Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బడ్జెట్‌ విధాన ప్రక్రియ మార్చాలి

కూనంనేని సాంబశివరావు

దేశ ఆర్థికానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో భారీ మార్పులు రావాలి. జిఎస్‌టి నుండి అనేక పన్ను, పన్నే తర ఆదాయాలను కేంద్రం గుప్పిట్లో ఉంచుకొని రాష్ట్రాలు కేంద్రంపైన ఆధార పడేలా రాష్ట్రాల అధికారాలను మోదీ ప్రభుత్వం కుదిస్తోంది. ఈ తరుణంలో అధికార పునర్విభజన అవసరం ఉంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ ముద్రణ, రైల్వే, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌ లాంటివి కేంద్రం వద్ద ఉంచుకొని ఆర్థిక, అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రధానమైన సంక్షేమం, ఆయా రాష్ట్రాల అభివృద్ధి అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. రాజ్యాంగంలో పొందు పర్చిన రాష్ట్రాల అధికార జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా సమాఖ్య స్పూర్తితో అమలు చేయాలి.


మూస బడ్జెట్‌ విధానం వల్ల దేశంలో 80 శాతం ప్రజల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కాలం చెల్లిన బడ్జెట్‌ రూపకల్పనా విధానాన్ని మార్చాలి. వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్‌గా ఉండే కొత్త తరహా బడ్జెట్‌ క్రమానికి శ్రీకారం చుట్టాలి. బడ్జెట్‌ అంటే జమాఖర్చుల పట్టికగా, వార్షిక ఆర్థిక ప్రకటనగా, నూతన ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య వ్యయానికి పార్లమెంట్‌ ఆమోదం పొందే ప్రక్రియగానే చూడరాదు. 2021-22 బడ్జెట్‌ 34.83 లక్షల కోట్లు కాగా ప్రస్తుత 2022-23 బడ్జెట్‌ 39.5లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్‌ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. జిడిపి శాతం ఈ ఆర్థిక సంవత్సరం 9.2 శాతం అనగా 147.5 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం రాక మునుపే 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు కేవలం 4.1 శాతం మాత్రమే, 2020-21లో ఇది మైనస్‌ 7.3 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి జిడిపి వృద్ధి రేటు పెరుగుదల, తరుగుదల దేశంలోని సామాన్య ప్రజల జీవితాలకు సంబం ధించిన అంశంగా చూడరాదు. సంపన్నుల ఆస్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగితే వృద్ధి రేటు అధికంగా కనపడుతుంది. సామాన్యుల, సంపన్నుల ఆదాయాలు కలిపి లెక్క వేయడం వలన జిడిపిలో వృద్ధి కనిపిస్తున్నది. కానీ సామాన్యుల ఆదాయంలో మార్పు ఏమీ ఉండదు. అసమానతలు అలాగే ఉంటాయి. అందువలన అంకెలపై ఆధారపడిన బడ్జెట్‌ కాకుండా వ్యక్తి కేంద్రంగా బడ్జెట్‌ తయారుచేసి సంతృప్త (శాచ్యురేషన్‌) స్థాయికి ఆయా పథకాలను తీసుకెళ్లగలిగితే నిర్దిష్ట కాల పరిధిలో పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తయారీ రంగం మౌలిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత తగ్గించకుండా సంక్షేమం, నగదు పంపిణీ లాంటి పథకాల వలన అభివృద్ధి, సంక్షేమం సమ్మిళతంగా సమతూకంలో ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ప్రధానంగా నాలుగు రకాల బడ్జెట్‌ రూపకల్పనా విధానాలు ఉన్నాయి. అవి 1) ఇంక్రిమెంటల్‌ 2) యాక్టివిటీ బేస్డ్‌ 3) వ్యాల్యూ ప్రిపోజీషన్‌ 4) జీరో బేస్డ్‌ బడ్జెట్‌. మన దేశంలో బ్యాలన్స్‌డ్‌ బడ్జెట్‌, సర్‌ప్లస్‌ బడ్జెట్‌, డెఫిసిట్‌ బడ్జెట్‌ విధానాలను అనుసరిస్తున్నారు. ఈ విధానం విఫలమైందని 75 సంవత్సరాల అనుభవం చెపుతున్నది. స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ సందర్భంగా అమృతకాల్‌ పేరుతో ప్రస్తుత బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రానున్న 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకొని 39.5 లక్షల కోట్ల దివ్యమైన బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లుగా నిర్మలా సీతారామన్‌ ఘనంగా ప్రకటించారు. కానీ, దేశంలో ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? కేంద్ర ప్రభుత్వ, గుత్త పెట్టుబడి దారుల, పెద్ద వ్యాపార సంస్థల, కార్పోరేట్ల పీడనే కనిపిస్తుంది. మనకు సంపన్న భారత్‌, మరొకటి పేదల భారత్‌ దర్శనమిస్తాయి. 90శాతంమంది ప్రజలు నిజాయితీగా తమకష్టార్జితాన్ని తాము తిన్నా తినక పోయినా పన్నుల కడ్తుంటే 75శాతం సంపద 10 శాతం ధనవంతులు ముఖ్యంగా అందులో ఒక్క శాతం అతి సంపన్నుల చేతుల్లో ఇరుక్కుపోయింది. 60 శాతం పేదల వద్ద 5 శాతం మాత్రమే సంపద ఉంది. ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్‌ పేరుతో అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ విడుదలచేసిన నివేదికప్రకారం దేశంలో 70 శాతంగా ఉన్న 95 కోట్ల మంది ప్రజల చేతుల్లో ఎంత ఆస్తి ఉందో దేశంలోని 1 శాతం సంపన్నుల చేతుల్లో అంతకు నాలుగు రెట్ల అధిక సంపద ఉంది. దేశంలో 100కు పైగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో దేశబడ్జెట్‌ కంటే మించిన సంపద ఉన్నది. ఆక్స్‌ఫామ్‌ 2020-21 నివేదిక ప్రకారం దేశంలోని 102 మంది శతసహస్ర కోటీశ్వర్ల జాబితాలో మరో 40 మంది చేరారు. ఇదే కరోనా కాలంలో 104 మంది సంపన్నుల ఆస్తి 23 లక్షల కోట్లు నుండి 53 లక్షల కోట్లకు పెరిగింది. ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలకంటే మనదేశంలో బిలీనియర్ల సంఖ్య ఎక్కువ. 1980లో వ్యాపారం ప్రారంభించిన గౌతమ్‌ అదాని సంపద 2014లో రూ.50వేల కోట్లు ఉండగా 2021-22 నాటికి 681 లక్షల కోట్లతో ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. రెండవ స్థానంలోకి జారిపోయిన ముఖేష్‌ అంబాని ఆస్తి 670 లక్షల కోట్లు. చాయ్‌వాలాగా చెప్పుకొనే ఘనత వహించిన మన ప్రధాని కరుణాకటాక్షాలు ఉంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరగవచ్చునో అదాని, అంబాని ఉదంతాలే గొప్ప ఉదాహరణ. దేశంలోని ఓడ రేవులు, విమానాశ్రయాలు, గనులు, సహజ వాయువులు, రక్షణ, రైల్వే, టెలికాం, బ్యాంకులతో పాటు బంగారు గనివంటి ఎల్‌ఐసి లాంటి మన పెద్దలు సంపా దించిన, పేదల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థల విధ్వంసానికి, ఆశ్రితుల, కార్పోరేట్‌ శక్తుల వికాసానికి మోదీ పూనుకున్నారు. సంపద పెరిగితే కింది స్థాయి వరకు ఉద్యోగావకాశాలు, ఇతర సౌకర్యాలు సమకూరుతాయని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త కీన్స్‌ ప్రతిపాదించిన ట్రికిల్‌ డౌన్‌ థియరి (బొట్టు సిద్ధాంతం) భారతదేశ పరిస్థితుల్లో పూర్తిగా విఫలం అయింది. సరైన అధికారిక సమాచారం లేనప్పటికి దేశంలోగాని, విదేశాల్లోగాని దాచి పెట్టిన నల్లడబ్బు విలువ 40 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. బడా దోపిడీదారులు బ్యాంకులకు ఎగవేసిన సంపదే 13 లక్షల కోట్లు. మోదీ 2014లో నల్లడబ్బును వెలికితీసి ప్రతి ఇంటికి 15 లక్షల చొప్పున డిపాజిట్‌ చేస్తానని చెప్పిన అంశం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్‌ నిరుపేద ఆఫ్రికన్‌ దేశాల సరసన 104వ స్థానంలో నిలిచింది. సురేశ్‌ టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో 41.8 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.7 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. దేశంలో కనీసం గూడు (ఇళ్ళు) లేనివారు 12 కోట్ల మంది, సెంటు భూమి లేనివారు పారిశ్రామిక కార్మికులలో 6 కోట్ల మంది ఉంటే 26 కోట్లుగా ఉన్న వ్యవసాయ కార్మికుల్లో దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (ఎస్‌ఎంఐఈ) నివేదిక ప్రకారం దాదాపు 6కోట్లమంది చదువుకున్న నిరుద్యోగులుఉన్నారు. భారతదేశ యువకుల్లో 63శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో దాదాపు 45 కోట్ల మంది అసంఘటిత కార్మికులే. సుప్రీంకోర్టు సూచించిన కనీస వేతనం రూ.18,500లు కూడా అసంఘటితరంగ కార్మికులకు అందడం లేదు. ప్రముఖ ఆర్థిక వేత్తలైన సంధ్యా కృష్ణన్‌, నీరజ్‌ హతీకర్‌ ప్రకారం దేశ జనాభాలో సగానికి పైగా అనగా 60 కోట్లకు పైగా మధ్యతరగతి వర్గం ఉన్నది. ఖరీదైన విద్య, వైద్యం, నిత్యావసరాల ద్రవ్వోల్బణ నేపధ్యంలో చావలేక బతుకుతున్నారు. దాదాపు 40 కోట్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలలో సగంమందికి పైగా దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలలో 40 శాతం పేదరికంలోనే ఉన్నారు. జీరోబేస్డ్‌ బడ్జెట్‌ అవసరం మంచి జీవితాలను గడిపే సమాజం కోసం బడ్జెట్‌ విధానాన్ని పూర్తిగా మార్చాలి. జీరో బేస్డ్‌ బడ్జెట్‌ ప్రకారం పాత లెక్కల జోలికి పోకుండా ఏటా ఆయా వర్గాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించుకోవడం వలన సంకల్పిత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. మౌలికరంగంలోని ప్రభుత్వరంగాన్ని, తయారీ రంగాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిసంక్షేమాన్ని రెండు కళ్లుగా చూడాలి. పేద వర్గాలకు నేరుగా నగదు పంపిణీ, సబ్సిడీలను కొనసాగిస్తూ హెలికాప్టర్‌ మనీ సిస్టం ద్వారా పేదల చేతుల్లో కనీస డబ్బు చేరేలా చర్యలు తీసుకుంటే కొనుగోలు శక్తి పెరిగి తద్వారా మౌలిక రంగంలోనూ, సంక్షేమ రంగంలోనూ దేశం అభివృద్ధి చెందుతుంది. జిడిపిలో 15 నుంచి 18 శాతం వరకు పాలుపంచుకుంటున్న వ్యవసాయ రంగానికి అమెరికా, జపాన్‌ తరహాలో ప్రభుత్వాలు పూర్తి మద్దతు కల్పించాలి. ఆరోగ్య, విద్యారంగాల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. నిరుపేదలకు ఇళ్ళు, నిరుద్యోగులకు ఉపాధీ లేక భృతి ఇవ్వాలి. సంపన్నులపై కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గించడం కాకుండా (12శాతంగా ఉన్న కార్పో రేట్‌ ట్యాక్స్‌ను 7శాతానికి ఇటీవల తగ్గించారు) ఆక్స్‌ఫామ్‌ సూచన ప్రకారం 2 నుంచి 4 శాతం సెస్‌ను విధించాలి.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలుదేశ ఆర్థికానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో భారీ మార్పులు రావాలి. జిఎస్‌టి నుండి అనేక పన్ను, పన్నేతర ఆదాయాలను కేంద్రం గుప్పిట్లో ఉంచుకొని రాష్ట్రాలు కేంద్రంపైన ఆధారపడేలా రాష్ట్రాల అధికారాలను మోదీ ప్రభుత్వం కుదిస్తోంది. ఈ తరుణంలో అధికార పునర్విభజన అవసరం ఉంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ ముద్రణ, రైల్వే, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌ లాంటివి కేంద్రం వద్ద ఉంచుకొని ఆర్థిక, అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రధానమైన సంక్షేమం, ఆయా రాష్ట్రాల అభివృద్ధి అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. రాజ్యాంగంలో పొందుపర్చిన రాష్ట్రాల అధికార జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా సమాఖ్య స్పూర్తితో అమలు చేయాలి.

వ్యాస రచయిత సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి,
మాజీ శాసనసభ్యులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img