Monday, March 20, 2023
Monday, March 20, 2023

మనిషి పక్షాన గొంతెత్తిన పేరలింగం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

అతనొక నిత్యచైతన్య ఉద్యమ తరంగం. పేరుదేవగుప్తపు పేరలింగం. రాజమండ్రిలో ఒక సాధారణ కార్మికుడు. ఎక్కువగా చదువు కోలేదు. కానీ, ఆయన కృషి గురించి తెలుసుకుంటే గొప్ప గొప్ప విద్యావేత్తలు సైతం సిగ్గుతో తలదించుకోవల్సిందే! ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు. జీవిత కాలమంతా ఒంటరిగానే సైన్సుహేతువాద ప్రచారంలో తలమునకలై గడిపారు. తనసైకిల్‌కు ‘‘హేతువాద చైతన్యరథం’’ అని బోర్డు తగించుకుని, వెనక సీటుమీద పుస్తకాల సంచి పెట్టుకుని, గోదావరి జిల్లాలో ఊరూరా తిరిగేవారు. గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలు తగ్గించ డానికి జీవితాన్ని ధారపోశారు. నిక్కరు, ఆఫ్‌ షర్టూ వేసుకుని, కాళ్లకు స్లిప్పర్స్‌తో సైకిల్‌మీద మారుమూల గ్రామాలన్నీ తిరిగే పేరలింగాన్ని ఆ ప్రాంతంలో అందరూ గుర్తుపడతారు. 1942 సెప్టెంబరు 6న దేవగుప్తపు పేరలింగం ఒక పేద వడ్రంగి కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో వారికి చదువుకునే అవకాశం లేదు. అయినా, అంతర్గతంగా అక్షరాలపట్ల పొంగుకొచ్చిన ప్రేమాభి మానాల వల్ల తెలుగు అక్షరాలు నేర్చుకోగలిగారు. ఉన్నత విద్య సాధించలేకపోయినా తన పరిమితమైన పరిజ్ఞానం తోనే ప్రశ్నించడం నేర్చుకున్నారు. ప్రశ్నఆయనలో శోధన శక్తిని తట్టి లేపింది. ఆ ప్రశ్నతో, ఆ శోధనతో హేతువాదిగా మారారు. 1980లలో రాజమండ్రి హేతువాదానికి మంచి కేంద్రంగా ఉండేది. రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్మ సుబ్బరాజు, కత్తి పద్మారావు మొదలైన వారంతా రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సభలు నిర్వహించే వారు. వేల సంఖ్యలో జనం హాజరయ్యేవారు. ఆ వేల మందిలో ఈ డి.పేరలింగం ఒకరు. ఆ ఒక్కడు ఒక్కడిగా మిగిలిపోలేదు. ఒక్క దీపం వందలవేల దీపాలు వెలిగించి నట్లు ఆ ఒక్కడే, తను సముపార్జించిన హేతువాద పరిజ్ఞానం ఊరూరూ తిరిగి ప్రచారంచేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో గాలి శేషగిరిరావు అనే ప్రసిద్ధ ప్రవచనకారుడు ఉండేవారు. హేతువాదులంతా కలిసి, అదే సుబ్రహ్మణ్య మైదానంలో ఆ ప్రవచనకారుడి బండారం ప్రజల ముందుపెట్టారు. అది కళ్లారా చూసిన పేరలింగం తన ప్రచారకార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. ఒకసారి అనారోగ్యంతో కదలకుండా ఇంటిపట్టున ఉండాల్సివస్తే, ఆయన ఆ సమయాన్ని పుస్తక పఠనానికి, అధ్యయనానికి వినియోగించారు. సమయం వృధాచేయకుండా తన ధ్యేయానికి అనువుగా మలచుకున్నారు.
వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. అది అబద్దాలకు లొంగకూడదు. అని నిర్ణయించుకుని, జనంలో తిరగ డానికి, హేతువాద ప్రచారానికి ఉద్యమించారు. తనకు తెలిసిన, తను తెలుసుకున్నఅంశాలు సరళమైన తెలుగులో రాయడానికి కూడా ప్రయత్నించారు. అలా కొన్ని చిన్న చిన్నపుస్తకాలు తయారయ్యాయి. అయితే అవి అచ్చేయడం ఎలాగో, అవి జనానికి అందించడం ఎలాగో ఆయనకు అప్పటికి తెలియదు. అందుకు కావల్సిన డబ్బు కూడా ఆయన దగ్గర లేదు. ఒకసారి రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియం మండలకేంద్రంలో హేతువాదులు కలుస్తున్నారని పేరలింగానికి తెలిసింది. అంతే, ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్లారు. సైకిల్‌మీద ఊరూరూతిరిగి హేతువాదం ప్రచారం చేస్తున్న ఈ పెద్ద మనిషిని అక్కడ కొందరు గుర్తించారు. తనుకొన్ని చిరుపొత్తాలు రాశానని అవి ఎలా ఎక్కడ అచ్చేయాలో తనకు తెలియదని ఆయన సభలో చెప్పారు. వెంటనేఅక్కడున్న యువకులంతా స్పందించారు. ఉన్న పళంగా నలభైవేలు పోగుచేసి ఇచ్చారు. ప్రజాపత్రిక సంపాదకుడు సుదర్శన్‌, ఆయన శ్రీమతి దేవి ముందు కొచ్చారు. ప్రచురణ బాధ్యత తమ మీద వేసుకున్నారు. ఫ్రూఫ్‌లన్నీ స్వయంగా సుదర్శనే చూసేవారు. ఆ రకంగా దేవగుప్త పేరలింగం ఆనే హేతువాద కార్యకర్త జనానికి రచయితగా పరిచయమయ్యారు. నలభైఏళ్ల క్రితమే తెలుగునాట మనిషి కేంద్రంగా గొంతెత్తిన గళంగా, కలంగా ఆయన నిలబడిపోయారు. ఆరు ఏడేళ్లకాలంలో పదికి పైగా పుస్తకాలు ప్రచురించారు.
ఆయన పుస్తకాల శీర్షికలు కొన్ని ఇలా ఉన్నాయి. 1. ప్రాచీన కులసంస్కతిసామాజికప్రగతి 2. ఓ మహిళా నీకు మతమెందుకమ్మా? 3. సైన్సు ప్లస్‌ మూఢనమ్మకాలు 4. బైబిల్‌శాస్త్రీయం విశ్లేషణ 5. ఆది మానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గువల్ల కాదు. 6. మత తత్వం స్త్రీ వ్యక్తిత్వం 7. పట్టువదలని హేతువాది విక్రమార్కుడు పేరలింగంస్వగతం (జీవితచరిత్ర) 8. మంత్రాల్లో దాగి ఉన్న బూతుల మర్మం 9. వరూధిని వివాహం హేతువాద సూక్తులు 10. శ్రీ వేంకటేశ్వర సుప్రభాత శృంగారం 11. పాకలపాటి వారి సంక్షిప్త చరిత్ర.ఈ పుస్తకాల శీర్షికలు చూస్తేనే ఆయన ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం కొంతలో కొంత అర్థమవుతుంది. ఆయనకు ఇప్పుడు ఎనభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్యరాజమహేంద్ర వరం (ఫోన్‌:903209442/ 9502654774) వారు రాజమండ్రిలోని ప్రదీప్‌ కేర్‌ ఆసుపత్రిలో 2022సెప్టెంబరు 4న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీవనసాఫల్య పురస్కారం అందించారు. ఇలాంటి నిస్వార్థ జీవుల్నిగుర్తించి గౌరవించుకోవడం మనకర్తవ్యం. ఎటు నుండి ఏ ఆధారమూ లేని పేరలింగం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్యపు పెన్షన్‌తో ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉండికూడా నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్నిఎదుర్కొని నిలబడటం మాటలు కాదుగదా? ఎక్కువగా చదువుకోనందుకు, వడ్రంగి కార్మికుడిగా జీవనం సాగిస్తున్నందుకు, దయనీయమైన స్థితిలో ఉండికూడా మేతువాదం మాట్లాడుతున్నందుకు భూ స్వాములు, ధనవంతులు, అగ్రవర్ణాల వారినుండి ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి. ఓపికగా పేరలింగం అన్నింటినీ సహించారు. నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమయ్యేవారు. తలవంచుకుని వెళ్లిపోయేవారు. విద్యావంతులైన మూర్ఖుల్ని ఎదుర్కొని చలాకీగా తిప్పికొట్ట గల సామర్ధ్యం లేనందువల్లవక్తగా, రచయితగా గుర్తింపు పొందే అవకాశం లేక చాలా కాలం కార్యకర్తగానే జనంలో ఉండిపోయారు. అలా కూడా ఎన్నో దాడులకు, బెదిరింపులకు గురయ్యారు. అయినా గత మూడు దశాబ్దాలుగా ఆయన ఎన్నడూ అధైర్యపడలేదు. వెనకడుగు వేయలేదు. అమాయక గ్రామీణుల మెదళ్లలో ప్రశ్నలు మొలిపిస్తూ సనాతనసంప్రదాయాల మోసాలు బట్టబయలు చేస్తూ, తన చైతన్య రథాన్ని ముందుకు దూకించేవారు. నిజానికి అది చాలా గొప్ప విషయం ఇప్పటికీ మనం అనుసరించాల్సిన అంశం ఇదే. పేరలింగం వలె గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు విస్తృతంగా తిరిగి, విద్యార్థుల్ని అక్కడిపౌరుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు ఒక చక్కటి సైన్సుగ్రంథాలయం నెలకొల్పి, పదిమందికి జ్ఞానం పంచుతూ, మరోవైపు దైవ మహిమలు చూపినవారికి లక్షరూపాయల బహుమతి ఇస్తానని ఛాలెంజ్‌చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఏ మాత్రం నిలదొక్కుకోని జీవితంతో పోరాడుతూ, హేతువాద విషయం వచ్చేసరికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండగలగడం ఆయన నిబద్దతకు, నిజాయితీకి నిదర్శనం! పేరలింగం గారు. తన ముగ్గురు కొడుకులను హేతువాదపద్ధతిలో వివాహాలు జరిపించారు. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, వినికిడి శక్తి బాగా కోల్పోయినా, ఆయన తన ధ్యేయంనుండి తన దృష్టి మరల్చడంలేదు. ఒక ఆదర్శానికి కట్టుబడిజీవించడం మనం సమకాలీనంలో చాలా అరుదుగా చూస్తాం. అలాంటి అరుదైన వ్యక్తుల్లో చాలా అరుదైనవారు దేవగుప్తపు పేరలింగం. సామాన్యుల్లో అసమాన్యుడు.
`కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img