Monday, March 27, 2023
Monday, March 27, 2023

చరిత్ర చీకటిపొరల్లో మత మౌఢ్యం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిసి చరిత్రను మానవరక్తంతో గడ్డకట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది చీకటే. చీకటికి పర్యాయపదమే మతం. మత కలహాల విశ్వరూపాన్ని దర్శింపచేయడమే భీష్మ సహాని నవల ‘తమస్‌’ ఉద్దేశం. ప్రముఖ హిందీ నవలా రచయిత నవలకు అదే పేరుతో గోవింద్‌ నిహలానీ రూపొందించిందే ‘తమస్‌’ చలన చిత్రం. ‘‘చీకటి రోజుల్లో కళలూ, కవిత్వాలు ఉంటాయా?’’ అని ప్రశ్నించాడు జర్మన్‌ మహాకవి బెర్తోల్డ్‌ బ్రెప్ట్‌ా. ఉంటాయి! అయితే అవి చీకటి రోజుల గురించి మాత్రమే ఉంటాయి.’’ అని ఆయనే సమాధానం కూడా చెప్పాడు. ‘‘గత చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోనివారు, అవే తప్పిదాల్ని మళ్లీ మళ్లీ చేయకమానరు’’ అని ప్రత్యక్షంగా అనుభవించి చెప్పాడు హిందీ చలన చిత్ర దర్శకుడు గోవింద్‌ నిహలానీ. గతంలోనే కాదు. మతకలహాల చీకటి వర్తమానంలో కూడా దేశమంతా వ్యాపించే ఉంది. ఇది నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యానం.!
1947 ఆగస్టు దేశ విభజనకు ముందు జలాలాబాదులో జరిగిన సంఘటనల ఆధారంగా భీష్మ్‌ సహాని (హిందీ నటుడు బలరాజ్‌ సహాని తమ్ముడు) నవల రూపుదిద్దుకుంది. అటు సింధ్‌ ఇటు పంజాబ్‌ల మధ్య, అటు ముస్లింలు ఇటు హిందువులమధ్య, అటు ముస్లింలీగ్‌ ఇటు కాంగ్రెస్‌ రాజకీయాలమధ్య ఐదులక్షలమంది అసువులు కోల్పోయారు. పదిహేను మిలియన్ల మంది కూడునీడ లేక నిరాశ్రయులై పాకిస్థాన్‌, భారతదేశంలోకి వలసవెళ్లారు. తప్పులు ఇరుపక్షాల వారివీ ఉన్నాయి. కాబట్టి జరిగిన నరమేథం వెనుక లోపించిన మానవ విలువల్ని, అప్పటి హీనమైన సమయాన్ని ‘తమస్‌’ చలన చిత్రం బేరీజు వేసింది. ఇందు లోని సంఘటనలు ఆకాలానికే పరిమితంకాదు. అహ్మదాబాద్‌, భివాండి, మొరాదాబాద్‌, మీరట్‌, హైదరాబాద్‌ లలో అప్పుడప్పుడు జరుగుతూ వచ్చిన హిందూ ముస్లిం కొట్లాటల వల్ల ఈ కళ ఈ కాలానిదే అని సాక్ష్యం పలుకు తుంది. హిందూ రాజ్యం, ఖలిస్తాన్‌ల కోసం జరుగుతున్న తీవ్రవాద రక్తపాతాలు అందుకు వంతపాడుతున్నాయి. అంతేకాదు కరాచీ వీధులలో మొహజిర్‌నాన్‌ మొహజిరాల మధ్య జరుగుతున్న ఘర్షణలుప్రస్తుతం కేరళలో హిందుత్వ, వామపక్ష వర్గాల మధ్య జరుగుతున్న హత్యలు ‘తమస్‌’లో చూసుకోవచ్చు. రాజకీయ ప్రయోజనాలకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలలో వందలాది అమాయకులు బలి గుర్తు తెచ్చుకోవచ్చు. కొద్దిపాటి తేడాలతో మతరాజకీయాలకు సంబంధించిన ఏ అల్లర్లలోనైనా నష్టపోయేది ప్రజలే! ఈ విశ్వజనీనమైన నిజాన్ని మనకు దర్శింపచేయడానికి దర్శకుడు చేసిన తపస్సేతమస్‌! మానవ సంబంధాల్ని మరింత మెరుగుపరచ డానికి మతాల్ని, నీచరాజకీయాల్ని దూరంగా తరిమేయ డానికి, నిజమైన విశ్వశాంతిని కాంక్షించడానికి తప్పదు, మనం ఎక్కడో ఓ చోట ఈ విధానాల్ని మార్చుకోక తప్పదుఅని గోవింద్‌ నిహలానీ ‘తమస్‌’లో చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ చిత్రంలోని కథాంశం ఈ విధంగా ఉంటుంది. ఎవరో ధనవంతులై హిందువులు అర్థరాత్రి నాథూ ఇంటికి వస్తారు. డబ్బులిచ్చి ఒక పందిని చంపమంటారు. తను చంపిన పంది ఉదయానికి మసీదు ముందుకు చేరుతుందని, దానితో పట్టణంలోని హిందూ ముస్లింల మధ్య అపార్థాలు ఎక్కువై తీవ్రపరిణామాలకు దారితీస్తాయని నాథూ ఊహించడు. కాంగ్రెస్‌ వాళ్ల ‘ప్రభాత భేరి’ కార్యక్రమం అర్థాంతరంగా ముగుస్తుంది. మరోపక్క ‘అల్లాహో అక్బర్‌’ నినాదాల్ని తొక్కేయడానికి ‘హరహర మహాదేవ’ బృందం బయలుదేరుతుంది. కత్తులు, కర్రలు తిప్పగలిగే ఖాకీ నిక్కర్ల యువకులు ‘హిందూసభ’ గా విజృంభిస్తారు. వీరందరి మధ్య నాథూ పాత్ర ఎంతో ఉదాత్తమైంది. మత రాజకీయాల్లో చిక్కుకుని, బలైపోయే లక్షలాది సామాన్యులకు ప్రాతినిధ్యం వహించే పాత్ర ‘‘ఇంతగా కుళ్లిపోయిన ఈ సమాజంలోకి మన కొడుకును ఎందుకు రానివ్వాలి?’’ అని నాథూ (ఓంపురి) గర్భవతి అయిన భార్యను ప్రశ్నిస్తాడు. ‘‘వాడి పుట్టుకను ఆపడానికి మనమెవ్వరం? వాడికి కావల్సిన సమాజం కోసం వాడే సంఘర్షిస్తాడు’’ అని ఆమె (దీపా సాహి) జవాబు చెపుతుంది. ఇక్కడ కొడుకు పుట్టడానికి భారత స్వాతంత్య్రోద్యమానికి అన్వయిస్తాడు దర్శకుడు. నవలలోలేని కొన్ని కొత్త విషయాలు కూడా దర్శకుడు చిత్రంలో చేర్చుకున్నాడు. ఉదాహరణకు స్త్రీలు బావిలో దూకిన సంఘటన! ఒకసారి ముస్లింలతో కొట్లాడి సిక్కులు మరణించారని వార్త తెలుస్తుంది. వారికి సంబంధించిన సిక్కు స్త్రీలందరూ పిల్లలతో సహా ఊరిబావిలోకి దూకుతారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో జరిగిన ‘‘ఖుర్‌బానీ’ ఘటనని దర్శకుడు అదనంగా చేర్చుకున్నాడు. భీష్మ్‌ సహాని నవలలో ఈ సంఘటన లేదు. అలాగే ఉత్కంఠ భరితంగా సాగే మరికొన్ని సంఘటనలు కూడా చిత్రంలో ఉన్నాయి. ఒక ముస్లిం మహిళ కాఫిర్లయిన సిక్కు దంపతులకు ఆశ్రయమిస్తుంది. మరోచోట ముస్లిం ఉపాధ్యాయుణ్ణి ఒక సిక్కు మహిళ ‘సజీవ దహనం’ నుండి కాపాడుతుంది. పాకిస్థాన్‌లో స్థిరపడ్డ రబాబీలు ఒకప్పుడు గురునానక్‌ శిష్యులు. అయినా ఇప్పుడు వారు ముస్లిం ఆచార వ్యవహారాలు, నియమాలు కూడా పాటిస్తారు. సామాన్యుల్లో సుహృద్భావం జాతీయ సమైక్యతను ఆకాంక్షించే గుణం నిండుగాఉంది. దాన్ని వెలికితీసి చూపే ప్రయత్నంచేశాడు దర్శకుడు. అతనిలోని మార్క్సిస్టు దృక్పధం ఇందులో కళాత్మకంగా బైటపడిరది. చలనచిత్ర దర్శకుడు గోవింద్‌్‌ నిహలానీ బాల్యం కరాచీలో గడిచింది. ‘డాన్‌’ వార్తా పత్రిక కార్యాలయం ఎదురుగా మేడమీద వీరి కుటుంబం ఉండేది. వారి ఇంటికింద ఒక పాన్‌షాపు ఉండేది. పాన్‌ షాప్‌ యజమాని ఆందోళనకారులకు భయపడి, పైకి నిహలానీ వాళ్లింటికి వచ్చాడు. ఆ రోజు సంపాదించిన మొత్తం నిహలానీ తండ్రికి అప్పగించాడు. దాచిపెట్టమనిచెప్పి, తప్పించుకుని పారిపోదా మని కిందకి వెళ్లాడు. అంతే ఆందోళనకారులు అతణ్ని కాల్చేశారు. ఇదంతా బాలుడిగా నిహలానీ ప్రత్యక్షంగా చూశాడు. మతకల్లోల భయంకర స్వరూపం ఆనాడే ఆ పసిహృదయం మీద చెరగని ముద్రవేసింది. ఆ అనుభవం అతణ్ణి ఊరుకోనివ్వలేదు. చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత, మత కల్లోలంపై సినిమా తీయాలన్న కోరిక బలపడిరది. ఫలితంగానే ‘తమస్‌’ (చీకటి) పేరుతో సమాజంలో వెలుగులు ప్రసరించాయి. దర్శకుడు గౌతమ్‌ఘోష్‌ తీసిన బెంగాలి చలనచిత్రం ‘అంతర్జలి యాత్ర’ కంచి శంకరాచార్యకు ఓ సవాల్‌ విసిరింది. కొన్నేళ్ల క్రితం ‘సతి’పై వాదోపవాదాలు చెల రేగాయి. జాతీయ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొన సాగాయి. అందుకు కారణం పూరి శంకరాచార్యులు, కంచి శంకరాచార్యులూ కలిసికట్టుగా ‘సతి’ని బాహాటంగా బల పరచడమే! భాంద్వా జిల్లాలోని ఓంకారేశ్వర్‌లో బైటపడ్డ రెండువేల యేళ్ల కిందటి ఒక గుహను ప్రారంభిస్తూ స్వామి జయేంద్ర సరస్వతి ‘సతి’ని ప్రోత్సహిస్తూ మాట్లాడాడు. హిందూ మత పునరుద్ధరణలో ‘సతి’ కూడా భాగమేనన్నాడు. కొన్ని వేల యేళ్ల కిందటి గుహను వెలుగులోకి తేవాలని ఆయనగారి ఉబలాటం కాబోలు! విశేషమేమంటే వారి పత్రికా విలేకరుల గోష్టిలో మహారాష్ట్ర పౌర సంబంధ, ఆర్థికశాఖ ఉపమంత్రి, నాగపూర్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉన్నారు. ఇలాంటి సంఘటనల్లో అలాంటి వారి గూర్చి విన్నప్పుడు మనకు ‘చదువుకున్న మూర్ఖులు’ అనే పదం గుర్తుకొస్తుంది. ‘స్త్రీ అత్యాచార్‌ విరోధి సమితి’ పూనుకొని శంకరాచార్య ప్రకటనను నిరసించడంతో విషయాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. మానవ పురోగమనానికి అడ్డుపడే అలాంటి దద్దమ్మలంతా పెద్దలై కూర్చోబట్టే దేశమింకా ఈసురోమంటోంది. ఎవడి మతం వాడు, ఎవడి డబ్బా వాడు వాయించుకోకపోతే మానవాళి సమస్యను హేతువాద దృక్పధంతో పరిశీలించొచ్చు కదా? భార్య చనిపోతే, ‘పతి’ ఆమె శవంతో పాటు చితిమీద పడి సజీవంగా కాలి చావాలన్న నియమంఉంటే మరి ఈ స్వాములు ఏం మాట్లాడేవారూ? ‘పతి’ని బలపరిచేవారా? ఇటు ఇంట్లో స్త్రీలను, అటు బైట ఇతర కులాలవారిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి అగ్రవర్ణం వారు ఏర్పరచిన నియమాలు, నిబంధనలు ఎంతటా హాస్యాస్పద మైనవో, ఎంత నికృష్టమైనవో ‘అంతర్జలి యాత్ర’ చలన చిత్రం స్పష్టం చేసింది. బెంగాలి రచయిత కమల్‌కుమార్‌ మజుందార్‌ కథకు రూపకల్పనే ఈ సినిమా! కథాంశం ఈ విధంగా ఉంటుంది. వృద్ధ బ్రాహ్మణుడు సీతారాం అవసాన కాలం దగ్గరికొస్తుంది. జాతకాలు చెప్పే బ్రాహ్మణుడు పరిగెత్తు కొస్తాడు ‘‘వృద్ధ బ్రాహ్మణుడు అప్పుడప్పుడే చనిపోడని, మళ్లీ పెళ్లి చేస్తే భార్యతోపాటే జంటగా పరలోకాలకు చేరు కుంటాడని’’ జోస్యం చెపుతాడు. ఇప్పుడో అప్పుడో అన్నట్లున్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి అప్పటికే స్మశానానికి తరలిస్తారు. జ్యోతిష్యుడి మాటమీద, ఉన్నఫలంగా వృద్ధుడికి స్మశానంలోనే పద్దెనిమిదేళ్ల కన్యతో హడావుడిగా వివాహం జరిపిస్తారు. కన్య తండ్రి చాలా పేదవాడు. కూతురికి పెండ్లి చేయలేదనే లోకనింద తప్పించుకోవడానికి పరోక్షంగా కూతురిని చంపడానికే సిద్ధ్ధపడ్డాడన్నమాట! ముఖ్యంగా సమాజాన్ని వెనక్కి నడిపించే ప్రభుత్వాలున్నప్పుడు ప్రజలు మరింత అప్రమత్తతో ఉండాలి!
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img