Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కాంగ్రెస్‌కు సర్దుబాటు ఉండాలి

రాహుల్‌ గాంధీ ఇక జోడీ యాత్ర చేయాల్సివుంది అని నేనంటే అపార్ధం చేసుకోవద్దు. అందునా ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూ ఇస్తూ ‘పెళ్లికూతురుని వెదకాల్సి ఉందని’ అన్నాడాయే. ఆ ఉద్దేశ్యంతో జోడీ యాత్ర చెయ్యమనడం లేదు. చెప్తున్నదల్లా రాజకీయ కోణంలో. రాజకీయంగా తమ పార్టీ ఎంత బలపడినా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేదు సరికదా ఆ దగ్గరకు కూడా రాలేదన్నది కఠిన వాస్తవం. ఇప్పుడు చూడాల్సింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తన బలం పెంచుకోవడంతో బాటు, కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను వెదుక్కోవడం. అవసరమైతే కొంచెం తగ్గి, ప్రత్యామ్నాయం బలంగా తయారయ్యేలా సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్లడం.నాయకత్వం తనకే కావాలన్న ధోరణి కాకుండా మంచి టీం ప్లేయర్‌గా వ్యవహరించగలిగేలా తమను తాము మలచుకోవడం. ఇది ఆ పార్టీకే కాకుండా, రాజకీయ రంగానికే మంచి చెయ్యగల అత్యవసర కార్యక్రమం.
కన్యాకుమారి నుండి కశ్మీర్‌ వరకూ 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఐదు నెలల పాటు రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఒక మంచి కార్యక్రమం. విజయవంతంగా, నిరాటంకంగా దాన్ని పూర్తి చేసిన ఆయన అభినందనీయులు. ఈ యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా ఉపయోగం ఎంతన్నది పక్కన పెడితే రాహుల్‌ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ట ఎంతోకొంత పెంచిందన్నది వాస్తవం. జనాల్లో ఆయన ఏమాత్రం సీరియస్‌నెస్‌, నిలకడలేని నేత అన్న నెగెటివ్‌ పర్సెప్షన్‌ని కొంత వదిలించుకున్నారు. గ్రామీణ భారతం, ప్రస్తుత సమస్యల పట్ల కొంత అవగాహన పెరిగే ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత కనబడుతోంది. సర్జికల్‌ స్ట్రైక్‌ పై తన పార్టీలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ చేసిన అనవసరపు వాచాలతని వెనకేసుకు రాకుండా హుందాగా స్పందించడమే అందుకు ఉదాహరణ. అయితే ఈ యాత్ర ఆయనకు మొదటి అడుగు. అంతే. తన పార్టీని చక్కదిద్దడానికి, జాతీయ స్థాయిలో గుర్తింపదగ్గ ఫోర్స్‌గా తయారుచెయ్యడానికి ఇంకా మరిన్ని అడుగులు పడాలి. అది కష్టమైన మార్గం కూడా. ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌.

  • డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img