అరుణ్
మమత పదవి నుంచి వైదొలగవలసిందే, ఎంతోకాలం ముఖ్యమంత్రిగా ఉండబోదు, మరో వ్యక్తిని ఆమె సీఎం పదవికి ఎంపిక చేయవలసిందే అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతున్నారు. కరోనా మూడవ దశ రాబోతున్నందున ఎన్నికలు జరపటానికి వీలు లేదని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మమత ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపేందుకు కూడా కేంద్ర నాయకత్వం సిద్ధపడుతోందని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయించేందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కుట్ర పూరితమైన సన్నాహాలు చేస్తున్నారు. మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం. ఏడు అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ఇందులో భవానిపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడి నుంచే మమత పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఘన విజయం సాధించినప్పటికీ మమత గెలుపొందలేదు. ఆరు నెలల లోపు ఏదో ఒక నియోజక వర్గం నుంచి మమత గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. ఎన్నికల్లో గెలవకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింసాయుత ఘటనలు చోటు చేసుకున్నాయి. హింసకు టీఎంసీనే కారణమని నిరూపించేందుకు కేంద్రం సీబీఐని ఉపయోగిస్తున్నది. ప్రభుత్వానిదే తప్పు అని తేల్చేందుకు అన్ని విధాలుగా బీజేపీ ప్రయత్నిస్తోంది. బహుశా వచ్చే నెలలో సీబీఐ తన నివేదికను అందజేయనున్నది.
రాష్ట్రంలో జరిగిన హింసా ఘటనలపై సీబీఐ ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. మొత్తం 31 కేసులు రిజిస్టర్ చేశారు. పైస్థాయిలో ఉన్న రాజకీయ బాస్ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఎలాంటి రిస్కు తీసుకోకూడదని సీబీఐ భావిస్తోంది. ఎఫ్ఐఆర్లు నమోదు చేసినంత మాత్రాన మమతను పదవి నుంచి తప్పించటం సాధ్యం కాదు. నందిగ్రాం నియోజకవర్గంలోని పుర్బమెదిన్పురి, కుచ్బిహార్లోని సీతాల్కుచి ప్రాంతాల్లో మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఈ మూడు కేసులు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సుబేందు అధికారికి సంబంధించినవి. టీఎంసీ పైన మరిన్ని కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు. అధికార పార్టీ కార్యకర్తలను అనేక మందిని అత్యంత క్రూరంగా హింసించారు. బీజేపీ గూండాలు అధికార పార్టీ కార్యకర్తలను కొందరిని హతమార్చారు. వారి ఇళ్లను ధ్వంసం చేసి మహిళలపై లైంగిక దాడి చేశారు. అయితే సీబీఐ వీటిని పట్టించుకోలేదు. కోర్టు సైతం వీటిని గుర్తించకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్లో ముగ్గురు బీజేపీ నాయకులను చేర్చిందని టీఎంసి ఆరోపించింది. సీబీఐ తప్పుదారిలో దర్యాప్తు చేయడానికి ఇది ప్రధాన కారణం. మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు అందజేసింది. అయినప్పటికీ సీబీఐ తనంతట తాను మూడు కేసులను ఎలా నమోదు చేసింది?
ప్రభుత్వాన్ని అస్థిరీకరించి మమతను పదవి నుంచి తప్పించేందుకు సీబీఐ పని చేస్తున్నదని టీఎంసీ విమర్శించింది. కోల్కతా హైకోర్టు మానవ హక్కుల కమిషన్ నివేదికను స్వీకరించి దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. త్రిపురలో ప్రతిరోజు తమ కార్యకర్తపై దాడులు జరుగుతున్నందున అక్కడికి మానవ హక్కుల కమిషన్ను మోదీ ప్రభుత్వం పంపాలని మమత సవాలు చేసింది. త్రిపురలోను రెండు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బెంగాల్ నుంచి త్రిపురకు వెళ్లగా వారిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలోనే మానవ హక్కుల కమిషన్ను ఆ రాష్ట్రానికి పంపాలని మమత డిమాండ్ చేశారు. త్రిపురలో టీఎంసీ ఎమ్మెల్యేలకు రక్షణగా పంపిన సెక్యురిటీ సిబ్బందిని కూడా బీజేపీ గూండాలు వదలడం లేదని ఆ పార్టీ విమర్శించింది. అసోంలో ఎన్ఆర్సీపై ఆందోళన జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్రానికి టీఎంసీ నాయకులను అనుమతించలేదు. త్రిపురలో ముజిబర్ ఇస్లాం మజుందార్ ఇంటికి బెంగాల్ టీఎంసీ నాయకులు మరో ఇరవై నిమిషాల్లో చేరుకుంటారనగా బధర్ఘాట్ వద్ద 15`20 మంది బీజేపీ గూండాలు వచ్చి దాడి చేశారని ఆ రాష్ట్ర టీఎంసీ నాయకుడు సుబాల్ బౌమిక్ తెలిపారు. దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మమత ఉప ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేకుండా చేసేందుకే బీజేపీ అన్ని విధాలుగా వ్యూహాలు పన్నుతున్నది. నవంబరు 4వ తేదీలోపు మమత అసెంబ్లీకి ఎన్నిక కావలసి ఉంటుంది. రాష్ట్రంలో మమత గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముర్షిదాబాద్ ప్రాంతంలోని షంషీర్గంజ్, జంగిపూర్లలో ఎన్నికలు జరగలేదు. ఇక్కడ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు మరణించటంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరో ఐదు నియోజక వర్గాల్లో కరోనా నియంత్రణకు టీకాలు వేస్తున్నందున వాయిదా వేశారు. ఎన్నికలు జరగని అయిదింటిలో దిన్హత, శాంతిపూర్, భవానిపూర్, ఖర్దహ, గొసబ ఉన్నాయి. ఉప ఎన్నికలు జరపాలని గత కొన్ని నెలలుగా కోరుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ అందుకు ఇష్టపడటం లేదు. బీజేపీ పలుకుబడి 33 శాతం నుంచి 3 శాతానికి పడిపోవటంతో ఉప ఎన్నికల నిర్వహణకు ముందుకు రావటం లేదు. ఉప ఎన్నికలు సెప్టెంబరు లోపే జరగాలి. అక్టోబర్లో పండుగలున్నాయి. అప్పుడు ఎన్నికలు జరపరాదని బీజేపీ నాయకులు కోరుతున్నారు.
మమత పదవి నుంచి వైదొలగవలసిందే, ఎంతోకాలం ముఖ్యమంత్రిగా ఉండబోదు, మరో వ్యక్తిని ఆమె సీఎం పదవికి ఎంపిక చేయవలసిందే అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతున్నారు. కరోనా మూడవ దశ రాబోతున్నందున ఎన్నికలు జరపటానికి వీలు లేదని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మమత ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపేందుకు కూడా కేంద్ర నాయకత్వం సిద్ధపడుతోందని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి. ఇందుకు అవసరమైన పథకాన్ని కూడా రూపొందించుకున్నారని భావిస్తున్నారు. జై శ్రీరామ్ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బెంగాల్లో హిందు వులు బీజేపీ ప్రయోజనాల కోసం తాము పాటుపడలేమని చెప్తున్నారు. బిహార్లో అనుసరించిన సామాజిక సమీకరణ ఎత్తుగడలను ఇక్కడ కూడా అమలు చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.