నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో ఎలక్ట్రిక్ వాహనాలు తరలిస్తున్న భారీ కంటెయినర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. నాసిక్లోని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ ఫ్యాక్టరీ గేటుకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జితేంద్ర ఎలక్ట్రికల్ స్కూటర్లను బెంగళూరుకు తరలిస్తుండగా మంటలు చెలరేగాయి. మొత్తం 40 స్కూటర్లతో వెళ్తున్న ఈ వాహనంలో మంటలు చెలరేగడంతో వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. మూడు వారాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలకు మంటలు అంటుకున్న ఘటనల్లో ఇది ఐదోది కావడం గమనార్హం. మార్చి 26న పుణెలో ఓలా ఎస్`1 ప్రో ఎలక్ట్రికల్ స్కూటర్ మంటల్లో కాలిపోగా.. అదేరోజు తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్కు మంటలు అంటుకున్నాయి. అలాగే, మార్చి 28న తిరుచ్చిలో ఇలాంటి ఘటనే చెలరేగగా.. ఆ మరుసటి రోజు చెన్నైలో నాలుగో ఘటన చోటుచేసుకుంది. మరోవైపు, ఏప్రిల్ 9న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ తెలిపింది. దీనికి మూలకారణమేంటో తెలుసుకొని.. త్వరలో చెబుతామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్న వేళ కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీలు, సంబంధిత అంశాల్లో నాణ్యతే ఈ ఘటనలకు కారణమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.