హరిహర స్వరూప్
భారత స్త్రీవాద ఉద్యమ ఆద్యుల్లో ఒకరైన కమలా భాసిన్ 70వ దశకం నుంచి పోరుబాటలో ఉన్నారు. మథుర అత్యాచార కేసు, షా బానో కేసుల్లో న్యాయం కోసం, వరకట్న వ్యతిరేక, అత్యాచార వ్యతిరేక ఉద్యమాల్లో ఆమె క్రియాశీలంగా పాల్గొన్నారు. కమలా భాసిన్ భారత్లో మాత్రమే కాదు దక్షిణాసియాలో గొప్ప స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. దక్షిణాసియాలో స్త్రీవాద సంస్థ సంగత్ను స్థాపించారు. మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందించే కేంద్రం జాగోరికి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. దీని నిర్వాహకుల్లో భాసిన్ ఒకరు. వంద కోట్ల మందిని చైతన్యపర్చడమే లక్ష్యంగా ఇతరత్రా అనేక సంస్థలతో కలిసి పనిచేసారు. ‘‘ఆజాదీ’’ నినాదానికి భారత్లో ప్రాచుర్యం, ప్రజాదరణ కల్పించిన వ్యక్తి కమలా భాసిన్. పాకిస్తాన్ ఫెమినిస్ట్ల నుంచి ఆమె ఈ నినాదాన్ని అందుకున్నారు.
కమలా భాసిన్… కవయిత్రి, రచయిత్రి, దక్షిణాసియాలో మహిళా హక్కుల ఉద్యమానికి మార్గదర్శి. ఆఖరి గడియల్లోనూ ఆమె పోరాట పటిమ ఇసుమంతైనా సడలలేదు. మరికొద్ది గంటల్లో తుది శ్వాస విడుస్తారనగా కూడా ఆమె ఐసియూలో నుంచే ఆన్లైన్ సమావేశంలోనూ పాల్గొనడం భాసిన్ నిబద్ధతకు నిలువుటద్దం. 75 ఏళ్ళ వయస్సులో కాలేయ కేన్సర్తో పోరాడడంలోనూ ఆమె గొప్ప స్ఫూర్తిని చాటారు.
భారత స్త్రీవాద ఉద్యమ ఆద్యుల్లో ఒకరైన కమలా భాసిన్ 70వ దశకం నుంచి పోరుబాటలో ఉన్నారు. మథుర అత్యాచార కేసు, షా బానో కేసుల్లో న్యాయం కోసం, వరకట్న వ్యతిరేక, అత్యాచార వ్యతిరేక ఉద్యమాల్లో ఆమె క్రియాశీలంగా పాల్గొన్నారు. కమలా భాసిన్ భారత్లో మాత్రమే కాదు దక్షిణాసియాలో గొప్ప స్త్రీవాదిగా గుర్తింపు పొందారు.
దక్షిణాసియాలో స్త్రీవాద సంస్థ సంగత్ను స్థాపించారు. మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందించే కేంద్రం జాగోరికి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. దీని నిర్వాహకుల్లో భాసిన్ ఒకరు. వంద కోట్ల మందిని చైతన్యపర్చడమే లక్ష్యంగా ఇతరత్రా అనేక సంస్థలతో కలిసి పనిచేసారు. ‘‘ఆజాదీ’’ నినాదానికి భారత్లో ప్రాచుర్యం, ప్రజాదరణ కల్పించిన వ్యక్తి కమలా భాసిన్. పాకిస్తాన్ ఫెమినిస్ట్ల నుంచి ఆమె ఈ నినాదాన్ని అందుకున్నారు.
మహిళల హక్కులపై 30కి పైగా పుస్తకాలు రాసిన కమలా భాసిన్ పిల్లల కోసం 8 రచనలు చేశారు. చిన్నారుల కోసం ఆమె రాసిన కవితల్లో ‘‘నేను ఆడపిల్లను కనక, నేను తప్పనిసరిగా చదువుకోవాలి’’ అనే కవిత బహు గుర్తింపు పొందింది. వీటితోపాటు ఆమె ఎన్నో పాటలు, కవితలు కూడా రాసారు.
తన పాటలు, పోస్టర్లు ద్వారా లక్షలాదిమంది కార్యకర్తలకు భాసిన్ సన్నిహితమయ్యారు, నిరసనోద్యమాలకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చారు. సంక్లిష్టమైన అంశాలను సరళంగా చెప్పడం ద్వారా స్త్రీవాద భావనలను సామాన్యుల్లోకీ తీసుకెళ్ళగలిగారు. పితృస్వామ్య భావజాలం లోగుట్టును వివరించారు. ఇందుకోసం ఆమె ప్రసంగాల్లో పడికట్టు పదాల పరిధిని దాటి సామాన్యుల వాడుక భాషను ఉపయోగించారు.
వ్యక్తిగతంగానూ కమలా భాసిన్లో ఒక ప్రత్యేకమైన గొప్ప లక్షణం ప్రస్ఫు టంగా కనిపించేది. తనదైన ప్రేమాభిమానాలతో ఆమెలో ఏదో విశిష్టత ఉందనిపించుకునేవారు. ఆ ఆప్యాయతతోనే తనకు దగ్గరయ్యేవారి హృదయాలను, బుద్ధిని వికసింపచేసేవారు. తన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రభావితం చేసేవారు. ఆమె రాసిన పాటలు, లేవనెత్తిన నినాదాలు, స్పర్శించిన హృదయాలు, గుదిగుచ్చిన సంబంధాలు, పోరాడిన సమస్యలు, ఉద్యమాలు ఇవే ఆమె ఆస్తి. ఔదార్యత, ఆప్యాయత, సహజత్వం, మేథస్సు ఇవన్నీ ఆమె పోరాటాల్లోనూ కనిపిస్తాయి. ఈ ఉపఖండానికి ఆమె వదిలివెళ్ళిన వారసత్వం ఇదే.
పాకిస్తాన్లోని షాహిదాన్వలి గ్రామంలో 1946లో జన్మించిన భాసిన్ గ్రాడ్యుయేషన్ జైపూర్లో పూర్తి చేసారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం సోషియాలజీ చదివేందుకు జర్మనీ వెళ్ళారు. అక్కడ నుంచి భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థలో 25 ఏళ్ళు పనిచేసారు. ఈ కాలంలో ఆమె భారతదేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలను కలుసుకున్నారు. దక్షిణాసియాలోని అనేక దేశాలకూ వెళ్లారు.
కమలా భాసిన్ గొప్ప ధైర్యవంతురాలు, ఆశావాది, ఆప్యాయతాను రాగాలు కురిపించే మంచి మనిషి. ఈ లక్షణాలతోనే ఆమె జీవితాన్ని గొప్పగా ఆస్వాదించారు అని చెబుతారు ఆమె స్నేహితులు, సన్నిహితులు, ఆమెనెరిగిన కామ్రేడ్లు. భాసిన్ వారసత్వం అపారం, అపూర్వం అంటారు…భాసిన్తో కలిసి ‘‘హద్దు`సరిహద్దులు : భారత్ విభజనలో మహిళలు’’ అనే పుస్తకాన్ని రచించిన రితూ మేనన్.
భాసిన్కు ఇద్దరు పిల్లలు. భర్త, కుమార్తె గతించారు. కుమారుడు జీత్ (42) సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నారు. అతను ఏ పనికైనా మరొకరిపై ఆధారపడాల్సిందే. భాసిన్ తన చివరి రోజుల్లో తన కుమారుడి జీవితం, భవిష్యత్తు గురించే సన్నిహితుల దగ్గర ఆవేదన చెందారు. ఈ ఒక్క విషయాన్ని మినహాయిస్తే భాసిన్ తన ప్రాణాల గురించి ఏ మాత్రం చింతించలేదు. పైగా ప్రతి క్షణాన్ని ఆమె ఆస్వాదించారు. ఆమె మంచంపై ఉండి కూడా పాటలు పాడేవారు. ఎన్నో విషయాలు చెప్పేవారు.
మృత్యువు సమీపిస్తున్న సందర్భంలోనూ ఆమె ఇతరుల గురించి ఆలోచించేవారు. జైలులో ఉన్న వారి గురించి ఆందోళన చెందేవారు. భాసిన్కు కేన్సర్ చికిత్స ప్రారంభమైన తర్వాత ఆమె ఉంటున్న ఆనంద్లోక్ నివాసానికి పలుమార్లు వెళ్ళిన కార్యకర్త కవితా శ్రీవాస్తవ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, మహిళల సమస్యలపై పోరాడిన ధీర, నికార్సైన స్త్రీవాదిగా జనం గుండెల్లో ముద్ర వేసుకున్న కమలా భాసిన్ ఐదు రోజుల క్రితం (ఈ నెల 25న) కన్నుమూయడం భారత్లో, దక్షిణాసియాలో మహిళల ఉద్యమాలకు తీరని లోటే.