Friday, April 19, 2024
Friday, April 19, 2024

మానవ మనుగడను ప్రశ్నిస్తున్న భూతాపం

టి.వి.సుబ్బయ్య

భూతాపం పెరిగితే మనిషి మనుగడకు ముప్పు కలగడం ఏమిటని ప్రశ్నించే డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి పాలకులున్నారు. నిజంగానే నాటికంటే నేడు మనిషి మనుగడను ప్రశ్నించేస్థాయికి భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తాజాగా ఐక్యరాజ్యసమితి తీవ్రంగా హెచ్చరిక చేసింది. ప్రపంచ వాతావరణ నిర్వహణ కేంద్రం ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. 1972లో ధరిత్రిరక్షణ సదస్సు జరిగిన నాటి నుండి నేటి వరకు దాదాపు 50 చిన్న, పెద్ద అంతర్జాతీయ వాతావరణ సదస్సులు జరిగాయి. అన్ని దేశాల పాలకులు, వాతావరణ శాస్త్రవేత్తలు ఈ సదస్సుల్లో పాల్గొని చర్చించి పర్యావరణ కాలుష్యం, భూతాపం తగ్గించడానికి తీర్మానాలు ఆమోదించారు. 2015లో పారిస్‌లో జరిగిన సదస్సు వాతావరణ మార్పులను తీవ్రంగా తీసుకొని ఈ శతాబ్ది చివరికి ఉష్ణోగ్రతలను 1.5లేదా 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ తీర్మానాలు సక్రమంగా అమలుచేయడం లేదని ఐరాస తాజా హెచ్చరికలు రుజువు చేస్తున్నాయి. శతాబ్దిచివరి నాటికి తగ్గించాలని అంచనావేసిన 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రానున్న ఐదేళ్లలో (20232027) ఏదో ఒక సంవత్సరం నమోదవుతాయని, ఇవి 1.8 డిగ్రీల సెల్సియస్‌కూ పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ వాతావరణ నిర్వహణ సంస్థ నివేదిక పేర్కొంది. రానున్న ఐదేళ్లలో నేటికంటే ఎక్కువగా ఎండలుమండి పోతాయనికూడా నివేదిక వెల్లడిరచింది. ఎల్‌నినో ప్రభావం కూడా తోడై ఉపద్రవాలకు దారితీస్తాయి. ప్రమాదకర పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయన్న సందేహాలు ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికీకరణ (17001800) తర్వాత అంటే దాదాపు 200 ఏళ్లుగా ప్రకృతి విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. మనిషి సుదీర్ఘకాలం ప్రకృతితో మమేకమై జీవించాడు. ఆనాడు ప్రకృతి వల్ల కలిగే కాలుష్యం అతి తక్కువగా ఉండి మనిషి నేటికంటే ఎంతో మేలైన వాతావరణంలో జీవనం సాగించాడు.
ప్రకృతి వనరులు మనిషికి అవసరమైనన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే మనిషి అత్యాశ, ప్రభుత్వాలు అభివృద్ధిపేరుతో సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం ఈ దుస్థితికి ప్రధానకారణం. ఈ విషయంలో సంపన్నదేశాలు ప్రకృతిని మరింతగా నాశనంచేసి పర్యావరణం మితిమీరి కలుషితం కావడానికి, భూతాపం పెరగడానికి అత్యధికంగా బాధ్యత వహించాల్సిందే. నేటి ప్రమాదానికి ప్రకృతి విధ్వంసం, యుద్ధాలు కీలకమైన కారణాలు. అలాగే మనిషి జీవన విధానం సైతం కాలుష్యానికి, భూతాపం పెరగడానికి దారి తీసింది. ఇంతగా జీవావరణం కలుషితం కావడానికి, భూతాపం పెరగడానికి దారితీస్తున్నవి ఏమిటి? ముఖ్యంగా బొగ్గు, పరిశ్రమలనుండి వెలువడే కర్బనపు వాయువులు, విషతుల్య వాయువులు, శిలాజ ఇంధనాలు, రసాయనాలు, కృత్రిమ ఎరువులు, పురుగుమందులు. వీటి వలన గాలి, నీరు, ఆహారం, పొలాలు, నదులు, సముద్రాలు తిరిగి బాగుచేయలేనంతగా కలుషిత మయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అన్నిటికంటే అధికంగా కాలుష్యం కలుగచేస్తున్న ప్లాస్టిక్‌ భూతం మన నిత్య జీవితంలో భాగమైంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వస్తువులే. ఇది అత్యంత ప్రమాదకారి అని తెలిసినా ప్రభుత్వాలు వీలైనన్ని ఉత్పత్తులను నిషేధించ కుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. అన్ని రకాల వాహనాల్లోవాడే పెట్రోలు, డీజిల్‌ తదితర ఇంధనాలు కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తికి ఇటీవలకాలంలో ముమ్మర ప్రయత్నాలు కొన్ని దేశాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి పెరిగితే కాలుష్యం తగ్గుతుంది. అయితే ముడిచమురు, బొగ్గు ఉత్పత్తి, వినియోగం పెరుగుతున్నదే కానీ తరగడంలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అన్నిటికంటే అత్యధిక కాలుష్యం వెదజల్లే విమానాల ఉత్పత్తి, వినియోగం పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్‌ వాహనాలు వినియోగంలోకి వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. ఇక సముద్రాలఅడుగున ప్లాస్టిక్‌ముక్కలు కొన్ని అడుగుల మందం అట్టకట్టుకుపోయాయి. అంతేకాదు సముద్రాలపైన కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్లాస్టిక్‌ కొండల్లా పేరుకొని ఉన్నాయని అధ్యయనాలు నిర్ధారించాయి. మనరోజువారీ వినియోగంతో వెలువడే మురుగు అంతిమంగా సముద్రాల్లో చేరుతోంది. దీనివల్ల సముద్రాలు తీవ్రంగా కలుషితమై అక్కడ నివసించే అనేక వందల జీవులు అంతరించిపోతున్నాయి. కాలుష్యం పెరుగుదలవల్ల సముద్రజలాలు వేడెక్కి ప్రకృతి విపత్తులు అధికం కావడానికి దారితీస్తున్నాయి. జంక్‌ఫుడ్‌, శీతల పానీయాలు, ప్లాస్టిక్‌ బాటిళ్లలో వాడే నీరు, కృత్రిమ ఎరువులు, పురుగుమందుల వల్ల పండే పంటలు మనకు ఎనలేని హాని కలిగించి కొత్త, కొత్తరోగాలకు, కొవిడ్‌ వైరస్‌ లాంటి విపత్తులకు కారణమవుతున్నాయి. మన జీవనవిధానం మారకపోతే ప్రకృతి విపత్తులు మరింతగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగరాల పెరుగుదల కాలుష్యాన్ని, భూతాపాన్ని పెంచి ప్రజలకు అనేకరకాల వ్యాధులు కలిగిస్తున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ మండేఎండలకు ఉపశమనంగా వాడే ఏసీల వినియోగమూ పెరుగుతుంది. ఫలితంగా భూతాపం ఇంకా పెరుగుతుంది. ప్లాస్టిక్‌ బ్యాగులను, బాటిళ్లను, ప్యాకింగ్‌ డబ్బాలు, ప్లేట్లు, గ్లాసులులాంటి వాటి ఉత్పత్తినైనా నిషేధించాలి. గుడ్డ సంచులను ప్రోత్సహిస్తే రైతులు, ఈ వృత్తిలో పనిచేసేవాళ్లు ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా ఇళ్లల్లో గృహిణులు ప్లాస్టిక్‌ ప్రమాదాన్ని గుర్తించి ప్లాస్టిక్‌ వాడకుండా ప్రత్యామ్నాయ వస్తువులు వాడాలి. శీతలపానీయాలు, జంక్‌ఫుడ్‌ వాడకాన్ని ప్రోత్సహించరాదు. అలాగే కర్బనపు వాయువులను వెదజల్లే వాహనాల ప్రయాణాలను మినహాయించి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే రైళ్లలో ప్రయాణాలు మంచిది. రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరగాలి. కాలుష్యం తగ్గించడానికి మేలైన జీవన విధానాన్ని అవలంబించాలి. ఆధునికత వెంటబడి పరుగెడితే రాబోయే ప్రమాదం బారినపడటం అనివార్యమవుతుంది. వాతావరణ ప్రభావం ఆర్థిక అసమానతలనూ పెంచుతుంది. అభివృద్ధిపేరుతో చేపట్టే కార్యకలాపాలన్నీ ప్రకృతి నాశనానికే దారితీస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల స్థాయి నుంచే ప్రకృతి విధ్వంసపై అవగాహనను పెంపొందించాలి. కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రజలను భాగస్వాములను చేయాలి. లేకపోతే భూగోళం అగ్నిగుండమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img