Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కారాగారాలు… సమస్యల నిలయాలు!

ఐ.ప్రసాదరావు
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా తప్పుచేసిన వారిని, నేరం రుజువైన వారిని, ఇంకా విచారణ కొనసాగుతున్న వారిని ఉంచే స్థలం జైలు. వీరికి రక్షణ, ఆరోగ్య భద్రత సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. శిక్ష పూర్తయి, బయటకు వచ్చే నాటికి శారీరక మానసిక ఆరోగ్యంతో వచ్చే విధంగా చూడ వలసిన బాధ్యత కూడా ఆ సిబ్బందిదే అనగా ప్రభుత్వానిదే. మనదేశంలో జైలు సిబ్బంది, జైలులో పనిచేసే ఆరోగ్య సిబ్బంది, మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ల కొరత గత కొన్నేళ్లుగా పట్టిపీడిస్తోంది. బడ్జెట్‌లో కేటాయించే నిధులు కూడా అవసరం మేరకు ఉండడం లేదు. దీనితో తప్పు చేసిన వ్యక్తిని సరిదిద్ది ప్రయోజకుడుగా బయటకు పంపించడం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ కరోనా కాలంలో గుమిగూడిన ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, కొవిడ్‌ మహమ్మారి అందరికీ సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో భారత సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారి శిక్ష ఆధారంగా కొంతమంది నేరస్తులను, విచారణలో ఉన్న వారిని ‘‘పే రోల్‌/తాత్కాలిక బెయిల్‌’’ మంజూరు చేసి విడుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఖైదీలను విచారణ చేయడానికి సన్నాహాలు చేయమని కూడా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలు ఈ ఆదేశాలు పాటించాయి. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జైలు, జైలు సిబ్బంది పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని ‘‘భారత జైళ్ళ గణాంకాలు – 2020’’ నివేదిక చెబుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం వల్ల 2019 డిసెంబర్‌ నుంచి 2020 డిసెంబర్‌ నాటికి 120 శాతంగా ఉన్న ఖైదీల రద్దీ 118 శాతానికి అనగా 2 శాతం తగ్గింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా అరెస్టు అయిన వారు సుమారు తొమ్మిది లక్షల మంది. కోవిడ్‌ కాలంలో నేరస్తులు, నేరాలు పెరిగాయి. 17 రాష్ట్రాల్లో 2019-2021 కాలంలో అంతకు ముందు నాలుగు సంవత్సరాల కాలంతో పోలిస్తే 23 శాతం ఖైదీలు పెరిగినట్లు ఈ నివేదిక చెబుతోంది. భయానకమైన విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లో 177 శాతం, సిక్కింలో 174 శాతం, ఉత్తరాఖండ్‌లో 169 శాతం ఖైదీలు పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఎందుకు నేరాలు, నేరస్తుల సంఖ్య పెరుగుతోంది విశ్లేషణ చేయాలి. వీటికి అడ్డుకట్ట వేయాలి. విద్య, ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి. మద్యం, మత్తులకు బానిసలు కాకుండా చూడాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభు త్వాలు, మీడియా బాధ్యత స్వీకరించాలి. అప్పుడు మాత్రమే నేరస్తుల సంఖ్య తగ్గుతుంది.
నేరం రుజువు అయిన ఖైదీలు కంటే విచారణ ఖైదీలు ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా జైళ్ళన్నీ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. న్యాయ స్థానాలలో న్యాయ మూర్తులు తక్కువగా ఉన్నారు. కొన్ని లక్షల కేసులు దేశ వ్యాప్తంగా అనేక కోర్టుల్లో పెండిరగ్‌లో ఉన్నాయి. ఇటీవల వేగవంతంగా జడ్జీలను నియమిస్తున్నారు. మంచి పరిణామం. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ చేసిన సూచన దిశగా ప్రయత్నాలు జరగాలి. సమస్యలు/తగాదాలు సామరస్యంగా పరిష్కారం చేసుకోవడమే మంచిది. సత్వర న్యాయంతో కోర్టు లపై ఒత్తిడి తగ్గుతుంది. భారత జైళ్ళ గణాంకాల నివేదిక ప్రకారం విచా రణలో ఉన్న ఖైదీలు 2019లో 69 శాతం ఉండగా, 2020లో 76 శాతానికి పెరిగారు. కేరళలో 110% నుంచి 83 శాతానికి, పంజాబ్‌లో 103% నుంచి 78 శాతానికి, హర్యానాలో 106% నుంచి 65 శాతానికి తగ్గుట ఆనందకర మైన పరిణామం.
ప్రస్తుతం కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్స్‌ (వి.సి) ద్వారా విచారణ చాలా తోడ్పడుతుందని నివేదిక చెబుతోంది. దేశ వ్యాప్తంగా 69% వి.సి. సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 2019లో 60 శాతంగా ఉన్న వి.సి ద్వారా విచారణ, ఇప్పుడు 69 శాతానికి పెరిగింది. అయితే తమిళనాడు, మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌, నాగాలాండ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, రాజస్థాన్‌, లక్షద్వీప్‌ వంటి రాష్ట్రాల్లో నేటికీ వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాలు 50 శాతం లోపు ఉండుట గమనార్హం. తమిళనాడులో 142 జైళ్ళు ఉండగా వాటిలో 14 జైళ్ళకు మాత్రమే 14000 మంది ఖైదీలను/విచారణలో ఉన్న వారిని విచారణ చేయడానికి అవకాశం ఉంది. 169% వీడియో కాన్ఫరెన్స్‌ చేయగలిగిన సౌకర్యాలతో ఉత్తరాఖండ్‌ ప్రథమ స్థానంలో ఉంది. జైలు నిబంధనల ప్రకారం ప్రతీ ఖైదీని ప్రతీ రెండు వారాలకు ఒకసారి విచారణ/ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి. ఇందుకు ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ విధానం బాగా దోహదపడుతుంది.
ఆరోగ్యం విషయానికొస్తే జైళ్ళల్లో ఆరోగ్య సంబంధిత వసతులు, సౌక ర్యాలు, సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక జైళ్ళలో బహు తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. ఈ విషయంలో గోవా పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ రాష్ట్రంలో 84.6% సిబ్బంది కొరత ఉంది. తమిళనాడు, కర్ణాటక 67.1%, లదఖ్‌ 66.7%, జార్ఖండ్‌ 59.2%, ఉత్తరాఖండ్‌ 57.6%, హర్యానా 50.5% శాతం ఆరోగ్య నిపుణులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషి యన్ల కొరత ఉంది. దీంతో ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరిత గతిన ఈ పరిస్థితిని మార్చాలి. గోవాలో కేవలం ఇద్దరు అంటే ఇద్దరు మాత్రమే వైద్యులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 14,308 మంది ఖైదీలకు కేవలం 26 మంది మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నారు. దాదాపు 15 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇదే సమయంలో అదనంగా పదివేల మంది ఖైదీలు చేరారు. వైద్య సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇతర సిబ్బంది ఖాళీలు భర్తీ చేయాలి. ‘‘మోడల్‌ ప్రిజన్‌ రూల్స్‌’’ ప్రకారం ప్రతీ 300 మంది ఖైదీలకు ఒక మెడికల్‌ ఆఫీసర్‌ ఉండాలి. దేశవ్యాప్తంగా 34% మెడికల్‌ ఆఫీసర్లు కొరత ఉందని నివేదిక స్పష్టం చేసింది. మిజోరంలో ఒక్క మెడికల్‌ ఆఫీసర్‌ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇక్కడ దాదాపుగా 90% కొరత ఉంది. ఉత్తరాఖండ్‌లో 5969 మంది ఖైదీలకు 12 మంది మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో 77.1% ఆరోగ్య సిబ్బంది కొరత. ఇదీ ప్రస్తుతం మన భారతదేశంలో జైళ్ళ పరిస్థితి. కేవలం అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ రెండు రాష్ట్రాల్లో మాత్రమే మోడల్‌ ప్రిజన్‌ రూల్స్‌ ప్రకారం 300 మందికి ఒక మెడికల్‌ ఆఫీసర్‌ ఉన్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాల జైళ్లలో ఈ రకమైన సౌకర్యాలు కల్పించాలి. శిక్ష పడినవారి కంటే విచారణ ఖైదీలు ఎక్కువగా ఉండడం వల్ల నిధులు ఎక్కువగా ఖర్చు అవు తున్నాయి. ఏదేమైనా ఖైదీలను పరిపూర్ణంగా మార్చి, మంచి పరివర్తన గల పౌరులుగా బయటకు పంపించాలి. ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు చేప ట్టాలి. ఖైదీలను శారీరక మానసిక ఆరోగ్యంతో, సమాజానికి కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తులుగా చేయడంలో జైళ్ళు, జైలు సిబ్బందిదే కీలక పాత్ర అని మరువరాదు. వీరి జీవితాలు మరెందరో జైళ్ళు పాలవకుండా ఉండ టానికి మార్గదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించాలి. జైళ్ళ పునరుద్ధరణకు కంకణబద్దులు అవ్వాలి. నిధులు మంజూరు చేయాలి. అవసరతలు తీర్చాలి.
వ్యాస రచయిత సెల్‌ 9948272919

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img