Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఓటు హక్కుకోసం సంఘర్షించిన మహిళలు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఫ్రుడెన్సియా అయాల(18851936) ఎల్‌ సాల్వడార్‌ కవయిత్రి. వ్యాసకర్త, స్త్రీ హక్కుల కార్యకర్త. 20వ శతాబ్దపు ప్రారంభంలో తన రచనలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మహిళ. ఎల్‌ సాల్వడార్‌లో స్త్రీలకు ఓటు హక్కు కూడా లేనిరోజుల్లో ఆమె అక్కడ దేశాధ్యక్షస్థానానికి మొదటిసారి పోటీలో నిలిచిన ధీర వనిత! అలాంటి సమాజం ఆమెను ఎలాగూ గెలవన్విదు. కానీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆమె ప్రదర్శించిన గుండె ధైర్యం, తెగువ ఎంతటిదో ఊహించుకోవాల్సిందే! ఆ దేశపు సుప్రీంకోర్టు ఆమె నామినేషన్‌ను అప్పుడు కొట్టేసింది. అయితే, ఆమె మరణం(1936) తర్వాత చాలా కాలానికి ఆ దేశ రాజ్యాంగ సవరణ ప్రకారం 1950లో మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించింది. సోన్‌ సొనేట్‌ ప్రాంతంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆమె, సాంటా అనా నగరంలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, జర్నలిస్టుగా, రచయిత్రిగా, కార్యకర్తగా రూపుదిద్దుకున్నారు. ఎల్‌సాల్వడార్‌ మధ్య అమెరికాలో ఒక దేశం. దీనికి సాన్‌సాల్వడార్‌ రాజధాని. ఇదే ఆ దేశంలోని అతి పెద్ద నగరం. అక్కడి ప్రస్తుత జనాభా 6.8 మిలియన్లు. ఇందులో ఎక్కువ శాతం మంది స్పానిష్‌ మాట్లాడుతారు. ప్రుడెన్సియా అయాల కేవలం మహిళా సాధికారతకోసం ఉద్యమించడమే కాదు, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా స్పందిస్తూ వచ్చారు. అమెరికా నియంతృత్వధోరణితో వారి దేశంమీద సైనికచర్య చేపట్టడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. అంతేకాదు, పరిపాలనలో పారదర్శకత ఉండాలనీ, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని, హక్కులు స్త్రీలతోపాటు పిల్లలకు కూడా ఉండాలని, సామాజిక కార్యకర్తగా ఆమె ఉద్యమాలు సాగించారు. ఫలితంగా అనేకసార్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గ్వాటమాల, ఎల్‌ సాల్వడార్‌లలో కొంతకాలం జైల్లో పెట్టారు. అందుకు ఆమె విచారించలేదు. పై వాటితోపాటు, పెళ్లికాని జంటలకు పుట్టిన పిల్లలకు కూడా హక్కులు వర్తింపచేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అక్రమసంబంధంతో పిల్లల్ని కన్నవారికి శిక్ష విధించవచ్చుగానీ, ఏమీ తెలియని పిల్లలు ఎందుకు బలికావాలి? అన్నది ఆమె వాదన. యువజంటలు పెళ్లయిన వారా? కాని వారా? వారి సంబంధం సక్రమమైందా కాదా? అని పసిబిడ్డలు చూసుకుని పుట్టరుకదా? పుట్టారంటే వారికి బాలల హక్కులు, ఆ తర్వాత మానవ హక్కులు వర్తించవలసిందేనన్నది ఆమె ఉద్దేశం. ప్రుడెన్సియా అయాల లింగ సమానత్వం ఎందుకు కావాలన్నారో దానికి తగిన వివరణ కూడా ఇచ్చారు. ‘‘స్త్రీపురుషుడు ఉంటేనే ఇల్లు. స్త్రీ పురుషుడు ఉంటేనే ఇంట్లో ఇంద్ర ధనుస్సులు. స్త్రీపురుషుడు ఉంటేనే సమాజం. స్త్రీపురుషుడు ఉంటేనే రాబోయే తరాలు స్త్రీపురుషుడు అంటేనే జీవన సౌంతర్యం! స్త్రీపురుషుడు ఉంటేనే అర్థం పరమార్థం. అందువల్ల దేశంలో పౌరసత్వం అనేది ఇద్దరికీ సమానమే. ఓటు హక్కుతోపాటు ఇతర హక్కులూ, బాధ్యతలు ఇద్దరికీ సమానమే. సమాజంలో సమ భాగస్వాములైన స్త్రీలను తక్కువగా చూడడం, సౌకర్యాలు కల్పించకపోవడం, విద్య నందించకపోవడం హేయమైన చర్య. సత్వరం దాన్ని సరిచేసుకోవాలి’’ అని ఆమె జీవితాంతం ఆవేదన చెందారు. ఆక్రోషించారు. చివరికి ఆమె మరణం తర్వాత చాలా కాలానికి ఆమె కృషి ఫలితంగానే మార్పులు జరుగుతూ వచ్చాయి. పురుష అహంకారాన్ని ధిక్కరిస్తూ హక్కులకోసం పోరాడుతున్న ప్రుడెన్సియా అయాలా గూర్చి ఆ దేశపు తత్వవేత్త, రచయిత, జర్నలిస్టు అయిన అల్బర్టో మాస్‌ ఫెర్రర్‌ఆ రోజుల్లో ఇలా రాశాడు. ‘‘ప్రుడెన్సియా అయాల పోరాటంలో న్యాయం ఉంది. ఆమె కేవలం స్త్రీ అయినందుకే ఆమెను రాజకీయాల్లోకి రాకూడదనడం, ఎన్నికల్లో నిలబడగూడదనడం అన్యాయం. స్త్రీలను చులకనగా చూడకూడదని ఆమె గొంతెత్తి ఆక్రోషించడంలో నిజాయితీ ఉంది. నిబద్దత ఉంది. విశ్వ జనీనమైన ఆమె వాదనను ఆలకించాల్సిందే. శ్రద్ధ వహించాల్సిందే. ఒక మహోన్నతమైన ఆశయం కోసం ఆమె సమిధ కావడానికి సిద్ధపడ్డారు. ఇక, ఈ దేశంలో లింగ అసమానత్వం ఇంకా ఎంతోకాలం నిలవదు’’ అని! హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీర వనితగా ప్రపంచ గుర్తించిన తర్వాత, ఆమె మరణానంతరం వారి దేశం ప్రుడెన్సియా అయాలకు దేశపు అత్యున్నత గౌరవం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జోస్‌ మాటియాస్‌ డెల్‌గాడో’ 2014లో ప్రకటించింది. ప్రుడెన్సియా అయాలకు సమకాలీనకాలంలో లేదా అంతకుముందు కాలంలో భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం! దానివల్ల ప్రపంచదేశాల కంటే ఈ దేశంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా బేరీజు వేసుకోవచ్చు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత, స్త్రీలకు ఓటు హక్కు ఉండాల్సిన అవసరాన్ని ‘ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’ (1917) నొక్కి చెప్పింది. ఈ సంస్థ ప్రకటించిన ‘స్త్రీ ధర్మ’ పత్రిక అందుకు తీవ్రంగా కృషి చేసింది. ఆ సంస్థ రూపొందించుఉన్న ధ్యేయాలు ఈ విధంగా ఉన్నాయి. 1.భారత మాతకు ప్రియమైన కూతుర్లందరూ వారివారి బాధ్యతల్ని తెలుసుకోవాలి. 2. తల్లులుగా, భార్యలుగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఒకవైపు భవిష్యత్‌ భారతాన్ని తీర్చిదిద్దుతూ, మరోవైపు కుటుంబ సభ్యులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3. పురుషులకు ఉన్నట్లుగానే స్త్రీలు కూడా ఓటుహక్కు సాధించుకోవాలి. మున్సిపల్‌, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌వంటి ఎన్నికల్లో పోటీ చేయగల హక్కును పొందాలి. 4.వివిధ మహిళా కమిటీలు ఏర్పడి, స్త్రీ జనాభ్యుదయానికి కావల్సిన వివిధ ప్రణాళికలు రూపొందించాలి. వాటికి కార్యరూపం ఇవ్వాలి. ముఖ్యంగా స్త్రీ విద్యకోసం ఎక్కువ శ్రమించాలి. ఈ ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ 1917లో మద్రాసు ఆడయార్‌లో ప్రారంభమైంది. మార్గరెట్‌ కజిన్స్‌, అనిబిసెంట్‌, జినా రాజదాస, దోరోతి వంటి వారు పూనుకుని సంస్థను పురోగమనదిశలో నడిపించారు. ఇక్కడ స్త్రీలకు విద్య నేర్పించి, వివేకవంతుల్ని చేసిన ఘనత సావిత్రిబాయి ఫూలే దే(18311897). ఆమె ఒక మరాఠి కవయిత్రి. మేధావి మాత్రమే కాదు. స్త్రీ జనోద్ధరణకు అలుపెరుగని పోరాటంచేసిన తొలి ఉపాధ్యాయురాలు. భర్త జ్యోతిబా ఫూలే(18271890)తోపాటు అంటరానితనాన్ని అంతమొందించిన ధీర వనిత! 1848లో ఆమె మహిళలకోసం తొలి పాఠశాలను ప్రారంభించారు. అందులో బ్రాహ్మణేతర జాతుల ఆడపిల్లలకు రాత్రింబవళ్లు చదువుచెప్పారు. 1873లో ఆమె ‘సత్యశోధక్‌ మండల్‌’ ప్రారంభించి తద్వారా ఒక మహోద్యమానికి రూపకల్పన చేశారు. దేశంలో నెలకొన్న సామాజిక పరిస్థితుల ప్రకారం ఓటుహక్కును, విద్యాలయాల్లో చదువుకునే అర్హతను స్త్రీకి ఊహించలేమని ఆనాటి మేధావులు కొందరు ఆవేదన వెలిబుచ్చారు. అయితే 19వ శతాబ్దిలో రామ్‌మెహన్‌రాయ్‌ లాంటి సంఘ సంస్కర్తలు స్త్రీ జనోద్ధరణకు పూనుకున్నారు. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. 20వ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితులు చాలా మారాయి. స్త్రీకి పురుషుడితో సమానమైన ప్రతిపత్తి లభించాలని స్రీలే సంఘర్షణ ప్రారంభించారు. ప్రుడెన్సియా అయాల వంటివారి జీవితాలు మనకు తెలిశాయి గనక, ప్రపంచ దేశాలన్నిటిలో స్త్రీల పరిస్థితి ఒకే విధంగా ఉందని తెలుస్తోంది. ప్రపంచపుపనిలో మూడిరట రెండువంతులు పనిచేసి, పదింట ఒకవంతు మాత్రమే సంపాదించుకుని నూటికి ఒకవంతు ఆస్తికూడా సమకూర్చుకోలేని అభాగ్యులమీద, అర్ధ జనాభా అయిన స్త్రీల మీద చరిత్రలో మొట్ట మొదటిసారి ప్రపంచపు దృష్టిపడిరది. ఇప్పటినుంచే చరిత్ర తప్పిదాన్ని సరిచేయడానికి తగిన కృషి ప్రారంభమైంది.తల్లిగా, భార్యగా స్త్రీ నిర్వహించే పాత్ర అద్వితీయమైంది. ఆమె కాలాన్ని, శక్తిని, ఆలోచనల్ని అన్నింటినీ ఇంటి పని మింగేస్తుంది. ఆ పని ఎంతవిలువైందో, అంత ‘విలువ’ లేనిది! అంటే ఎంత పనిచేసినా ఆమెకు ఒక రూపాయి ఆదాయంగానీ, కనీసంగుర్తింపుగానీ దొరకవు. ప్రపంచ దేశాలన్నింటా పరిస్థితి ఇదే. ఇంటిపని పోను, బైటపని అదనం! అంటే ఒక రోజులో స్త్రీలు రెండురోజుల పని చేస్తున్నారన్నమాట. ప్రపంచంలో గల ఆహారంలో సగానికిపైగా పండిరచేది స్త్రీలే. కానీ, వారికంటూ భూమి ఉండదు. ప్రభుత్వ సహాయంగానీ, బ్యాంకు రుణాలుగానీ ఉండవు. ప్రపంచ కూలీలలో మూడువంతులు స్త్రీలే. చేసే పని ఒకటే అయినా, పురుషుడి కంటే స్త్రీకి తక్కువ కూలీ చెల్లిస్తారు. ఇంటి పనుల్లాగానే, వారుచేసే వ్యవసాయ పనులకు, నిర్మాణ రంగ పనులకు కూడా సరైన విలువ లేదు. నిన్న మొన్నటిదాకా ఉద్యోగాల్లో కూడా ఈ తేడా ఉండేది. చేస్తున్నఉద్యోగం ఒకటేఅయినా, స్రీల వేతనం పురుషుల వేతనం కంటే తక్కువగా ఉండేది. 1975 80 ప్రాంతాల్లో ఈ తేడా సవరించారు. తెలివైన, చురుకైనస్త్రీలు సెక్రటరీలుగా, క్లర్కులుగా, పీఏలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు పురుషులు కూడా చేస్తున్నారు. అయితే,వారి సంఖ్య తక్కువ. పురుషులు మేనేజర్లుగా, నిర్వహణాధికారులుగా, యజమానులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, అభివృద్ధిచెందిన ప్రపంచ దేశాలలో కూడా ఇలాగే ఉంది. ఈ 21శతాబ్దంలో పరిస్థితులు మరింతగా మెరుగయ్యాయి. పురుషులతోపాటు స్త్రీలకు కూడా అన్ని హక్కులూ లభించాయి. విద్యావంతుల సమూహాల్లో అనగాహన పెరిగిన కుటుంబాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. పురుషులు ఇంటిపనిలో పిల్లల సంరక్షణలో భాగ స్వాములవుతున్నారు. స్త్రీలు కూడా సంపాదనకోసం పరుగులు తీస్తున్నారు. అయితే, స్త్రీ, పురుష స్వేచ్ఛ కట్టలు తెంచుకోకుండా జాగ్రత్తపడాల్సి వస్తోంది.
`కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img