Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ధర్మం నడిచేది నాలుగు పాదాల మీద కానే కాదు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ధర్మ పాలకుడు, ధర్మ పరిరక్ష కుడు, ధర్మం నాలుగు పాదాలా నడిచింది అనే మాటలు తరచూ వింటూ ఉంటాం! అంటే ఏమిటి? ధర్మం నాలుగు పాదాలా నడవడం కాదు, అది సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విడగొట్టడం! ధర్మమనేది ఏమైనా నాలుగు కాళ్ళ మీద నడిచే జంతువా? కాదు గదా? సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విడగొట్టిన వైదిక ధర్మం, అంతా సజావుగా ఉంది అని తనను తానే పొగడుకోవడం. నాలుగు కులాలకు నిర్దేశించిన వృత్తులు ఎవరికి వారు చేస్తూ ఉండడం. అంటే స్వధర్మాలైన కుల వృత్తులు చేసుకుంటూ ఉండడం. వర్ణ సంకరం లేకుండా ఉండడం ధర్మం నాలుగు పాదాల మీద నడవడ మంటే ఇదే!! బ్రాహ్మణ కులానికి చెందిన పుష్యమిత్ర శృంగుడి నుండి శూద్ర కులస్తుడైన శ్రీకృష్ణ దేవరాయలు దాకా అందరూ ‘‘మేము కుల సంకరాన్ని అరికట్టామని గర్వంగా చెప్పుకున్నారు. ‘ఆగమ ప్రియుడు’ అనే బిరుదు కూడా వారికి వారే ప్రకటించుకున్నారు. ‘ఆగమ శాస్త్ర’మంటే వర్ణ వ్యవస్థను బల పరిచేది. దానికి ప్రియుడు కావడమంటే సమాజంలోని నిచ్చెనమెట్ల వ్యవస్థను బలపరచడం... దాన్ని కొనసాగించడం! ‘స్వధర్మంనిధనంశ్రేయం’ అని గొప్పగా చెప్పుకున్నారు. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను బౌద్ధ, జైన ధర్మాలు నిరసించాయి. అంతేకాదు, ఆధునిక వైజ్ఞానిక జన్యుశాస్త్ర పరిశోధనలు కూడా ‘‘మానవ జాతి అంతా ఒక్కటే’’నని ఘోషిస్తున్నాయి. ధర్మం పేరుతో బానిసత్వం కాదు, న్యాయం, సచ్ఛీలత, నిబద్ధతా, సమానత్వం కావాలి!
1927 డిసెంబరు25న మహారాష్ట్రలోని మహద్‌ గ్రామంలో వేలాదిమంది వాలంటీర్ల సమక్షంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ‘మనుస్మృతి’ గ్రంథం ప్రతుల్ని దహనం చేశారు. ఆ సందర్భంలో అక్కడ వారు చేసిన ప్రతిజ్ఞ ఇలా ఉంది. 1. చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను 2. కుల వ్యత్యాసాలను అంగీకరించను 3. హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను 4. హిందువుల్లో ఆహారంపానీయం వంటి విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించను 5. ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి సదుపాయాల విషయంలో అస్పృశ్యులు అనేవారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాను. ఇలాంటి అవగాహన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించడానికి ‘మనుస్మృతి’ వ్యతిరేక ఉద్యమం పనిచేసింది. పని చేస్తూనే ఉంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా తమ కులం, తమ మతం గురించి మాట్లాడుతున్నారంటే వారి మానసిక స్థితి సరిగా లేదను కోవాలి! ఒకసారి పెరియార్‌ అన్నారు ‘‘మతాన్ని పాటించే వ్యక్తి నుంచి ఎలాంటి హేతుబద్ధమైన ఆలోచనని ఆశించలేం. అతడు నీటిలో తేలుతూ అటూ ఇటూ ఊగే మొద్దులాంటివాడు’’ అని. మన వాళ్ళే కాదు, విదేశీయులు కూడా మతం గురించి హెచ్చ రిస్తూనే వచ్చారు. ‘‘మతాలను ప్రశ్నించే సాహసం చేయకపోతే చివరకు అవి మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరిస్తాయి’’ అని విలియం హెచ్‌. రెనాల్డ్స్‌ ప్రపంచ పౌరుల్ని హెచ్చరించాడు. ఇతడు హేతువాద ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడేమీ కాదు. అమెరికాలో ఫిల్మ్‌ ఎడిటర్‌. ఒక సామాన్యుడిగా తన భయాన్ని అలా వ్యక్తీకరించాడు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు పరి స్థితి ఎలా ఉన్నా, వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలేవీ కుల, మతాలను వాటి చుట్టూ అల్లుకున్న మూఢ నమ్మకాల్ని పట్టించు కోలేదు. కొందరు మహానుభావులు తమ పరిధిలో జీవితాలు త్యాగం చేస్తూ వచ్చారు. కొన్ని సంస్థలు కృషి చేస్తూ వచ్చాయి. ఈ సమాజ బలహీనతల్ని ఆసరా చేసుకుని, నిచ్చెన మెట్ల సంస్కృతిని, మనుస్మృతిని మళ్ళీ బలోపేతం చేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ ప్రయత్నాన్ని వివేకవంతులైన ఈ దేశ ప్రజలు సాగనివ్వరు. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే, ఈ ‘‘ధర్మ’’ శాస్త్రాలు చెప్పేది అగ్ర కులస్తుల పట్ల నిమ్నకులాల వారు విధే యులుగా ఉండాలనీ, బానిసత్వం వర్థిల్లుతూ ఉండాలనే కదా? ఈ 21వ వైజ్ఞానిక సమాజంలో అది సాధ్యమా?
‘‘గదిలో చీకటిగా ఉంటే ఎంత ప్రార్థన చేసినా వెలుగు రాదు. వెలుతురు కోసం లైటు వేసుకోవాల్సిందే!’’ ` అని సింపుల్‌గా చెప్పారు థామస్‌ ఫెడరిక్‌ లిమ్‌. ప్రసిద్ధ సైకోథెరపిస్టు. ‘స్టేయింగ్‌ సేన్‌’ అనే ప్రసిద్ధ గంథ్ర రచయిత. అందరూ శారీరక దృఢత్వం కోసం వ్యాయామాలు చేస్తారు కానీ, మేధస్సుకు సంబంధించి, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదని ఆయన ఆ గ్రంథం ప్రకటించారు. ‘లైటు వేసుకోవాల్సిందే’ అని అనడంలో చాలా అర్థం ఉంది. సంకెళ్ళుంటే తెంపుకోవాల్సిందే అణచివేతుంటే పోరాడాల్సిందే. అంధ విశ్వాసాలుంటే వదులుకోవాల్సిందే. అసమానతలు ఉంటే నేలమట్టం చేయాల్సిందే. నిచ్చెన మెట్ల వ్యవస్థను విరగ్గొట్టాల్సిందే. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు కద లాల్సిందే. లైటు వేసుకోవాల్సిందే.. చీకట్లను పారద్రోలాల్సిందే అన్న దాంట్లో చాలా అర్థాలున్నాయి. ఒక్క హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో కూడా మూర్ఖత్వం అదే స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఇక్కడ ఒక పాస్టర్‌ చేసే గిమిక్కు చూడండి! ఒక యువకుని గుండెకు గురి చూసి పిస్టల్‌ పేల్చినప్పుడు ఆ యువకుడు కుప్పగూలిపోయాడు. అతను చనిపోయాడని అందరూ భావించారు. కానీ, ఆ యువకుడు తటాలున లేచి, తన గుండెపై ఉన్న బైబిల్‌ తెరచి చూశాడు. తుపాకి గుండు బైబిల్‌ను చీల్చుకుంటూ వెళ్ళి ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. ఆ పేజీలో ఈ విధంగా రాసి ఉంది ‘‘నీ ఎడమ పక్క వేయి మంది పడిననూ, నీ కుడి పక్క పది వేల మంది కూలిననూ అపాయము నీ యొద్దకు రాదు ఆమెన్‌! హలలూయా ఇట్టి సాక్ష్యమును దేవుడు మనకందరికీ కలిగించుగాక’’ అని!
ఇదే నిజమైతే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు తయారు చేసే ఫాక్టరీలన్నీ మూసెయ్యాలి. అవెందుకూ దండగ? బుల్లెట్‌ పేలిన ధ్వని ‘టేప్‌ రికార్డర్లో పెట్టి, ఒక సీన్‌ క్రియేట్‌ చేసి, డ్రామాలాడి జనాన్ని మభ్యపెట్టినందువల్ల ఏం సాధించగలరూ? ఇలాంటి ప్రదర్శనలు పెద్ద పెద్ద హాళ్ళలో ఎందుకూ? చేతనైతే పోయి యుద్ధ భూమిలో చేయాలి. మన సైనికులు అమరులు కాకుండా ఉంటారు లేదా పోలీసు ఎన్‌కౌంటర్లు జరిగే చోట చేసి చూపాలి. పాస్టర్ల శక్తి సామర్థ్యాలు లోకానికి తెలుస్తాయి. చచ్చిన వాళ్ళను బతికించే ప్రక్రియ పెయిడ్‌ కళాకారులతో రక్తి కట్టిస్తారు తప్ప, ఆసుపత్రులకు వెళ్ళి చావు బతుకుల్లో ఉన్న రోగులను బాగు చేయరు. అది వారి వల్ల కాదు. అబద్ధపు బతుకులు బతికేవారు అబద్ధపు నాటకాలాడి పొట్ట పోసుకోవాల్సిందే! ఆకలి అయిన ప్పుడు బిచ్చగాళ్ళు నిజాయితీగా చిప్ప పట్టుకుని బిచ్చమెత్తుకుం టారు. వారి కాలిగోటికి సరిపోరు కదా? ఈ మత ప్రచారకు లు? మత ప్రదర్శకులు? ఇలాంటి వారిని, ఇలాంటి సంఘట నల్ని చూసే ఇంగ్లీషు నటి జానీ జోన్స్‌ ఇలా అన్నారు. ‘‘నేను పిచ్చాసుపత్రులను, చర్చిలను కూడా సందర్శించాను. రెండు చోట్లా మనం వాళ్ళు చెప్పింది వినాల్సిందే! మనం చెప్పేది వాళ్ళు వినరు!’’ అని. భారత ప్రధాని ‘మన్‌ కి బాత్‌’ అలాంటిదే! ఆయన చెప్పింది వినాల్సిందే. దేశ ప్రజల మాట ఆయన వినరు. అయితే తను చెప్పేదంతా దేశ ప్రజలు వింటున్నారన్న భ్రమలో ఆయన ఉన్నారేమో తను చేసే గిమిక్కు జనం నమ్ముతున్నారని పాస్టర్‌ అనుకున్నట్టుగా? నియో లాటిన్‌ కవి ఆంథోని ఆల్సోప్‌ అన్నట్టుగా నిజమే ‘‘మతమంటే మరణాంతర రక్షణ పేరుతో జరిగే ఒక పెద్ద స్కామ్‌!’’ మతాలను నిలబెడుతున్న దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, మోక్షం, కర్మ, తలరాత, విధిరాత అన్నీ గుడ్డి నమ్మకాలే అందుకే ప్రశ్నించడం ఈ మతాలకు నచ్చదు. అసలే జవాబులు వాటి దగ్గర ఉండవు. అందువల్ల ప్రశ్నలు ఎదుర్కోవ డమంటే వాటికి చిరాకే కదా? జవాబుల్లేవని ఒప్పేసుకునే చిత్తశుద్ధి కూడా వాటికి ఉండదు. అందుకే, మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ తన సంపాదకీయంలో ఈ మధ్య ఇలా రాసుకుంది. ‘‘ప్రజలు కోర్టుల్లో ప్రమాణం చేసేప్పుడు మత గ్రంథాలపై కాకుండా రాజ్యాంగంపై ప్రమాణం చేయాలనీ, అలా చేస్తే దేశం నుండి మత రాజకీయాల్ని తరిమేయవచ్చని రాజ్యాంగం అన్ని మతాల వారికీ విలువైంది కాబట్టి, మత గ్రంథాల కన్నా రాజ్యాంగమే ఉన్నతమైందన్న విషయం లోగడ బాల్‌థాక్రే కూడా చెప్పేవారనీ’’ ఆ పత్రిక రాసుకుంది. ఈ విషయంలో పూర్తి వాస్తవముంది కానీ, అలాంటి రాజకీయ పార్టీయే తన ఆలోచనా ధోరణిలో మార్పులు చేసుకుని, ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శప్రాయంగా ఉంటే ఆనందించాల్సిన విషయమే!
ఈ మధ్య మన దేశంలో ఒక విచిత్రం జరిగింది. ‘‘హిందూ పదానికి అర్థం ఏమిటని, నిర్వచనం ఏమిటని’’ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. హిందూ అనే పదానికి ప్రభుత్వంలోని ఏ శాఖ వద్దా సరైన నిర్వచనం లేదని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నుండి సమాధానం వచ్చింది! హిందూ అనే పదానికి అర్థమే లేదని వచ్చిన సమాధానంతో అందరూ నోరెళ్ళబెట్టారు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్న మనువాదులు గతంలో రచించిన రక్తచరిత్రను భారతదేశ పౌరులు తిరస్కరించారు. అది ఇటీవలి పౌరసత్వ చట్టమైనా, ఇప్పటి రైతు వ్యతిరేక చట్టాలైనా జనం తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తూనే ఉంటారు. బెంగాల్‌ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పొడుగు గడ్డం పెంచినంత మాత్రాన వారు విశ్వకవులు కాలేరు. పది తప్పినవాడు పది తప్పినవాడిలాగానే ఉంటాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త వరీందర్‌ పాల్‌ సింగ్‌, సాయిల్‌ కెమిస్ట్‌ కేంద్రమంత్రి సదానంద గౌడ చేతుల మీదుగా గత ఏడాది (2020) సెప్టెంబరు 11న న్యూదిల్లీలో అందు కోవాల్సిన అవార్డును ఆ వేదిక మీదే తిరస్కరించారు. రైతులకు తన సంఫీుభావం తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ధర్మం నాలుగు పాదాలా నడుస్తూ ఉందన్న భ్రమలో ఉందామా? మనువాదుల అహం కారం నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని, మత సంప్రదాయాల్ని నిలబెట్టాలని చూస్తున్నప్పుడు సామాన్య పౌరులు ఏం చేయాలీ? వారి ఆటలు అలాగే సాగనివ్వాలా? లేక ‘మానవ జాతి అంతా ఒక్కటే’నని నినదించాలా? మరీ ముఖ్యంగా సైన్సు ఉపకరణాలే లేకుంటే మతం, ఆధ్యాత్మికత, స్వస్థత ` అంటూ మూఢత్వ ప్రవచనాలు చెప్పేవాళ్ళంతా ఏనాడో అడ్రస్సు లేకుండా పోయే వారు. అవునా? కాదా? ఎవరికి వారు నిజాయితీగా విశ్లేషించుకోవాలి!

వ్యాస రచయిత
సుప్రసిద్ధ రచయిత, బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img