ఈ సంవత్సరంలో, 2008 ఆర్ధిక మాంద్యాన్ని మించిన మాంద్యం ప్రపంచాన్ని చుట్టనుందని ఐక్యరాజ్యసమితి, ఐ.ఎమ్.ఎఫ్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రపంచంలో పేరొందిన టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ 12,000 మందికి ఉద్వాసన పలకడంతో యావత్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల కాలంలో మెటా, ట్విట్టర్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, బైజుస్, అమెజాన్, స్విగ్గీ వంటి సంస్థలు వేలసంఖ్యలో ఉద్యోగస్తులను ఇంటికి పంపుతున్నాయి. ఇప్పటికే అనేకమందిని క్యాంపస్ సెలక్షన్ ద్వారా సెలక్షన్ చేసినా, కాల్ లెటర్స్, నియామక ఉత్తర్వులు ఇవ్వడం లేదు. చాలా మంది నిరాశలోఉంటూ, ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. 2025 వరకూ ఈ ఆర్ధిక సంక్షోభం కొనసాగుతుందని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కోవిడ్ కాలంలో అన్ని పరిశ్రమలు మూతపడినప్పటికీ, సాఫ్ట్వేర్ రంగం మాత్రం అన్ని దేశాల్లో ఊపందుకుంది. అన్ని పనులు ఆన్లైన్లో జరగడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. సాఫ్ట్వేర్ ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయి.
ఆన్లైన్ ద్వారా విద్య, మెడిసిన్, సమావేశాలు, చర్చలు, రకరకాల సేవలు, వ్యాపారాలు భారీఎత్తున జరగడంతో ఉవ్వెత్తున సేవారంగం ఎగిసింది. ఆర్థికమాంద్యం, యుద్ధం కారణంగా సాఫ్టవేర్ రంగంలో ఉద్యోగాలు తీసే పనిలో వివిధ కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. దశల వారిగా ఉద్యోగులను ఇంటికి పంపే పనిలోఉన్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం, అధిక ధరలు, బ్యాంక్ వడ్డీరేట్లు, నిర్వహణా భారం పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉద్యోగాల కోతకు కారణం అని గుర్తెరగాలి. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడ సప్లయ్చైన్కు ఆటకం, ధరలు పెరుగుదలకు కారణం కావడంతో చాలా టెక్ కంపెనీలు, ఖర్చుతగ్గించుకునే క్రమంలో వేలసంఖ్యలో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ముఫ్ఫై లక్షలు ఉద్యోగాలు గాలిలో కలిసాయి. దీంతో నిరుద్యోగం పెరిగి, కొనుగోలు శక్తి పడిపోతుంది. వస్తుఉత్పత్తి తగ్గి, పారిశ్రామిక రంగం కుదేలైపోతుంది. ఈ విధంగా ఎగుమతులుతగ్గి దాదాపు అన్నీ దేశాలు విదేశీమారకద్రవ్యం కోల్పోయి, ఆర్ధికాభివృద్ద్ధి ఋణాత్మక దిశగా పయనించి, అనేక దేశాలు మరెన్నో శ్రీలంకలుగా కళ్ళ ముందు కదలాడే పరిస్థితి దాపరించనుంది.
ఈ ఆర్ధిక సంక్షోభం ప్రస్తుతం యూరప్ దేశాల్లో దావానలంలా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితి మనకు కూడా ఈ ఏడాది జూన్ తర్వాత నుంచి కనపడుతుంది అని ఆర్ధిక నిపుణుల అంచనా. ఇప్పటికే మనదేశంలో స్వాతంత్య్రం అనంతరం నాలుగుసార్లు 1956,1966, 1973, 1980 సంవత్సరాల్లో వచ్చిన ఆర్థికసంక్షోభంతో దేశ ఆర్ధికాభి వృద్ధి మైనస్లో నమోదైంది. ప్రస్తుతం రానున్న ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకో వటానికి ప్రజలు తమవద్ద ఉన్న ధనాన్ని అనవసర, అనుత్పాదక, విలాస వస్తువులపై ఖర్చు చేయరాదని ఆర్థిక నిపుణులుహెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో దాదాపు డెభ్బైఐదు శాతం జనాభా నెలసరి వాయిదాలు(ఈ.ఎమ్.ఐ)లు కట్టడంతోనే తమ జీవితాలు గడుపుతున్నారు. ఒక్కనెల జీతాలు/ పెన్షన్లేట్ అయినా, భారిగా పెనాల్టీలు చవి చూస్తున్నారు. ఏదికొన్నా అనగా ఇల్లు, స్థలం, కారు, గృహోపకరణాలు, భూములు చివరికిపిల్లలు ఉన్నత చదువులకు కూడా ఋణాలు తీసుకుని, దాదాపు వారి జీతాలు అంతా అప్పులు కట్టడానికే వెచ్చిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆర్ధికమాంద్యంవస్తే, దాదాపు యావత్ భారత్ ప్రజానీకం తీవ్రఒడుదుడుకులు చవిచూసే ప్రమాదంఉంది. ఇప్పటికే దేశంలో సుమారు కొన్ని కోట్లమందికి మూడుపూటల తిండిలేదు. ఆకలి మరణాలు ఉన్నాయి. పోషకాహారంలోపం, రకరకాల అనారోగ్యాలు వెంటాడు తున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక ధరలు, నిరుద్యోగం ఆకాశాన్ని అంటు తున్నాయి. ఇక ఆర్ధికమాంద్యం వస్తే నూటికి డెభ్బై ఐదుశాతం జనాభా జీవితాలు అస్తవ్యస్తంగా మారనున్నారు. కావున ఇప్పటినుంచి ప్రభుత్వాలు, ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. డబ్బులు భధ్రపరుచుకోవాలి. ప్రభుత్వాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించాలి. ఉత్పత్తి, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సేవారంగం, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలు కంటే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు మాత్రమే ప్రజలకు, దేశానికి ఆర్ధిక, సామాజిక భద్రత కలిగిస్తాయని గ్రహించాలి. ఆర్ధిక పరంగా, యుద్ధాలు పరంగా, ఆరోగ్యపరంగా, ప్రకృతిపరంగా ఎన్ని సమస్యలు సంభవించినా ఒకదేశం, ప్రజానీకం భధ్రతగా జీవనయానం సాధించాలంటే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు మాత్రమేనని అందరూ గ్రహించాలి. పొదుపు, అవసరమైన వస్తువుల కొనుగోలు శ్రేయస్కరం. విలాసాలు, అపరిమితమైన ఖర్చులు ఎప్పుడూ ప్రమాదమే. అప్పుడు మాత్రమే ఆర్ధికమాంద్యం నుంచి దేశాలు, ప్రజలు గట్టెక్కగలరు.
`ప్రసాదరావు