Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదోడి ఉపాధికి ఏదీ హామీ

కరవది సుబ్బారావు

పేదోడి ఉపాధికి హామీ రోజురోజుకు మృగ్యమైపోతోంది. గ్రామీణ ప్రాంత చిన్న, సన్నకారు రైతాంగం కోసం, వ్యవసాయ కూలీలు, పేదలకోసం ఏర్పాటుచేసిన మహాత్మగాంధీ ఉపాధి హామీపధకం కోసం కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గిపోవటంతో ఈ పథకం అమలు ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారుతుంది. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో వామపక్షాలు బలంగాఉన్న నేపథ్యంలో వారి వత్తిడి మేరకు అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ తప్పనిస్థితిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా, ఇది 2006 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేని సమయాలలో కూలీలకు పనులు దొరకటం, అలాగే పేద రైతులకు కూడా ఇది ఉపాధి కావటం మంచి పరిణామంగా మారింది. దీనిని ఆసరా చేసుకుని కూలీల కూలి రేట్లు కూడా పెరిగాయి. పనిచేసే కూలీల శ్రమకు డిమాండ్‌ వచ్చింది. పేదలు గౌరవంగా, గర్వంగా తలెత్తుకు తిరిగే రోజులు వచ్చాయి. కూలీల నిత్యావసర వస్తువుల కొనుగోలు శక్తిని పెంచుకోవటంతో పాటుగా తమ పిల్లలకు మంచి విద్యాబుద్దులు చెప్పించేందుకు కొంతమేర వెసులుబాటు దొరికింది. అయితే ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక కుయుక్తులు పన్నింది. అయితే వాటిని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, పేదలతో కలిసి విజయవంతంగా తిప్పికొట్టాయి. కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్న కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది మహాత్మాగాంధీ ఉపాథిó హమీ పథకానికి నిధులు కేటాయింపులు తగ్గిస్తూ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే 2023`24 బడ్జెట్‌లో 33శాతం తగ్గించారు. ఈ పధకానికి 2020`21లో రూ.1.10లక్షల కోట్లు కేటాయించగా, 2021`22లలో రూ.98వేల కోట్లు, 2022`23లో రూ.89.400 కోట్లు, 2023`24లో రూ.60వేల కోట్లు వంతున ప్రతి ఏడాది కోతపెడుతూనే వస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పధకానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. ఈ పధకం ప్రధాన ఉద్ధేశం గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ పనులులేని రోజులలో 100 రోజులపాటు ఉపాధి కల్పించి వారికి కనీస కూలీ ఇవ్వటం. అడిగిన ప్రతి నిరుద్యోగ యువతకు జాబ్‌ కార్డు ఇవ్వటం. కార్డు ఇచ్చిన 15 రోజులలోపు పనులు కల్పించటం, లేని పక్షంలో తిండితో కూడిన ఖర్చుల నగదు ఇవ్వాల్సి వుంది. దీంతో ఈ పధకం ద్వారా ఉపాధి పొందేందుకు యువత పథకం ప్రారంభించిన తొలినాళ్లలో ఉత్సాహంగా పనులలోకి వెళ్లారు.        
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు తగ్గాయి. ఆ తర్వాత కాలంలో యువత చేరిక తగ్గినా, జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏడాదికి యువత ఈ పధకం ద్వారా ఉపాధి పొందేందుకు కొంత శాతం మేర పెరిగింది. ఈ పధకం వల్ల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి నీటి వనరులు పెరిగాయి. మొక్కల పెంపకం ద్వారా వాతావరణ పరిరక్షణ మెరుగుపడిరది. అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో భూగర్భÛ జలాలు పెరిగాయి. 2006లోఈ పధకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు రూ.1.10లక్షల కోట్లు గ్రామీణ పేదలకు నేరుగా వేతన చెల్లింపులు జరిగాయి.2008 నుండి సరాసరిన ఏడాదికి 5 కోట్ల కుటుంబాలకు నేరుగా ఉపాధి కల్పించారు. 80శాతం కుటుంబాలకు బ్యాంకుల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు ఇస్తున్నారు. 10 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసు ఖాతాలు తెరిచారు. పధకం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు వ్యక్తి రోజు సగటు కూలి 81శాతం పెరిగింది. ఈ పథకం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు 33శాతం కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 146లక్షల పనులు చేపట్టగా వాటిలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పధకం ద్వారా ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పధకంలో కాంట్రాక్టు పద్దతిలో ఎఫ్‌ఎలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఎపిఓలు, ఎపిడిలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇసిలు ఎక్కువభాగం ఎస్‌సీ,ఎస్టీ,మైనార్టీ,బీసీి సామాజిక వర్గాలకు చెందిన వారే కావటం విశేషం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో కూడు, గుడ్డ, నీడ అందరికీ కల్పించాలని తెలియజేస్తుంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ 35శాతం మంది ప్రజలు ఒక్కపూటే తిండితిని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. దేశంలోని 40శాతం సంపద కేవలం ఒక్కశాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. 50శాతం ప్రజల చేతుల్లో 3శాతం సంపద మాత్రమే ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలసలు పోతూనే ఉన్నారు. ఉపాధి హామీ పధకం ప్రభుత్వాల అమలులో నిర్లక్ష్యంతో నేటికీ పూర్తిస్ధాయిలో ప్రజలకు ఉపాధి దొరకటం లేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా, పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి హమీ పనులు చేపట్టి నిరుద్యోగ సమస్యను తగ్గించే అవకాశం ప్రభుత్వాలకు ఉంది. అలాగే అందరికి ఉపాధి చూపి పౌష్టికాహారలోపాన్ని కూడా జయించవచ్చు. అలాగే ప్రజలలో కొనుగోలు శక్తిని పెంచవచ్చు. ఇవన్నీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యం. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఉపాధి హామీ పధాకానికి నిధులు కేటాయింపులలో కోతలు విధించి పేదలపై కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది. మనువాదాన్ని ముందుకు తెచ్చి పేదలను మరింతపేదవారిగా మార్చేందుకే కేంద్రం ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పేదలకడుపులు నింపుతున్న ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడాదికి 200 రోజులు పనిదినాలు కల్పించటంతో పాటుగా కనీసం వేతనం పెరిగినా నిత్యావసరవస్తువుల ధరలకు అనుగుణంగా రోజుకు రూ.600 ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పధకాన్ని పట్టణాలకు విస్తరింపజేసి పట్టణప్రాంత ప్రజలకు కూడా ఉపాధి చూపాలి. అలాగే ఉపాధి అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు ఇవ్వటంతో పాటుగా జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 200 రోజులు ఉపాధి చూపాలి. లేని పక్షంలో వారికి నిరుద్యోగ భృతిని అందించాలి. 80శాతం ప్రజలు ఉపాధి పొందుతున్న మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పున:పరిశీలనచేసి పధకానికి నిధుల కేటాయింపు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సెల్‌ : 7893530894

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img