ముకుల్ సంగ్మా దీమా
కోల్కతా : మరో 45 రోజుల్లో మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ముకుల్ సంగ్మా దీమాగా చెప్పారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సంగ్మా ఇటీవలే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్కు నిజమైన ప్రత్యామ్నాయాన్ని మేఘాలయ ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీపై చిత్తశుద్ధితో పోరాడే పార్టీని కాంక్షిస్తున్నారని సంగ్మా చెప్పారు. వాస్తవంగా ఈశాన్య రాష్ట్రం మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, అఖిలభారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీని కోరుకుంటున్నట్లు సంగ్మా వివరించారు. కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం సంగ్మా విలేకరులతో మాట్లాడుతూ మేఘాలయలో తృణమూల్ జెండా ఎగరడం ఖాయమన్నారు. సంగ్మా రెండుసార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమ ఎమ్మెల్యేలు తృణమూల్లో చేరాలన్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని సంగ్మా తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం సాధ్యం కాదని తమకు అర్థమైందన్నారు. తమ నిర్ణయం మేఘాలయకు, ఈశాన్య రాష్ట్రాలు, యావత్ దేశంలోనే కొత్త వరవడి సృష్టిస్తుందని చెప్పారు. మమతా బెనర్జీ నాయకత్వం అద్భుతమన్నారు. కాంగ్రెస్ను వీడటం కష్టమైనప్పటికీ ఆ నిర్ణయం తప్పనిసరని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మమతా బెనర్జీ నాయకత్వం దేశానికి అవసరమని, దేశ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములుగా ఉంటామన్నారు. తమ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆమోదించారన్నారు. దీదీ, టీఎంసీ అంటే ఏమిటో మేఘాలయ ప్రజలకు ఇప్పటికే తెలిసిందని సంగ్మా పేర్కొన్నారు. ‘రానున్న 45 రోజుల్లో మేఘాలయలోని అన్ని ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం మీరే చూస్తారు’ అని ఆయన దీమాఆ చెప్పారు.