ఎల్.ఎస్. హర్డినియ
మధ్యప్రదేశ్లోని డా॥గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్రలో జులై 30 2021న జరిగిన అవమానం ఎన్నటికీ మరిచిపోలేనిది. యూనివర్సిటీ నిర్వహించ తలపెట్టిన వెబ్నార్ చర్చలో ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు తొలగించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధమైన ఎబివిపి హుకుం జారీ చేసింది. ఆంథ్రోపాలజీ (మానవ నిర్మాణ శాస్త్రం) పై సెమినార్ నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికాలోని న్యూజెర్సీ మాంట్క్లెయిర్ స్టేట్ యూనివర్సిటీతో కలిసి డా॥హరిసింగ్గౌర్ విశ్వవిద్యాలయం ఆన్లైన్ సెమినార్ను నిర్వహించాలని 2021 మే ప్రారంభంలోనే నిర్ణయించింది. చర్చలో పాల్గొనే వారి జాబితా నుండి డా॥గౌర్రజా, డా॥అపూర్వానంద్ పేర్లను తొలగించాలని ఎబివిపి హుకుం జారీ చేసింది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన వీరిద్దరు ‘‘దేశ శత్రువులు’’ అంటూ ఎబివిపి నిందలు వేసింది. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్ విలువలను సమున్నతంగా పాటిస్తారు. న్యూజెర్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నీరజ్ విద్వన్ సెమినార్లో పాల్గొనాలని 2021 మే 28వ తేదీన నిర్ణయించారు. ‘‘శాస్త్రీయ దృక్పథం సాధనలో సాంస్కృతిక, భాషాపరమైన అడ్డంకులు’’ అనే అంశంపై సెమినార్ నిర్వహించాలని నిర్ణయించారు. 2021 జూన్ 2వ తేదీన సెమినార్ ప్రతిపాదనను వైస్ ఛాన్సలర్కు పంపారు. జూన్ 7వ తేదీన సెమినార్కు అనుమతి ఇచ్చారు. అనంతరం సెమినార్లో పాల్గొనే వారి జాబితాలో ప్రొఫెసర్లు గౌర్రజా, అపూర్వానంద్ల పేర్లను కూడా 2021 జులై 20న వైస్ ఛాన్సలర్ వీరి పేర్లను ఆమోదించారు.
జులై 22న ఎబివిపి బెదిరిస్తూ వీసీకి మెమొరాండం ఇచ్చింది. గౌర్రజా, అపూర్వానంద్ పేర్లను తొలగించకపోతే సెమినార్ జరగకుండా అడ్డుకుంటామని బెదిరించారు. వీరి బెదిరింపులకు భయపడిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకుని సెమినార్ నిర్వహించాలని కోరుతూ ఆంథ్రోపాలజీ శాఖకు జులై 29న ఒక లేఖ పంపారు. ఎబివిపి బాటలోనే పోలీసు సూపరింటెండెంట్ జులై 29న సెమినార్ నిర్వహించవద్దంటూ వీసీకి బెదిరింపు లేఖను పంపించారు. సెమినార్ నిర్వహిస్తే ఐపీసీ 505 సెక్షను క్రింద నిర్వాహకులను గూండాలుగా చూపిస్తూ కేసు పెడతామని ఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆమోదం లభించే వరకు సెమినార్ను వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ నిర్వాహకులకు మరో లేఖను పంపారు. సెమినార్కు ఎవరూ హాజరు కాకుండా చూడాలని ఆ లేఖలో హెచ్చరించారు. యూనివర్సిటీ అనుసరిస్తున్న శాస్త్రీయ దృక్పథంపైనే గూండాలు ఎక్కుపెట్టారు. సెమినార్లో ఎవరూ పాల్గొనకుండా చూసేందుకు యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. అనేక మంది విద్యార్థులు, శాస్త్ర పరిశోధకులు తీవ్ర నిరసన తెలిపారు. శాస్త్రీయ దృక్పథంపైన విద్యాసంస్థ స్వయం ప్రతిపత్తి పైన ఈ బెదిరింపులు, దాడిగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న దిశలోనే ఎబివిపి చర్యలు ఉంటున్నాయి.
21వ శతాబ్దిలో ఇలాంటి సిగ్గుమాలిన ఘటనను అనుమతించటం దుర్మార్గం. శాస్త్రీయ దృక్పథాన్ని విస్తరించేందుకు గాను శాస్త్రీయ విద్యా విధానంపై తీర్మానాన్ని ఆమోదించిన మొదటి దేశం మనది. ప్రతి పౌరుడి రాజ్యంగ విధి ఇదని ప్రభుత్వ విధానం పేర్కింది. ఇలాంటి విధానాన్ని రూపొందించటంపై మనమంతా గర్వపడాలి. ఇలాంటి దాడి ఇదొక్కటే కాదు. ఇటీవల ఉజ్జయిని, మాందసౌర్, భోపాల్ తదితర చోట్ల కూడా దాడులు జరిగాయి. ఫలితంగా అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ఠ గంగలో కలిసింది. సెమినార్కు రక్షణ కల్పించవలసిన పోలీసుల పాత్ర ఆ శాఖకే అవమానకరమైంది.