ఎం కోటేశ్వరరావు
‘‘యువత ముందు నిలుచొని చెబుతున్నాను, దిల్లీలోని ప్రభుత్వం సిబిఐని చూపి మమ్మల్ని భయపెట్టలేదు ‘‘సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది’’ ‘‘సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని’’ ‘‘మీరు ఏమైనా చేసుకోండి, కానీ సిబిఐ భయంతో అభివృద్ధి బాటను వీడేదిలేదు’’ ‘‘పరిణామాలు ఎలా మారతాయో నాకు తెలుసు, కానీ మేము సిద్దపడిఉన్నాం’’ పాఠకులకు ఈ మాటలు ఎవరివో అర్ధమయ్యే ఉంటాయి. ఇంకెవరివి! మోదీ ఏలుబడిలో వేధింపులకు గురవుతున్న ప్రతిపక్షనేతలు చేసిన ప్రకటనలు అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సిఎం పదవిలో ఉన్నపుడు చేసిన ఆరోపణలు. మోదీ అంటే అవినీతి అని అర్ధం అంటూ గతంలో తానుచేసిన ట్వీట్ను తొలగించటం లేదని బిజెపి నేత ఖుష్బూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సిబిఐ గురించి మోదీ చెప్పిన ఈ అంశాలు ఆయన వెబ్సైట్లో ఇప్పటికీ దర్శన మిస్తున్నాయి. అంతే కాదు మోదీ చెప్పిన సుభాషితాలు ఇంకా ఇలా ఉన్నాయి. ‘‘సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’’ ‘‘ గుజరాత్ను కించపరిచేందుకు అబద్దాలు చెప్పవద్దు’’ ‘‘ సిబిఐని రాజకీయమయం కావించేందుకు సమయాన్ని ఖర్చుచేసే బదులు ఉత్తరాఖండ్లో ఇబ్బందులు పడుతున్నవారికి సహాయ పడేందుకు వెచ్చించండి’’ అని కూడా చెప్పారు. 2013 జూన్ 24న గాంధీనగర్లో స్వామి వివేకానంద ఉపాధి వారంలో భాగంగా జరిగిన సభలో నరేంద్రమోదీ ప్రసంగించారు. పైన పేర్కొన్న ఆరోపణలన్నీ అక్కడ చేసినవే. ఈ రోజుల్లో పత్రికల్లో సగం వార్తలు సిబిఐ సంబంధమైన వాటితో నింపుతున్నారు. అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు. వారి రాజకీయ యజమానులను సంతృప్తి పరచేందుకే ఇలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. మీరుపోటీ పడాలనుకుంటే పడదాం. ఎవరు ఎన్ని ఉద్యోగాలను ఇవ్వగలమో చూసుకుందాం అని కూడా మోదీ సవాల్ చేశారు. అప్పటికే మోదీని తమ నేతగా లోక్సభ ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు బిజెపి నిర్ణయించిన పూర్వరంగంలో చేసిన ప్రసంగమది.
అలాంటి మోదీ గుజరాత్ సిఎంగా ఉండగా ఒక నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఇరికించేందుకు సహకరించాల్సిందిగా కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా సిబిఐ తనపై వత్తిడి తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన మీద వత్తిడి తెచ్చినప్పటికీ దాని గురించి బిజెపి ఎన్నడూ రచ్చచేయలేదని కూడా షా చెప్పారు. కాంగ్రెస్ పాలకుల మీద ఎంత ఉదారత ! మరి ఇప్పుడెందుకు చెప్పినట్లు ? అన్న ప్రశ్న జనంలో తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలుచేసిన విమర్శలమీద అమిత్ షా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా ఈ అరోపణ చేశారు అన్నది స్పష్టం. అవినీతి పరులందరూ ఒక దగ్గర చేరుతున్నా రంటూ ప్రతిపక్షాలమీద నరేంద్రమోదీ దాడిచేసిన తరువాత అమిత్ షా ఈ మాటలను చెప్పి చర్చను పక్కదారి పట్టించేందుకు చూశారు. పరువునష్టం కేసులో శిక్ష పడిన రాహుల్ గాంధీ హైకోర్టులో అప్పీలుకు పోకుండా ప్రధాని మోదీని నిందిస్తూ రచ్చచేస్తున్నారని ఆరోపించారు. అప్పీలు చేసుకోవాలా లేదా అనేది రాహుల్ గాంధీకి చెందిన అంశం. ఏమి చేయాలో కూడా బిజెపి నేతలు చెబుతారా ? లేక వారు అనుకున్న విధంగా జరగటం లేదని ఉక్రోషమా ? శిక్ష విధించిన కోర్టు అప్పీలుకు ఇచ్చిన గడువు గురించి తెలిసినప్పటికీ రాహుల్ను అనర్హుడిగా ప్రకటించేందుకు లోక్సభ సచివాలయం ఎందుకు తొందరపడిరదో అమిత్ షా చెప్పి ఉంటే బాగుండేది.
రాజస్థాన్లోని మార్బుల్ వ్యాపారులు తమను వేధిస్తున్న గుజరాత్కు చెందిన సొహ్రబుద్దీన్ షేక్ను అదుపు చేయాలని కోరగా నాడు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఆదేశాల మేరకు పోలీసులు 2005లో సొహ్రబుద్దీన్తో పాటు అతని భార్య కౌసర్ను కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై అమిత్ షా రాజీనామా చేశారు, అదే కేసులో సిబిఐ అరెస్టు చేసింది. సొహ్రబుద్దీన్ లష్కరే తోయిబాకు చెందినవాడని, నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు గుజరాత్ పోలీసులు ఆరోపించారు. అమిత్ షా ఆదేశాలమేరకు అతన్ని చంపినట్లు తమ దగ్గర ఆధారాలు న్నాయని, దాని గురించి సిఎం నరేంద్రమోదీకి తెలుసా లేదా అని నిర్ధారణ చేసుకొనేందుకు ఆయనను కూడా ప్రశ్నించవచ్చని సిబిఐ భావించినట్లు వార్తలు వచ్చాయి. నకిలీ ఎన్కౌంటర్ కేసుల భయంతోనే నరేంద్రమోదీ సిబిఐ మీద దాడులు చేస్తున్నట్లు 2013లోనే కాంగ్రెస్ విమర్శించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పనిచేస్తోందని కూడా గుర్తు చేసింది.
సిబిఐపై నరేంద్రమోదీ పదే పదే దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు. భావనగర్లో 2010 జూలై 31న మాట్లాడుతూ ‘‘గుజరాత్ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్లోని కోర్టులను, లాయర్లను అమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి ? మన న్యాయవిశ్వవిద్యాలయాలను మూసుకోవాలా, లాయర్లు రోడ్డున పడాలా ? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికి పోతోంది. గుజరాత్ దేశంలో భాగం కాదా, ఒక శత్రు రాష్ట్రంగా ఎందుకు పరిగణిస్తున్నారు. ఉగ్రవాదంమీద పోరు జరపకుండా నన్ను నిరోధిస్తున్నారు. ఓటు బాంకు రాజకీయాల్లో భాగంగా నిందితులను అరెస్టు చేయటం లేదు. నా సన్నిహితుడు అమిత్ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నన్ను భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి. ఏ మాత్రం భయపెట్టలేరు. ఇది జాతీయవాదులు, జాతివ్యతిరేకుల మధ్య పోరు, గుజరాత్ యుద్ధభూమి. గుజరాత్ గెలుస్తుంది.’’ అని చెప్పారు.
అవినీతిలో కూరుకుపోయిన వారందరూ ఒక దగ్గరకు చేరుతున్నారని ఇప్పుడు ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ సహా 14 పార్టీలకు చెందిన వారు సిబిఐ, ఈడిలను తమ నేతల మీద ప్రయోగిస్తున్నా రంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణకు స్వీకరించింది. దీంతో మోషా రంగంలోకి దిగారు. యుపిఏ 2004
14 పాలనా కాలంలో అక్రమాలకు పాల్పడిన వారినుంచి కేవలం రు.ఐదువేల కోట్ల విలువ గల ఆస్తులు మాత్రమే పిఎంఎల్ఏ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారని తాము తొమ్మిది సంవత్సరాల్లో లక్షా పదివేల కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు. యుపిఏ పాలనాకాలంలో ఈడి 112 దాడులు చేసి రు.5,346 కోట్లు స్వాధీనం చేసుకోగా, మోదీ అధికారానికి వచ్చాక ఎనిమిది సంవత్సరాల్లో 3010 దాడులు రు.99,356కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకున్నట్లుగా 2022 జూలై 27న పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్ ఏలుబడిలో సగటున ఒక్కో కేసులో 47.7 కోట్లు స్వాధీనం చేసుకోగా, మోదీ పాలనలో రు.33 కోట్లుగా ఉంది. విదేశీమారక ద్రవ్య అక్రమాల కేసులు ఇదే విధంగా 8,586 నుంచి 22,320కి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. దాడులు జరిపిన 3,010 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేసింది 888 కేసుల్లో కాగా శిక్షలుపడిరది 23 కేసుల్లో, వాటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రు.869 కోట్లని కూడా ప్రభుత్వం తెలిపింది. అందువలన దాడుల సంఖ్య పెరిగినా ఆస్తులను లక్ష కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినా తేలిన కేసులు, స్వాధీన మొత్తాలను చూస్తే అది నామమాత్రమే అన్నది స్పష్టం. మోదీ ఏలుబడిలో 2014 ఏప్రిల్ ఒకటి నుంచి 3,555 మనీలాండరింగ్ కేసులు నమోదు కాగా చార్జిషీట్లు దాఖలు చేసింది 2022 మార్చి వరకు 992 మాత్రమే. అవినీతి, అక్రమాల తామెంత నిబద్దతతో ఉన్నదీ తమ ఏలుబడిలో కేసుల సంఖ్య పెరగటాన్ని సూచిస్తున్నదని ప్రభుత్వం చెప్పుకుంది. వాటిలో ఎక్కువభాగం బెదరింపులు, కేసుల్లో ఇరికించేందుకు చేసిన దాడులే అన్నది విమర్శ.
సిబిఐపై నరేంద్రమోదీ పదే పదే దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు. భావనగర్లో 2010 జూలై 31న మాట్లాడుతూ ‘‘గుజరాత్ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్లోని కోర్టులను, లాయర్లను అమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి ? మన న్యాయ విశ్వవిద్యాలయాలను మూసుకోవాలా, లాయర్లు రోడ్డున పడాలా ? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికిపోతోంది. గుజరాత్ దేశంలో భాగం కాదా, ఒక శత్రు రాష్ట్రంగా ఎందుకు పరిగణిస్తున్నారు. ఉగ్రవాదంమీద పోరు జరపకుండా నన్ను నిరోధిస్తున్నారు. ఓటు బాంకు రాజకీయాల్లో భాగంగా నిందితులను అరెస్టు చేయటం లేదు. నా సన్నిహితుడు అమిత్ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నన్ను భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి. ఏ మాత్రం భయపెట్టలేరు. ఇది జాతీయవాదులు, జాతివ్యతిరేకుల మధ్య పోరు, గుజరాత్ యుద్ధభూమి. గుజరాత్ గెలుస్తుంది.’’ అని చెప్పారు.