ఎం. కోటేశ్వరరావు
మాజీ హీరోయిన్ ఖుష్బూ తన పార్టీ బీజేపీి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోదీలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు రెండుసంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్సభ సచివాలయం రంగంలోకిదిగి లోక్సభ సభ్యత్వాన్ని రద్దుచేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్ నేతలు గతంలో ఖుష్బూ కూడా రాహుల్ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బీజేపీిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద ఖుష్బూ మండిపడ్డారు. ఆమె ప్రస్తుతం బీజేపీి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్ ప్రతినిధిగా ఖుష్బూ చేసిన ట్వీట్లో ఇలా పేర్కొన్నారు. ‘‘ఇక్కడ మోదీ, అక్కడ మోదీ, ఎక్కడ చూస్తే అక్కడ మోదీ…లేకపోతే ఏమిటి? మోదీ అనే పదానికి ముందు అవినీతి పరులపేర్లు ఉంటున్నాయి. దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోదీ అంటే అవినీతిపరులని అర్ధం మార్చుదాం. నీరవ్, లలిత్, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.’’ అని ఉంది.
దీని గురించి ఖుష్బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ, నన్ను రాహుల్ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోదీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్కు పనిలేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి’’ అని పేర్కొన్నారు. రాహుల్గాంధీతో తనను సమంగా చూసి నందుకు కాంగ్రెస్కు కృతజ్ఞతలు అని ఖుష్బూ ట్వీట్ చేశారు.
ఖుష్బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారంచేశారు. తనకు పార్టీలో తగినంతగుర్తింపు ఇవ్వ లేదంటూ అదే ఏడాది రాజీనామాచేసి కాంగ్రెస్లోచేరారు. 2020లో కాంగ్రెస్కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల ఖుష్బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బీజేపీిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బీజేపీి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోదీని పొగుడుతూ ఖుష్బూ మాట్లాడారన్నది స్పష్టం. బీజేపీిలో చేరటాన్ని ఖరారుచేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిరదీ చూద్దాం.‘‘ పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను. నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.’’ అని ఎఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బీజేపీలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాహుల్ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు. తన ట్వీట్కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్ మోదీ, మధ్యలో నరేంద్ర మోదీ, కుడివైపున లలిత్ మోదీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశంవదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ‘‘జనరల్ నాలెడ్జ్` ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే’’ అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోదీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు. ‘‘దొంగలందరికీ మోదీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది’’ అంటూ రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోదీ కులం అంతటికీ పరువునష్టం కలిగించినట్లు సూరత్ కోర్టులో బీజేపీనేత దాఖలు చేసిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడిరది. మోదీ కులం సహా ఓబీసీి లందరినీ రాహుల్ గాంధీ అవమానించారు అని బీజేపీ ఓబీసీిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటిపేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటిపేర్లు గలవారు ఉన్నారు. ఓబీసీిల్లో మోదీ అనే కులమే లేదు. నరేంద్రమోదీ తెలీ ఘంచీ లేదా మోధ్ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు). ఈ కులానికి చెందినవారు నూనెగానుగ ఆడిరచటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పనిచేసేవారిని గనిగ అని పిలుస్తారు. ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్ మోదీది, నరేంద్రమోదీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్ మోదీ జైన మతంలో పాలంపూరీ జైన్స్ కులానికి చెందిన వ్యక్తి. లలిత్ మోదీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్కు చెందిన బీజేపీి నేత సుశీల్ కుమార్ మోదీ వైశ్య, బిసి కాదు. గుజరాత్లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసివచ్చేట్లుగా మోదీ అని అడా, మగా అందరూ పెట్టుకుంటారు.
మోదీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బీజేపీి, సంఘపరివార్కు చెందినవారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధంవచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ‘‘ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ’’ అంటున్నారా లేదా? కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఒక సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ?’’ అని ప్రశ్నించారు. బీజేపీి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా, లేకున్నా సూరత్కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?
విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలువేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్ న్యూస్పోర్టల్ నమోదుచేసి ప్రచురించింది. మధ్యప్రదేశ్లో గడ్డం ఉన్న ఒక భవర్లాల్ జైన్ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్వా, ఆధార్ కార్డు చూపమంటూ దాడిచేసిన బీజేపీి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్ బీజేపీి ఎంఎల్ఏ హరిభూషణ్ ఠాకూర్ బచువల్ చెప్పారు. వారికి ఓటింగ్రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బీజేపి నేత, సుప్రీం కోర్టు లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసులు అరెస్టుచేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఢల్లీి పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్గా పనికిరాడని ప్రకటించలేదు.