సంగిరెడ్డి హనుమంతరెడ్డి
ఇజ్రాయిల్పై హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయిల్కు అండగా ఉంటామని ప్రధాని మోదీ ఎక్సర్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. క్లిష్టకాలంలో ఉనికిని కోల్పోతున్నది పలస్తీనా నా? దాన్ని ఆక్రమించి పాలస్తీనీయులపై అమానవీయ హింసకు పాల్పడిన ఇజ్రాయిల్దా? పలస్తీనాను 1517లో ఒట్టొమాన్ సామ్రాజ్యం స్వాధీన పర్చుకుంది. 1917లో దాన్ని బ్రిటన్ జయించింది. పలస్తీనాను ఆంగ్ల, అరబ్ భాషల్లో పలస్తీనా అని, పక్కనే హిబ్రూ భాషలో ఎరెట్జ్ యిజ్రాయెల్ అని రాసేవారు. 1917 నుండి 1948 వరకు పలస్తీనాలో బ్రిటిష్ ఆదేశాల పాలన సాగింది. పలస్తీనాలో అరబ్బులు, యూదులు, క్రైస్తవులు నివసించేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో యూదుల మద్దతు కోసం వారికి ప్రత్యేక రాజ్యం ఇస్తామని విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్ మద్దతుతో ‘బాల్ఫోర్ ప్రకటన’ ద్వారా బ్రిటన్ వాగ్దానం చేసింది. 1939`1945 మధ్య జర్మని నియంత హిట్లర్ ఆజ్ఞతో నాజీలు 15 లక్షల పిల్లలు, 60 లక్షల యూదులను చంపారు. 19వ శతాబ్దం చివర మొదలైన యూదు జాతీయవాదానికి నాజీ యూదు మారణకాండ తోడైంది. మాకు ప్రత్యేకదేశం కావాలన్న కోరిక యూదులకు బలపడిరది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బతికి బట్టకట్టిన ఐరోపా దేశాల యూదులు పలస్తీనాకు వచ్చారు. 2.4.1947 నాటి బ్రిటన్ కోరిక మేరకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ సభ 29.11.1947న 181 వతీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటన్ అధీన పలస్తీనాను 14.05.1948న యూదు(ఇజ్రాయిల్), అరబ్(పలస్తీనా) దేశాలుగా విభజించడం ఆ తీర్మాన సారాంశం. ఈ తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్లు సమర్థించాయి. అరబ్బు దేశాలు తమ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాయి. అరబ్బు దేశాల వ్యతిరేకతకు భయపడ్డ అమెరికా ఈ తీర్మానానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ విభజనతో రెండు మత దేశాలు స్థాపించారు. దీనిని మన ప్రధాని నెహ్రూ వ్యతిరేకించారు. ఐరాసలో భారత ప్రతినిధి విజయలక్ష్మి పండిత్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ఐరాస తీర్మానం యూదులకు మోదాన్ని, అరబ్బులకు ఖేదాన్ని కలిగించింది. అంతర్యుద్ధానికి దారితీసింది. యూదు ప్రజామండలి నాయకుడు డేవిడ్ బెన్ గురియన్ 14.5.1948న ఇజ్రాయిల్ దేశ స్థాపనను ప్రకటించారు. విభజన తీర్మానానికి మద్దతు ఉపసంహ రించుకున్న అమెరికా అధ్యక్షుడు హారిస్ ట్రూమన్ అదేరోజు ఆ కొత్త దేశాన్ని గుర్తించారు. సోవియట్ నాయకుడు స్టాలిన్ ఆ పనేచేశారు. అరబ్ దేశాలు ఈ విభజనను తిరస్కరించాయి. 14.5.1948 నుండి 1967 వరకు పలస్తీనా భాగాలైన వెస్ట్బ్యాంక్, తూర్పు జెరుసెలంలను జోర్డాన్, గాజాస్ట్రిప్ (భూభాగం)ను ఈజిప్ట్ పాలించాయి. మూడేళ్ళలో 6లక్షల మంది ఐరోపా దేశాల యూదులు పలస్తీనాకు వచ్చారు. ఐరాస నిర్ణయించిన దాని కంటే 20శాతం ఎక్కువ భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించింది. తర్వాతి కాలంలో క్రమేపీ అత్యధిక పలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్ దురాక్రమించింది. ఐరాస మధ్యవర్తిగా స్వీడిష్ దౌత్యవేత్త కౌంట్ ఫోల్కే బెర్నడొట్టె చేసిన శాంతి ప్రణాళికను ఇరుపక్షాలు ఆమోదించలేదు. 1948 సెప్టెంబర్లో లేహి తీవ్రవాదులు ఆయనను హత్య చేశారు. 1949 ఎన్నికల తర్వాత సనాతన యూదు మతవాద పార్టీల మద్దతుతో బెన్ గురియన్ తిరిగి ప్రధాని అయ్యారు. ఈరోజు 135 ఐరాస సభ్య దేశాలు గుర్తించిన పలస్తీనాను ఇజ్రాయిల్ గుర్తించలేదు. ఇజ్రాయిల్కు అతి దగ్గరి మిత్ర దేశాలలో ఐరాసను నియంత్రించే అమెరికా ప్రధానమైంది. పలస్తీనా-ఇజ్రాయిల్ సంఘర్షణకు రెండు-దేశాల పరిష్కారాన్ని వర్తింపజేయడమే ఏకైక మార్గం. అంటే యూదులకు ఇజ్రాయిల్, పలస్తీనా ప్రజలకు పలస్తీనా. ఇజ్రాయిల్ ప్రభుత్వం తరఫున ప్రధాని యిట్జక్ రాబిన్, పలస్తీనా విమోచన సంస్థ పక్షాన మహ్మద్ అబ్బాస్, అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో 13.09.1993న ఓస్లో ఒప్పందాలలో భాగంగా దీనిని అంగీకరించి సంతకాలు చేశారు. 1948-49 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో మధ్యప్రాచ్యంలో చిన్న భూభాగమైన పలస్తీనాలో అనేకులు చనిపోయారు, చాలా కుటుంబాలు నాశనమయ్యాయి, పిల్లలు అనాథలయ్యారు, హతులయ్యారు. ఈ హింసను ఆపడానికి అంతర్జాతీయ సమాజం రెండు-దేశాల పరిష్కార అమలుకు నిజాయితీగా కృషిచేయాలి. ఇజ్రాయిల్-పలస్తీనా వివాదంపై చైనా వైఖరి ఇదేనని, మధ్యప్రాచ్య సమస్యపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జై జున్ ఈ నెల 10న ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికి చెప్పారు. గాజా భూభాగంలో ఇజ్రాయిల్ దళాలు, హమాస్ మధ్య జరిగిన పోరులో ఇప్పటికే 2,100 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. దీనిపై ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పలస్తీనా శాఖ సహాయమంత్రి ఒసామా ఖేదర్తో ఫోనులో మాట్లాడుతూ జై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు హానిచేసే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని, ఖండిస్తున్నదని, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిస్తోందని జై చెప్పారు. కాల్పుల విరమణ తక్షణ అవసరం. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ప్రధాన దేశాలు, ఇజ్రాయిల్, పలస్తీనాలు శత్రుత్వాన్ని విరమించుకునేట్లు ఒప్పించాలి. ఇరుపక్షాల మధ్య వివాదాలు, శత్రుత్వాల సుదీర్ఘ చరిత్ర దృష్ట్యా, పరస్పర నిందల ద్వారా శాంతిని నెలకొల్పడం అసాధ్యం.
ఇజ్రాయిల్ ఏర్పాటు నుండి నేటి వరకు పలస్తీనా ఉనికినే గల్లంతు చేయటానికి ఇజ్రాయిల్ అనేక దుర్మార్గాలకు పాల్పడిరది. ఈ హింసలకు హెచ్చరిక ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 07న హమాస్ దక్షిణ, మధ్య ఇజ్రాయిల్ భూభాగాలపై భూ, జల, వాయు మార్గాల్లో దాడికిపాల్పడిరది. వందలాది ఇజ్రాయిల్ పౌరులను చంపింది. ‘‘బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్ ప్రభుత్వం మిగిలిన మా భూభాగాలనూ ఆక్రమిస్తోంది. మా ప్రజలను చంపుతోంది. మమ్ములను చేతలతో, మాటలతో రెచ్చగొడుతోంది. అందుకే ఈ దాడిచేశాం.’’ అని హమాస్ తమ దాడిని సమర్థించుకుంది. గాజాపై తనభారీ హింసాత్మక దాడులు, హమాస్ దాడికి ప్రతీకారమని ఇజ్రాయిల్ సమర్థించుకోవచ్చు. కానీ అది సంఘర్షణను పరిష్కరించదు. ఇజ్రాయిల్-పలస్తీనామధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇజ్రాయిల్, పలస్తీనాల మధ్య దాడి, ఎదురుదాడుల దుర్మార్గపు వృత్తం కారణంగా, రెండు వైపులా ప్రజలు నిరంతరం భయంతో బతుకుతున్నారు. 75 ఏళ్ల హింస తర్వాత శాంతిని ఆశించలేరు. ఇజ్రాయిల్ ప్రజలను చంపడం, లేదా ఇజ్రాయిల్ భూభాగంలోకి క్షిపణులను కాల్చడం వల్ల వారికి శాంతిభద్రతలు ఉండవని పలస్తీనా తీవ్రవాదులు, ముఖ్యంగా హమాస్ గ్రహించాలి. ఇజ్రాయిల్ సైన్యం ఎంత బలంగా ఉన్నా, అది స్వల్ప ఘటనలను, కారణాలను రెచ్చగొట్టే చర్యలుగా భావించరాదు. వెస్ట్ బ్యాంక్, గాజాలలోని పలస్తీనా భూభాగాలపై క్షిపణులతో దాడిచేయడం, మరింత పలస్తీనా భూమిని ఆక్రమించడం మానుకోవాలి. జీవించి, జీవించనివ్వడం ఇరుపక్షాల హేతుబద్ధ లక్ష్యం కావాలి. ఘర్షణలను ఆపడానికి, రెండు-దేశాల పరిష్కార అమలుకు అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను ఒప్పించాలి. మనపాలకులు ప్రపంచ పటంలో స్థానం కోల్పోతున్న పలస్తీనాకు అండగా నిలబడాలి. దాన్ని మింగిన ఇజ్రాయిల్కు కొమ్ముకాయరాదు.
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి
ఫోన్: 9490204545