Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు

ఎప్పుడైతే బ్యాంకింగ్‌ రంగం డిజిటిలీకరణ జరిగిందో ఖాతాదారులు నగదు లావాదేవీలు ఇంటినుండే జరుపుతున్నారు. ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ మంది ఖాతాదారులు ఆన్‌లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ పరిస్థితులలో చాలా మంది ఆన్‌లైన్‌ వైపే మొగ్గుచూపారు. ఇదే అదనుగా చాలా మంది మోసగాళ్ళు ఖాతాదారులను మోసంచేసి మన నగదును మనకు తెలియకుండా కాజేస్తున్నారు. ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుండి ఇంటర్నెట్‌ మాధ్యమం ద్వారా డబ్బులు దొంగలించడాన్నే ఆన్‌లైన్‌ మోసం అని చెప్పొచ్చు. మోసగాళ్లు రకరకాల పద్ధతులను అనుసరించి డబ్బులను కాజేయడం, నకిలీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యు.పి.ఐ ల ద్వారా ప్రధానంగా మోసాలు జరుగుతున్నాయి. ఎ.టి.యం.లో కీ పాడ్‌ కనిపించేలా చిన్న రహస్య కెమెరాను అమర్చి ద్వారా మనం పిన్‌ను నమోదు చేసేటప్పుడు పసిగట్టి స్కిమ్మింగ్‌ పద్దతిలో నకిలీ ఎ.టి.యం కార్డులను తయారు చేసి ఖాతా నుండి నగదును తియ్యడమూ లేదా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేసుకుంటారు. బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్‌ నంబర్‌ సిమ్‌ ని స్వాపింగ్‌ లేదా క్లోనింగ్‌ చేసి నకిలీ సిమ్‌ ని పొంది ఓ.టి.పి లు వచ్చేటట్లు చేసుకొని ఖాతాలోని నగదును కొల్లగొడతారు. ఫిషింగ్‌ అంటే బ్యాంక్‌ లేదా ఈ – కామర్స్‌ సైటులను పోలిన వెబ్‌సైట్‌లను రూపొందించి వీటిని వినియోగించే టప్పుడు వాటి ద్వారా ఖాతాదారుని వివరాలు తెలుసుకొని మోసానికి పాల్పడతారు. ఫిషింగ్‌ పద్దతి ఉపయోగించి ఇంకా బ్యాంకుల నుండి అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి కార్డ్‌ బ్లాక్‌ అయిందనో, ఇ-కె.వై.సి చేయ్యాలనో, ఖాతా బ్లాక్‌ అయిందనో వినియోగదారుల కార్డుల వివరాలు , పిన్‌ నెంబరులను తెలుసుకొని ఒ.టి.పి ల ద్వారా ఖాతాలోని నగదును ఖాళీ చేస్తారు. ఇప్పుడు అందరూ ఎక్కవగా రకరకాల యు.పి.ఐ ల ద్వారా బ్యాంకు లావేదేవీలు చేస్తున్నారు. మోసగాళ్ళు దొంగ క్యు.ఆర్‌ లను ఫోన్లకు పంపించి దాని ద్వారా అకౌంట్‌ లోని డబ్బులను తీస్తున్నారు. మన ఖాతాకు ఎంతో కొంత నగదును పంపించి, పొరపాటుగా వచ్చేసిందని, ఆ నగదును యు.పి. ఐ ద్వారా తిరిగి పంపమని ప్రాధేయపడతారు. ఇది నిజమే అనుకొని వారి ఖాతాకు నగదును తిరిగి పంపుతారు.ఇదే అదనుగా మోసగాళ్ళు వారి పని వారు కానిస్తారు. అలాగే కొన్ని సంస్థలు టోల్‌ ఫ్రీ నంబరును తెలుసుకోడానికి ఆన్‌లైన్‌లో శోధిస్తారు. మోసగాళ్ళు ముందు గానే మనం వెతుకుతున్న నంబర్లకు బదులుగా నకిలీ ఫోన్‌నంబర్లను ఉంచుతారు. వినియోగదారుడు ఆ నంబర్‌ యదార్థమైనదేనని నమ్మి కాల్‌ చేస్తే తనదైన శైలిలో మోసగాళ్ళు నగదును మాయం చేసేస్తారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫేస్‌బుక్‌ ,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు వాడుతున్నారు. ఇదే అదనుగా మన స్నేహితుడు మాదిరిగానే అత్యంత అవసరం ఉందని కొంత మొత్తాన్ని అప్పు కావాలని నమ్మ బలుకుతారు. మనం నమ్మి ఆన్లైన్లో నగదును పంపిస్తే ఇక అంతే. ఇంకా వ్యక్తి గత ఫోటోలను అసభ్యకరంగా మార్పులు చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. కొంత మంది యువత అసభ్యకరమైన వెబ్‌సైట్ల్లను చూస్తారు. అప్పుడు ఆ వెబ్‌సైటు నుండి కొన్ని రకాల మాల్వేర్లను వారి వ్యక్తిగత మొబైల్‌ లేదా కంప్యూటర్‌ చొప్పిస్తారు. అది ఇక అక్కడే తిష్టవేసి వ్యకిగత సమాచారాన్ని లేదా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేసేటప్పుడు సమా చారాన్ని మోసగాళ్లకు చేరవేస్తుంది. వారు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలు దొంగలించి నగదును కాజేస్తారు. తక్కువ రేటుకే కొన్ని రకాలైన వస్తువులు విక్రయిస్తామని మన ఫోన్లకు యస్‌.యమ్‌.యస్‌ లేదా ఈ మెయులుకు లింక్‌ లను పంపుతారు. అది క్లిక్‌ చెయ్యగానే మన అకౌంట్లో డబ్బులు తీసేసుకుంటారు. గేమ్స్‌, అశ్లీల యాప్‌ లను లింకుల ద్వారా డౌన్లోడ్‌ చేసేటప్పుడు మన బ్యాంకింగ్‌ వివరాలను తస్కరించి ఖాతాలను ఖాళీ చేస్తారు.ఇక లాటరీ వచ్చిందని, రీఛార్జ్‌ ఉచితమని, పెట్రోల్‌ ఉచితమని రకరకాలైన సందేశాన్ని పంపించి అవి క్లిక్‌ చెయ్యగానే వారి పని వారు చేస్తారు. ఇక మనకు మిగిలింది జీరో అకౌంట్‌ మాత్రమే..!
ఖాతాదారులు అవగాహన కలిగి ఉండాలి
ఎ.టి.యంలలో నగదుతీసేటప్పుడు రహస్య పిన్‌ను ఎవరికీ కనిపించ కుండా కీబోర్డ్‌పై ఒత్తాలి. శివారుప్రాంతాల్లో ఉన్న కేంద్రాలనుండి కాక జనావాసాలు ఎక్కువగాఉన్న ప్రాంతాల్లో ఉన్న ఎటియంల నుండి నగదును తీసుకోవాలి. ఏ ఒక్కబ్యాంకు అధికారి కాల్‌చేసి ఖాతాకు సంబంధించిన వివరాలు అడిగారు. మనకువచ్చే ఒ.టి.పిలు ఎవరితో చెప్పకూడదు. ఆన్‌లైన్‌లో లావాదేవీలుచేసేటప్పుడు బ్యాంకుకి సంబంధించిన వెబ్‌సైట్‌ మాత్రమే ఉపయోగించాలి. ఆన్‌లైన్‌ ఫోన్‌నంబర్లను నమ్మ గూడదు. యు.పి.ఐ లతో జాగ్రత్తగా లావాదేవీలు చెయ్యాలి. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతసమాచారాన్ని, ఫోటోలను ఉంచగూడదు. ఉచితాలని, లాటరీలని నమ్మగూడదు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు ఫోన్‌ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్‌ని లాక్‌ చేసుకోవాలి. ఇక ఏదైనా అక్రమ లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు ఫోన్‌చేసి తెలియజేయాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 1930నంబరుకి కాల్‌చేసి జరిగినవిషయాన్ని చెప్పి ఫిర్యాదు ఇవ్వాలి.
డి. జె. మోహనరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img