Friday, April 19, 2024
Friday, April 19, 2024

పత్తి సేకరణకు బీజేపీ ప్రభుత్వం తిలోదకాలు

ఆశా, నిరాశల మధ్య పత్తి సేద్యం సాగుతూ వస్తున్నది. ఒక సంవత్సరం ధర ఆశను, ఆతర్వాత రెండు సంవత్సరాలు రైతాంగంలో నిరాశను నింపు తున్నది. మార్కెట్‌లో నిలకడలేని ధరలు, ఊరటనివ్వని మద్దతు ధరలు పత్తి సేద్యాన్ని, పత్తి రైతులను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తూనే ఉంది. గత పత్తిసీజన్‌లో క్వింటాల్‌కు 10 నుంచి 12వేల రూపాయల దాకా ధర లభించటంతో, దిగుబడులు తగ్గినా రైతాంగానికి ఊరట లభించింది. ఫలితంగా ఈ సంవత్సరం ఆ ఆశతోనే ఆంధ్రప్రదేశ్‌లో 2.40లక్షల హెక్టార్ల నుంచి 3.11లక్షల హెక్టార్లకు పత్తి సేద్యం పెరిగింది. తెలంగాణలో 50లక్షల ఎకరాల్లో సేద్యం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు వరకు 10వేల రూపాయలకు పైగా క్వింటా పత్తికి ధర ఉంది. ఆ తర్వాత కొత్త పత్తి పంట రాగానే పత్తిధర ఫతనం ప్రారంభమైంది. ఇందుకు కారణం బహిరంగ రహస్యమే. గత అగస్టుకు ముందు 90శాతం పైగా రైతులు పత్తిని రైతులు విక్రయించారు. రైతులవద్ద ఉన్న పత్తి వ్యాపారుల వద్దకు చేరిన తర్వాత, దాన్ని విక్రయించటానికి వారు ధరను పెంచుతూ ఉంటారు. పోయిన ఆగస్టులో పత్తి రేటు పెరగటానికి అదే కారణం. గత అక్టోబర్‌ నుంచి రైతులు తిరిగి పత్తి పంట విక్రయాలను ప్రారంభించారు. వ్యాపారులు ధరలు తగ్గించటమూ ప్రారంభించారు. నేడు క్వింటా పత్తిధర 6,800 నుంచి 7,500 వరకు ఉంది. గత ఆగస్టు నుంచి 3వేలకు పైగా ధర తగ్గింది. ఎకరా పత్తి సేద్యానికి 32 వేలకు పైగా రైతుకు సేద్యపు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అదనంగా మరో 20వేలు ఖర్చు ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు సగటు దిగుబడి 10 క్వింటాళ్ల వస్తుంది. గత కొన్ని సంవత్సరాలగా సగటు దిగుబడి తగ్గుతూ ఉంది. నకిలీవిత్తనాలు, తెగుళ్ల వలన ఈ సంవత్సరం 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 6,380 రూపాయలు. దీని ప్రకారం సొంత భూమి రైతుకు పెట్టుబడి వచ్చీరాని పరిస్థితి. కౌలు రైతులకు 20వేలకు పైగా నష్టం.
అమెరికా వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తిఉత్పత్తి 128.2 మిలియన్‌ బేళ్లు కాగా ఈ సంవత్సరం 120.2 రెండు మిలియన్‌ బేళ్లకు పరిమితమైంది. మిల్లుల వినియోగం 1,86,000 బేళ్ల నుంచి 134.4 లక్షల బేళ్లగా ఉంది. వస్త్రాలపై జీఎస్‌టీ విధింపు వలన కొనుగోలు తగ్గి మిల్లులు ఉత్పత్తిని తగ్గించటమే అందుకు కారణంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పత్తి దిగుమతులు 46.4 మిలియన్‌ బేళ్లు. చైనా దిగుమతి 2.5 మిలియన్‌ బేళ్లు. ఈ సంవత్సరం మనదేశంలో పత్తి ఉత్పత్తి తగ్గటం, మిల్లుల డిమాండ్‌ పెరగటంతో ఎగుమతులు తగ్గనున్నాయి. గత సంవత్సరం 78 లక్షల బేళ్ల పత్తి ఎగుమతులు జరగగా, ఈ సంవత్సరం 40 లక్షల బేళ్లకు తగ్గుతుందనే అంచనా వేస్తున్నారు. పత్తి కొనుగోలులో మిల్లులు ద్వందవైఖరి అవలంబిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే దిగుమతి చేసుకోవటం, ఎక్కువగా ఉంటే దేశంలోనే కొనుగోలు చేయటం అనే విధానం అనుసరిస్తున్నాయి. దేశంలో ధర తక్కువగా ఉన్నప్పుడు ఎగుమతులు ఆపాలని పాలకులపై వత్తిడి చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతుల విధానం రైతాంగానికి నష్టంగా మారింది. 2020 లెక్కల ప్రకారం, ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35శాతం కాగా, అక్కడ జరిగే ఉత్పత్తిలో 85శాతం ఎగుమతి చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం లాంటి దేశాలు అమెరికాతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకు కారణం అమెరికా అందిస్తున్న సబ్సిడీనే. అమెరికాలోని ఒక్కో పత్తి రైతుకు పరోక్షంగా ఇస్తున్న సబ్సిడీ 1,17,494 డాలర్లు. అమెరికా చట్టాల ప్రకారం మార్కెట్లో మద్దతు ధరకన్నా తక్కువ ఉంటే, ఆమేరకు ప్రభుత్వం లెక్కగట్టి రైతుకు చెల్లిస్తుంది. 1995 నుంచి 2020 వరకు 40.10 బిలియన్‌ డాలర్లు సబ్బిడీ రూపంలో చెల్లించింది. రైతులకు జిన్నింగ్‌ ఖర్చులు తగ్గించే పేరుతో 3.16 బిలియన్‌ డాలర్లు అందచేసింది.
అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు కోరుతున్నా అమెరికా చేయలేదు. ప్రపంచ వ్యవసాయ ఒప్పందానికి ముందు 1986-88లో ఉన్న సబ్సిడీల ఆధారంగానే ఇప్పటికీ అమెరికా సబ్సిడీలను లెక్కిస్తున్నది. ఈ కాలంలో తమ పత్తి సబ్సిడీ 2,384 మిలియన్‌ డాలర్లని, దాన్నే ప్రమాణంగా తీసుకోవాలని మొండికేస్తున్నది. దీని ప్రకారం అదనంగా ఇచ్చిన 19 బిలియన్‌ డాలర్లను గ్రీన్‌బాక్స్‌ పేరుతో దాచి పెడుతున్నది. ఇది ప్రపంచ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకం. భారతదేశంలో రైతుకు ఇచ్చిన పరోక్ష సబ్సిడీ 27 డాలర్లు మాత్రమే. దీన్ని కూడా ఇవ్వగూడదని, రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీని తగ్గించాలని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశంపై కేసులు వేశాయి. భారత్‌ అమెరికా ఇస్తున్న పరోక్ష సబ్సిడీలను బట్టబయలు చేయలేక పోతున్నది. ఆ దేశాలకు దాసోహమంటూ, వాటిని సంతృప్తి పర్చటానికి మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటంలో మొండికేస్తున్నది. పంటల అమ్మకాలను బహిరంగ మార్కెట్‌కు అప్పగించేందుకు, కార్పొరేట్‌ సంస్థలకు రైతుల భూములను కట్టపెట్టేందుకు, వ్యవసాయాన్ని కార్పొరేట్లపరం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయచట్టాలు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్దఎత్తున రైతాంగం ఉద్యమించటంతో, వాటిని రద్దుచేసినా, పరోక్షంగా వాటిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తూనే ఉన్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లను ఎఫ్‌సీఐ విరమించింది. ఇప్పుడు పత్తి కొనుగోళ్ల నుంచి సీసీిఐ తప్పుకోనుంది. అందుకు బడ్జెట్‌ కేటాయింపే నిదర్శనం. బడ్జెట్‌లో కేటాయించిన లక్ష రూపాయలతో సీసీఐ కొనే పత్తి ఎంత. తెలంగాణలో ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినా నామమాత్రపు కొనుగోళ్లే. ఈ విధంగా పత్తి కొనుగోళ్ల నుంచి మోదీ ప్రభుత్వం తప్పుకోనుంది. మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను యావన్మంది రైతాంగం అర్ధం చేసుకోవాలి. పత్తికి కనీస మద్దతు రూ.10వేలు ప్రకటించి, దానికి చట్టబద్దత కల్పించి, ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయాలి. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img