సంగిరెడ్డి హనుమంతరెడ్డి
అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచవ్యాపితంగా మనుషుల ఆయుష్షు పెరిగింది. ప్రపంచంలో 2020 నాటికి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్యను దాటింది. 60 ఏళ్ళవారి సంఖ్య 2030 నాటికి 140 కోట్లకు, 2050 నాటికి 210 కోట్లకు చేరుతుందని అంచనా. 2050 నాటికి 80 ఏళ్ళు దాటిన జనాభా 42 కోట్ల 60 లక్షలకు చేరుతుంది. 2050 నాటికి 80శాతం వృద్ధులు పేద, మధ్య ఆదాయాల దేశాలలో ఉంటారు. మన దేశంలో 1950 నాటికి వయోవృద్ధుల సంఖ్య జనాభాలో 5 శాతం. 2016లో ఈ సంఖ్య 10శాతం. 2050 కి ఇది 20.3 శాతానికి చేరనుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అనగా 5 మందిలో ఒకరు వయోవృద్ధులే. ధనిక దేశాల్లో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలలో, ఇప్పటికే తీవ్రంగా ఉన్న వృద్ధుల సమస్యలు, 2050 నాటికి భరించలేని స్థితికి చేరతాయి. నేటి ప్రభుత్వాలు, ప్రజలు, ప్రత్యేకించి వృద్ధుల సంక్షేమ విధానాలను ఎన్నికల లబ్ధికి పరిమితం చేశాయి. ఐక్యరాజ్య సమితి 2021-2030 ని ఆరోగ్య వయోవృద్ధుల దశాబ్దంగా ప్రకటించింది. వృద్ధుల ఆర్థిక, ఆరోగ్య అసమానత లను తగ్గించమని, జీవనస్థాయిని పెంచమని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. 31.03.2021 కి మనదేశంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య 68,62,465. అందులో టెలికమ్యూనికేషన్ పెన్షనర్లు 4,67,751 మంది.
ధరం స్వరూప్ నకారా రక్షణశాఖలో ఆర్థిక సలహాదారు. 1972లో పదవీ విరమణ చెందిన ఆయనకు పెన్షన్ పెరుగుదల ప్రయోజనం ఇవ్వలేదు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ చంద్రచూడ్్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్, ‘‘పెన్షన్, బహుమతి, పారితోషికం, దయతో ఇచ్చే అదనపు ఫలితం కాదు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన ప్రభుత్వోద్యోగి పదవీవిరమణకాల హక్కు. విశ్రాంత ఉద్యోగులు శాంతియుత, గౌరవప్రద జీవితం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలి’’ అని తీర్పిచ్చారు. ఈ చారిత్రక తీర్పు 1982 డిసెంబర్ 17న వెలువడిరది. ఈ రోజును జాతీయ పెన్షన్ దినంగా పాటిస్తున్నాం.
వృద్ధాప్యం శారీరక, ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితులలో వివిధ మార్పులు తెస్తుంది. వృద్ధులను వారి పిల్లలే భారంగా భావిస్తారు. మనుషులు, మానవ వనరులు, దేశ సంపద. వృద్ధుల అనుభవాలను, సామర్థ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు పథకాలు రచించాలి. వారిని ఆర్థిక స్వతంత్రులను చేయాలి. వృద్ధులు బతుకు దెరువులో భాగంగానే యౌవనాన్ని, శక్తిసామర్థ్యాలను, కాలాన్ని సమాజం కోసం, దేశ నిర్మాణం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. వారిని నేటి సామాజిక వ్యర్థపదార్థాలుగా చూడరాదు. ఆ భాద్యత ప్రభుత్వాలదే. వారి నివాసస్థలాల వద్దే ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మానసిక ఆరోగ్య నిర్వహణ సౌకర్యాలు, చికిత్స, ఆర్థిక ఆసరా అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1857లో తన ఉద్యోగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది. భారత పెన్షన్ చట్టం 1871 ద్వారా ఉద్యోగులు అందరికీ పెన్షన్ ఇచ్చింది. 1881లో పెన్షన్ను స్థిరీ కరించింది. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా పెన్షన్ను మెరుగు పరిచింది. ద్రవ్యోల్బణ పరిహారంగా అప్పుడప్పుడు పెన్షన్ను పెంచేది. 1957లో నెహ్రూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ను తప్పనిసరి చేసింది. తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని పాటించాయి. 1981లో కుటుంబ పెన్షన్ సాధించడమైంది. ముందు నిర్ధారిత స్థిర పెన్షన్ పథకం అమలులో ఉండేది. దీని ప్రకారం ఉద్యోగి పొందిన చివరి జీతం ఆధారంగా అందులో సగం సొమ్మును ప్రభుత్వమే పెన్షన్గా చెల్లించేది. వాజపేయి ప్రభుత్వం 01.01.2004 నుండి ఈ పథకం స్థానంలో భాగస్వామ్య పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగి తన మూలవేతనం, అధిక ధరల భత్యంపై 10శాతం చెల్లిస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. (ఇలా జమైన సొమ్మును కంపెనీలలో మదుపుచేస్తుంది.) ఈ మొత్తంలో 60 శాతాన్ని పదవీ విరమణ చెయ్యగానే, 35శాతం సొమ్మును పెన్షన్గా చెల్లిస్తారు. ఈ పథకంలో ఉద్యోగి పెన్షన్ను కొనుక్కున్నట్లు లెక్క. ఇది మార్కెట్ ఒడిదుడుకులపై, ప్రైవేటు మదుపుదార్లపై, సట్టా వ్యాపారంపై ఆధారపడుతుంది. పెన్షన్ తగ్గవచ్చు. లేదా సున్నా కావచ్చు. ఈ పథకంలో ఉద్యోగుల భవిష్య నిధిని కూడా రద్దు చేశారు. ఇటీవలకొన్ని ప్రతిపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ పథకానికి మారాయి. ఒక పెన్షన్ పథకంలో జమైన ఉద్యోగుల పెన్షన్ నిధి సొమ్మును మరొక పథకానికి బదిలీచేయడానికి మోదీ సర్కార్ నిరాకరించింది. దేశం కోసం ప్రాణాలను ఒడ్డే సైనికులకు మోదీ వాగ్దానించిన ఒక పదవి ఒక పెన్షన్ పథకంలో న్యాయం చేయలేదు. అగ్నిపథ్ పథకంతో తాత్కాలిక సైన్యాన్ని సృష్టించి సైన్యానికి పెన్షన్నే ఎత్తేసింది.
మోదీ ప్రభత్వం ఏడేళ్ల నుండి బి.ఎస్.ఎన్.ఎల్. లో పెన్షన్ను సవరించ లేదు. 4వ కేంద్ర వేతన సవరణ సంఘం 1986కు ముందు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పెన్షన్ సవరించాలని సిఫారసు చేసింది. 40 శాతం పెంపుతో పెన్షన్ను సవరించాలని నాటి కేంద్ర ప్రభుత్వం 5వ కేంద్ర వేతన సవరణ సంఘాన్ని ఆదేశించింది. 6వ కేంద్ర వేతన సవరణ సంఘం పెన్షనర్ల వృద్ధాప్యం, వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెరిగే ఆర్థిక భారాలకు అనుగుణంగా 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు 20శాతం అదనపు పెన్షన్, 85 ఏళ్ళకు 30శాతం, 90 ఏళ్ళకు 40శాతం, 95 సంవత్సరాలకు 50శాతం, 100 ఏళ్లు నిండినవారికి 100 శాతం పెన్షన్ సిఫారసు చేసింది. టెలికమ్యూనికేషన్ శాఖ ఉద్యోగులు 01.10.2000 న ప్రభుత్వ రంగ సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్.లో చేరిన తర్వాత, కేంద్ర కరువు భత్యం స్కేల్సుకు బదులుగా పారిశ్రామిక కరువు భత్యం స్కేల్సుపై పెన్షన్ పొందుతున్నారు. 7 వ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 01.01.2016 నుండి 2.57శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో పెన్షన్ను సవరించారు. బి.ఎస్.ఎన్.ఎల్. పెన్షనర్లకు ఇంత వరకు పెన్షన్ సవరించలేదు.
కీ.శే. ప్రఖ్యాతనటులు జయప్రకాశ్రెడ్డి కొత్తసేన అనే నాటకాన్ని ప్రదర్శించే వారు. ఇందులో, వృద్ధులు తమ జీవిత ప్రజ్ఞాపాటవాలను, అనుభవాలను వృద్ధాప్యంలో ఉపయోగిస్తూ, నిర్విరామ జీవితం గడుపుతూ సమాజంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. విశ్రాంత సైన్యాధికారులు హర్షకక్కర్, ఎల్.రామదాసులు విశ్రాంత ఉద్యోగులే ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని సేవలలో ఉన్న శ్రామికులకు మార్గదర్శకం కావాలన్నారు. కార్మిక సంఘాలు వయోవృద్ధుల,పెన్షనర్ల శ్రేయస్సుకూ పని చేయాలి. పెన్షనర్ల సంఘాలు ప్రత్యేకించి బి.ఎస్.ఎన్.ఎల్. పెన్షనర్ల సంక్షేమ సంఘం సరైన దిశలో కృషిచేస్తోంది.
సెల్: 9490204545