Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచంలో దైవభావన తగ్గుతోందా?

డాక్టర్‌ దేవరాజు మహారాజు

డాక్టర్‌ దేవరాజు మహారాజు మనదేశంలో ఉన్న హేతువాదులు, నిరాశ్వరవాదులు, మానవతావాదులు సంతోషించాల్సిన విషయం ఒకటుంది. ‘‘గ్లోబల్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ రిలిజియసిటీ’’ లండన్‌ ప్రకటన 2005 ప్రకారం.. దైవ భావన, దైవ భీతితో ఉన్నవారు మన దేశంలో 87శాతం, మళ్లీ అదే సర్వే 2013లో జరిపినప్పుడు వచ్చిన ఫలితం 81శాతం. అంటే సుమారు ఏడెనిమిదేళ్లలో ఆరు శాతం మంది మన దేశ ప్రజలు దైవభావనలోంచి బైటపడి, ఆత్మ విశ్వాసంతో మానవతా వాదులుగా మారారన్నమాట! ఇప్పుడున్న పోప్‌, పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తర్వాత తాజా సర్వే ప్రకారం వియత్నాంలో 23శాతం, స్విట్జర్లాండ్‌లో 21శాతం, దక్షిణాఫ్రికాలో 19శాతం, అర్జెంటీనాలో 8శాతం మత విశ్వాసకులు తగ్గిపోయారు. అంటే అక్కడ హేతువాదుల సంఖ్య పెరిగినట్టే కదా? అయితే ఇందులో ఎటూ తేల్చుకోలేక తటస్థంగా ఉండేవారు కూడా కొంతమంది ఉండొచ్చు. ఏమైనా దైవభీతిలోంచి బైటపడాలన్న వారి నిర్ణయం ఆహ్వానించ దగిందే! తీవ్రవాదానికి కేంద్ర బిందువుగాఉన్న పాకిస్థాన్‌లో మాత్రం ఫలితం వేరుగా ఉంది. అది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. పాకిస్థాన్‌లో మతోన్మాదులు గతం కన్నా ఇప్పుడు ఆరుశాతం పెరిగారు. మరో విషయమే మంటే మన పక్కనేఉన్న చైనాలో తన జనాభాలో సగం మంది ఇప్పుడు నాస్తికులని తాజా సమాచారం. అంటే మన దేశంలో నిరీశ్వరవాదులు 19శాతమైతే, చైనాలో 50శాతం మన్నమాట! ఈ లెక్కలిలా బేరీజు వేసుకోవడమెందుకంటే, మన వెనకబాటు తనాన్ని మనం అంచనా వేసుకుని వైజ్ఞానిక పథంలోకి అడుగు వేయాడానికి! శాస్త్ర సాంకేతిక రంగాలో చైనా, అమెరికాతో పాటు పడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది.ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమంటే, దేవుణ్ణీ, మత విశ్వాసాల్నీ, మూఢ నమ్మకాల్ని పక్కనపెడితే పురోగమనం సాధ్యమని తెలుస్తోంది కదా? 2011 నాటి యుకె జనాభా లెక్కల ప్రకారం అక్కడ క్రైస్తవులు 58.5శాతం. అయితే, ఆ తరువాత స్థానం మతం లేని మానవతావాదులది! ఇక వరుసగా మిగిలిన స్థానాలన్నీ ఇతర మత విశ్వాసాలున్న వారివి. అలాగే అమెరికాలో జరిగిన సరికొత్త సర్వే ప్రకారం, మత విశ్వాసాల్ని పక్కన పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అది 4.9శాతం ఉంది. ఎందుకు మత విశ్వాసాల్ని పక్కన పెడు తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అది అడిగినప్పుడు చాలామంది చాలా రకాలుగా సమాధానా లిచ్చారు. అయితే అన్ని సమాధానాల సారాంశం ఒక్కటే! ఇంగిత జ్ఞానం వల్ల దేవుణ్ణి నమ్మడం లేదని కొందరంటే, లాజిక్‌ వల్ల నమ్మడం లేదని కొందరన్నారు. ముఖ్యంగా సైన్సు అర్థం చేసుకోవడం వల్ల, దైవ భావన పట్ల విశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది అని ఎక్కువ మంది చెప్పారు. మహిమలు, అద్భుతాలు సైన్సు పరీక్షలకు నిలబడవు. అందువల్ల ఏ దేవుణ్ణి నమ్మినా ఏమీ ఫలితం ఉండదు. కేవలం మనల్ని మనం నమ్ముకుంటే చాలు అన్న అభిప్రాయం అధిక సంఖ్యాకుల్లో కనిపిస్తోంది. కుటుంబంలో వారసత్వ కారణాల వల్ల బాల్యంలో మత విన్యాసాలు ఉంటే ఉండొచ్చు కానీ, యవ్వన దశకు వచ్చేసరికి ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రపంచాన్ని చూడడం, తోటి మనుషులతో వ్యవహరించడం, కళాశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ముఖ్యంగా జీవ పరిణామ సిద్ధాంతం పట్ల ఆకర్షితులు కావడం, దేవుడి పుట్టుకకు ఆధారాలు లేకపోవడం, దేవుడు మనుషుల్ని సంరక్షిస్తున్నాడనడానికి రుజువుల్లేకపోవడం ప్రశ్నలూహేతువాదమూ రంగంలోకి రాగానే, మనుషుల మనసుల్లో మత విశ్వాసాలు ఇగిరిపోవడం, ఎగిరిపోవడం జరుగుతూ వస్తోందన్నది సారాంశం. ప్రపంచంలోని ఎక్కువ దేశాలలో పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. అంతర్జాలంలో కావల్సినన్ని సర్వే రిపోర్టులున్నాయి. కావల్సిన వారు వెతుక్కుని విషయం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం నిస్షందేహంగా రాబోయే కాలాల్లో పుక్కిటి పురాణాల్ని, కట్టు కథల్ని నమ్ముతూ బతికే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇంట్లో కనబడే దేవతలుగా చెప్పుకొనే అమ్మానాన్నల సలహా సంప్రదింపులు లేకుండానే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్న నేటి తరం…ఇక అసలే కనబడని, ఏ ప్రభావమూ చూపని దైవశక్తి బీద ఆధారపడతారా? సమా జం పరిపక్వ దశకు వస్తున్న కొద్దీ, జనంలో స్వయం ప్రతిపత్తి, ఆత్మ విశ్వాసం పెరుగుతంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మార్పును ఆపడం ఎవరి వల్లా కాదు. కాని, వైజ్ఞానిక దృష్టి కోణం లోంచి రాగల తరాల్ని మానవతా వాదం వైపు మళ్లించ గలిగితే…ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుంది.
‘‘ఒకరి పుట్టుకను, జాతిని ఎద్దేవా చేయడంలో హేతుబద్ధత లేదు. అది అంగీకారం కాదు. కానీ, అతని మత విశ్వాసాల్ని విమర్శించే హక్కు ఇతరులకు ఉంటుంది. అది అంగీకారమే! పుట్టిన ఏ శిశువుకూ మతం ఉండదు. పుట్టిన తర్వాత చుట్టూ ఉన్నవారు దాన్ని అంటగడతారు కదా! ఈ సమాజంలో స్వేచ్ఛగా భావాల్ని వ్యక్తీకరించుకోవచ్చు. విమర్శించొచ్చు. అభినందించొచ్చు…అన్నీ మాట్లాడొచ్చు కానీ, మత విశ్వాసాల గురించి మాట్లాడొద్దు అని నియమావళి రూపొందిస్తే అది పెద్ద పొరపాటు. ఇక అదేం స్వేచ్ఛ?’’ అని అంటాడు మిస్టర్‌ ‘బీన్‌’ గా ప్రసిద్ధుడైన, సినీ రచయిత, బ్రిటీష్‌ రచయిత రోవన్‌ అట్‌కిన్‌ సన్‌..! మత వ్యతిరేక బిల్లుపై తన స్పందనను తెలియజేస్తూ అసలైతే, భారతదేశం మూఢ నమ్మకాల విష వలయంలో చిక్కుకుని పైకి తేరుకోలేని స్థితిలో ఉంది. బాబాలని, జ్యోతిష్యాలని, వాస్తులని, స్వామీజీలని నమ్మి ఈ దేశం ముందుకు నడుస్తున్నాననుకుంటోంది. కష్టించి పనిచేయలేని కొందరు రాసిన కొన్ని కథలని మూర్ఖంగా నమ్ముతూ, స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పయి అజ్ఞానంతో బతకడానికి సిద్ధపడుతూ ఉంది. ‘‘చదువురాని నిరక్షరాస్యుల కంటే చదువుకుని అజ్ఞానంతో బతుకుతున్న మూర్ఖులతోనే ఈ దేశానికి చాలా ప్రమాదం’అని బాధ్యత గల మేధావులంతా ఆవేదన చెందుతున్నారు. జ్యోతిషం బూటకం అని నోబెల్‌ విజేత ప్రొఫెసర్‌ వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ ప్రకటిస్తే, అది మన జనం చెవికెక్కదు. ఆయనేమి మిడిమిడి జ్ఞానంతో చెప్పిన విషయం కాదు గదా? స్ట్రక్చురల్‌ బయాలజీలో విశేషమైన కృషి చేసి, నోబెల్‌ సాధించిన మేధావి కదా? మన పిచ్చి జనం ఎలా ఉన్నారంటే టెన్‌తో, డిగ్రీయో ఫెయిలయిన వాడు చెప్పే మాటలు నమ్ముతారు. ఏదో ఆఫీసులో క్లర్కుగా పనిచేసి, రిటైరయ్యాక ప్రవచానాలు చెప్పుకు తిరిగేవాణ్ణి నమ్ముతారు. భక్తి ముసుగులో వాళ్లు మూఢత్వం ప్రచారం చేస్తున్నారన్న విషయం గ్రహించరు. ప్రొఫెసర్‌ వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ ఒక ప్రకటనలో ఏం చెప్పారంటే ‘‘వివిధ రకాల భావ దారిద్య్రాలతో మగ్గుతున్న ప్రజలను మంచి పాలనా వ్యవస్థ గల ప్రభుత్వాలు మాత్రమే రక్షించగలవని, సంకుచితత్వం, అశాస్త్రీయ భావనల్లోంచి మనిషిని రక్షించే క్రమ పరిణామమే వైజ్ఞానిక శాస్త్రమని… అది కాల పరీక్షలకు తట్టుకుని నిలబడిరదని’’అభివర్ణించారు. ప్రస్తుతం కేంబ్రిడ్జి యూనివిర్శటీ, బ్రిటన్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ జ్యోతిషం, రసవాదం, వాస్తు శాస్త్రాలు ఎంత మాత్రమూ భారతీయ జ్ఞాన సంపద కావు’’ అని కొట్టి పారేశారు. ‘విశ్వాసాలు జనాన్ని విడదీస్తాయి. ప్రశ్నలు కలుపుతాయి’ అని అన్నాడు సర్‌ పీటర్‌ అలెగ్జాండర్‌ ఉత్సినోవ్‌, బ్రిటీష్‌ రచయిత, నటుడు, దర్శకుడు. అలాంటి భావనలతోనే కాబోలు విశ్వ జనుల్లో చాలామంది మత విశ్వాసాల్లోంచి బయటపడి, స్వేచ్ఛాలోచన వైపు దృష్టి మరలుస్తున్నారు. మన దేశ గణాంకాల ప్రకారం నిరీశ్వరవాదుల లెక్కలేవీ ఉండవు. కానీ 2015 లో విడుదలైన 2011 నాటి గణాంకాల ప్రకారం మన దేశంలో మూడు కోట్ల మంది తమకు ‘మతం లేదు’ అని ప్రకటించిన వారున్నారు. అంటే ఇందులో హేతువాదులు, నాస్తికులు, మానవతావాదులు ఉన్నట్టు కదా? 2006లో డెంట్యూ కమ్యూనికేషన్‌ ఇనిస్టిట్యూట్‌, జపాన్‌ పరిశోధనా కేంద్రం జరిపిన వరల్డ్‌ వాల్యూ సర్వే ప్రకారం 6.6 శాతం భారతీయులు తమకు మతం లేదని ప్రకటించుకున్నారు. విన్‌ గాలప్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ రిలిజయన్‌ అండ్‌ ఎథీజమ్‌` ప్రకారం భారత్‌లో మత విశ్వాసం లేనివారి శాతం 13 శాతానికి పెరిగింది.
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img