Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గంగా, కావేరి అనుసంధానమే మేలు

తిప్పినేని రామదాసప్పనాయుడు

గంగానది భారతదేశంలో అతిపెద్ద జీవనది. ఉత్తర భారతదేశంలోని గంగానదిని దక్షిణ భారతదేశంలో కావేరితో గత నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా తీసుకొస్తే… దక్షిణ భారతదేశ భూములన్నీ దాదాపు సస్యశ్యామలంగా మారుతాయి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు నదుల అనుసంధానం గురించి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కూడా గంగా, కావేరి పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. మోదీ ప్రధానిగా వచ్చిన తరువాత కూడా గత ఏడాది వరకు ఆ ప్రక్రియ చుట్టూనే చర్చ జరిగింది. ఇంచుమించు సంవత్సర కాలం నుంచి గోదావరి, కావేరి అనుసంధానం గురించి ప్రణాళికలు తయారు చేయడం ప్రారంభించారు. శుక్రవారం జరిగే సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఈ విషయాన్ని జాతీయ స్థాయి మేధావులకు ‘గోదావరి, కావేరి వద్దు`గంగా, కావేరి ముద్దు’ అనే విషయాన్ని స్పష్టంగా వివరించాలని యావత్‌ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

దిల్లీలో శుక్రవారం (18న) నదుల అనుసంధానం గురించి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్నాటక, మహారాష్ట్రల నుంచి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు లేదా నీటిపారుదల శాఖల ప్రముఖ ఇంజనీర్లు పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో ప్రధాని ప్రసంగం నదుల అనుసంధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే… నెహ్రూ హయాం నుంచీ ప్రతిపాదనలో ఉన్న గంగా, కావేరి నదుల అనుసంధానాన్ని పక్కనబెట్టి గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి ప్రధాన జీవనదులు. కృష్ణాతో పోలిస్తే గోదావరిలో ఎక్కువ నికర జలాలు వున్నాయి. ఈ సంవత్సరం, గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోయింది. ఈ రెండు నదుల వరద జలాలు ప్రతియేటా ఏ కొద్దిపాటి వర్షాలు వచ్చినా తప్పనిసరిగా వందల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడంలో కొంతమేర అర్థం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఈ రెండు నదుల అనుసంధానంలో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అనేక పెండిరగ్‌ అనుమతులకు విముక్తి కలిగించారు. భారీగా నిధులు కూడా కేటాయింపచేశారు. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించిన రెండు ప్రధాన కాలువలతో పాటు మరికొన్ని కాలువలు పూర్తి అయ్యాయి. ఈ కాలువల ద్వారానే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబునాయుడు హయాంలో ఆగమేఘాల మీద పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొంతమేర గోదావరి నీటిని కృష్ణానదికి మళ్ళించారు. ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల రైతులు ఆ నీటి ద్వారా పంటలు పండిస్తున్నారు. పోలవరం పూర్తి అయిన తరువాత ఆ పట్టిసీమ ప్రాజెక్ట్‌ నీటిని నిలిపివేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. ఇందుకు ప్రాజెక్ట్‌ నిర్మాణ ఖర్చులు పూర్తిగా కేంద్రం భరించవలసి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి రాజకీయాల ప్రభావంతో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నేటికీ సగం కూడా పూర్తి కాలేదు. తెలంగాణలో గోదావరినది మీద తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసింది. వాస్తవంగా రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడే కాకుండా గత ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రాణహిత చేవెళ్ళ భారీ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతానికి పోలవరం ఎంత ముఖ్యమో… తెలంగాణకు ప్రాణహితచేవెళ్ల అంతే ముఖ్యమని అప్పుడు భావించారు. అయితే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాణహితచేవెళ్ల పథకం స్థానంలో డిజైనింగ్‌లో మార్పులు చేసి కాళేశ్వరం తీసుకువచ్చారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా లేకున్నా… రాష్ట్ర నిధులతో పాటు ఇతరత్రా కొన్ని సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పుల ద్వారా చాలా వరకు పనులు పూర్తి చేశారు. తెలంగాణ భూభాగంలోకి ప్రవేశిస్తున్న కృష్ణా, గోదావరి నదులు రెండూ మహారాష్ట్రలో పుడుతున్నాయి. కృష్ణా మహారాష్ట్ర నుంచి కర్నాటకలోకి ప్రవేశించి ఆ తరువాత తెలంగాణ మీదుగా ఆంధ్రా భూభాగంలోకి వస్తున్నది.
గోదావరి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి ఆంధ్రాలోకి చేరుతోంది. గోదావరి నది మీద మహారాష్ట్ర ఎక్కడబడితే అక్కడ కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రకు ఎగువన వున్న తెలంగాణ కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపంలో అనేక చిన్నా చితకా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నది. మిగిలిన నీటి మీద ఆంధ్రాలో త్వరలో పూర్తి కానున్న పోలవరం భవిష్యత్తు ఆధారపడి వుంది. కృష్ణానది మీద కూడా కర్నాటక విచ్చలవిడిగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నది. కర్నాటక దయాదాక్షిణ్యాల మీద, మిగిలేటటువంటి కృష్ణా జలాల మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి వుంది. ఇక్కడ కూడా ఆంధ్రాకు తెలంగాణ ఎగువ రాష్ట్రం కిందికి వస్తుంది. మొదట తెలంగాణ వాడుకున్న తరువాతనే ఆంధ్రాకు ఈ కృష్ణా జలాలు వస్తున్నాయి. తాజా నదుల అనుసంధాన పథకంలో భాగంగా గోదావరిని కృష్ణా ఆ తరువాత పెన్నాలో కలిపి చివరకు తమిళనాడులోని కావేరి నదికి తీసుకెళ్లనున్నారు. పెన్నానది వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి కడప మీదుగా నెల్లూరు వరకు సాగనున్నది. ఈ పెన్నా కూడా కర్నాటకలో పుడుతున్నప్పటికీ భారీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే అనంతపురం జిల్లాలో ప్రవహించే పెన్నా నదిలో నీళ్లు కనబడతాయి. ఇప్పటికే పెన్నా నది మీద నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్ట్‌ నిర్మించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా వరకు మేలు జరుగనున్నది. మొత్తం మీద ఈ రెండు ప్రధాన నదుల నీరు మహారాష్ట్ర, కర్నాటకల అడ్డుకట్టలను దాటుకొని తెలుగు రాష్ట్రాలలోకి వచ్చిన తరువాత ఇక్కడి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా అతి కష్టం మీద తెలుగు ప్రజలకు ఉపయోగపడుతున్న జలాలను తమిళనాడుకు తరలిస్తే…. తెలుగు రాష్ట్రాల భూములు భవిష్యత్తులో ఎడారి భూములుగా మారే ప్రమాదం పొంచి వుంది.
గంగానది భారతదేశంలో అతిపెద్ద జీవనది. ఉత్తర భారతదేశంలోని గంగానదిని దక్షిణ భారతదేశంలో కావేరితో గత నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా తీసుకొస్తే… దక్షిణ భారతదేశ భూములన్నీ దాదాపు సస్యశ్యామలంగా మారుతాయి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు నదుల అనుసంధానం గురించి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కూడా గంగా, కావేరి పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. మోదీ ప్రధానిగా వచ్చిన తరువాత కూడా గత ఏడాది వరకు ఆ ప్రక్రియ చుట్టూనే చర్చ జరిగింది. ఇంచుమించు సంవత్సర కాలం నుంచి గోదావరి, కావేరి అనుసంధానం గురించి ప్రణాళికలు తయారు చేయడం ప్రారంభించారు. శుక్రవారం జరిగే సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఈ విషయాన్ని జాతీయ స్థాయి మేధావులకు ‘గోదావరి, కావేరి వద్దుగంగా, కావేరి ముద్దు’ అనే విషయాన్ని స్పష్టంగా వివరించాలని యావత్‌ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. వ్యాస రచయిత ఛైర్మన్‌, ముద్ర అగ్రికల్చర్‌ Ê స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img