Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆధునిక మూఢ నమ్మకాల్లో కొట్టుకుపోతున్న యువత

డాక్టర్‌ దేవరాజు మహారాజు

జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఒక లక్ష్యం కలిగి ఉండడం ` మాక్జిమ్‌ గోర్కీ

యాభై మంది సాధువులు కలిసి గుంపుగా హిమాలయాలకు వెళుతున్నారు. వారిని చూసి ఓ పత్రికా విలేకరి పరిగెత్తి వారికి అడ్డం పడ్డాడు. ‘‘అందరూ కలిసి మూకుమ్మడిగా ఎక్కడికి వెళుతు న్నారు స్వాములూ?’’ అని అడిగాడు. విలేకరిని ఎగాదిగా చూసి ఓ స్వామి ఇలా అన్నాడు ‘‘సజీవ సమాధి అవుదామని కట్టగట్టుకుని వెళుతున్నాం నాయనా! దారి విడువు’’ అన్నాడు. ‘‘అవునా స్వామీ! ఎందుకలా?’’ అడిగాడు విలేకరి మళ్లీ. ‘‘నాయనా! నీకు తెలుసు కదా? ఎప్పుడైతే ఫేస్‌బుక్‌, వాట్సప్‌ మొదలయ్యాయో ప్రతివాడూ ఇతరులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఇహ ఈ ప్రపం చానికి మా అవసరం లేకుండా పోయింది నాయనా! ప్రతివాడూ చెప్పేవాడే. వాడు మాత్రం చెయ్యడు!’’ అని స్వామిజీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. తమను తాము ఆపుకోలేని మిగతా స్వాములు ఒక్కసారి భోరుమన్నారు. విలేకరికి జ్ఞానో దయమయ్యింది. తమ వ్యక్తిగత ప్రవర్తనను, సామాజిక నడవడిని పరిశీలించు కోకుండా ఎదుటివాడికి నీతులు చెప్పే వ్యసనం ఈ దేశంలో సామాన్యుడి నుండి ప్రధానమంత్రి దాకా ఉన్నది నిజమే కదా? అనుకున్నాడు!
తలదించి నన్ను చూడు. మళ్ళీ తలెత్తకుండా చేస్తానంటుందిమొబైల్‌! తలదించి నన్ను చూస్తే మళ్ళీ తల దించకుండా చేస్తానంటుంది పుస్తకం!! మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఊరికే పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. అందులో ఉన్నది కాస్త మెదడుకు ఎక్కించుకోవాలి. జీర్ణించుకోవాలి. విశ్లేషించు కుని ఆలోచించగలగాలి. అందుకే మాక్జిమ్‌ గోర్కీ అన్నాడు. ‘‘పుస్తకాలు చదువుతూ ఉండు. పుస్తకం పుస్తకం మాత్రమే! ఆలోచించడం నీకు నువ్వే నేర్చుకోవాలి!!’’ అని. ఈ అత్యాధునిక యుగంలో యువత సరికొత్త మూఢ నమ్మకాల్లో మునిగిపోతోంది. ఒక మానసిక బలహీనుడు తన వాట్సప్‌ గ్రూప్‌లో తనకు నచ్చిన దేవుడి ఫొటోనో, దేవత ఫొటోనో పెట్టి పదిమందికి షేర్‌ చెయ్యమంటాడు. షేర్‌ చేసిన తక్షణం అద్భుతం జరుగుతుందని ఊరిస్తాడు కూడా! కష్టే ఫలి : అన్నారు గానీ, షేరే ఫలి : అని ఎవరూ అనలేదు. ఒకప్పుడు పురోహితులు, జ్యోతిష్యులు, వాస్తు చూసేవాళ్ళు చెప్పేవాటిని ఇప్పుడు యువతీ యువకులు చేస్తున్నారు. వాళ్ళలో కొందరు వాటిని నిజంగా నమ్మే వాళ్ళయి ఉండొచ్చు లేదా ఊరికే దేవుడి పేరుతో మిత్రులను ఆటాడిద్దాం అని చేసేవారూ కావొచ్చు. ఎట్లా చేసినా అదొక అనవసరమైన చర్య. వేటిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో తెలియపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతకాలం క్రితం దేవుడి పేరుతో ఉత్తరాలు వచ్చేవి. అది అందుకుని చది వినవారు అలాంటివి మరో వంద ఉత్తరాలు రాసి బంధు మిత్రులకు పంపించాలన్న సూచన ఒకటి అందులో ఉండేది. అలా ఉత్తరాలు రాయలేక, రాయకుండా ఉండనూ లేక జనం నానా ఇబ్బంది పడేవారు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఒకతను తన ఆధార్‌ కార్డ్‌ పోస్ట్‌ చేసి తన సెంటిమెంట్‌ కథ ఒకటి రాశాడు. సహాయం చేయదల్చిన వారు ఈ కింది బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బు వేయాలని అభ్యర్థించాడు. కింద తన బ్యాంక్‌ వివరాలిచ్చాడు. అతను చెప్పిన సెంటిమెంట్‌ కథ వాస్తవమే కావొచ్చు. కానీ మాధ్యమాన్ని ఇలా ఉపయోగించుకోవడం సబబేనా? సామాజిక కార్యాచరణకు వాడుకుంటే బావుండేది కదా? లేదా చావు బతుకుల్లో ఉన్నవారికి దాతలు వచ్చి ఫలానా గ్రూప్‌ రక్తం దానం చెయ్యమన్నా సరే కానీ వ్యక్తిగతంగా ఇలా (గౌరవంగా) అడుక్కోవడాన్ని ఏమందాం? పేపర్‌, రేడియో, టి.వి.ల్లో ప్రకటనలంటే చాలా ఖర్చవుతుంది. ఇది మరి ఫ్రీ ఫినాయిల్‌ కదా? ఎంతయినా తాగొచ్చు అనుకుంటే జరిగేది కీడే ఇప్పుడు మనకొక మిశ్రమ సంస్కృతి కనిపిస్తోంది. వీధుల్లో అత్యాధునికంగా కనబడేవారు, ఇండ్లల్లో పరమ ఛాందసంగా ఉంటున్నారు. ఆధునికత వేషంలో మాత్రమే ఆలోచనలో ఉండదు. ఆడా మగా తేడా లేకుండా మోకాళ్ళపై చిరిగిన జీన్స్‌, హాఫ్‌ బనియన్స్‌ వేసుకుని జల్సాగా తిరిగే వాళ్ళు సాయంత్రాలు కాగానే పబ్బుల దారి పడుతున్నారు. లేదా డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. మళ్ళీ ఉదయమే సంప్రదాయపు దుస్తుల్లో తల్లిదండ్రులతో దేవాలయాల్లో, ప్రార్థనా స్థలాల్లో కనిపి స్తారు. పెండ్లి చేయడానికి పురోహితుడైనా అంతే అక్కడ ఆ గంట చొక్కా విప్పి పంచె కట్టుతో ప్రత్యక్షమై తన ఐడి జంధ్యాన్ని తిప్పుతూ కార్యక్రమం నిర్వహిస్తాడు. డబ్బులు, సంభావన చేతిలో పడిన మరుక్షణమే ఫ్యాంటూ షర్టూ తగిలించుకుని, గాగుల్స్‌తో వేషం మార్చి బైక్‌ మీద తుర్రున వెళ్ళిపోతాడు. వీళ్ళే మళ్ళీ నిష్ఠ, సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు. ఎందుకీ ద్వంద ప్రవృత్తీ అని అడిగితే అడిగినవాడు చెడ్డవాడు కావల్సిందే. ఇంతెందుకు మన ప్రసిద్ధ గాయనీ గాయకు లనే చూడండి. దేవుడి పేరుతో ఉన్న టెలివిజన్‌ ఛానెళ్ళలో సంప్రదాయ దుస్తులు ధరించి, తామే పరమ భక్తులయినట్లు, శాస్త్రీయ సంగీతం, కీర్తనలు, భజనలు పాడుతారు. ఆ సాయంత్రం మరో చోట బహిరంగ సభలో పాడాల్సి వచ్చినపుడు అల్ట్రా మోడ్రన్‌ డ్రెస్సులతో గెంతుతుంటారు, మరో గానగంధర్వుడు వళ్ళు కదలక పోయినా, గొంతులో ఒక ఊపు తెచ్చి, సెక్స్‌ పాట మహా సెక్సీగా పాడి శ్రోతలతో ఈలలు వేయించుకుంటాడు. ఆయనే మరో చోట దిగజారుతున్న విలువల గూర్చి, కనుమరుగవుతున్న భాష గూర్చి తెగ ఆవేదన పడతాడు. అదే ఆవేదన ద్వందార్థాల పాటలు పాడేప్పుడు ఉండాలి కదా? ఎందుకీ ద్వంద ప్రవృత్తీ? డబ్బు వస్తూ ఉంటే ఎక్కడి పాట అక్కడ పాడతారన్నమాట! నాటకాల్లో, సినిమాల్లో వేషాలు వేసే కళాకారులకు అది తప్పదు. కానీ, నిజజీవితంలో వేషాలెందుకూ? గౌరవంగా ఒక వ్యక్తిత్వమున్న మనుషుల్లా ఎందుకు ప్రవర్తించరు? ‘‘తెలివితేటలు రావడానికి గింజలు అమ్మబడును’’ అని బోర్డు పెట్టుకుని ఇటీవల ఒకతను వ్యాపారం మొదలుపెట్టాడు. అతను అమ్మే ‘‘మహిహ గల’’ గింజ లు తింటే తెలివి పెరగడం గ్యారంటీ అట? వసంత పంచమి నాడు సరస్వతి పూజ చేస్తే చదువు బాగా వస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని పంతుళ్ళు చెప్పడం విన్నాం గాని... ఇలా గింజలు తింటే తెలివితేటలొస్తాయని ఎప్పుడూ వినలేదు. అలాగని ఎలా నిరూపిస్తారూ? జనాన్ని వెర్రి బకరాలు చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ఇదొకటా? జనాన్ని మోసం చేసే వాళ్ళను పట్టుకుని ప్రభుత్వాలు శిక్షించాలి. ప్రభుత్వాలే జనాన్ని మోసం చేసే చోట ఇక న్యాయమెవరు చేయాలీ? సమాజమెట్లా బాగుపడాలీ? ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి? జనం వేసే ఓట్ల వల్లనే కదా? మరి జనమే మూర్ఖత్వంలో మగ్గిపోతుంటే మార్పు ఎలా వస్తుందీ? ఉదాహరణకు వంద రోజుల్లో ‘మీ డబ్బు రెండిరతలు చేస్తామని ఏదో ఒక కంపెనీ ప్రకటన ఇస్తే చాలు లక్షలు లక్షలు తీసుకెళ్ళి జనం ఆ కంపెనీలో పెడుతున్నారు. కంపెనీ బిఛాణా ఎత్తేసి పోతే, అదే జనం నెత్తీనోరూ బాదు కుంటున్నారు. సులభంగా వచ్చే డబ్బు మీద, అదృష్టాల మీద, దురదృష్టాల మీద జనానికి ఎందుకింత పిచ్చీ? అంటే వాళ్ళు ఇంకా కర్మ సిద్ధాంతాన్ని, దేవుణ్ణీ నమ్ముతున్నారు. మంచి చేసినా చెడు చేసినా అది కేవలం మనిషి మాత్రమే చేయగలడని, చేస్తున్నాడని గట్టిగా నిర్ణయించుకున్న నాడు ` తప్పకుండా జనం ఆలోచనా విధానం మారుతుంది.
తెలంగాణలోని జయశంకర్‌ జిల్లాలోని మహదేవపూర్‌లో ‘‘వాస్తు శాస్త్రా ధికారి’’ కార్యాలయం ఉంది. అది పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం వారిది. ఇంకొద్ది కాలంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు వాస్తు కళాశాలలుగా మారిపోతా యేమో చెప్పలేం. మాస్టర్‌ ఆఫ్‌ వాస్తు, డాక్టర్‌ ఆఫ్‌ వాస్తు పట్టాలు పంచినా ఆశ్చర్య పోనక్కర లేదు. ఎందుకంటే లోగడ రాశులు చూసి దాని ప్రకారం నాటడానికి మొక్కలు సరఫరా చేసినవారు ముందు ముందు ఏమైనా చేయగలరు కదా? ఒకాయన దిల్లీలో డైరెక్టర్‌ జనరల్‌ లాంటి అత్యున్నత పదవి లోంచి ఇరవై యేళ్ళ క్రితం రిటైరై, ఈ మధ్య సతీసమేతంగా ‘ఆయుష్‌ హోమం’ చేశాడు. దానివల్ల ఆయుష్షు పెరిగి, తిరిగి యవ్వనవంతులవుతారని భ్రమ! కాలం వెనక్కి తిరగదు. పోయిన యవ్వనం తిరిగి రాదు. తన అనుభవ సారం సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేస్తే బావుండేదేమో కదా? జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపురంలో ఒక టాలెంట్‌ స్కూలు యాజమాన్యం ఒక దిగంబర స్వామిని స్కూలు ఆవరణలోకి తీసుకుపోయి బాలబాలికల ముందు పూజలు చేసింది. మతి స్థిమితం సరిగా లేనివారు ఎక్కడైనా నగ్నంగా కనబడితే ఓర్చుకోలేని సమాజంలో ఒక పాఠశాల యాజమాన్యం ఒక నగ్నబాబాను పురవీధుల గుండా ఊరేగించి, స్కూలు లోపల బాలబాలికల ముందు నిలబెట్టి పూజలు చేయడం దేనికి సంకేతం? ఇదేం నాగరికత? ఇదేం సంప్రదాయం? ఇదేం టాలెంటూ? పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించనక్కరలేదా? నగ్నబాబాకు ఎలాగూ మతి స్థిమితం ఉండి ఉండదు. కానీ అక్కడ యాజమాన్యం వారి దిగంబరత్వం అసహ్యంగా బయటపడిరది కదా?
కొద్దిరోజుల క్రితమే మనమొక ప్రత్యేకమైన వార్త విన్నాం, చూశాం, చదివాం. శ్రీలంకలో ఒక మాజీ నావికుడు విజితముని రహానా డిసిల్వా విశ్రాంత జీవితం హాయిగా గడపలేక జ్యోతిష్యం చెప్పే పని పెట్టుకున్నాడు. సామాన్య జనం ఆయన జ్యోతిష్యాన్ని నమ్మినవారు నమ్మారు, నమ్మనివారు నమ్మలేదు. దేశంలో ఒక పెద్ద సంచలనం సృష్టించి రాత్రికి రాత్రే ప్రసిద్ధుడయిపోదామనుకున్నాడేమో… శ్రీలంక అధ్యక్షుడు 2017 జనవరి 26న చనిపోతున్నాడని ప్రకటించాడు. జనవరి 26 అయిపోయింది. అప్పటి అధ్యక్షుడు సిరిసేన బతికే ఉన్నాడు. ఎప్పటిలా ఈ విషయాన్ని జనం, పోలీసులు తేలికగా తీసుకోలేదు. పోలీసులు జ్యోతిష్యుణ్ణి అరెస్ట్‌ చేసి లాకప్‌లో పడేశారు. ఇంకెప్పుడూ జ్యోతిష్యం చెప్పనని హామీ పత్రం రాయించుకుని వదిలేశారు. మాట తప్పితే ఇరవై లక్షల జరిమాన కడతానని కూడా ఆ పత్రంలో రాయించుకున్నారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఇలాంటి చర్యలు చేపడితే జనంలో కొంత మార్పు వస్తుందేమో!

వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img