(2023 ఫిబ్రవరి 13 నుండి 22 వరకు సీపీఐ నీటిపారుదల ప్రాజెక్టుల పరిశీలన యాత్ర సందర్భంగా)
జి. ఓబులేసు
(నిన్నటి తరువాయి)
హంద్రీ-నీవా ద్వారా మదనపల్లి, కుప్పం, వాయిల్పాడు, తంబళ్లపల్లి లాంటి పట్టణాలకు ఆయకట్టుతోపాటు 351 చెరువులు నింపి సాగునీరిచ్చే విధానాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 17న మదనపల్లి అలాగే గాలేరునగరి ప్రాజెక్టులలో అంతర్భాగమైన కరకంబాడీ, బాలాజీసాగర్ ప్రాజెక్టులను తిరుపతిలో పరిశీలించాము. అదే రోజు సోమశిల రిజర్వాయర్ను సందర్శించాము. 68 టిఎంసిల నీరు గత రెండు సంవత్సరాలుగా సోమశిలలో ఉండినా కొత్త ఆయకట్టు అభివృద్ధిలేదు. పాత ఆయకట్టు కూడా పూర్తిగా నీటిని ఇవ్వలేని పరిస్థితి. 28 మంది లస్కర్లు ఉండాల్సి ఉంటే ఏడుగురి ద్వారానే పనిచేయిస్తున్నారు. అది కూడా 4 నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేని దుస్థితి. 17వ తేదీ పర్యటనలో వెలుగొండ పూలసుబ్బయ్య ప్రాజెక్టుకు వెళ్లి నిర్వాసితుల జనం బాధలను తెలుసు కున్నాము. వెలుగొండ ప్రాజెక్టును 43.50 టిఎంసిల సామర్థ్యంతో 4,47,300 ఎకరాలకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో సాగునీరు, 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు అందించే మహత్తర ప్రాజెక్టు ఇది. ఇందులో మొదటి టన్నెల్ పూర్తయ్యింది. రెండో టన్నెల్ కూడా దాదాపు పూర్తయింది. కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే పెండిరగ్ ఉంది. 11 ముంపు గ్రామాలకుగాను 7గ్రామాలకు నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేయించారు. ఇంకా 3 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడం గానీ, నష్టపరిహారంగానీ ఇవ్వలేదు. 2019 కటాఫ్ డేట్ పెట్టినా ఆలోగా ఇవ్వలేదు. 2019 నుండి 2023కు నిర్వాసితుల వయసు 18 దాటినవారు వచ్చారు. వీరి సమస్య పరిష్కారం కాలేదు. సుంకేసుల, గొట్టిపాడు, కాకర్ల వాసులకు ఒన్టైమ్ సెటిల్మెంట్గా ప్రతి ఒక్కరికి రూ.12.5 లక్షలుగా నిర్ధారించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు రైతులమీద ఆధారపడి జీవించే ఇతర వృత్తుల వారికి కూడా పరిహారం చెల్లించి మిగిలిన 2.5 కిలోమీటర్ల పనిపూర్తిచేస్తే 4.50 లక్షల ఎకరాలు పారుదల కిందకు వస్తాయి. ఫిబ్రవరి 20న పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించడమైనది. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగానే జీవనాడి. కుడి, ఎడమ కాలువల ద్వారా 15లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖ పారిశ్రామికవాడ అవసరాలతో పాటు శ్రీకాకుళం వరకు అనేకగ్రామాలకు తాగునీరుఅందించే గొప్ప ప్రాజెక్టు. 950 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. యుపీఏ ప్రభుత్వకాలంలోనే జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించినా కావలసిన నిధులు ఇవ్వనందున ప్రాజెక్టు నత్తనడక నడుస్తూ వచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నిధులు సమకూర్చి పూర్తిచేయాలి. 2014 నుంచి నేటి వరకు కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. 16 వేల కోట్ల నుండి సవరించిన అంచనాలతో రూ.55 వేల కోట్లకు చేరింది. కేంద్రం భూ సేకరణ సమస్య, నిర్వాసితుల సమస్య మాది కాదు అంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. సర్వేల పేరుతో ఇన్స్పెక్షన్ పేరుతో ప్రతి సందర్భంలో కొర్రి వేస్తున్నది. సవరించిన అంచనాల మొత్తాన్ని కేంద్ర జలవనరుల శాఖ, ప్రాజెక్టు అధారిటీ అంగీకరించినా ఒప్పుకోవడం లేదు. నిర్వాసితులకు రూ.28 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. గోరుచుట్టుపై రోకలి పోటులా డయా ఫ్రం వాల్ 2020లో డ్యామేజీ అయ్యిందని అది ఏ స్థాయిలో దెబ్బతింది? పాక్షికంగా మరమ్మత్తులు చేయాలా? లేక పూర్తిగా పాడయ్యిందా తేల్చాలి. పూర్తిగా దెబ్బతిందని తేలితే రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్లు మళ్లీ డయా ఫ్రం వాల్ నిర్మించాలి. పోలవరంలో పనులు డిసెంబర్ నుండి జూన్ వరకే జరుగుతాయి. జూన్ తరువాత వరదలు ఒకటికి రెండుసార్లు వచ్చి పనులు జరగవు. కోవిడ్కు ముందు 30 వేలమంది కార్మికులు పనులు చేస్తూ ఉంటే, కోవిడ్ వల్ల 6, 7 వేలకు తగ్గిపోయారు. మళ్లీ ఈ మధ్య 17 వేల మంది వరకు కార్మికులు అందుబాటులోకి వచ్చారు. 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంది. ఇవన్నీ అధిగమించి ప్రాజెక్టు పూర్తికావాలంటే గతంలో ఇరిగేషన్ మంత్రులు చెప్పినట్లు 2018
21 పూర్తి చేస్తామనే మాటలు డొల్ల అని తేలుతుంది. ప్రస్తుతానికి కుడి మెయిన్ కాలువ 177.9 కిలోమీటర్లకుగాను 157.510 కిలోమీటర్లు లైనింగు, 255 స్ట్రక్చర్స్కుగాను 209 పూర్తయ్యాయి. అలాగే ఎడమ మెయిన్ కెనాల్ 210.928 కిలోమీటర్లకుగాను 185 కిలోమీటర్లు ఎక్స్కవేషన్ పూర్తయ్యింది. 210.928 కిలోమీటర్లకుగాను 128.595 కిలోమీటర్లు లైనింగు పూర్తయ్యింది. 453 స్ట్రక్చర్స్కుగాను 166 మాత్రమే పూర్తయ్యాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తిగా ఉత్తరాంధ్రకు ఉద్దేశించింది. నాయకులెవ్వరూ ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడడం లేదు. ఏతావాతా ప్రాజెక్టులో అన్ని రకాల పనులు సగటున ఇప్పటికి 68శాతం మాత్రమే పూర్తయినాయి. మొత్తం కుడి, ఎడమ కాలువలు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం, ఆర్Êఆర్ ప్యాకేజీ సంపూర్ణంగా ఎత్తు తగ్గించకుండా ఇవ్వడానికి ఇంకెంతకాలం పడుతుందో, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని అగమ్యగోచర పరిస్థితి.
ఫిబ్రవరి 21, 22 తేదీలలో ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించాం. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద మహేంద్రతనయ నదిపై అఫ్షోర్ వంశధార నది పైన, హీరమండల రిజర్వాయర్ను నాగావళి నీటి ప్రవాహంతో నిర్మిస్తున్న తోటపల్లి రిజర్వాయర్లను చూడడం జరిగింది. వంశధార ప్రాజెక్టు 16.5 టిఎంసిలలో నిర్మించాలని భావించినా నేటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాతపట్నం, శ్రీకాకుళం, పాలకొండ తాలూకాల్లో 204 గ్రామాలకు తాగునీరు, 1.70 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. తద్వారా కళింగ ఆంధ్రాలో వలసలు నివారించవచ్చు. మొదటి, రెండవ దశలు అసంపూర్తిగానే ఉన్నాయి. నెల్లిమర్ల దగ్గర తారకరామ తీర్థ సాగర్ను 24,710 ఎకరాల ఆయకట్టుతోపాటు 8172 ఎకరాల స్థిరీకరణ చేయవచ్చని రూ.181.50 కోట్ల అంచనాతో 2008కి పూర్తిచేయాలని నిర్ణయించినా నిధులు ఇవ్వనందున నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించడంతో 2014లో సవరించిన అంచనాలవల్ల రూ.475 కోట్లకు పెంచారు. ప్రస్తుతం రూ.740 కోట్లకు అంచనా పెంచారు. ఇది పూర్తయితే 49 గ్రామాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు సరఫరా చేయవచ్చు. ప్రస్తుతం ఆరు సంవత్సరాలుగా పనులు జరగక ప్రాజెక్టు నిర్మాణం అటకెక్కింది. ఇక బాబూ జగ్జ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్నట్లు ఉంది. అనకాపల్లి దగ్గర తాళ్ళపాలెం కాలువ పనులు కొద్దిగా జరిగినా అక్కడి నుంచి భూ దేవీ రిజర్వాయర్కు కాలువనే తవ్వలేదు. ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కిందకు వస్తుంది. ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తికావడంపైనే ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, త్రాగునీరు, పారిశ్రామిక కేంద్రాలకు నీటి కొరత తీరుతుంది. తుంగభద్ర డ్యాం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వరకు 8 రోజులపాటు రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత సీపీిఐ ప్రతినిధి బృందానికి జనం నుండి, నిర్వాసితుల నుండి ఎదురైన ప్రశ్నలు, సందేహాలను ఆయా ప్రాజెక్టుల వారీగా ఇంజనీరింగ్ అధికారులతో చర్చించాము. అధికారులతో చర్చించిన మీదట సీపీిఐ తన నిర్దిష్ట ప్రతిపాదనను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెస్తున్నది.
మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సింహభాగం నిధులను నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించి ఖర్చు చేయడం ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలి. అలాగే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు కేంద్రంపై ఒత్తిడిపెంచి, పోలవరానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేటట్లు చేయాలి. రాయలసీమ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే అప్పర్ భద్ర నిర్మాణాన్ని నిలువరించాలి. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కొరకు సాధించేవరకు ఉద్యమించాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కొరకు పోరాడాలి. ఈ కర్తవ్య నిర్వహణలో సీపీిఐ ముందు వరసలో ఉంటుందని, అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి. (గమనిక: నిన్నటి సంచికలో వచ్చిన దశాబ్దాల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం సీమ ప్రాజెక్టులు వ్యాసంలో హంద్రినీవా ప్రాజెక్టు నీటి ద్వారా 62,500 ఎకరాలకు రావలసిన నీటికి బదులుగా 6లక్షల 2500 ఎకరాలకు అని చదువుకోగలరు `సం॥)
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు