Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పోలవరం గుట్టు విప్పని కేంద్రమంత్రులు

వి. శంకరయ్య

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి లోక్‌సభలో ఒక రకంగానూ రాజ్యసభలో మరోరకంగా కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రులు విరుద్ధమైన ప్రకటన చేశారనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇద్దరు సహాయ మంత్రులు చేసిన ప్రకటనల్లో కూడా అసలు రహస్యం దాచి పెట్టారు. అయితే రాజ్యసభలో మాత్రం కేంద్రమంత్రి వ్యయం పెరగడానికి వక్రభాష్యం చెప్పి అసలు వాస్తవం దాచి పెట్టారు. ప్రాజెక్టు వ్యయం పెరగడానికి భూసేకరణ పరిహారం పునరావాసం వ్యయం పెరగడంగా చెప్పి వాస్తవం వెల్లడిరచలేదు. 2020లో సమావేశమైన సవరణల వ్యయం అంచనాల కమిటీ రెండో డిపిఆర్‌ ఎందుకు ఆమోదించిందనే ప్రశ్నకు ఇద్దరు మంత్రుల్లో సమాధానంలేదు? ఇక్కడే అసలు రహస్యం దాగివుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసీ దాచి పెడుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 2019 ఫిబ్రవరి నెలలో సాంకేతిక సలహా మండలి సమావేశమై 2017-18 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారం రెండవ డిపిఆర్‌ అంచనా వ్యయం 55,548 కోట్లుగా ఆమోదించినది. తదుపరి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అధికారంలోనికి వచ్చింది. వచ్చీ రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కన్నా ముందుగా అందులో అవినీతి వెతకడం కాంట్రాక్టరు మార్పుతో కాలం గడిపింది. కాంట్రాక్టరు మార్పు వద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తిరిగి 2020 లో గాని పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర జల శక్తిశాఖ పట్టించుకోలేదు. 2020లో సమావేశమైన సవరణల వ్యయం అంచనాల కమిటీ రెండు డిపిఆర్‌లు ఎందుకు ఆమోదిం చిందనే అంశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో మంత్రులు చేసిన ప్రకటనల్లో కాగడాపెట్టి వెతికినా సమాధానం లభించదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జ్ఞాపకశక్తి వుండదని భావిస్తున్నారేమో?
2020 లో సమావేశమైన సవరణల వ్యయం అంచనాల కమిటీ 2019 లో కేంద్రమంత్రివర్గం ఆమోదం చూపెట్టి 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 29,027.95 కోట్లని, ఇందులో సాగునీటి వ్యయం 20,027.95 కోట్ల రూపాయల అంచనా వేసింది. ఎందుకిలా జరగిందనేందుకు కేంద్రమంత్రివర్గం 2017లో చేసిన తీర్మానం చూపెట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వం 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్లకే కట్టుబడి వున్నట్లు భావించాలి. అదే సమయంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారం గతంలో సాంకేతిక సలహా మండలి ఆమోదించిన అంచనాను సవరించి 47,725.25 కోట్లు చాలని ఇందులో సాగునీటి వ్యయానికి 35,950.16 కోట్ల రూపాయల అవసరమని రెండు అంచనాలను కేంద్ర ఆర్థికశాఖకు సమర్పించింది. ఇందులో కీలకమైన రెండు అంశాలు ఇమిడి వున్నాయి.
ఒకే సమయంలో సవరణల వ్యయం కమిటీ రెండో డిపిఆర్‌ ఎందుకు రూపొందించింది? ఈ అంశంపై కేంద్ర మంత్రులు నోరు విప్పలేదు. కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సమయంలో 2010-11 నాటి షెడ్యూల్‌ రేట్ల ప్రకారం తొలి డిపిఆర్‌ను 16,010.47 కోట్లు గానూ, ఇందులో సాగునీటి వ్యయం 9,307.34 కోట్ల రూపాయలుగా ప్లానింగ్‌ కమిషన్‌ ఆమోదించిన దరిమిలా పైగా చట్టబద్దతగల జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా రెండవ డిపిఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు? ఇందుకూ సమాధానం లేదు. రెండు చట్టసభల్లో కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాచారంలో రెండవ డిపిఆర్‌ గురించి ప్రస్తావించ లేదు?
వాస్తవంలో సవరణల వ్యయం అంచనాల కమిటీ ఆమోదించిన 2013-14 నాటి అంచనాల మేరకే ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ బిల్లులు చెల్లించుతోంది. అందుకు పెచ్చువున్న బిల్లులను చెల్లించకుండా తిరిగి పంపిన సందర్భాలున్నాయి. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలు పంచుకొంటున్నదనేందుకు ఇంత కన్నా మరొక తార్కాణం అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధాన మంత్రిని కలిసినప్పుడు ప్రస్తుతం 15 కోట్ల రూపాయల (గతంలో పది వేల కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది) రూపాయలు అడ్వాన్స్‌గా అడిగానని ప్రకటన చేశారు. గాని ప్రాజెక్టు ఎన్నిదశలుగా నిర్మించినా ముందుగా రెండవ డిపిఆర్‌ ఆమోదం అడిగినట్లు చెప్పలేదు. ఇప్పుడే కాదు. గతంలో కూడా రాష్ట్రప్రభుత్వం నుండి ఇలాంటి విజ్ఞప్తి చేసిన దాఖలా లేదు. కేంద్ర మంత్రులు కూడా రెండవ డిపిఆర్‌ గురించి మాట మాత్రంగా ప్రస్తావించ లేదు. ప్రాజెక్టు వ్యయం పెరగడానికి భూసేకరణ పునరావాసం నష్ట పరిహారం గురించి చెబుతారే గాని 2020 లో సమావేశమైన సవరణల వ్యయం అంచనాల కమిటీ ఒకే రోజు వివిధ షెడ్యూల్‌ రేట్లతో వేసిన అంచనా ఎందుకు వేసిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి పల్లెత్తు మాట రావడం లేదు.
వాస్తవంలో ఈ రోజుకూ కేంద్ర ప్రభుత్వం 2013-14 నాటి షెడ్యూల్‌ రేట్లకే కట్టుబడి వుంది. ఈ పాటికే దాదాపు 13 వేల కోట్ల రూపాయల ఇచ్చినందున మరొక పదివేల కోట్లరూపాయల ఇచ్చి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 41.15 (135 అడుగులు) కే ఎన్నికలలోపు మమ అనిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడబల్కుని ఈ దుష్ట పన్నాగానికి తెరలేపారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర మంత్రుల సమాధానాల్లో పెద్ద తేడా లేదు. కాకుంటే పోలవరంప్రాజెక్టు ఎత్తుకు గల చట్టబద్దత ఒక మంత్రి వెల్లడిరచారు.
పోలవరం నీటి నిల్వ సామర్థ్యం తగ్గించగలరేగాని ప్రాజెక్టు ఎత్తునిర్మాణం తగ్గించలేరు. ఈ పాటికే స్పిల్‌ వే 150 అడుగుల ఎత్తుతో నిర్మాణం జరిగినందున నదీ గర్భంలో డయాఫ్రమ్‌ వాల్‌ గాని రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గాని ఎత్తుతగ్గించడం కుదరదు. ఈ అంశాన్ని కేంద్ర జల సంఘం ఈపాటికే స్పష్టత ఇచ్చింది. ఈ అంశంలో పోలవరం ప్రాజెక్టుకు దేవుడు స్క్రిప్టు బాగా రాశారు.
పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లకు పరిమితంచేస్తే డెడ్‌ స్టోరేజ్‌ 119 టియంసిలు మాత్రమే మిగులుతాయి. లైవ్‌ స్టోరేజ్‌ 75 టియంసిలు గురించి మరిచి పోవాలి. కుడి ఎడమ కాలువల్లో గ్రావెటి ద్వారా నీళ్లు పారవు. ఇదే జరిగితే ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టి ఉద్థరిస్తామంటున్న వైసిపి నేతలు ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన సుజల స్రవంతి గురించి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్నాటి ప్రాంతానికి చేపట్టిన వైయస్సార్‌ ఎత్తిపోతలు అటకెక్కుతుంది. రాయలసీమ గురించి చెప్పే పనిలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహంలో పాలుపంచు కొని అది చెప్పే అన్నింటికి జగన్మోహన్‌ రెడ్డి తలూపితే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న వారౌతారు. ఈ లొంగుబాటు ఈనాటిది కాదు. 2020 లోనే జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి చెబుతూ డ్యాం సేఫ్టీఅండ్‌ స్టెబిలిటీ ప్రొటొకోల్‌ సిద్ధాంతం చెప్పి వున్నారు.
విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img