Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రమాదంలో జీవవైవిధ్యం

పంటలలో వైవిధ్యత ఉంటే భూములు బాగుంటాయి, వంటలలో వైవిధ్యత ఉంటే మనుషులు బాగుపడతారు. జీవ సమాజంలో జీవులమధ్య ఉన్న విభిన్నతను జీవ వైవిధ్యం అంటాము. జీవుల సంఖ్య, భిన్నత్వం, మార్పు చెందే తత్వాలన్నీ జీవవైవిధ్యానికి సంబంధించినవే. జీవన వైవిధ్యం ప్రధానంగా జన్యుపరమైన, జాతిపరమైన, ఆవరణ వ్యవస్థల జీవన వైవిధ్యం. ప్రకృతిలో సహజంగా, కాలానుగుణంగా వచ్చిన మార్పులవలన కొన్ని జాతులు అదృశ్యమై, మరికొన్ని కొత్తజాతులు ఆవిర్భవిస్తాయి. ప్రస్తుతం ప్రకృతిలో వస్తున్న మార్పులను తట్టుకోలేక ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. దీనికి ప్రధాన కారకుడు మానవుడు. మానవుడు జరిపే ప్రకృతి ప్రతికూల చేష్టలవలన ఏటా కొన్ని వందలజాతులు అంతరించి పోతున్నాయి. ప్రధానంగా భౌగోళిక, జీవావరణమార్పుల వలన ఇప్పటివరకు ఐదుసార్లు జీవవైవిధ్యం చాలావరకు అంతరించిపోయింది. మళ్లీ పరిణామం చెందుతూ వచ్చింది. ఇదంతా అనేక లక్షలఏళ్ల కాలంలో జరిగింది. దాదాపు 350 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతా వ్యాపించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి తద్వారా మానవ జనాభా 18 రెట్లు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో సగటు జీవనప్రమాణాలు మెరుగుపడి మానవుడు అవసరాలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన ఆ అవసరాలనిమిత్తం సహజ వనరులు మట్టి, నీరు, గాలి, జంతు, వృక్షజాతులను అస్థిరమైన పద్ధతిలో వినియోగించుకుని పర్యావరణాన్నీ, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ‘మానవ చర్య’ అణుయుద్ధం కన్నా తీవ్రమైనదని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఒక జాతి నశిస్తే మనిషి దాన్ని తిరిగి సృష్టించలేడు. జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలుఇచ్చే 90శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటిమీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులునశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఏటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా అనేకచోట్ల పంటలదిగుబడి తగ్గుతున్నదని అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత అంటే ప్రకృతి వనరులనే కాకుండా, అమూల్యమైన జంతుజాలాన్ని కాపాడుకోవడం. జీవ వైవిధ్యం జాతీయ సంపదకు సూచిక. మానవ వికాసానికి చోదకశక్తిగా పనిచేస్తుంది. ప్రపంచంలో 2.3శాతం భూభాగంలో 12శాతం జీవ వైవిధ్య జాతులకు నిలయంగా ఉన్న భారత్‌లో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 60శాతం ఉభయ చరాలు, 47శాతం సరీసృపాలు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి. కొన్ని జీవరాసులు నశించినా వాటి ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. దాంతో పర్యావరణం దెబ్బతిని ఆ దుష్ఫలితం మనుషుల మీద పడుతుంది. ఏ దేశంలోనైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. జీవవైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం అడవులపై మనిషి దృష్టిపడటమే. అడవుల్లో అణువిద్యుత్‌ కేంద్రాలు, ఖనిజాల తవ్వకం జరగటం వల్ల జంతుజాలం కనుమరుగవు తున్నది. ప్రతి జీవికి జీవించే హక్కున్నది. కానీ ఇష్టాను సారంగా చేపలు, ఇతర జంతువులవేట, మితి మీరిన ప్లాస్టిక్‌వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం యంత్రాలవాడకం, శిలాజఇంధనాలను మండిర చడం, గనుల తవ్వకం, కర్బన ఉద్గారాలు జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధానకారణాలు.మనిషి మనుగడకు కీలకమైన జీవవైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలగురించి ఒకసారి సమీక్షించు కుందాం. 

ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. మానవ అవసరాలు, పరిశ్రమలు, నివాస గృహాల కోసం అడవులను నరికి వేయడం, సహజ ఆవాసాలను మార్చడం సర్వసాధారణమైంది. దీనితో వృక్ష, జంతుజాతులు అంతరించి పోతున్నాయి. జీవ సంపద తగ్గిపోతుంది. పరిశ్రమలు, వాహనాల వలన వాతావరణంలోకి, నీటిలోకి అనేక హానికర రసాయనిక పదార్థాలు చేరి వృక్ష, జంతుజాతుల మనుగడకు ముప్పుఏర్పడిరది. వ్యవసాయంలో వాడే క్రిమి సంహారక, కలుపు నివారణ రసాయన మందులు, రసాయన ఎరువులు, భారీ రసాయన మూలకాల వలన వాతావరణ, భూమి, నీటి కాలుష్యం జరిగి అనేక వృక్ష, జంతుజాతుల మనుగడకు ప్రమాదంసంభవిస్తున్నది. సునామీలు, తుపానులు, వరదలు, భూకంపాలు, అడవులకు నిప్పు పెట్టడం, అగ్నిపర్వతాల వలన సహజ ఆవాసాలు దెబ్బతిని జీవవైవిధ్యం తగ్గుతున్నది. విదేశీ జాతులతో ఇది సంభవిస్తున్నది. వాటిని తేవడంవలన స్థానికజాతులకు ప్రమాదం సంభవిస్తుంది. ఉదా:పార్థీనియం, తుంగ, గరిక, లంటానా, ఐకొర్నియా, ప్రోసోపిస్ప్రకు చెందిన జాతులు స్థానిక జాతుల వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఇవే జీవ కాలుష్యకాలు. అందుకే ప్రపంచదేశాలు కలిసికట్టుగా జీవవైవిధ్యం సంరక్షణ చేపట్టాలి. జీవ సంపద, వాటి వనరులను ప్రస్తుత అవసరాలకు తగినంత ఉపయోగించుకొని భావితరాలకు కూడా లభించే విధంగా కాపాడటాన్ని జీవవైవిధ్యసంరక్షణ అంటారు. ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవ వైవిధ్యం కలిగిన దేశం. ప్రపంచంలో 2.5శాత భౌగోళిక వైశాల్యం కలిగి, 7.8శాతం వైవిధ్యం ఇక్కడ ఉంది. 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. 1982లో జాతీయ వన్యమృగ బోర్డును ఏర్పరిచారు. వన్య మృగ సంరక్షణ సవరణచట్టాన్ని 2006 ఆమోదించారు. 2002లో జాతీయ జీవవైవిధ్య చట్టంచేశారు. 2003 అక్టోబర్‌ 01 తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం కిందకు జాతీయ జీవవైవిధ్య అధారిటీ, జాతీయ జీవవైవిధ్య బోర్డు, జీవవైవిధ్య నిర్వహణకమిటీ వస్తాయి. జాతీయ జీవవైవిద్యం ప్రాధికారసంస్థ ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ వాతావరణం, అడవుల మంత్రిత్వశాఖ, ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
జాతీయ జీవవైవిధ్య అధారిటీ సంస్థనూ చట్టబద్ధ హోదాతో చెన్నైలో 2003లో ఏర్పాటు చేశారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలి. తృణధాన్యాలు పండిరచి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట మార్పిడి అంటే మట్టి ఆరోగ్యాన్ని మెరుగు పరచి, సారవంతం చేసి తెగుళ్లు, కలుపు సమస్యలను అదుపులో పెట్టడానికి ఒకే భూమిలో వివిధ రకాల పంటలను వరుసగా పండిరచడం. పంట మార్పిడి చేయడం ద్వారా పొలంలో తెగుళ్ళు,ు చీడ పీడలు వృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తీవ్రతను తగ్గిస్తుంది తద్వారా పంట నష్టం అంతగా ఉండదు. పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము వంటి పంటల్ని వేసుకోవడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీనివల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. రైతులు అధిక దిగుబడి, లాభాల కోసమో వేసిన పంటనే మళ్లీ వేస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పక్కవారు అదే పంట వేస్తున్నారని వేసిన పంటే మళ్లీ మళ్లీ వేస్తూ ఉంటారు. ఇక ఒకే పంటకు ఎక్కువ రేటు ఉందని అదే పంట ప్రతి ఏడాది వేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. పంట ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, దీనిపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేది, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలని వారి సలహా. వైవిధ్యంతో కూడిన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆరోగ్యానికి దరిదాపుగా 40 రకాలు అయిన చిన్న పోషకాలు కావాలి. ఏ ఒక్క తరహా ఆహారమూ వాటిని ఇవ్వలేదు. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పదార్థాలు శాకాహారులు కాకుంటే మాంసం ఉత్పత్తులయిన చేపలు, చికెన్‌, ఇతర మాంసకృత్తులు, అలాగే తృణధాన్యాలు వంటివి. ఈ తరహా ఆహారాలను, ఏ మోతాదులో తీసుకోవాలి అనేది మనిషికి అవసరం అయ్యే కేలరీలస్థాయినిబట్టి వుంటుంది. సాధ్యమైనంత ఎక్కువగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. సమతుల శరీర బరువును కొనసాగించాలి. శరీరం బరువు ఎంత వుండవచ్చుననేది, అనేక అంశాలపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు: మీరు పురుషులా, స్త్రీలా, ఎత్తు, వయస్సు, వారసత్వం లేదా జన్యువుల వంటి అంశాలు ప్రధానమైనవి. స్థూలకాయం వలన పలు వ్యాధులు రావచ్చు. రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం, కొన్నిరకాల క్యాన్సర్లు మొదలైనవి చెప్పుకోవచ్చును. శరీరం వుండాల్సినంత బరువును కలిగి లేకపోవడం కూడా ప్రమాదమే. దీనివలన: ఎముకల సమస్యలు, రుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చును. క్రమం తప్పని వైద్యం కూడా శరీర బరువును తగిన స్థాయిలో ఉంచుకోగలిగేటందుకు ప్రధానం. వైవిధ్యంతో ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఒక్క ఆహార పదార్థాన్ని శృతిమించి తీసుకోకుంటే, భిన్నమైన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా, తీసుకోగలుగుతారు. భారత ప్రభుత్వం జీవవైవిధ్య చట్టానికి అనుగుణంగా జిల్లాల్లో జీవ వైవిధ్య మండళ్లు ఏర్పాటు చేయాలి. జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగానికి సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, జీవ వనరుల వినియోగం ద్వారా సమకూరే ప్రయోజనాల న్యాయబద్ధ పంపిణీ మొదలైనవి జీవ వైవిధ్య మండలి ప్రధానఉద్దేశం. దేశంలో వివిధవ్యవసాయ వాతావరణప్రదేశాలలో సంప్రదా యకంగా సాగుచేసే పంటల రకాలను పునరుద్ధరించడం, ప్రోత్సహించడం, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, సేంద్రియ వ్యవసాయం, నగర సుందరీకరణ, నగర జీవవైవిధ్య సూచిక తయారు చేయడంవంటి విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జీవవైవిధ్య మండలి బాధ్యత.
డాక్టర్‌ ముచ్చుకోట సురేష్‌బాబు, ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img