Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఆలోచనలేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్ట్‌ చేయడం లాంటిది.
థామస్‌ పెయిన్‌ (17371809)
అమెరికన్‌ తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త

దళితుల చేతితో నీళ్ళు తాగడానికి నిరాకరించిన ఈ దేశంలోని పెద్ద మనుషులు ఈ రోజు ఒక జంతువు మూత్రం సంతోషంగా తాగు తున్నారు. దేశం ఎంత ముందుకు పోతూఉందో, ఎంత వెలిగిపోతూ ఉందో ప్రపంచం గమనిస్తూనే ఉంది. గోమూత్రం అంత పవిత్రమైనదే అయితే, దేవుళ్ళ అభిషేకాలకు ఎందుకు వాడడం లేదూ? అని నేటి యువతరం ఒక ప్రశ్నను సంధిస్తోంది. సరస్వతి శిశుమందిర్‌ల పేరుతో ఆరెస్సెస్‌ వారు లక్షలాది ఆదివాసీ బాలబాలికల పసి మనసుల్ని కలుషితం చేస్తున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి జాగ్రత్త పడాల్సి ఉంది. అయినా విద్యాలయాలపై దాడులు, యూనివర్సిటీలపైదాడులు వీరికి కొత్త కాదు. లోగడ నలంద, విక్రమశిల, తక్షశిలలాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసంచేసింది. వీరిపూర్వీకులేనన్నది గమనించాలి! ఇటీవల జేఎన్‌యూపై దాడులు కూడా ఎవరు చేయించారో అందరికీ తెలిసిన విషయమే.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ ఆఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడు, జాతి వివక్షపై జీవితాంతం పోరాడిన విప్లవవీరుడు నెల్సన్‌ మండేలా ఇలా అన్నారు. ‘‘మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ బేధాలతో విభజన అయి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజన జరిగింది. మూర్ఖులే జాతి, మత, రంగు, లింగ భేదాలతో తమని తాము విభజించుకున్నారు’’ ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా ఉంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా ఉంచలేకపోయింది. దానికి కారణమేమిటీ? అని ఇకనైనా మనం ఆలోచించుకోవాలి కదా? మతం అణచివేతకు గురైన జీవి నిట్టూర్పు. హృదయంలేని ప్రపంచంలో హృదయంలాంటిదని, స్ఫూర్తిలేని ప్రపంచంలో స్ఫూర్తిలాంటిదని కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా ఒకరకంగా మతం ప్రజల పాలిట మత్తుమందు. ఆనందంగా ఉన్నామని భ్రమలు కల్పించే మతం రద్దు కావాలంటే నిజ జీవితంలో నిజమైన ఆనందం సాధించి ఉండాలి. ఆ నిజమైన ‘ఆనందం’ సాధించబడాలంటే ఏం చేయాలో మార్క్సుఏంగిల్స్‌ చెప్పారు. ‘‘మత భావనలు బలంగా కొనసాగడానికి అదృష్టం, అతీత శక్తులు, దేవుళ్ళపై నమ్మకాలకు భౌతిక పునాది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. వాటిని రూపుమాపి, భావజాల పోరాటం కూడా జోడిస్తే… అప్పుడు మనిషికి మతం అవసరం తొలగిపోతుంది. మతం అంతరించి పోతుంది’’ అన్నాడు మార్క్స్‌. ‘‘మతాన్ని తొలగించాలంటే మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి. సమాజంలోని దోపిడిని వ్యతిరేకించి పోరాడకుండా దాని ప్రతిబింబమైన మతంపై పోరాడడం వలన ఉపయోగముండదు’’ అని చెప్పాడు ఏంగిల్స్‌. ఆ మహానుభావుల అభిప్రాయాలు మనకు శిరోధార్యమే. కాని స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో యేం జరుగుతూ వస్తోందో మనకు తెలుసు. మనిషికి మతం అవసరం లేని పరిస్థితిని ప్రభుత్వాలుగాని, రాజకీయ పార్టీలుగాని, సామాన్య పౌరులుగానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా?/ చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి! దేవుడు, దయ్యం, మతాల జోలికి పోకుండా ఇన్నేళ్ళూ వామపక్షాలు దోపిడీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు. అది సరిపోవడం లేదు కదా? ఏమైనా మంచి ఫలితాలు వచ్చాయా? ‘మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి’ అని అన్నాడు ఏంగిల్స్‌. మరి ఈ దేశంలో వామపక్షాలు ఆ పనిచేస్తూ వచ్చాయా? మతం సృష్టించిన పరిస్థితులు తొలగించాలంటే, తప్పకుండా జనంలో వైజ్ఞానిక స్పృహ పెంచడం అవసరం. ఆ దిశలో వామపక్షాలు ఎందుకు కృషి చేయడం లేదూ? ఎంతసేపూ పోరాటాలు, హక్కులు, ధర్నాల దగ్గరే గిరి గీసుకుని ఉన్నాయే? మతం/దేవుడు/ మూఢ నమ్మకాలు వంటి అంశాల్ని ఎందుకు వదిలేశారూ? ఇక్కడ వామపక్షాల గూర్చి మాట్లాడడమెందుకంటే చేస్తే, అంతోఇంతో అవే చేయాలి! బూర్జువా రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాలు పట్టించుకోవు. వారు నోట్లు పంచి ఓట్లు దండుకునే పనిలో తీరికలేకుండా ఉంటారు. అధికారం చేజిక్కించు కోవడానికి దిగజారిన రాజకీయాలు చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. వారితో ప్రజా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని ఊహించలేం.
బూర్జువా నాయకుల ప్రకటనలుపనితీరు ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. 2019లో రామమందిరం కట్టలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నన్నాడు సాక్షి మహరాజ్‌. రామమందిరం కట్టిందీ లేదు. ఆయన రాజకీయాలు వదిలి వెళ్ళిందీ లేదు. 2018లోపు గంగానదిని శుభ్రం చేయించలేకపోతే జల సమాధి చేసుకుంటానన్నది ఉమాభారతి. గంగా నదిని శుభ్రం చేయించింది లేదీ. ఆమె తనను తాను జల సమాధి చేసు కున్నదీ లేదు. వందరోజుల్లో నల్లధనం వెలికి తీయలేకపోతే నన్ను ఉరి తీయండి! అని అన్నాడు ఈ దేశ ప్రధాని. ఆ ప్రధాని పీఠమ్మీద ఇప్పటికి 78 ఏళ్ళుగా కూర్చున్నా, ఆ పని చేయలేక నిస్సహాయుడిగా మిగిలి పోయాడు. పైగా ప్రతి భారతీయుడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్న ఆ పెద్ద మనిషి నిజాయితీనిఏమని పిలుద్దాం? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు/ లైంగిక దాడులు/ కిడ్నాపులు, దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వాటికి బాధ్యులైన వారు, దేశ ప్రజలనుద్దేశించి వివరణలు ఇవ్వాలి కదా? మరి ఏమైందీ? దేశంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకుని పారిపోయిన దేశీయ వ్యాపారవేత్తలు ముఖ్యంగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ముస్లింలు లేరు, దళితుల్లేరు, బహుజనుల్లేరు. పోనీ నక్సలైట్లో, అర్బన్‌ నక్సల్సో ఉన్నారా అంటే వాళ్ళుకూడా లేరు. కేవలం గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు. వారంతా కలిసి దోచుకున్నది పది లక్షలు కాదు. పది లక్షల కోట్లు ‘మాత్రమే’? మరి ఈ దేశ కాపలా దారు ఏమయ్యాడూ? ఇంకా చాయ్‌ అమ్ముకుంటూనే దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడా? లేక దేశీయ సంస్థల్ని ప్రైవేటు వారికి అమ్ముకుంటూ దేశమంతా తిరుగుతున్నాడా? పెంచిన గడ్డానికో మాస్క్‌ తగిలించుకుని, ఎలక్షన్‌ ర్యాలీలు తీస్తూ, కుంభమేళాలు జరిపిస్తూ కరోనా వ్యాప్తిలో తలమునకలై ఉన్నాడా? ఏం చేస్తున్నట్టూ? ప్రతి ఎకౌంట్‌లో పదిహేను లక్షలు వేయడం తర్వాతి మాట. ముందు సగటు మనిషి ఎకౌంట్లో మూడు నాలుగువేలు కూడా లేకుండా చేయడానికి పథకాలు రచిస్తున్నాడా? మిగతా పాలకులు ఏమయ్యారూ? వ్యవస్థలు ఏమయ్యాయీ? దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచ బోతున్నారూ? దేశాన్నిముంచిన వ్యాపారవేత్తల పేర్లు: 1. విజయమాల్యా, 2. మెహుల్‌ చోక్సీ, 3. నీరవ్‌ మోడీ, 4. నిషన్‌ మోడీ, 5. పుష్పేష్‌ వైద్య, 6. ఆశిష్‌, 7. సన్నీ కల్రా, 8. ఆర్తి కల్రా, 9. సంజయ్‌ కల్రా, 10. వర్షా కల్రా, 11. సుధీర్‌ కల్రా, 12. జతన్‌ మెహతా, 13. ఉమేష్‌ పరిఖ్‌, 14. కమలేశ్‌ పరిఖ్‌, 15. నీలేశ్‌ పరిఖ్‌. 16. వినయ మిట్టల్‌, 17. ఏకలవ్యా గార్గ్‌, 18. చేతన్‌ లాల్‌, 19. నితిన్‌లాల్‌, 20. దీప్తి బెన్‌ చేతన్‌, 21. సవియా సేట్‌, 22. రాజీవ్‌ గోయెల్‌, 23. అల్య గోయెల్‌, 24. లలిత్‌ మోడి, 25. రితేష్‌ జైన్‌, 26. హితేశ్‌ పటేల్‌, 27. మయూరి బెన్‌, 28. ఆశిష్‌ భాయ్‌ పారిపోయే దొంగల్ని చౌకీదార్‌ నిలదీయ లేదంటే, పట్టుకోలే దంటే, విజిలేసి, నలుగుర్ని కేకేసి గోలగోల చేయలేదంటే ఏమిటి అర్థం? చౌకీదార్‌ దొంగలతో లాలూచీ పడ్డాడని కదా అర్థం? ఇక్కడ ఒక్క చౌకీదా రంటే చౌకీదారనే కాదు. ఆ స్థానంలో ఉన్న వ్యవస్థలు/ ప్రభుత్వాధినేతలు అందరికందరూ దోషులేనన్నది ఈ దేశ ప్రజల తీర్పు. అయితే దానికి కారణం చౌకీదార్‌ అతని టీం మాత్రమే కాదు. అనాలోచితంగానో, డబ్బుకు ఆశపడో అనర్హులను/ అసమర్ధులను ఎన్నుకున్న తప్పు ఎవిరిదీ? ఈ దేశ మూర్ఖ ప్రజలది కాదా? ఎవరికి వారు ఆలోచించాలి! ఈ దేశ ప్రజలు చేస్తున్న దుర్మార్గమైన పని ఏమిటంటే చదువు లేని అవివేకుల్ని పలుమార్లు గెలిపిస్తారు. తీవ్రవాద ఆరోపణలున్న వారినీ గెలిపిస్తారు. ఇళ్ళలో దూరి దౌర్జన్యాలు చేసే గూండాలను గెలిపిస్తారు. అసెంబ్లీలో కూర్చుని నీలిచిత్రాలు చూసే హీనుణ్ణీ గెలిపిస్తారు. ఇక రేపిస్ట్‌లనైతే చాలా ఘనంగా గెలిపిస్తారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళని గెలిపించి పైగా లబోదిబోమంటుంటారు. ‘‘అయ్యో! నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని… ఏడుస్తూ పెడబొబ్బలు పెడతారు. అవన్నీ అవసరమా? విద్యావంతులకు, వివేకవంతులకు, సమర్ధులకు, నీతినిజాయితీ, నిబద్ధతా గల యువతీ యువకులకు దేశంలో కొదవ లేదు. దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళంతా బయటికి రావాలి. ధైర్యంగా ప్రస్తుత పరిస్థితుల్ని ఎదుర్కోవాలి! జనం వారికి అండగా నిలబడి గెలిపించాలి. దేశం బాగుపడాలంటే అదొక్కటే మార్గం.
అయినా తరతరాలుగా మెదళ్ళలో కులమతాల, వర్గ వర్ణాల, లింగ రంగు భేదాల మకిలి పేరుకుపోయి ఉంటే వివేకం, సమానత్వం ఎలా సాధ్యం? సైన్సు గాడ్జెట్లు వాడుతున్నాం కదా? ఇక ఆధునికులమై పోయినట్టే అని అనుకుంటే అది బుద్ది తక్కువే అవుతుంది. పైగా ప్రతి పనికిమాలిన వాడూ మనోభావాల గూర్చి మాట్లాడడం ఫ్యాషనైపోయింది. ఏదో ఇతరులెవ్వరికీ మనోభావాలు ఉండవన్నట్లు అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ` హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తే, వైజ్ఞానిక స్పృహ అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన వారిని మనోభావాలు బాధించవు. ప్రతి విషయాన్నీ మనోబలంతో విశ్లేషించుకోగలిగే స్థోమత వస్తుంది. స్థాయి పెరుగుతుంది.
వ్యాస రచయిత : సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img