Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఐదు కోట్ల మంది పిల్లలు బడి బయటే

కరోనా రెండో దశ తరువాత గొర్రెలు కాస్తూ, బర్రెలు కాస్తూ, ప్రమాద వశాత్తు కరెంటు తీగలు తగిలి చనిపోయిన పిల్లల వార్తలు ఎన్నో మనల్ని కలవరపెట్టాయి. నేల బావిలో పడి మరణించిన పిల్లల గురించి ఏ హక్కుల సంఘాలూ ప్రభుత్వాలను ప్రశ్నించ లేకపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నలు నిషేధం కదా!

బి. హరి వెంకట రమణ

నూతన జాతీయ విద్యా విధానం ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు సార్వత్రిక విద్యను వాగ్దానం చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 4 వ లక్ష్యానికి దీనిని అనుసంధానం చేసారు. వలస కార్మికుల పిల్లలు, బడి బయట పిల్లలను ప్రధాన స్రవంతి విద్యలోకి తీసుకురావడానికి ఓపెన్‌ స్కూలు విద్య, దాతృత్వ సంస్థల సహకారంతో వినూత్న విద్యా కేంద్రాలు, హైస్కూల్‌ స్థాయి నుంచి వృత్తి విద్యలు, ప్రత్యేక విద్యా మండళ్లు, విద్యావిధానంలో ప్రత్యామ్నాయ నమూనాలను ఆమోదించటం, విద్యా ఫలితాల కోసం ఇన్‌పుట్‌కు తక్కువ ప్రాధాన్యత, సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఇంకా కళలు, క్రీడలను పాఠ్యభాగాలలో చేర్చడం ఇందులో ప్రధానమైనవి. ఇవన్నీ సరే! అసలు జాతీయ విద్యా విధానం అమలుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులే లేవు, ఏవి ఎప్పుడు అమలు చేస్తారన్న కాల పరిమితీ లేదు. విద్య ఉమ్మడి అంశంగా గుర్తిస్తూ అంతర్లీనంగా కేంద్రప్రభుత్వం మనువాద సంస్కృతిని పాఠ్యాంశాలలో చేరుస్తోంది. ఇక ముందు పాఠ్యాంశాలన్నీ కేంద్ర స్థాయిలోనే రూపొందుతాయనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శరవేగంగా జాతీయ విద్యావిధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు పరుస్తూ అదనంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థుల కోసం అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా పలు పథకాలు ప్రవేశపెట్టింది. వీటిని ఆహ్వానిస్తూనే ఈ పథకాలు, జాతీయ విద్యా విధానం బడిబయట పిల్లలను, బాలకార్మికుల సంఖ్యను తగ్గించగలవా? అని పరిశీలన చేయవలసిన అవసరం పౌర సమాజాల పైన, విద్యా పరిరక్షణ కార్యకర్తలపైనా వుంది.
మనదేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రాథమిక విద్యాభ్యాసంలో చేరిన దళిత, బహుజనుల పిల్లలు, అమ్మాయిలు హైస్కూలు, ఇంటర్‌కు వచ్చేసరికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మిగులుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం డ్రాపౌట్లుగానూ, బాలకార్మికులగానూ మారుతున్నారు. బాల్యవివాహాలకూ బలవుతున్నారు. ఇంకా హైస్కూలు స్థాయికి చేరినా వారి అభ్యసన నైపుణ్యాలు అత్యంత నాసిరకంగా మిగులుతున్నాయి.
2020లో యుడైస్‌ లెక్కల ప్రకారం రెండుకోట్లకు పైగా బడిబయట బాలబాలికలు ఉన్నారు. వీరిని ఓపెన్‌ స్కూల్‌ విద్యావిధానం ద్వారా, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా2030 సంవత్సరం నాటికి ( సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధనకు) ప్రధాన స్రవంతిలో కలుపుతామని ప్రభుత్వం అంటోంది. కొవిడ్‌ అనంతర ఆర్థిక సంక్షోభ కాలంలో వీరి సంఖ్య ఎంత వరకూ పెరిగిందో అధికారికంగా తెలీదు. ఇక మన రాష్ట్రంలో బడిబయట ఉన్న పిల్లల సంఖ్యలో స్పష్టత లేదు. (2016 `17 లెక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి). ఒక అంచనా ప్రకారం బడిబయట పిల్లలు దేశవ్యాపితంగా కలిపి ఐదుకోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. మనదేశం 1989 అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక (యు.ఎన్‌.సి.ఆర్‌.సి) పై సంతకం చేసినపుడు బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా తొలగించలేని అశక్తతలో ఉన్నామని చెప్పింది. ఇప్పటికీ ఇందులో ఎలాంటి మార్పూ లేకపోవడం శోచనీయం, సిగ్గుచేటు.
జాతీయ విద్యావిధానం బడిబయట పిల్లలను, బాల కార్మికులను ప్రధాన స్రవంతిలోకి తెస్తుందని ఒక పక్క చెబుతున్నారు గానీ మరోవైపున రేషనలైజేషన్‌ పేరుతో అనేక పాఠశాలలను ఏకీకరణ చేసి గ్రామీణ, గిరిజన ప్రాంత పిల్లలకు బడిని మరింత ఎక్కువ దూరం చేసారు. ఈ నేపధ్యంలో దూరాన వున్న పాఠశాలలకు చేరుకునే పిల్లలు ముఖ్యంగా ఆడ పిల్లలు ఎంతమంది? బాలకార్మికులుగా మారేవారు ఎంతమంది?
విద్యాహక్కు చట్టం 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించమని చెపుతోంది. కానీ, బాలకార్మికుల నిషేధ, నియంత్రణ చట్టం1986, సవరణ చట్టం 2016 ప్రకారం 14 సంవత్సరాలు దాటిన వయసు పిల్లలు హానికరం కాని పరిశ్రమలలో బడి సమయం అయి పోయిన తరవాత పని చేసుకోవచ్చు. ఒక పక్క అంతర్జాతీయ నిర్వచనాల ప్రకారం 18 సంవత్సరాలలోపు వారం దరినీ బాలలు అంటున్నాము, మరో పక్క బాలల న్యాయ చట్టం ప్రకారం కూడా ఇదే నిర్వచనం ఇస్తూ 14 సంవత్సరాలు దాటిన పిల్లలను పనికి ప్రోత్సహించడం బాలల హక్కులకు తీవ్ర ఉల్లంఘన. షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు బాలకార్మికులను తమ సొంత పిల్లలుగా చూపుతూ పనులలో పెట్టుకుంటున్నారు.
విద్యకు కేటాయింపులు
బాలకార్మిక వ్యవస్థ అంతర్జాతీయంగా మానవ హక్కులకు పెద్ద సవాలు. పనిచేసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 152 మిలి యన్లు ఉంటారని ఒక అంచనా. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు ఒక డాలర్‌ ఖర్చు చేస్తే, రెండు దశాబ్దాలలో తిరిగి 7 డాలర్ల ఆదాయం లభిస్తుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రాథమిక విద్యను పూర్తిచేసిన బాలబాలికలకు తదుపరి దశలో 5 నుండి 15 శాతం వరకు ఆదాయం అని కూడా వెల్లడిరచింది. బాలుర కంటే బాలికలకు చదువు ఉంటే అధిక ఆదాయం వస్తుందని కూడా ఆ నివేదిక తెలిపింది. విద్యకోసం 6 శాతం జి.డి.పి. ని కేటాయించడానికి ప్రభుత్వం ప్రైవేటు దాతృత్వ సంస్థల వైపు చూస్తోంది. మన రాష్ట్రంలో విభిన్న విద్యా పథకాలతో బడిబయట బాలలను తిరిగి పాఠశాలల్లో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరు తున్నారు. అయితే ఇంత కష్టపడి చేర్చినా అనూహ్యంగా కొవిడ్‌ సంక్షోభం, కుటుంబాల ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడటం వలన తిరిగి అనేక మంది పిల్లలు పనులకు వెళుతున్నారు. కరోనా రెండో దశ తరువాత గొర్రెలు కాస్తూ, బర్రెలు కాస్తూ, ప్రమాద వశాత్తు కరెంటు తీగలు తగిలి చనిపోయిన పిల్లల వార్తలు ఎన్నో మనల్ని కలవరపెట్టాయి. నేల బావిలో పడి మరణించిన పిల్లల గురించి ఏ హక్కుల సంఘాలూ ప్రభు త్వాలను ప్రశ్నించ లేకపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నలు నిషేధం కదా!
లోపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక శాఖ 14 సంవత్సరాలలోపు పిల్లలు పనిచేస్తూ బాలకార్మికులుగా పట్టుబడినా, ఆయా యజమానులకు విధించిన జరిమానాను ఆ పిల్లలు 18 సంవత్సరాలు పూర్తయిన తరవాత వారికి తిరిగి ఇవ్వడంలో విఫలమయింది. రాష్ట్ర వ్యాపితంగా వేలాది మంది పిల్లలను గుర్తించి ఈ కరోనా కష్ట కాలంలో ఆయా డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను వారికి తిరిగి ఇచ్చినట్లయితే ఆ కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో బాలకార్మిక నిషేధ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను సంవత్సరాల తరబడి ఏర్పాటు చేయలేదు, కొన్ని జిల్లాలలో ఆయా స్వచ్ఛంద సంస్థల చొరవతో మాత్రమే వీటిని ఏర్పాటు చేసారు, చాలా జిల్లాల్లో ఇంకా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. పలు చోట్ల బాలకార్మికులను జిల్లా బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టటం లేదు, పిల్లలు పనిచేస్తూ పట్టుబడిన వెంటనే ఆయా కార్మిక అధికారులు జరిమానాలతో సరిపెడు తున్నారు. జిల్లా స్థాయిలో బాలల సంరక్షణ సమితి ముందు ప్రవేశపెట్టడం వలన పిల్లల సమగ్ర వికాసానికి ఆ కమిటీ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పరిష్కారాలు
కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నట్లయితే పిల్లలను పనికి పంపే అవకాశాలు తక్కువ ఉంటాయి కనుక సంక్షేమ పథకాలతో పాటు పట్టణ పేదల, బడుగుల, గిరిజనుల జీవనో పాధులు పెరిగే అవకాశాలపై దృష్టి పెట్టాలి. కొవిడ్‌ సంక్షోభం తగ్గుముఖం పట్టాక తిరిగి బాలకార్మికులుగా మారే అవకాశం ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, స్థానిక అంగన్‌వాడీల ద్వారా గుర్తించి వారికి తగిన సహాయ సహ కారాలు అందించాలి. ప్రతి జిల్లాలోనూ బాలకార్మికులపై ఒక సమగ్ర సర్వే చేపట్టాలి. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టాన్ని సవరించి 3 నుంచి 18 సంవత్సరాలలోపు వారందరికీ ఉచిత నిర్భంద విద్య అందేలా చర్యలు తీసుకోవాలి. బాలికలకు కస్తూర్భా విద్యాలయాలలాగే 14 నుంచి 18 సంవత్సరాల బాలురకు కూడా ఆటపాటలతో వృత్తి నైపుణ్యాలను నేర్పే ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి. బడికి దూరంగా వున్న పిల్లల కొరకు ఆడపిల్లలకయితే సైకిళ్లు అంద జేయాలి. బాలబాలికలు పాఠశాలలకు వెళ్లి రావడం కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను నడపాలి. గ్రామ బాలల పరిరక్షణ సంఘాలకు శిక్షణ ఇచ్చి గ్రామాలను, వార్డులను బాలల స్నేహ పూర్వక గ్రామాలుగా, వార్డులుగా రూపొందించాలి. గ్రామం, వార్డులో పిల్లలకు హానికరంగా వున్న ప్రదేశాలను, సురక్షిత ప్రదేశాలను మ్యాపింగ్‌ చేయాలి. పొదుపు సంఘాల సమావేశంలో బాల్యవివాహాల నిరాకరణతో పాటు బాలకార్మికుల అంశం, బాలల హక్కుల పరిరక్షణ తప్పనిసరిగా ఒక ఎజెండాగా వుంచే అలవాటు చేయాలి. దీనివలన బాలకార్మికులుగా మారడానికి అవకాశం వున్న పిల్లలను ముందే గుర్తించి తగిన చర్యలు చేపట్టటానికి అవకాశం వుంటుంది.
వ్యాస రచయిత బాలల హక్కుల కార్యకర్త
8466820560

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img