Friday, April 19, 2024
Friday, April 19, 2024

అంబేద్కర్‌ బాటన గుజరాత్‌లో బౌద్ధం!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా 2023, ఏప్రిల్‌ 14న హైదరాబాదుహుస్సేన్‌ సాగర్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అతి పెద్ద కంచు అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించారు. ఆయనపై దేశ ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ రకంగా భారత రాజ్యాంగ నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కుతోంది. ‘లైట్‌ ఆఫ్‌ ఆసియా’గా ప్రపంచప్రఖ్యాతి గాంచిన గౌతమ బుద్ధుణ్ణి, ఆయన బోధించిన ధర్మాన్ని ప్రచారం చేసిన ఆశోకచక్రవర్తిని ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజలు స్మరించుకుంటున్నారు. అంతేకాదు, హిందూ మతాన్ని త్యజించి ఆరులక్షల మందితో అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించడం కూడా సమకాలికులకు స్పూర్తి నందిస్తోంది. తెలంగాణ టూరిజంశాఖ నాగార్జునసాగర్‌లో బుద్ధవనాన్ని ఎంతో ఆద్భుతంగా అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడానికి ఇంకా కృషి చేస్తోంది. ఇక భారతదేశం బైటజరిగే విషయాలు చెప్పుకోవాలంటే ఉత్తరె అమెరికాలో అంబేద్కర్‌ జయంతిని...‘డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ సమానత్వపు రోజు’’గా గుర్తించి జరుపు కున్నారు. అంతేకాదు, నెలపొడవునా ‘దళిత్ర చరిత్ర మాసం’గా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాలు ఇలా ఉంటే, అదే రోజు 2023 ఏప్రిల్‌ 14న, గుజరాత్‌లో మరో మహాద్భుతం జరిగింది.. గుజరాత్‌ రాష్ట్ర రాజధాన్ని గాంధీ నగర్‌లో యాభైవేలమంది దళితులు బౌద్ధం స్వీకరించారు. ఆరాష్ట్రంలోని వివిధ గ్రామాల్లోంచి, పట్టణాల్లోంచి, నగరాల్లోంచి, అటవీ ప్రాంతాల్లోంచి దళితులూ,ఆదివాసీలు అక్కడి రమాకాంతా మైదానంలో సమావేశమయ్యారు. హిందూ మతాన్ని త్యజించి, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ నడిచిన దారిలో నడిచి, బౌద్ధం స్వీకరించారు.ఆ రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, వెనకబడిన జాతుల వారు అందరో కలిసి పెద్దఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించు కున్నారు. దంగాపూర్‌ ఆదివాసీలైతే కుటుంబాలకు కుటుంబాలు తరలివచ్చి, బుద్ధ దీక్ష తీసుకున్నారు. కార్యక్రమం చూడడానికి మరికొన్ని లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్ని స్వయం సైనిక్‌దళ్‌ (ఎస్‌ఎస్‌డీ) అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించింది. అప్పుడు ఆ ఏప్రిల్‌ 14న జరిగిన ఆ కార్యక్రమం బౌద్ధ బిక్షు ప్రజ్ఞారత్న ఆధ్వర్యంలో జరిగింది. వీరు పోరుబందర్‌లోని గ్రేట్‌ అశోకా బౌద్ధ విహార్‌ నుండి వచ్చి, ఆ కార్యమ్రానికి అధ్యక్షత వహించారు. అక్కడి వారందరితో బుద్ధ దీక్ష ఇప్పించారు. కార్యక్రమాలు ఆ విధంగానే కొనసాగితే రానున్న రెండేళ్లలో అంటే 2025నాటికి ఒక కోటి మంది దీక్ష తీసుకుంటారని దీని వెనక కృషి చేస్తున్న స్వయంసైనిక్‌ దళ్‌ ఆశిస్తోంది. ప్రభుత్వం మతాలమధ్య విద్వేషాలు రగిలించడం మాత్రమే కాదు, హిందూ మతస్థుల మధ్య కూడా కలహాలు సృష్టిస్తోంది. బలవంతంగా హిందుత్వను ప్రజలమీద రుద్దడం వల్ల ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. హిందూ మతంలోని ఎగుడుదిగుళ్లను, నిచ్చెన మెట్లు కుల సంస్కృతిని బలపరచ్చడం, మహిళల హక్కులు, మానవహక్కులు హరించడం ఈ దేశ ప్రజలు భరించలేక పోతున్నారు. మను ధర్మశాస్త్రాన్ని మనప్రాచీన రాజ్యాంగం అంటూ నెత్తికెత్తికోవడం, దేశద్రోహులైన గాడ్సే, సావర్కర్‌ల స్థాయి అనూహ్యంగా పెంచడం ఈ దేశప్రజలకు నచ్చడం లేదు. నీతిలేని, చదువులేని ప్రబుద్ధులంతా మహానాయకులై వెలిగిపోవడంఅధర్మమే ధర్మంగా చలామణి అవుతూ ఉండడం ఈ దేశప్రజలకు కష్టంగా ఉంది. అందుకే వేలసంఖ్యలో జనం బుద్ధ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీన్ని హిందూ దేశంగా మార్చాలని కలలుకంటున్న నేటి పాలకులకు, లక్షల మంది హిందూ మతాన్ని త్యజించడం ఒక చెంపపెట్టు! అధికారంలో ఉన్నవారు ఉగ్రమార్గాన్ని వెతుక్కుంటూ ఉంటే దానికి ధీటైన సమాధానం చెప్పగల సమతామార్గాన్ని, నైతిక రుజుమార్గాన్ని సామాన్యప్రజలు వెతుక్కుంటున్నారు. దేవుడనే రాముడి బూచీ చూపించి పాలకులు రాజకీయాలు చేస్తుంటే అసలు దేవుడనే వాడే లేడన్న బుద్ధ మార్గాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. శోభాయాత్రల పేరుతో పాలకులు అల్లర్లు, కల్లోలాలు ప్రోత్సహిస్తుంటే..మనసు ప్రశాంతంగా ఉంచుకుని, సర్వజనాభ్యుదయాన్ని కాంక్షించే బుద్ధమార్గాన్ని జనం కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకులంతా ఆ రాష్ట్రం వారే. బ్యాంకులు దోపిడీచేసి పారిపోయిన దొంగలంతా అక్కడివారే. అలాంటి గుజరాత్‌లో సామాన్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ కార్యక్రమం తేటతెల్లం చేసింది. అబద్ధాలతో అధికారంలో ఉందామను కున్న వారికి బదులుగా అబద్ధం ఆడరాదనీ, దొంగతనాలు చేయకూడదని చెప్పిన బుద్ధమార్గాన్ని గుజరాత్‌ ప్రజలు కావాలనుకుంటున్నారు. ఇది ఎంతో అహ్వానించదగిన పరిణామం. మనం బతుకుదాం. మరొకరిని బతకనిద్దాం. మొత్తానికి మొత్తంగా మనిషిని బతికించుకుందాం అనే సూత్రానికి కట్టుబడ్డ సామాన్యుల చైతన్యం చాలా గొప్పది. వెలుగులవెంట నీడలుండడం కాదు, నీడల్ని మాయం చేయగల వెలుగులు అక్కడ దేదీప్యంగా ప్రసరిస్తున్నాయి. హిందూమతంలోని పూజలు, భజనలు,పాపాలు, పుణ్యాలు,ఆత్మలు, పునర్జన్మలు, ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటికంటే ముఖ్యంగా ఉన్నతులు, నిమ్నవర్గాలు వంటివన్నీ మూఢనమ్మకాల పుట్టలు! వీటిలో వేటికీ ఆధారాలులేవు. నిరూపణలు లేవు. కేవలం విశ్వాసాల ఆధారంగా శతాబ్దాలుగా కొనసాగుతూ మానవుల జీవితాలు దుర్భరం చేస్తున్నాయి. అందుకే, వాటన్నిటినీ వదిలి స్వేచ్ఛాలోచనలకు, మానవవాదానికి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి విలువనివ్వాలని స్వయంసైనిక్‌దళ్‌ ప్రచారం చేస్తుంది. మనుషుల్ని ఎగుడుదిగుడు స్థాయిల్లో ఉంచి, వివక్షచూపుతున్న హిందూధర్మాన్ని తిరస్కరించడమే ఈ కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం. ఆనాడు అంబేద్కర్‌ చేసిందే ఆదర్శంగా తీసుకుని, ఈ రోజు దేశంలో లక్షలమంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. మనుషులందరిదీ ఒకేస్థాయి అని నినదిస్తున్నారు. ఎవరి జ్ఞానాన్ని వారు, ఎవరి వివేకాన్ని వారు తట్టిలేపుకోవాలని, నిర్ణయం తీసుకునేముందు బాగా ఆలోచించాలని, బుద్ధిని ఉపయోగించాలని స్వయంసైనిక్‌దళ్‌ జనానికి బోధిస్తోంది. దీక్ష తీసుకునే విషయంలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు. ఎన్నికల్లో మాదిరిగా ఎవరూ ఎవరినీ డబ్బుతో లొంగదీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇలాంటి పని ఆలోచనాపరులేచేస్తారు. అదీగాక, ఇది పూజలో, మంత్రాలు వల్లెవేసి మతమార్పిడి చేసే తంతుకాదు. అసలు బౌద్ధం మతమేకాదు.! అదొక జీవన విధానం!! బుద్ధుడి బోధనలు పూర్తిగా స్వీకరించి, అందుకు అనుగుణంగా తమ జీవన విధానం మార్చుకుంటారు. అంతేఇది న్యాయసమ్మతంగా, చట్టబద్దంగా మనస్పూర్తిగా చేయవలసిన పని! దీక్ష తీసుకునేవారు వారివారి కలెక్టర్‌ ఆఫీసుల్లో అప్లికేషన్‌లు నింపాలి. ఆ తర్వాత అందులో ప్రకటించినవన్నీ నిజాలాకాదా`అనేది పోలీసు ఎంక్వయిరీ జరుగుతుంది. దీక్ష తీసుకున్నవారి వివరాలన్నీ గజిట్‌లో అచ్చేస్తారు. ఇదంతా అధికారికంగా జరిగే కార్యక్రమం.
ఈ స్వయం సేవక్‌దళ్‌ తొలుత 2006లో ఒక యాభై మందితో ఏర్పడిరది. ఒకే ఆలోచనావిధానం గల మిత్రులైన దళిత కార్యకర్తలతో మొదలైంది. ఆ సంఖ్య… క్రమంగా ఊహించనిరీతిలో పెరుగుతూ పోయింది. ప్రతి సంవత్సరం అంబేద్కర్‌ జయంతి రోజున ఇలాంటి దీక్షలు దిల్లీ, కోల్‌కత్తా, బెంగుళూర్‌, భోపాల్‌, ముంబై, హైదరాబాదు, లక్నో వంటి పెద్దపెద్ద నగరాల్లో జరపాలని స్వయం సైనిక్‌ దళ్‌ పథకాలు వేసుకుంది.
-కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత,
జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img