Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మత తత్త్వంపై మరోసారి, దున్నేవానికే భూమి అని ఒకసారి రాజ్యాధికారానికి వేరొకసారి ఇలా ఉద్యమాలు, పోరాటాలు వేటికవి విడివిడిగా ఉండవేమోనని నేననుకుంటున్నాను. దోపిడీ శక్తుల కులమూ, వర్గమూ, రాజ్యమూ కలగలిసి ఉన్న వ్యవస్థలో పీడిత కులాల వర్గాల ఉద్యమాలు, పోరాటాలేకాదు, ఉద్యమ శక్తులు కూడా కలగలిసే ఉండాలి. వారి నడుమ కనీస సమన్వయం, సహకారం ఉండాలి. పందులదొడ్డి కంటే హీనంగా దేశాన్ని దిగజార్చిన పాలకులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశించకుండా లొంగకుండా, ఉద్యమ శక్తులు పోరాట చేవతో సమరశీలంగా సాగాలి. సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో కృషి, సాంఘిక రాజకీయ రంగాలలో కృషితో సమన్వయం కావాలి. వర్గపోరాటం అగ్రకుల వ్యతిరేక పోరాటంతో భూ స్వామ్య వ్యతిరేక పోరాటంలో భుజం భుజం కలిపిసాగాలి.

రక్తమాంసాలు గల మానవుణ్ని ప్రేమిస్తాను
అవిటిచెవిటి మూగదేవుణ్ని మాత్రం నమ్మను
మానవుణ్ణి ద్వేషించే మీరు దేవుణ్ని పూజిస్తారు
దేవుణ్నికాదనే నేను, మానవుణ్ని ప్రేమిస్తాను!
‘నరబలి’ కావ్యంలో వేనుని కథని సి.వి. తనదైన ఆధునిక ధృక్కోణంతో రాశారు. తన సిద్ధాంతాన్ని వేనుని పాత్ర ద్వారా అలా వెల్లడిరచారు.
‘‘పట్టెడన్నం పెట్ట నిరాకరిస్తున్న వర్గం/ అప్పనంగా మంది సొమ్ము తినమరిగిన పూజారి పురోహిత వర్గం/కొండల్లో ఎన్నడో పారిపోయి బండరాయిలా దాక్కున్న నిన్ను/వెతికి వెతికి పట్టుకొచ్చి వీధికెక్కించారు గదరా!’’అని దేవుణ్ణి ఎద్దేవా చేశారు సి.వి. తన ‘ఊళ్లోకి స్వాములోరు వచ్చారు’ కావ్యంలో ఇంతకీ ఎవరీ సి.వి? ఈ తరం యువతీ యువకులకు అంతగా పరిచయం ఉండకపోవచ్చు. సి.వి.పూర్తిపేరు చిత్తజల్లు వరహాలరావు(14.01.19308.11.2017) కానీ, పొడి అక్షరాలతో ‘‘సి.వి’’గానే ప్రసిద్ధులు. కవి, రచయిత, హేతువాది, సాంస్కృతిక రథ సారధి. నిత్య పరిశోధకుడు, దిగంబర కవుల మార్గదర్శి, శాస్త్రీయ విజ్ఞాన కార్యకర్త, మార్క్స్‌ఏంగెల్స్‌లను అమితంగా ప్రేమించిన వాడు, సీపీఐ (యంఎల్‌) వైపు నిలబడ్డానని ప్రకటించుకున్నవాడు. కొన్ని విభేదాలు ఉన్నా శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడు ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ‘‘సాయుధవిప్లవం ద్వారా ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకోవడంకష్టజీవులు తమ భవితవ్యానికి తామే అధినాధులు కావడం’’ అని పారిస్‌ కమ్యూన్‌ సారాంశాన్ని విప్పి చెప్పారు. సి.వి! గుంటూరులో జన్మించిన ఈ ముందు తరం రచయిత, మరణించేంతవరకు విజయవాడ హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్నారు. సి.వి.తండ్రి వెంకటా చలపతి స్వాతంత్య్ర సమరయోధుడు. తల్లి లక్ష్మీ దేవమ్మ. గుంటూరు ఏ.సి.కాలేజీలో బి.ఏ చదువుతూ ఉండగా, విప్లవ దళితకవి శివసాగర్‌ సి.వికి క్లాసుమేట్‌. తర్వాత,ఎకనామిక్స్‌లో పి.జి. డిగ్రీ, మద్రాసుక్రిస్టియన్‌ కాలేజి నుండి తీసుకున్నారు(1958). మద్రాసులో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఎక్కువకాలం అక్కడి కన్నెమెర (గ్రంధాలయంలో గడిపేవారు. కావల్సిన విషయాలన్నీ నోట్స్‌ రాసుకునేవారు) అవే ఆయనకు తర్వాత కాలంలో 30 పుస్తకాలు రాయడానికి ఉపయోగపడ్డాయి.(ఈయన ‘నరబలి’ గ్రంధాన్ని నారాయణస్వామి కన్నడంలోకి అనువదిస్తే, కారు చీకట్లో రచనను వేగుంట మోహనప్రసాదు ఇంగ్లీషులోకి అనువదించారు.) 1950లోని మార్క్సిస్టు ఉద్యమాలతో మమేకమైన సి.వి. మొదట కవిగా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తర్వాత కాలంలో విషయాలు వివరంగా ప్రజల్లోకి వెళ్లాలంటే పద్యంకన్నా గద్యమే సరైనదని గ్రహించారు. ఆ రకంగా ఎన్నో రచనలు వెలువరించారు. నరబలి, సత్యకామ జాబాలి, ఏడుకొండల వాడా గోవిందా, ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు కారుచీకటిలో కాంతిరేఖ, స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ, భారత జాతీయ పునరుజ్జీవనం, విషాద భారతం, పారిస్‌ కమ్యూన్‌, కౌటిల్యుని అర్థశాస్త్రం, పుట్టుపుర్వోత్తరాలు వంటి పుస్తకాలన్నీ ఆయనను సామాజక విప్లవ కారుడిగా నిలబెడతాయి. వర్ణవ్యవస్థ, మనుధర్మశాస్త్రం, ప్రాచీన భారతంలో చార్వాకం, ఆధునిక యుగంలో కులవ్యవస్థ వంటి గ్రంధాలు ఆయన ఎంతటి హేతువాదో నిరూపిస్తాయి. డార్విన్‌ పరిణామ వాదం, సింధూ నాగరికత వంటి రచనలు ఆయనలోని వైజ్ఞానిక స్పృహను వెల్లడిస్తాయి. ఆయన స్వయంగా సైన్సు విద్యార్థి కాకపోయినా, వైజ్ఞానిక దృక్పధమన్నది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అంశమని ఆయన గ్రహించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, దళిత ఉద్యమ వైతాళికుడైన కుసుమ ధర్మన్నను వెలికితీసి పరిచయం చేయడం మరొక ఎత్తు. అంతేకాదు దళిత సాహిత్యోద్యమానికి ఒక పునాదిరాయి కావడంసి.వి. గొప్పదనం! ఆయనలో తెలియకుండానే ఒక గొప్ప పరిశోధకుడు, ఒక చరిత్రకారుడు, ఒకవైజ్ఞానికుడు ఉండడం విశేషం. ఈ లక్షణాలు లేని ఉట్టి కవులూ, రచయితలు తెలుగువారిలో చాలా మంది ఉన్నారు. వారితో సమాజానికి ఎక్కువగా ఉపయోగం ఉండదు. ప్రశ్నించని వాడు, ప్రశ్నను నిలబెట్టనివాడు హేతువాది కానివాడి వల్ల, సమాజానికి ఉపయోగ మేమిటీ? ఆ రకంగా పైరవీలుచేసి అవార్డులు తెచ్చుకున్న వారికన్నా, ప్రభుత్వంలో ఉన్నవారికి భజనలుచేసి పదవులు అనుభవించిన వారికన్నా సి.వి. జీవితం చాలాచాలా విలువైంది. అందుకే చెప్పేది, ఆయన రచనలు ఊరికే చదవడంకాదు।అధ్యయనం చేయాలి! అంతకన్నా ముఖ్యం జీర్ణించుకోవాలి!! ఆచరించాలి.
‘‘నెరసిన గుబురు మీసాలు/పెరిగిన బైరుగడ్డమూ/మానవతను విరజిమ్మే నేత్రాలూ/రక్తమూ కన్నీరు కలిసి సృష్టించిన కొత్త సిద్ధాంతాన్ని/ ప్రపంచ పీడిత ప్రజాకోటి సమర్పించే/మానవోన్నతునిలా ఉన్న ఈయన ఎవరూ? ఆహా ఈయనే కార్ల్‌ మార్క్స్‌/మూర్తీభవించిన తత్వశాస్త్రంలా ఉన్న ఏంగెల్స్‌’’అని మార్క్సిజం సృష్టికర్తల్ని తన్మయత్వంతో పాఠకుల కళ్ల ముందు చిత్రీకరించారు సి.వి. అంతేకాదు, ‘మానవోన్నత మూర్తి స్టాలిన్‌’ అనే ఒక స్మృతి గీతం కూడా రాశారు. కమ్యూనిస్టు ఉద్యమంతో ఇంతగా పెనవేసుకుపోయిన సి.వి, సమకాలీనంలో ఉన్న కొందరు కమ్యూనిస్టులను తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే అది కమ్యూనిజం తప్పుకాదనీ, దాని విలువల్ని నిలుపుకోలేని కొందరు వ్యక్తుల తప్పిదమని వివరణ ఇచ్చారు. వామపక్షవాదులలో సైతం ఇంకా వదలని కులతత్వాన్ని, ప్రాంతీయ విభేదాల్ని ఎత్తిచూపడానికి ఆయన ఏ మాత్రం జంకలేదు, గొంకులేదువ్యక్తులకైనా, పార్టీకైనా, అధికారంలో ఉన్నవారికైనా, లేనివారికైనా అంతర్మధనం అవసరం. అత్మ విమర్శ అన్నింటికంటే ముఖ్యం. సమాజంలోని కులం, మతం, వర్ణవ్యవస్థ వంటి విషయాలపై కమ్యూనిస్టులు చేయాల్సినంత చేయలేదని సి.వి.భావన. అందుకే ఆయనే స్వయంగా ఆయా విషయాలపై విస్త్రతంగా రచనలుచేస్తూ వచ్చారు. ‘‘వర్ణవ్యవస్థలాంటి భ్రష్టమైన వ్యవస్థఈ భూ మండలంలో ఎ్కడైనా ఉందా? వైదికపురోహిత పరాన్నభుక్కు వర్గమా/పాలకవర్గ శునకాల్ని మీరు ఇస్కో ఇస్కో అంటూ/పాలితులనే కవ్విస్తున్నారు/వాళ్లే ఇస్కో ఇస్కో అనేదశ ఆద్యంతాన భవిష్యత్తులో రాబోతోంది జాగ్రత్త!’’ అని పేదల, శ్రామికుల తిరుగుబాటు అనివార్యం అని ‘జాబాలి’ ద్వారా హెచ్చరించారు’’ (సత్యకామ జాబాలి 1972) శతాబ్దాలుగా కొనసాగుతున్న తతంగాన్నంతా సి.వి.నాలుగు వాక్యాల్లో తేల్చేశారు. భారతదేశంలో ఫ్యూడల్‌ వర్గాలు బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రజలపై రుద్ది,సాంస్కృతికంగా కులాల్ని స్థిరపరిచాయి. అవి అలా కొనసాగడానికి కల్పిత పురాణాలు, నిచ్చెనమెట్ల వ్యవస్థ, ఆత్మలు, పరమాత్మలు, పునర్జన్మలు, దేవుని పేరిట ఛాందస ఆచారాలూ సృష్టించి సమాజాన్ని కుళ్లబొడిచారు. సి.వి ఇలాంటి విషయాలపై లోతుగా అధ్యయనం చేశారు. ఇతర ఏ కమ్యూనిస్టు రచయితా రాయనంత స్పష్టంగా, బలంగా గ్రంధ రచనచేసి కొత్త తరాల్ని కూడా ప్రభావితం చేశారు. ఈ విషయాల్నింటినీ గుదిగుచ్చి ఉద్యమ స్వరూపాన్ని సి.వి. స్పష్టంగా ఇలా వెల్లడిరఎచారు. ‘‘కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మత తత్త్వంపై మరోసారి, దున్నేవానికే భూమి అని ఒకసారి రాజ్యాధికారానికి వేరొకసారి ఇలా ఉద్యమాలు, పోరాటాలు వేటికవి విడివిడిగా ఉండవేమోనని నేననుకుంటున్నాను. దోపిడీ శక్తుల కులమూ, వర్గమూ, రాజ్యమూ కలగలిసి ఉన్న వ్యవస్థలో పీడిత కులాల వర్గాల ఉద్యమాలు, పోరాటాలేకాదు, ఉద్యమ శక్తులు కూడా కలగలిసే ఉండాలి. వారి నడుమ కనీస సమన్వయం, సహకారం ఉండాలి. పందులదొడ్డి కంటే హీనంగా దేశాన్ని దిగజార్చిన పాలకులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశించకుండా లొంగకుండా, ఉద్యమ శక్తులు పోరాట చేవతో సమరశీలంగా సాగాలి. సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో కృషి, సాంఘిక రాజకీయ రంగాలలో కృషితో సమన్వయం కావాలి. వర్గపోరాటం అగ్రకుల వ్యతిరేక పోరాటంతో భూ స్వామ్య వ్యతిరేక పోరాటంలో భుజం భుజం కలిపిసాగాలి. దళితులు, మహిళలు, మైనారిటీలు, ఆదివాసీ పోరాటాలు, శ్రామిక వర్గ పోరాటాలతో మమేకం కావాలి’’ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా ఉద్యమ స్వరూపం గురించి చెప్పిన రచయిత మరొకరులేరంటే అతిశయోక్తి కాదు. కానీ, కాలగమనంలో ఏమైంది? దళితులు, మహిళలు, మైనార్టీలు విడివిడిగా తమతమ అస్థిత్వ పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అందరూ సంఘటితంగా, సమైక్యంగా ఉద్యమించాల్సిందిపోయి, విడిపోవడంవల్ల బలహీనపడ్డాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు అధికారం అప్పగించడమంటే మిగతావన్నీ బలహీన పడ్డాయనేకదా అర్థం? ఇది తాత్కాలికం అనుకుని, సి.వి.సూచించిన మార్గంలో ఉద్యమించక తప్పదు! ఐక్యపోరాటానికి సంసిద్ధులు కాక తప్పదు.
`సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img