Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నెహ్రూ భరతమాత ముద్దు బిడ్డ – వాజ్‌పేయి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మరణించినపుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అర్పించిన నివాళి ఈ విధంగా ఉంది. ‘‘ఒక కల విచలితమైంది. ఒక పాట మూగబోయింది. ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది. భయం, ఆకలి లేని ఒక ప్రపంచపు కల అది. ఇటు గీతా పాఠాన్ని ప్రతిధ్వనించే గీతం ఇది. అటు రోజా పువ్వు వెదజల్లే పరిమళం అది. ఎదురైన ప్రతి చీకటితో పోరాడుతూ, వెలుగులీనుతూ, ప్రతిరాత్రీ మేల్కొని మండుతూ ఉన్న దీపం అది. మాకుదారి చూపుతూనే ఒకనాటి ఉదయం నిర్వాణం చెందింది. మరణం తప్పదు. భౌతిక శరీరం తాత్కాలికం. ఆ బంగరు శరీరం నిన్న గంధపు చెక్కల మధ్య మాయమైంది. కానీ, ఆ మృత్యువు ఎందుకంత తొందరపడిరదీ? స్నేహితులంతా నిద్రలో ఉన్నప్పుడు, పహారా కాస్తున్నవారు ఒకింత మగతగా ఉన్నప్పుడు జీవితంలో మాకు ఎంతో విలువైన ఆ బహుమతిని నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయిందే? భరతమాత విషాదంలో మునిగిపోయింది. తన ముద్దుల బిడ్డను, ప్రియతమ రాకుమారుణ్ణి ఆమె ఈ రోజు కోల్పోయింది. తన అనుచరుణ్ణి, తన సహచరుణ్ణి కోల్పోయానని…మానవత్వం ఈ రోజు ఖిన్నవదనంతో ఉంది. తన పరిరక్షకుడు ఇక లేడని.. శాంతి ఈ రోజు సహనం కోల్పోయింది. అణగారిన బతుకులకు అండలేకుండా పోయింది. సామాన్యుడి కళ్లలో వెలుగులు ఆరిపోయాయి. తెరపడిపోయింది. ప్రపంచ రంగస్థలం మీది నుంచి ముఖ్యమైన నటుడు తన చివరి పాత్ర పోషించి, ప్రేక్షకుల ముందు సెలవు తీసుకుని నిష్క్రమించాడు.’’
వాజ్‌పేయి కవి. భావోద్వేగంలో ఆయన చెప్పిన ఈ మాటలు కేవలం ఆనవాయితీగా చెప్పిన పొడిమాటలు కావు. గుండె లోతుల్లోంచి తన్నుకుని వచ్చినవని తెలుస్తూనే ఉంది. పార్టీలు వేరైనా, రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా ఒక మహామనిషి కనుమరుగైనప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా వ్యక్తీకరించాలి. ఆ పనిని బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి విమర్శను ఆహ్వానించి ప్రోత్సహించారు. ఇందిరాగాంధీ తర్వాత వేర్వేరు వ్యక్తులు ప్రధానులయ్యారు. పార్లమెంటు హౌస్‌లో ఎవరో నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. అది గమనించిన వాజ్‌పేయి కలతచెందారు. ఏదిఏమైనా, దేశతొలి ప్రధానిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని గొడవచేసి మళ్లీ నెహ్రూ చిత్రపటాన్ని అక్కడ యథావిధిగా ఏర్పాటు చేయించారు.ప్రధానిగా వాజ్‌పేయి పార్లమెంటులో చేసినొక ఉపన్యాసంలో ఆయనే స్వయంగా ఈ విషయం తెలియజేశారు. అందుకే రాజకీయాల్లో ఉన్నవారంతా రాజకీయనీతిజ్ఞులు కారు. నేటి వాజ్‌పేయి వారసులు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాలి!
భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మీద ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు తమ అక్కసు అన్ని విధాలా వెళ్లగక్కుతున్నారు. ‘‘ఈ దేశానికి తొలిప్రధాని నెహ్రూ బదులుగా సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ అయి ఉంటే కశ్మీరు పరిస్థితి, దేశపరిస్థితి వేరుగా ఉండేదని, కశ్మీరులో కొంతభాగం పాకిస్థాన్‌ ఆధీనంలో ఉండేది కాదనీలోకసభలో స్వయంగా నేటి ప్రధాని మోదీ ప్రకటించారు. భారత తొలి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌కు తామే నిజమైన వారసులమని ప్రతిచోట ప్రకటించుకుంటున్నారు. పదవులున్నాయి. నోటికి పెదవులున్నాయి కదా అని తోచిందల్లా మాట్లాడితే దేశప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. అంతో ఇంతో చరిత్ర, భూగోళం, సైన్సు, ప్రపంచజ్ఞానం పెంచుకుని, ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్న సామాన్యుల సంఖ్య పెరిగింది. వారు అన్నీ విశ్లేషించుకుంటున్నారు. ఎవరైనా సరే, ఆకాలానికి, ఆ సమయానికి, ఆ సందర్భానికి తగిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. జనానికి, దేశానికి మేలు చేసినవారు చరిత్రలో నిలబడతారు. కీడు చేసినవారు చరిత్ర హీనులవుతారు. స్వాతంత్య్రం లభించిన నాటికి దేశంలో నెహ్రూ స్థాయి ఏమిటీ? వల్లభాయ్‌పటేల్‌ స్థాయి ఏమిటీ? అనేది కొన్ని పాత ఉత్తరాలవల్ల తెలుసుకోవచ్చు. వాజ్‌పేయి శ్రద్ధాంజలితో కొంత అర్థమవుతోంది కదా? దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేనాటికి జవహర్‌లాల్‌నెహ్రూ తిరుగులేని అగ్రనాయకుడు. ఆయన దార్శనికుడు గనుక, దేశ అవసరాలకు కావల్సిన ప్రాజెక్టులకి, వైజ్ఞానిక పరిశోధనాశాలల స్థాపన, వైజ్ఞానికుల్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని ఆహ్వానించడం, లలిత కళల్ని, బాలల అవసరాల్ని గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. పద్నాలుగేళ్లు జైల్లో మగ్గినా, భార్య చనిపోయి ఒంటరివాడైనా, మొక్కవోని దీక్షతో తనను తాను దేశానికి అర్పించుకున్న ధీశాలి. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు పనిగట్టుకుని నెహ్రూ కృషిని, నిర్ణయాల్ని తక్కువచేసి మాట్లాడడం వారి సంస్కారహీనతను తెలియజేస్తుంది తప్ప, తొలి ప్రధాని ముద్రను చెరిపేయలేవు. మహాత్మాగాంధీ, నెహ్రూని అక్రమంగా, దొడ్డిదారిన ప్రధానిని చేశారని నేటి ప్రభుత్వ నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఆ కాలంలో నెహ్రూ స్థాయి ఏమిటో, సర్దార్‌ పటేల్‌ స్థోమత ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడాలేరు. దేశంలో ఆకలి, పేదరికం రూపుమాపాలంటే, దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి సాధించాలని కలలుగన్నవాడు నెహ్రూ. విద్యావంతుల్ని, అందులో వివేకవంతుల సంఖ్య పెంచడం, సంస్కృతీ సంప్రదాయాల గుప్పిట్లో ఉన్న మూడనమ్మకాల్ని తగ్గించడం తక్షణం చేయాల్సిన పనులని ఆయన ఉద్భోదించారు. హోమి జె.బాబా, శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, సర్‌ సి.వి.రామన్‌, సతీష్‌ థావన్‌, జె.సి. ఘోష్‌, మేఘానంద్‌ సాహా, నళినీ రాజన్‌ శంకర్‌ లాంటి వైజ్ఞానికుల్ని ఆయన స్వయంగా ప్రోత్సహించి వారి చేత ప్రపంచస్థాయి పరిశోధనా శాలలకు రూపకల్పన చేయించడం సామాన్యమైన విషయంకాదు. ఎంతటి దార్శనికుడయితే నెహ్రూ ఆ పనులు చేయగలిగారూ? బ్రిటీష్‌ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత అయిన పాట్రిక్‌ బ్లాకెట్‌ను తన వైజ్ఞానిక సలహాదారుగా చేసుకుని, భారతీయ రక్షణశాఖను బలోపేతం చేయగలిగారు. అనేక రంగాలలో ఆయన వేసిన పునాదులుమీదే దేశం తర్వాతికాలంలో పురోగతి సాధిస్తూ వస్తోంది కదా? ఇంత చేసినా దేశ నిర్మాతని చరిత్రపుటల్లోంచి తీసెయ్యాలని, ఉపన్యాసాలలో ఆయనపేరు రాకుండా విస్మరించడం ఏం గొప్పదనం? బాబూ రాజేంద్రప్రసాద్‌ తొలి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, నెహ్రూ కృషికి గుర్తింపుగా స్వయంగా ఆయనే ‘భారత రత్న’ ప్రకటించారు. ఆ విషయం దేశ ప్రజలకు కూడా తెలియజేశారు. ఆ విషయం పరిగణనలోకి తీసుకోకుండా నెహ్రూయే తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నారని ఇప్పటి నీతిమాలిన పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ పేరు మార్చి నరేంద్ర మోదీ పేరుపెట్టాలని కుటిలయత్నాలు జరుగుతున్నాయట. విలువల వలువలు విడిచేసిన వారికి సిగ్గూ ఎగ్గూ ఏముంటుందీ? తన తర్వాత తన భాష మాట్లాడేది నెహ్రూనే అని గాంధీజీ అన్నారు. సర్దార్‌పటేల్‌, నెహ్రూ కన్నా 14ఏళ్లు పెద్దవాడు. అయినా కూడా నెహ్రూకి తను జీవితకాలం విధేయుడినని ప్రకటించుకున్నారు. అలాగే రాజాజీ, సి.రాజగోపాలాచారి నెహ్రూ కన్నా 11ఏళ్లు పెద్ద. అయినా కూడా తనకన్నా నెహ్రూ 11వందల రెట్లు గొప్పవాడని రాజాజీ కితాబిచ్చారు. తొలిప్రధాని అయ్యాక, తన మంత్రివర్గంలో చేరి, హోంశాఖ నిర్వహించాల్సిందిగా నెహ్రూ పటేల్‌కు లేఖ రాశారు. దానికి ఆయన రాసిన ప్రత్యుత్తరం ఇలా ఉంది. ముప్పయ్యేళ్లుగా కొనసాగుతున్న మన స్నేహబంధం, స్వాతంత్రోద్యమంలో కార్యకర్తలుగా మన అనుబంధం చాలా గొప్పవి. వాటి ముందు ఈ ఆనవాయితీ అంగీకారాలు అవసరంలేదు. నా సేవలు మీరు ఎలా అంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ దేశం కోసం మీరు చేసిన త్యాగం గొప్పది. ఇలాంటిది మీరుకాక, మరొకరెవరూ చేయలేదని నా విశ్వాసం. అందువల్ల, ఇక నాజీవితమంతా మీకు ఎదురుచెప్పని విశ్వాసపాత్రుడనై ఉంటూ అంకితభావంతో పనిచేస్తాను. ‘‘నేను కశ్మీరుకు చేయగలిగింది చేశాను. కశ్మీరుకు సంబంధించి విధానపరమైన అభిప్రాయ బేధాలు మీకూ నాకూలేవు. అయినా దురదృష్టవశాత్తూ మన కింద ఉన్నవారు మీకూ, నాకూ మధ్య పెద్ద అగాధాలు ఉన్నాయని భావిస్తున్నారు.’’ (సర్దార్‌పటేల్‌ నెహ్రకు రాసిన ఉత్తరం. అక్టోబరు 8, 1947)నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (2010) పుస్తకం నుంచి ) పండిట్‌నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు, ప్రపంచ రాజకీయాలనే శాసించారు. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ , దేశ ప్రజలకు వైజ్ఞానిక స్పృహ నూరిపోశారు. వాట్టర్‌ క్రూకర్‌ మాటల్లో ‘‘నెహ్రూ ఒక అరుదైన వ్యక్తి. సర్వస్వతంత్రుడై ఉండి, తెలివి, శక్తీ సమార్థ్యాలు ఉండి మంచివాడుగా, వినయశీలిగా ఉండడం అరుదు కదా’’ చదువూ, సంస్కారమూ లేక, వ్యక్తిత్వమూ లేక మందబలంతో బరితెగించిన నేతల్ని ఇప్పుడు మనం మన కళ్లముందు చూస్తున్నాం. ఈ మూర్ఖ ప్రభుత్వపు ఆగడాలు దేశాన్ని ఇంకా ఎంత అనాగరికతలోకి తీసుకువెళుతుందో తెలియదు.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img