అహ్మదాబాద్ : ఏడు పదుల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చి అరుదైన ఘనత సాధించింది ఓ మహిళ. పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వాన్ని అస్వాదిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వయసులో తల్లి అయిన అతికొద్ది మంది మహిళల్లో ఒకరిగా నిలిచింది. గుజరాత్లోని మోరా గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు జివున్బెన్ రబరి(70). ఆమె భర్త పేరు మల్ధారి(75). ఇద్దరూ దశాబ్దాలుగా పిల్లల కోసం పరితపిస్తున్నారు. కానీ వారి కల నెరవేరలేదు. చివరకు ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చినట్లు రబరి తెలిపారు. తాను 70 ఏళ్ల వయస్కురాలినని, కానీ దాన్ని నిరూపించేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆమె చెప్పారు. బ్రిటన్కు చెందిన డైలీ మెయిల్ ఈమెపై కథనం కూడా ప్రచురించింది. ‘‘ఈ వయసులో పిల్లల్ని కనడం సాధ్యం కాదనే మొదట వారికి చెప్పాము. కానీ వాళ్ల కుటుంబంలో చాలా మంది లేటు వయసులోనే తల్లిదండ్రులు అయినట్లు చెప్పారు. నేను చూసిన వాటిలో ఇది అరుదైన ఘటన’’ అని వైద్యుడు నరేశ్ భానుశాలి పేర్కొన్నారు.