Monday, March 27, 2023
Monday, March 27, 2023

బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం

ఎం. కోటేశ్వరరావు

మనం ఏదో అనుకుంటాంగానీ అనుకున్నట్లుగా అన్నీ జరుగు తాయా! షారూఖ్‌ఖాన్‌, దీపికా పడుకోన్‌ నటించిన ‘పఠాన్‌’ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతూ, కొత్తవాటిని నమోదుచేస్తూ త్వరలో రు.600 కోట్ల క్లబ్బులో చేరనుంది. దాన్ని ప్రదర్శించే హాళ్లను తగుల బెట్టేందుకు సిద్ధపడిన వారంతా కూడా వరుసల్లో నిలిచి ఆ సినిమా చూస్తూ ఉండి ఉండాలి. తొలి మూడు రోజుల్లో కెజిఎఫ్‌2, బాహుబలి 2 సృష్టించిన రికార్డులను ఇది బద్దలు కొట్టింది. హిందీ సినిమాల్లో మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను వేగంగా దాటిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సృష్టిస్తుందో చూద్దాం. నరేంద్రమోదీ, బీజేపీి, కాషాయదళాలు చేస్తున్న మంచి పనులు మీకు కనిపించవా అని విమర్శకులను కొందరు అడుగుతుంటారు. ప్రస్తుతానికి పఠాన్‌ సినిమా గురించి వారు సరైన పాత్రనే పోషించారని చెప్పకతప్పదు. కాషాయపెద్దలు గనుక బేషరమ్‌ రంగ్‌ పాట మీద రెచ్చిపోకుండా ఉండి ఉంటే ముందుగానే దానికి ఉచితంగా అంత పెద్ద ప్రచారం లభించేది కాదు. సినిమా హాళ్లను తగులబెడతాం అని దేశభక్తులు నినదించకుండా ఉండిఉంటే ఆసక్తి అసలు పెరిగి ఉండేదికాదు. పేరు చెప్పకపోయినా ప్రధాని నరేంద్రమోదీ చేత కూడా మద్దతుదార్లు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇవేవీ లేకపోతే, దాన్లో సరకు లేకపోతే అనేక రికార్డులను బద్దలుచేసి ఉండేదికాదు. ‘‘కమలశ్రీ’’ కంగన రనౌత్‌ సినిమా విడుదల తరువాత తన పాత్రను తాను పోషించారు. అసోం ముఖ్యమంత్రి, బీజేపీి నేత హిమంత బిశ్వ శర్మ పాత్రగురించి ఎంత చెప్పుకున్నా తరగదు. తనకేం ప్రచారం వస్తుందనుకున్నారో ఏమో, అతను ఎవరు అని ప్రశ్నించి అసోం సిఎం సంచలనం సృష్టించారు. షారూఖ్‌ఖాన్‌ పేరుతోపాటు తన పేరునూ కలిపి సొంతంగా ప్రచారం చేసుకున్నారు.
జనవరి 25న విడుదలైన పఠాన్‌ చిత్రం రికార్డులను బద్దలుచేస్తున్నట్లు అన్ని పత్రికలూ రాస్తున్నాయి. షారూఖ్‌ ఖానా అతనెవరు, అసోంలో చాలా మంది షారూఖ్‌ ఖాన్లున్నారు అన్న సిఎం హిమంత బిశ్వ శర్మ మాదిరి పఠాన్‌ సినిమానా? ఆ పేరుతో ఒక సినిమా తీశారా? అది విడుదలైందా అన్నట్లు ఏ పత్రికా అమాయకత్వాన్ని నటించలేదు, బీజేపీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో మనకెందుకు అన్నట్లు విస్మరించలేదు. వచ్చిన వార్తల ప్రకారం ఆ సినిమాకైన ఖర్చు 260 కోట్లు మొదటి మూడురోజుల్లోనే వసూలైంది. పఠాన్‌ సినిమాలో పాకిస్తాన్‌, ఐఎస్‌ఐని సానుకూలవైఖరితో చూపారని కంగన రనౌత్‌ చెప్పారు. దీన్ని బట్టి ఆమె ఆ సినిమాను కసితోనో, దేశభక్తి కళ్లద్దాలతోనో ఎక్కడో అక్కడ చూశారనే అనుకోవాలి. చిత్రం ఏమిటంటే ఒక బీజేపీనేత నుంచి ఆ మాట వచ్చిఉంటే అదొక తీరు, ఒక నటిగా ఉన్న కంగన నాలుగు సొమ్ములు సంపాదించుకొనేందుకు తాను ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జన్సీ సినిమాను త్వరలో విడుదల చేయబోతూ అలాంటి విమర్శ చేశారు. అదేవిధంగా గుజరాత్‌ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీని కూడాచూసి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఏదో ఒకటిచెపితే ఏమైనాసరే చూసి తీరవలసిందే అంటున్న విద్యార్థులకు ఒక వివరణ, ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది కదా!
నిషేధం నుంచి ఇటీవలే బయటపడి తిరిగి ట్విటర్‌ స్రవంతిలో కలసిన కంగన శుక్రవారం చెలరేగారు. ‘‘విద్వేషం మీద ప్రేమ విజయం అని పఠాన్‌ సినిమా గురించి చెబుతున్న అందరినీ అడుగుతున్నా ! నేను అంగీకరిస్తా, ఎవరి ప్రేమ ? ఎవరి విద్వేషం అన్నదాని మీద అందరం స్పష్టంగా ఉండాలి. ఎవరు టికెట్లు కొంటున్నారు? ఎవరుదాన్ని విజయవంతం చేస్తున్నారు ? దేశంలో 80శాతం హిందువులే జీవించుతున్న చోట పఠాన్‌ అని పిలిచే సినిమా బాగా ఆడుతోందంటే ఆ ఖ్యాతి భారత్‌ అనురాగం, అంతరగ్రాహకతకు చెందుతుంది. పఠాన్‌ విజయవంతంగా నడుస్తున్నదంటే ఆ ఖ్యాతి భారత స్ఫూర్తికి చెందుతుంది. అది విద్వేషం, తీర్పులకు అతీతం. శత్రువుల తుచ్చ రాజకీయాలు, విద్వేషం మీద విజయం. పెద్ద ఆశలు పెట్టుకున్నవారందరూ ఒక్కటి గమనించాలి. పఠాన్‌ కేవలం ఒక సినిమా మాత్రమే, దేశం ఇప్పటికీ జై శ్రీరామ్‌ అని గర్జిస్తోంది. భారతీయ ముస్లింలు, దేశభక్తులని నేను నమ్ముతున్నా, అఫ్గాన్‌్‌ పఠాన్‌లకు వీరికి ఎంతో తేడా ఉంది. అఫ్ఘానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు, నరకం అంటే భయంకరం, కనుక పఠాన్‌ సినిమాకు దాని కథనం ప్రకారం ఇండియన్‌ పఠాన్‌ అన్నది తగిన పేరు’’ అని ట్వీటారు. ఇతరులకు బుద్దులు చెబుతున్న కంగన కడుపు మంట, విద్వేషంతప్ప ఇందులో మరొకటి కనిపించటం లేదు. పాకిస్తాన్‌, ఐఎస్‌ఐని సానుకూల వైఖరితో చూపారని ఆరోపిస్తూనే సినిమా విజయం సాధించిందని చెప్పటం అంటే సానుకూలవైఖరిని జనం ఆమోదించినట్లా ? ఏం మాట్లాడుతున్నారు ? కంగన ట్వీట్ల మీద స్పందిస్తూ కంగన జీవితకాలంలో సంపాదించిన దాని కంటే పఠాన్‌ సినిమా ఒక వసూళ్లు ఎక్కువ అని ఒక ట్వీటర్‌ అపహాస్యం చేశారు. దాని మీద స్పందిస్తూ ఎమర్జన్సీపేరుతో తాను ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్న సినిమాకోసం తన ఇంటిని, ఆఫీసునూ తాకట్టు పెట్టినట్లు కంగన చెప్పారు.
సినిమా విడుదలకు ముందు బేషరమ్‌ రంగ్‌ అనే పాటలో కొన్ని సెకండ్ల పాటు హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ కాషాయరంగు బికినీ ధరించటం మీద కాషాయ దళాలు చేసిన రచ్చ తెలిసిందే. దాని మీద వచ్చిన వత్తిడితో తాను ఇచ్చిన సర్టిఫికెట్‌ను తానే చించి కొన్ని మినహాయింపులతో సెన్సార్‌బోర్డు మరో సర్టిఫికెట్‌ ఇచ్చింది. కోతలు పెట్టిన తరువాత బికినీలో కాషాయ రంగు ఉందా లేదా అని బహుశా కాషాయ దళాలు బూతద్దాలు వేసుకొని చూస్తూ ఉండబట్టే అంత పెద్దఎత్తున వసూళ్లు అంటే తప్పులేదేమో ? దీన్ని గురించి తెలిసిన తరువాతనైనా సిఎం హిమంత బిశ్వ శర్మ పఠాన్‌ సినిమా చూస్తారా, షారూఖ్‌ఖాన్‌ అంటే ఎవరో, ఏమిటో తెలుసుకుంటారా ? నిజానికి షారూఖ్‌ ఖాన్‌ అంటే ఎవరో తెలీక కాదు. బేషరమ్‌ రంగ్‌ పాటమీద చేసిన రచ్చ, బెదిరింపుల గురించి ఒక సిఎం తెలుసుకోలేదంటే తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. దాని మీద వివాదం మొదటికే మోసం తెచ్చేట్లు కనిపించటంతో కొన్ని సినిమాల మీద రచ్చకు పోవద్దంటూ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ హితవు చెప్పారు. సదరు బీజేపీి కార్యవర్గ సమావేశం 16,17 తేదీలలో శర్మ పాల్గొన్నారు. అన్నింటికీ మించి ప్రధాని హితవును ఖాతరు చేయకుండా జనవరి 20వ తేదీన గౌహతిలోని ఒక సినిమా హాలు వద్ద బిజెపి కనుసన్నల్లో నడిచే భజరంగ్‌దళ్‌ గాంగు పఠాన్‌ సినిమా పోస్టర్లను చించివేసి వీరంగం వేశారు. అది శాంతి భద్రతల విఘాతానికి దారితీస్తుందని పోలీసులు సిఎంకు నివేదించలేదని అనుకోగలమా ? ఆ ఉదంతం, బెదిరింపుల గురించి మరుసటి రోజు(శుక్రవారం) విలేకర్లు అడిగిన ప్రశ్నకు సిఎం షారూఖ్‌ ఖాన్‌ ఎవరు అంటూ చారిత్రాత్మక వ్యాఖ్య చేశారు. తనకు పఠాన్‌ సినిమా గురించి కూడా తెలియదన్నారు. అది ఊహించని రీతిలో ఎదురుతన్నింది. సినిమాకు పెద్ద ప్రచారాన్ని తెచ్చింది.
కొన్ని సినిమాల గురించి వివాదాస్పదంగా మాట్లాడ వద్దని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు తప్ప సినిమా హాళ్లను తగులబెడతామన్న వారి గురించి అడిగితే అసలు సినిమాల గురించి, ప్రముఖ హీరోల గురించి తెలియదని చెప్పమనలేదు కదా ! షారూఖ్‌ ఖాన్‌ మాట్లాడితే స్పందిస్తానని విలేకర్లతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. దానికి దేశమంతటా మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చేదీ కాదు. అది పఠాన్‌ సినిమాకు పైసాఖర్చులేకుండా పెద్ద ప్రచార అంశంగా మారింది. షారూఖ్‌ఖాన్‌ ఫోన్‌చేసి ఉంటే దాని సంగతిచూసి ఉండేవాడిని, జరిగింది పెద్ద అంశం కాదు అన్నారు. షారూఖ్‌ఖాన్‌ ఎవరని మీరు ఎందుకు ప్రశ్నించారని విలేకర్లు సోమవారం ప్రశ్నించగా, అతని గురించి నాకెందుకు తెలియాలి? అతనంత గొప్పవాడని నాకు నిజంగా తెలియదు, నా కాలపు హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, జితేంద్ర తప్ప నిజంగా నాకు షారూఖ్‌ఖాన్‌ అంటే ఎవరో పెద్దగా తెలీదు. 2001 తరువాత నేను ఆరు లేదా ఏడు సినిమాల కంటే ఎక్కువ చూడలేదు. నేను అతని సినిమాలు చూడలేదు. తరాలను బట్టి సినిమా తారల ఆకర్షణ భిన్నంగా ఉంటుంది. సిఎంగా నాతో మాట్లాడాలని ఎందరో అడుగుతుంటారు, శనివారం ‘‘నేను షారూఖ్‌ ఖాన్ను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను’’ అన్న ఒక మెసేజ్‌ వచ్చింది. తన సినిమా త్వరలో రిలీజ్‌ కానుందని, ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మీ సినిమా పేరు ఏమిటని నేను అడిగాను, పఠాన్‌ అని చెప్పారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పాను’’ అని సిఎం చెప్పారు. ఇది కూడా మరొక కథే. గుజరాత్‌ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీని అందుబాటులో లేకుండా చేశారు. ఎలాగో సంపాదించి దాన్ని ప్రదర్శిస్తుంటే విద్యుత్‌ నిలిపివేయటంతో పోలీసులతో అడ్డుకోవటం వంటివి చేస్తున్నారు. ఎబివిపిని రంగంలోకిదించి కాశ్మీరీఫైల్స్‌ సినిమాను ప్రదర్శిస్తామంటూ పోటీకి దిగారు. ఇవన్నీ ఎదుటివారిని మరింత రెచ్చగొట్టేవే, ఎదురుతన్నేవే !

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img