సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ పిలుపు
ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలనిఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం గూడూరు పట్టణం కటకరాజావీధిలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ ప్రథమ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువులు, వంట, గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎన్నో ప్రాణత్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక కోడ్ లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేవారిని లక్ష్యంగా చేసుకుని రకరకాల చట్టాలతో జైళ్లలో నిర్భందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రత్యామ్నాయ శక్తి కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పౌరుడూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే సీపీఐను ఆదరించాలని కోరారు. ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రథమ జిల్లా మహాసభలను కార్మికులు, కర్షకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలున్నాయన్నారు. ప్రధానంగా అసంపూర్తిగా నిలిచిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పటిష్ట డ్రైనేజీ వ్యవస్థ, స్లమ్ ఏరియాల అభివృద్ధి తదితర సమస్యలన్నింటినీ సీపీఐ తిరుపతి ప్రథమ జిల్లా మహాసభలలో చర్చిస్తామని
తెలిపారు. 14వ తేదీ ఉదయం గూడూరు సీపీఐ కార్యాలయం నుండి మహాసభలకు వాహనాలు బయలుదేరి వెళుతాయన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా, సీవీఆర్. కుమార్, జీ. రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు కే. నారాయణ, ఇన్సాఫ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్. జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు.