Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశానికి రానున్నవి చీకటి రోజులు

జస్టిస్‌ మార్కండేయ కట్జూ

  నాజీ జర్మనీకి, బీజేపీ భారత్‌కూ పోలికలు చూపుతూ సరిగ్గా జర్మనీలో జరిగినట్టుగానే, అసలు సమస్యలనుంచి దృష్టి మళ్లించడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారు జస్టిస్‌ మార్కండేయ కట్జూ. భారతదేశంలో జరుగుతున్న సంగతులు నాకు నాజీల కాలంలో జర్మనీలో జరిగిన సంగతులను గుర్తుకు తెస్తున్నాయి. జనవరి 1933లో హిట్లర్‌ అధికారానికి వచ్చిన తర్వాత యావత్తుజర్మనీ ఉన్మాదంలో పడిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ జనం ‘హెయిల్‌ హిట్లర్‌’ అనీ ‘సీగ్‌ హెయిల్‌’ అనీ ‘యుడెన్‌ వెరెక్కె’ అనీ అరవడం, మత్తెక్కిన మరబొమ్మల్లాగ ఆ పిచ్చివాణ్ణి ప్రశంసించడం చేశారు. మీకు కావాలంటే ఆ దృశ్యాలన్నీ యూట్యూబ్‌ మీద చూడవచ్చు. జర్మన్లు ఎంత ఉన్నతమైన సంస్కృతీపరులంటే వారు మాక్స్‌ ప్లాంక్‌, ఐన్‌స్టీన్‌ వంటి గొప్ప శాస్త్రవేత్తలను, గోథె, షిల్లర్‌ వంటి మహా రచయితలను, హీనె వంటి మహా కవులను, మోజార్ట్‌, బాక్‌, బీథోవెన్‌ వంటి మహా సంగీత విద్వాంసులను, మార్టిన్‌ లూథర్‌ వంటి గొప్ప సంస్కర్తలను, కాంట్‌, నీషే, హెగెల్‌, మార్క్స్‌ వంటి గొప్ప తత్వవేత్తలను, లీబ్నిట్జ్‌, గాస్‌, రీమన్‌ వంటి గొప్ప గణితశాస్త్రజ్ఞులను, ఫ్రెడరిక్‌ ది గ్రేట్‌, బిస్మార్క్‌ వంటి గొప్ప రాజనీతిజ్ఞులను కన్న నేల అది. నేను కలిసిన ప్రతి ఒక్క జర్మన్‌ కూడ ఎంతో ఉత్తములు. అయినప్పటికీ, రంగస్థలం మీదికి హిట్లర్‌ వచ్చాక, జర్మన్లే ఉత్తమ పాలక జాతి అని, వారి సమస్యలన్నిటికీ బాధ్యులు యూదులే అని ప్రకటించాక, జర్మన్లు ఆ పిచ్చిప్రేలాపనలను నమ్మడం మొదలుపెట్టారు. యూదులమీద జరిగిన అత్యాచారాలకు, చివరికి జరిగిన మహామారణ కాండకు వారు ఎదురుచెప్పలేదు. బహుశా దాన్ని సమర్థించి ఉంటారు కూడ. 

అలా ఎలా జరిగింది? కచ్చితంగా జర్మన్‌ ప్రజలందరూ మూర్ఖులేమీ కాదు. అంతరాంతరాళల్లో దుర్మార్గులేమీ కాదు. అన్ని దేశాల, అన్ని మతాల, అన్ని నరజాతుల, వగైరా అన్ని సమూహాల ప్రజల్లో 99 శాతం మంచివాళ్లేనని నా ప్రగాఢ నమ్మకం. మరి అరవై లక్షల మంది యూదులను గ్యాస్‌ చాంబర్ల లోకి పంపి మూకుమ్మడిగా హత్య చేయడానికి జర్మన్లకు చేతులెలా వచ్చాయి? నా ఉద్దేశంలో దానికి కారణమేమంటే, మహా శక్తిమంతమైన ఆధునిక ప్రచారసరళి అత్యంత సంస్కృతీపరుల, ఆలోచనాపరుల మెదళ్లలో కూడ విషం నింపగలదు. ఎక్కువమంది జర్మన్ల విషయంలో జరిగిందదే. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జర్మన్లలో నిండిన నిరాశా నిస్ప్రహలు, 1929 మహాసంక్షోభం తర్వాత పెద్దఎత్తున వ్యాపించిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థికసంక్షోభం హిట్లర్‌ వంటి దుర్మార్గుడి విషప్రచారానికి సులభంగా దొరికిన ఆయుధాలు. ఆ విషప్రచారాన్ని జర్మన్లు మొత్తానికి మొత్తంగా అక్షరం వదలకుండా మింగి తమ మెదళ్లలో నింపుకున్నారు.
ఇవాళ అత్యధిక భారతీయుల విషయంలో అదే జరుగుతున్నది. అభివృద్ధి నిరోధక, హిందూ నయాఫాసిస్టు పార్టీ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి భారతీయ మైనారిటీలకు(ప్రత్యేకంగా ముస్లింలకు) వ్యతిరేకంగా భారీ మతోన్మాద ప్రచారానికి తెరలేపింది. ఆవులను చంపుతున్నారనీ, హిందూ బాలికలకు వల వేస్తున్నారనీ, వగైరా విద్వేషం నిండిన ఉపన్యాసాలతో చాలమంది హిందువుల మనసులను విషపూరితం చేశారు. రామాలయం నిర్మించాలనే ప్రకటనలూ, ముస్లింలను కొట్టి చంపడమూ గత కొద్ది సంవత్సరాలలో సర్వసాధారణమైపోయాయి. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌మీద వైమానికదాడి, సానుకూలమైన భారత ప్రచార సాధనాల ద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం కూడ ఈ దండయాత్రలో భాగమే. ఈ ప్రయత్నమంతా ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి కనీవినీ ఎరగని ఘనవిజయం చేకూర్చడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధించింది. భారతదేశంలోని ఏ ఒక్క నిజమైన సమస్యనూ పరిష్కరించలేని గారడీచర్యగా అధికరణం 370రద్దు, దుష్ట పాకిస్తాన్‌మీద సాధించిన మహా విజయంగా, ఉత్సవసందర్భంగా చాల మంది హిందువులను మరింత ఉన్మాదులుగా మార్చింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో హౌడీ మోదీ ప్రదర్శన దీనికి ఒక సాక్ష్యం.
కనీ వినీ ఎరగని స్థాయిలో నిరుద్యోగం (స్వయంగా భారత ప్రభుత్వ సంస్థ నేషనల్‌ శాంపిల్‌ సర్వే వెల్లడిరచింది), దారుణమైన శిశు పోషకాహార లోపం (దేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపం) పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు(మూడు లక్షలకు పైగా), అందని సరైన ఆరోగ్య సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ధనికులకూ, పేదలకూ మధ్య పెరుగుతున్న అంతరం (దేశంలోని 135 కోట్ల జనాభాలో సగం మంది దగ్గర ఉన్న సంపద కన్న ఎక్కువ సంపద ఏడుగురు భారతీయుల దగ్గరే ఉంది) వంటి భారతదేశంలోని నిజమైన సమస్యలలో ఏ ఒక్కటీ ఇటీవలి లోకసభ ఎన్నికలలో చర్చకే రాలేదు. లౌకిక వాదమనేది ఉత్తర అమెరికా, యూరప్‌ల వంటి పారిశ్రామిక సమాజాల లక్షణం. అది ఆసియా దేశాలలో అత్యధికంగా ఉన్న భూస్వామ్య, అర్థభూస్వామ్య సమాజాల లక్షణం కాదు. రాజ్యాంగంలో ఆ మాట ప్రస్తావించినంత మాత్రాన దేశం లౌకిక దేశం అయిపోదు. భారతదేశం ఇంకా అర్ధభూస్వామ్యమేననేది ఈ సమాజంలో విస్తృతంగా ఉన్న కులతత్వం, మతతత్వం రుజువు చేస్తున్నాయి. భారతీయులలో అత్యధికులు లోలోతులనుంచి మత విశ్వాసాలు కలవాళ్లు. భారతీయులలో దాదాపు 80శాతం హిందువులు గనుక వారు అతి సులభంగా మతోన్మాద ప్రచారానికి గురికాగలరు.
భారతదేశంలో హిందువులు, ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లే. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేనుచూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లింలేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు సంతోషిస్తున్నారేమో కూడ. ఒక తీవ్రవాది తగ్గాడని అనుకుంటున్నారేమో! మైనారిటీలపై ప్రత్యేకించి ముస్లింలపై విద్వేషంరూపంలో మతోన్మాదం చాలమంది హిందువులలో పైకి కనబడకుండా ఎప్పుడూ ఉంటూనేఉంది. ఎక్కడో ఒకచోట నిప్పురవ్వపడితే పేలిపోయే మందుపాతరలాగ అది వేచి చూస్తూ ఉండిరది. 2014 నుంచి 2019 వరకూ ఆ మతోన్మాద మంటలను భారతీయ జనతాపార్టీ ఎగసన దోస్తూ వచ్చింది. ఈ పార్టీ మీద ఆధిపత్యం వహిస్తున్నది భయంకరమైన ముస్లిం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక మతోన్మాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు.
ఇప్పుడిక భారతీయ జనతా పార్టీ, దాని నాయకుడు మోడీ అసాధారణ విజయం సాధించారు గనుక, ప్రజల వైపు నుంచి తమ సమస్యలు పరిష్కరించే పాలన ఇమ్మని ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఉద్యోగాలు కల్పించమనీ, రైతుల నిస్సహాయస్థితిని మెరుగుపరచమనీ, శిశు పౌష్టికాహార లోపాన్ని తగ్గించమనీ, మంచి ఆరోగ్యసేవలు అందించమనీ, నాణ్యమైనవిద్య అందించమనీ, వగైరా ఆకాంక్షలు పెరుగుతాయి. కాని ఈ పాలకులకు ఆ పరిష్కారాలు ఎలా సాధించాలో తెలియదు. అంతేకాదు, పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, దేశంలో ప్రస్తుతం ఆర్థికస్థితి మరింతగా దిగజారింది. జాతీయాదాయ పెరుగుదల రేటు ఒక్కసారిగా 5శాతానికి పడిపోయింది. వాహనాల తయారీరంగం సహా పారిశ్రామిక ఉత్పత్తులలో, రియల్‌ ఎస్టేట్‌, విద్యుచ్చక్తి ఇటువంటి మరెన్నో రంగాలలో పతనం కనబడుతున్నది. మున్నన్నడూ లేనంత నిరుద్యోగం తలెత్తడం మాత్రమే కాదు, అది ఇంకా పెరుగుతున్నది. సరిగ్గా హిట్లర్‌ యూదులు అనే బలిపశువును కనిపెట్టినట్టుగా. భారతదేశంలో అటువంటి బలిపశువు ముస్లింలు. ముస్లింల మీద అత్యాచారాలు ఇంకా పెరుగుతాయనీ, తక్కువగా క్రైస్తవుల మీద కూడ పెరుగుతాయనీ నాకు భయం కలుగుతున్నది. సరిగ్గా నాజీ పాలనాకాలంలో జర్మనీలో విజ్ఞానశాస్త్రాన్ని ఎట్లా జాత్యహంకార పూరితమైన అర్థరహిత ప్రేలాపనగా మార్చారో, భారతదేశంలో కూడ 2014 తర్వాత విజ్ఞానశాస్త్రాన్ని అట్లాగే మార్చారు. నాజీ జర్మనీలో చరిత్రను ఎట్లా వక్రీకరించారో, 2014 తర్వాత భారతదేశంలో కూడా అట్లాగే వక్రీకరిస్తున్నారు. సరిగ్గా జర్మన్‌ ప్రచార సాధనాల మీద గోబెల్స్‌ ఆధిపత్యం చలాయించినట్టుగానే, భారత ప్రచారసాధనాలు కూడ వంగిపోయి, లొంగిపోయి, ‘సర్వంసహా చక్రవర్తి’కి ప్రణామాలు పలుకుతున్నాయి. దేశానికిక రానున్నవి చీకటిరోజులే.
(రచయిత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షులు)
తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img