Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఫ్యాక్టరీల చట్ట సవరణ దుర్మార్గం

తమిళనాడు అసెంబ్లీ ఫ్యాక్టరీల చట్టం(1948) సవరణ బిల్లును 2023 ఏప్రిల్‌ 21న ఆమోదించింది. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టానికి ఇదే ఫ్యాక్టరీల (కర్నాటక సవరణ) బిల్లు, 2023 అనే పేరుతో ఫిబ్రవరి 24న ఆమోదించిన కర్నాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ధైర్యం ఇచ్చింది. సవరించిన చట్టాల ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎలాంటి ఓవర్‌ టైం చెల్లింపులు లేకుండానే కార్మికుల పనిగంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తాయి. కర్మాగార యజమానులు కార్మికులను గతంలో మూడు నెలల్లో 75 గంటల ఓవర్‌టైం బదులు 145గంటలవరకు పనిచేయిస్తారు. ఈ చట్టంవలన రాత్రిషిఫ్టులలో మహిళలు పని చేయవలసివస్తుంది. ఈ సవరణలన్నీ శ్రామికప్రజల దోపిడీకి దారితీస్తాయి. అందుకే ఆ సవరణలను తమిళనాడు కార్మికులు ఆగ్రహంతో ఖండిస్తున్నారు. ఏప్రిల్‌ 21 తర్వాత వివిధ కార్మిక సంఘాలు తమిళనాడు అంతటా ఈ సవరణలకు వ్యతిరేకంగా నిరసన చర్యలను ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణను రద్దు చేయకుంటే మే12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెచేస్తామని ప్రకటించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎం ఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐసీసీటీయూ, వర్కింగ్‌ పీపుల్స్‌ కౌన్సిల్‌, ఎంఎల్‌ఎఫ్‌, ఎల్‌ఎల్‌ఎఫ్‌ తొమ్మిది కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళనలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. చెన్నై నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ మే డే పార్క్‌లో మహిళా వర్కర్స్‌ యూనియన్‌ బ్యానర్‌లో వందలాది మంది బట్టల తయారీ మిల్లుల కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆగ్రహం, ఐక్య వ్యతిరేకత వివిధ రాజకీయ పార్టీలపై చాలా ఒత్తిడితెచ్చింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని అనేక రాజకీయపార్టీలు, సంస్థలు కూడ ఉపసంహరించు కోవాలని ఉమ్మడి మెమోరాండం ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. చివరగా ఏప్రిల్‌ 24న, తమిళనాడు ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలచట్టం(1948) సవరణ అమలును నిలిపివేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించవలసి వచ్చింది. నాలుగు లేబర్‌కోడ్‌లను బలవంతంగా అమలులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దేశవ్యాప్తంగా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వాటి అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వివిధ చట్టాలను సవరిస్తున్నాయి. కార్మిక చట్టాలు, ఫ్యాక్టరీల చట్టాలను సవరణలు చేయడం వల్ల పెట్టుబడిదారులు శ్రమ దోపిడీకి పాల్పడతారు. ప్రైవేటు, ప్రభుత్వరంగ కార్మికులసంఘాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో 8గంటల పనిదినంహక్కును నెల కొల్పేందుకు కార్మికులు చేసిన పోరాట చరిత్రను గుర్తు చేశారు. 1936లో పుదుచ్చేరిలో, 1947లో దేశవ్యాప్తంగా 8 గంటల పనిదినాల పరిమితిని అమలు చేశారని, అనేక త్యాగాలతో రక్షించుకోవాలని మన పూర్వీకులు సాధించారని కార్మికులు గుర్తించాలి. కష్టపడి సాధించిన ఈ హక్కును సమర్థించుకోవాలని శ్రామిక ప్రజలందరికీ ఆ ప్రకటన పిలుపునిచ్చింది. తమిళనాడులో కార్మికుల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం వెనుకంజ వేసి తాత్కాలిక విజయం సాధించినప్పటికీ, సవరణ ఉపసంహరించుకోలేదనేది వాస్తవం. కాబట్టి కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. సవరణపై స్టే విధించడం అంటే ప్రభుత్వం తన లక్ష్యాన్ని మార్చుకుందని అర్థం. కార్మికఐక్యతను మరింత పటిష్టం చేసుకోవడానికి కార్మికులు ఈ కాలాన్ని ఊపిరిగా ఉపయోగించు కోవాలి. సవరణలు తక్షణం అమలు కాకుండా, ప్రభుత్వరంగ కార్మికులు ప్రైవేట్‌రంగ కార్మికులతో చేతులుకలపాలి. కార్మికచట్ట సవరణలరూపంలో కార్మిక హక్కులపై దాడులను, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం పోరాటంలోభాగం. రాజకీయ, కార్మిక సంఘాల విభేదాలను పక్కనబెట్టి కార్మిక ఐక్యతను బలోపేతంచేసి, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలి.
ఆళవందార్‌ వేణు మాధవ్‌, 8686051752

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img