Friday, April 19, 2024
Friday, April 19, 2024

కర్నాటకలో బీజేపీ ఓటమికి రైతుల ప్రతిన

అరుణ్‌ శ్రీవాస్తవ

కర్నాటకలో బీజేపీని మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. సంయుక్త కిసాన్‌ పంచాయత్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో రైతులు సమావేశమై శపథం చేశారు. రాష్ట్ర జనాభాలో 65శాతం మంది రైతులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలను మోసగించేందుకు గతంలో అనేకసార్లు ఆడిన ‘నాటకాలను’ మళ్లీ ఆడుతున్నారని రైతులు అభిప్రాయపడుతున్నారు. జనాన్ని సమస్యల నుంచి పక్కదారి పట్టించేం దుకుగాను తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నాటినుంచి కాంగ్రెస్‌ తనను 91సార్లు తిట్టిందని ప్రచారం చేస్తున్నారు. అయితే మోదీ ఆడుతున్న కపట నాటకాన్ని రైతులు నమ్మడంలేదు. రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక, మతవాద బీజేపీ అనుకూల చర్యలను నిరసిస్తూ బీజేపీని ఓడిరచాలని నిర్ణయించారు. ఇంటింటికీ తిరిగి బీజేపీకి ఓటు వేయవద్దని ప్రచారం చేయడానికి రైతులు పూనుకున్నారు. ఈ సమావేశంలో 20 రైతు సంఘాల నుంచి 250 మంది రైతు నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తక్షణం నెరవేర్చవలసిన ఒక డిమాండ్‌ గాకుండా మరో 15 డిమాండ్లను ప్రకటించింది. 20192020లో చేసిన మూడుసాగు చట్టాలను, భూ సంస్కరణల(సవరణ) చట్టాన్ని ఏపిఎంసి సవరణ చట్టాన్ని, పశువధ నిరోధ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని సమావేశం కీలకమైన డిమాండ్‌ చేసింది. విద్యుత్‌ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయం చేసినప్పటికీ రైతులకు సబ్సిడీపైన విద్యుత్‌ సరఫరా చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కనీస మద్దతు ధరకోసం చట్టంచేసి హామీ ఇవ్వాలి. అనేక విపత్తులను ఎదుర్కొంటూ నష్టపోతున్న రైతులకు తగినంత నష్టపరిహారం చెల్లించాలి. రైతుల రుణాలను రద్దు చేయాలి. రైతులకు ఆమోదం లేకుండా రాష్ట్రంలో ఎక్కడా భూమిని ప్రభుత్వం తీసుకోరాదన్న దానితో పాటు అనేక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కర్నాటక రాష్ట్రాన్ని తమ వలసప్రాంతంగా చూస్తున్నదని సమావేశం విమర్శించింది. అమూల్‌ను అనుమతించడం వాణిజ్య ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. కన్నడ రైతులకు ప్రత్యేక గుర్తింపులేకుండా చేయాలని చూస్తున్నారు. మోదీఅమిత్‌షా ద్వయం అమూల్‌ను నందిని సంస్థలో విలీనం చేయాలని పన్నాగం పన్నారని, ఇది రైతు వ్యతిరేకమైన నిర్ణయమని రైతు నాయకులు విమర్శించారు. రైతులు గుర్తింపు, ఆత్మగౌరవంపె ౖదాడి జరిగితే సహించబోం అని హెచ్చరించారు. నందినిలో 15 వేలకుపైగా పాల ఉత్పత్తి సహకార సంఘాలున్నాయి. 60లక్షల రైతు కుటుంబాలు ఈ సంస్థ పరిధిలో ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, జెడి(ఎస్‌) పార్టీల నాయకులను కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించగా బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు హన్నన్‌ మొల్లా, యోగేంద్ర యాదవ్‌, శ్రీమతి కవిత కూరగంటి, అవిక్‌షాలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రముఖ రైతు నాయకులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టరు ప్రకాశ్‌ కమ్మరాడి పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత దిల్లీలో సంయుక్త మోర్చా నాయకులు సమావేశమై రెండో దశ రైతు పోరాటం నిర్వహించాలని యోచించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను కలుసుకొని మెమొరాండం అందచేశారు. రైతుల డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం 15నెలల క్రితం రాత పూర్వక హామీ ఇచ్చింది. రైతుల ఓర్పునకు పరీక్ష పెడుతున్నారు. ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే రైతులు మళ్లీ ఆందోళన బాటపడతారని మంత్రిని హెచ్చరించారు. స్వామి నాథన్‌ కమిషన్‌ కూడా అన్ని పంటలకు కనీసమద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని సిఫారసు చేసింది. ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించాలని, ప్రభుత్వం మద్దతుధర కోసం నియమించిన అన్ని కమిటీలను రద్దుచేయాలని కూడా రైతు నాయకులు మంత్రిని కోరారు. విద్యుత్‌ చట్టసవరణ బిల్లు ఉపసంహరణ, లఖింపురి ఖేరీలో రైతులను హతమార్చిన ఘటనపై హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను అరెస్టు చేయాలని తదితర డిమాండ్లను విజ్ఞాపన పత్రంలో పొందుపరచారు. కర్నాటక రైతుల నిర్ణయం బీజేపీకి శరాఘాతం అవుతుంది.
మే, జూన్‌, జులై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిల్లో రైతు సదస్సులు ఏర్పాటు చేస్తామని కిసాన్‌మోర్చా తెలిపింది. ఆగస్టు 1న, 15తేదీలలో కార్మిక యూనియన్‌లు కలుపుకుని పెద్దప్రదర్శనలు నిర్వహిస్తామని రైతులు, కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే విధానానికి అంతం పలకాలని మోర్చా డిమాండ్‌ చేసింది. సెప్టెంబరులో లేదా నవంబరు మధ్యలో జాతీయస్థాయి రైతు యాత్రలు దేశమంతటా నిర్వహిస్తామని జాతీయస్థాయి కిసాన్‌మోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో అసెంబ్లీఎన్నికలు జరుగు తాయని అక్కడ కేంద్రీకరించి పనిచేయాలని నిర్ణయించారు. కర్నాటక ప్రభుత్వం రైతులపట్ల అనుసరించిన వైఖరి ఆందోళనకరంగా ఉంది. పాలకపార్టీ నాయకుల తీరు మరింత ప్రమాదకరమైంది. కులం,మతం ఆధారంగా రైతులనుచీల్చేందుకు పూనుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పనిచేస్తున్నారు. ఒక గ్రూపు రైతులను మరో గ్రూపుపైకి పాలకపార్టీ నాయకులు ఉసిగొల్పుతున్నారు. కులం,మతాలను ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే రైతుల కష్టాలను గురించి పాలకులు పట్టించుకోవడంలేదు. 2021లో దేశవ్యాప్తంగా 10,881మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలో జరిగాయి. రెండోస్థానంలో కర్నాటక నిలిచింది. ఆహ్వానించదగిన పరిణామం ఏమంటే పశ్చిమబెంగాల్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఒడిశాలలో ఒక్కరైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు. 2021లో కర్నాటకలో 2082 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో అత్యధికంగా బెలగావి ప్రాంతంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకోగా, మైసూరు జిల్లాలో 191 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఈ నేపధ్యంలో ఈసారి బీజేపీని ఓడిరచాలని కిసాన్‌మోర్చా సమావేశం ప్రతినబూనింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img