సాంకేతిక కారణాలేనన్న సంస్థ
ఆన్లైన్ పేమెంట్స్లో దిగ్గజ సంస్థగా ఎదిగిన పేటీఎం సేవలు శుక్రవారం మూడు గంటలు నిలిచిపోవడంతో వినియోగదారులు శుక్రవారం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పేటీఎం సేవలు స్తంభించాయి. ఈ అసౌకర్యంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పేటీఎం సంస్థ ఆ తర్వాత సమస్యను పరిష్కరించింది. శుక్రవారం ఉదయం పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు యాప్ను ఓపెన్ చేయగా… సాంకేతిక సమస్యలు కనిపించాయి. పేటీఎం ఓపెన్ అయినా… చెల్లింపులు కాలేదు. చెల్లింపులకు అనుమతి ఇచ్చిన వెంటనే పేటీఎం దానికదే లాగౌట్ అయ్యింది. ఆ తర్వాత తిరిగి లాగిన్ అవుదామని యత్నించిన వినియోగదారులకు నిరాశే ఎదురైంది. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున పేటీఎంకు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన పేటీఎం తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించింది. ఆ తర్వాత సాంకేతిక సమస్య కారణంగానే అవాంతరం తలెత్తిందని, సమస్యను పరిష్కరించినట్లు వినియోగదారులకు తెలిపింది.