ఎం. కోటేశ్వరరావు
మేడిన్ ఇండియా తొలి చిప్ 2024 డిసెంబరు నాటికి మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్లోని సనంద్ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఫాక్స్కాన్వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహో ఓహో నరేంద్రమోదీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్ మోడల్ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు. ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో ? ఫాక్స్కాన్
వేదాంత సంస్థ కలసి గుజరాత్లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్ డాలర్లతో(రు.లక్షా 60వేల కోట్లు ) ఒక చిప్స్ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో ఎక్కడుందో చెప్పరు. కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదువేల మందికి పని చూపే మైక్రాన్ ఉత్పత్తి మార్కెట్కు వస్తుందని చెబుతున్నారు. మోదీ చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా !
మైక్రాన్ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు(మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రు.6,830 కోట్లు. మరి మిగతాది ! కేంద్ర ప్రభుత్వం పదకొండువేల కోట్లు (50శాతం), రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవై శాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30శాతం మాత్రమే.అంటే రు.30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్ కంపెనీని రు.వందకు స్వంతదారును చేస్తారు. ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోదీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా ? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే… 2020లో జనరల్ మోటార్స్ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగిఇవ్వదు. అయినా 70శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా ? అవసరం తీరిం తరువాత వెళ్లిపోకుండా ఉంటారా? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్(సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్చేసి మరెక్కడో ఉత్పత్తిచేసిన విడిభాగాలను మనదేశానికి తీసుకువచ్చి వాటి రూప కల్పన ప్రకారం ఒక దగ్గర అమర్చి(ఫాబ్రికేషన్), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్ లేదా మేకిన్ ఇండియా జరిగేది, పాకింగ్ ఇండియా. అదైనా గొప్పే కదా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు, ప్యాకింగ్కు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.
మేకిన్, మేడిన్ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో పాకింగ్ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ధి చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా పాకింగ్ రాయితీలు కాదు, ఉత్పత్తిచేసి తన జనానికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమికండక్టర్ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, పాకింగ్లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చిప్స్లో 90శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.
చైనాతో మైక్రాన్ కంపెనీకి ఎక్కడ చెడిరది? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తిఅవుతున్న చిప్స్ను ఏ దేశంలో నైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలే పోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ అంగీకరించింది. అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమీకండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు.వాటిలో ఫాక్స్కాన్వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్టిఎం మైక్రోటెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడి సహా అనేకషరతులను ఎస్టిఎం ముందుకుతెచ్చింది. ఐదు, పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత
ఫాక్స్కాన్ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రు.66 వేల కోట్లు కాగా దీనికి కూడా కేంద్రం రు.76వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు.
ఐదు రాష్ట్రాలు, తరువాత లోకసభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కనుక పాకింగ్ను కూడా మేకింగ్గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకో వచ్చని మైక్రాన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రజలందరి సొమ్మును మోదీ సర్కార్ గుజరాత్కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బీజేపీి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోదీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోదీ అంటే గుజరాత్ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే.