Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికవర్గంపై దాడికి ప్రతిఘటన

వెలుగూరి రాధాకృష్ణమూర్తి

చికాగో నగరంలో 8గంటల పనిదినం కోసం కార్మికులు 1866 మే 4న సమావేశం కాగా పోలీసుల జోక్యంతో అక్కడ పరిస్థితి రక్తసిక్తమైంది. హటాత్తుగా బాంబుపేలి ఓ పోలీసు మరణించగా పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ జరిగిన పోరాటం ప్రపంచమంతా విస్తరించింది.
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన కార్మిక దినోత్సవం పాటించాలని, 1889లో 2 వ అంతర్జాతీయ కార్మిక సంస్థ యావత్‌ ప్రపంచ కార్మికవర్గానికి పిలుపునిచ్చింది. నాటి నుండి ప్రపంచంలోని అన్ని దేశాలలోని కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు మే డే జరుపుకుంటున్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే కమ్యూనిస్టు ప్రణాళిక ఇచ్చిన నినాదం భూగోళంపై మార్మోగింది. భారతదేశంలో మే డే మొదటిసారి 1923లో సింగారవేలు చెట్టియార్‌ నాయకత్వంలో మద్రాసులో కార్మికులు మే డే నిర్వహించారు. ఆతర్వాత, దేశమంతటా మే డే నిర్వహించాలని 1927లో ఎఐటియుసి పిలుపుఇచ్చింది. అప్పటి నుండి కార్మిక, ఉద్యోగ వర్గాలు దేశం నలుమూలలా మే డే ను పాటిస్తున్నారు. చికాగో కార్మికుల త్యాగాల స్పూర్తితో కార్మికవర్గ పోరాటాలు అనేక దేశాలలో ప్రజ్వరిల్లాయి. 8గంటల పనిదినం సహా పనిభద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మెహక్కు, కనీస వేతనాలు, బోనస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ, ఇ.యస్‌.ఐ., సెలవులు, మెటర్నిటీ బెనిఫిట్‌ లాంటి సౌకర్యాలు, పనిప్రదేశంలో భద్రత, వర్కర్స్‌ కాంపెన్సేషన్‌ యాక్ట్‌, తదితర రాయితీలెన్నిటినో కార్మికవర్గం పోరాటాలుచేసి సాధించు కుంది. సోవియట్‌, చైనా, క్యూబా, వియత్నాం సహా మరికొన్ని దేశాలలో కార్మిక, కర్షక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే, 1991లో సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలాక పరిస్థితిలో తీవ్రమార్పు వచ్చింది. సామ్రాజ్యవాద అమెరికా నాయకత్వంలో ద్రవ్య పెట్టుబడి, విదేశీ కార్పొరేట్‌ పెత్తనం చెలాయింపు తీవ్రస్థాయికి చేరుకుంది. పెట్టుబడికి శ్రమను కట్టుబానిసగా మార్చే విధానాలు వెల్లువెత్తాయి. కార్మికవర్గ ప్రతిఘటన పెరిగింది. ఉత్పత్తిశక్తుల, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యం తీవ్రతరమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోతోంది. అనేక దేశాల్లో ఫాసిస్ట్‌ శక్తులు అధికారంలోకివచ్చి కార్మిక వర్గ హక్కులపై తీవ్రదాడికి పాల్పడుతున్నాయి. అనేక త్యాగాలు, బలిదానాలతో కార్మికవర్గం సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను, కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారు. శ్రమ అమానుష దోపిడీకి గురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా శ్రమకు, పెట్టుబడికి మధ్య భీకర పోరాటమే జరుగుతోంది.
భారతదేశంలో కార్మికవర్గ పరిస్థితి మరింత అమానవీయంగా ఉంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక, గత 100 సంవత్సరాలుగా అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్డుచేసి 4కార్మిక కోడ్స్‌ను అమల్లోకి తెస్తున్నారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కులపై దాడి చేస్తున్నారు. 12 గంటల పనిదినం అమలుకు పూనుకుంటున్నారు. కనీసవేతనాల ఊసేలేకుండా చేస్తున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, అప్రెంటిస్‌, ఫిక్సడ్‌టరం ఎంప్లాయిమెంట్‌, దినసరి కూలీ పద్ధతులు అన్ని రంగాల్లో అమలు జరుపుతున్నారు.
ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ మాటేలేదు. పనిప్రదేశాల్లో భద్రత, కార్మికసంక్షేమం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానం అమల్లోకి వచ్చింది. చట్టాలన్నింటినీ కార్పొరేట్లకు చుట్టాలుగా మార్చేశారు. కార్మికశాఖను నామమాత్రం చేశారు. 25 కోట్లమంది కార్మికులు దేశవ్యాప్తంగా అనేకసార్లు సమ్మెలుచేసి మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సమరభేరి మ్రోగించారు. ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోవిడ్‌ కాలంలో దేశమంతా ప్రజలు తీవ్రకష్టాల్లో ఉండగా, బి.జె.పి. పాలిత రాష్ట్రాల్లో 3 సంవత్సరాలపాటు కార్మికచట్టాల అమలును నిలిపివేస్తూ ఆర్డినెన్స్‌లు తెచ్చారు. 12 గంటల పనిఅమలు, సమ్మెల నిషేధం అమలుకు ప్రయత్నించారు. సమైక్య కార్మికోద్యమం ఈ విధానాలను ప్రతిఘటించింది. ప్రభుత్వం జారీచేసిన ఈ ఆర్డినెన్సులు అవాంఛనీయమనీ, తక్షణమే ఉపసంహరించాలని ఐ.యల్‌.ఓ. సైతం భారతదేశాన్ని కోరింది. చివరకు, న్యాయస్థానాల జోక్యంతో ప్రభుత్వాలు వెనకడుగు వేయక తప్పలేదు.
సంపదను సృష్టించేది కార్పొరేట్లేననీ, సమాజం ముందుకు సాగటానికి కారణం వారేనని, వారికి కావాల్సిన రాయితీలనుఇచ్చి, వారడిగిన కోర్కెలు తీర్చటం తమ ప్రభుత్వ విధానమని పాలకులు నిస్సిగ్గుగా పార్లమెంట్‌లోనే ప్రకటించటం దుర్మార్గం. వ్యాపారం చేయడం మా వ్యాపారం కాదని కూడా వారు ప్రకటించారు. ఆ విధంగా ప్రభుత్వరంగ సంస్థలపై తమ విముఖతను వెల్లడిరచుకున్నారు. ఈ భావజాలానికి అనుగుణంగానే బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చివేసింది. కార్మికవర్గాన్ని కట్టుబానిసలుగా మార్చేస్తూ ఉంది. ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అయినకాడికి కార్పొరేట్లకు అప్పగిస్తూఉంది. ‘‘నగదీకరణ’’ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అతి తక్కువ ధరలకు అమ్మకానికి పెట్టింది. 2024 ఎన్నికల్లో తిరిగి బిజెపి అధికారంలోకివస్తే, ఆర్ధికవ్యవస్థ తీవ్ర వినాశకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, కార్మికులు, ఉద్యోగవర్గాల పరిస్థితి దుర్భరంగా మారుతుందనీ దేశంలోని యావత్‌ కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు ఒక అంచనాకు వచ్చాయి. అందువల్లనే, 2023 జనవరి 30 వతేదీ ఢల్లీిలో జరిగిన కేంద్ర కార్మికసంఘాల సదస్సు ‘‘నరేంద్రమోదీని గద్దె దించండి! దేశాన్ని కాపాడండి’’ నినాదంతో మహోద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఆ నినాదాన్ని సాకారం చేయడానికి ఈ మే డే సందర్భంగా ప్రతిన పూనుదాం.
వ్యాస రచయిత ఎఐటియుసి ఏపి గౌరవాధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img