రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసిన కేంద్రం
ఏపీకి రూ.1,438 కోట్లు
న్యూదిల్లీ : పదిహేడు రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించిన ఆరవ నెల వాయిదా నిధులు రూ.17,871 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కాగా సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 202122 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి మొత్తం రూ.8,628.50 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. రాజ్యాంగంలోని 275వ అధికరణ కింద రాష్ట్రాలకు విభజనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రెవెన్యూ లోటు భర్తీని అందిస్తుంది. విభజన తర్వాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని తీర్చడానికి నెలవారీ వాయిదాలలో 15వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం నిధులు విడుదల చేస్తుంది. 15వ ఆర్థికసంఘం 2021
22 సంవత్సరంలో 17 రాష్ట్రాలకు ఈ మంజూరును సిఫార్సు చేసింది. వ్యయ విభాగం 17 రాష్ట్రాలకు పోస్టు డెవల్యూషన్ రెవెన్యూ డెఫిషిట్(పీడీఆర్డీ) మంజూరుకు సంబంధించిన ఆరవ నెల వాయిదా రూ.9,871 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వాయిదాతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం రూ.59,226 కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది. 202122 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన విభజనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్రాల రాబడి, వ్యయ అంచనా మధ్య వ్యత్యాసం ఆధారంగా ఈ మంజూరును పొందడానికి రాష్ట్రాల అర్హతను ఆర్థిక సంఘం నిర్ణయించిందని ఆ ప్రకటన వివరించింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా పీడీఆర్డీ మంజూరుకు సిఫార్సు చేయబడిన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, అసోం, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇదిలాఉండగా, 15వ ఆర్థిక సంఘం 2021
22 సంవత్సరంలో 17 రాష్ట్రాలకు పీడీఆర్డీ మంజూరు మొత్తం రూ.1,18,452 కోట్లను సిఫార్సు చేసింది. అందులో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం రూ.59,226 కోట్లు(50 శాతం)గా ఉంది.