Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాజ్యాధికారం కోసం హిందూత్వ రాద్ధాంతం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

‘‘ఫాసిస్టు భావజాలం ప్రజల్లో సుస్పష్ట ఐక్యత తెస్తుంది. హిందూసేన పున ర్నిర్మాణానికి హిందూ రాష్ట్రకు అలాంటిసంస్థ కావాలి. హెగ్డేవార్‌ ఆధ్వర్యం లోని మన రాష్ట్రీయస్వయంసేవక్‌ సంఫ్‌ు అలాంటిదే.’’ 1931లో ఇటలీ ఫాసిస్టునియంత ముసోలినిని కలిసిన తర్వాత హిందూ జాతీయవాద నాయకుడు బాలకృష్ణ శివరాం మూంజ్‌. సంఫ్‌ుపరివార్‌సంస్థలు నాజీ హిట్లర్‌, ముసోలినిల నుండి ప్రేరణపొందాయి. హిందువులకు ప్రత్యేక హక్కులు కావాలని వాదిస్తున్నాయి.
హిందూమతం-హిందూత్వం
ఇండో ఆర్యన్‌ల సంస్కృత పదం సింధు నుండి హిందు పుట్టింది. సంపద పోగేసుకోటం (అర్థ), కోరికలు తీర్చుకోటం (కామ), పునర్జన్మ నుండి ముక్తి పొందటం (మోక్ష) హిందూ మత ధర్మాలు. ‘‘హిందూ, భారతీయం ఒకటే. భార తీయులంతా హిందువులే. భారత్‌ హిందూదేశం. భారత ఉపఖండ ప్రజలందరు హిందువులు. భారత్‌ వారి పితృభూమి, పుణ్యభూమి. ఆక్రమణదారులు నాశనం చేసిన హిందూ సంస్కృతిని పునరుద్ధరించాలి.’’ ఇది హిందూత్వ వాదం. హిందూ త్వం విద్యార్థులు సంస్కృతం, వైదికజ్ఞానం నేర్చుకోవాలంటుంది. ఖిలాఫత్‌ ఉద్యమ ముస్లిం రాజకీయాలను ప్రతిచర్యగా అనుకరించింది. హిందూత్వ సూత్ర కారుడు సావర్కర్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. రెండవ ప్రధాన కార్యదర్శి గోల్వాల్కర్‌ల ప్రవచ నాలు హిందూత్వ తాత్వికతకు ఆదర్శాలు.
ముస్లిం ద్వేషి బంకించంద్ర ఛటోపాధ్యాయ 1870ల్లో ముస్లిం వ్యతిరేక ఆనంద్‌ మఠ్‌ నవలలో వందేమాతరం యుద్ధ గీతం రాశారు. హిందూదేశ స్థాపన కలలు కన్నారు. బెంగాలి హిందూత్వవాది చంద్రనాథ్‌ బసు ‘హిందూత్వ’ పుస్తకంలో హిందూత్వ పదం మొదటగా రాశారు. గుర్తింపు కోసం సావర్కర్‌ దీన్ని ప్రచారం చేశారు. మతం-సంస్కృతి, ఉమ్మడి దేశం, ఉమ్మడి జాతి, ఉమ్మడి సంస్కృతి సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. హిందూత్వంలో హిందు, జైన, బౌద్ధ, సిక్కు మతాలను చేర్చారు. సంఫ్‌ు పరివార్‌ సంస్థలు హిందూత్వను హైందవ జాతి ఐక్యతా ఉద్యమంగా ప్రచారం చేశాయి. నాస్తిక సావర్కర్‌కు ముస్లింలు శత్రువులు, బ్రిటిషోడి కంటే ముస్లిం సంస్కృతి అపాయకరం. ‘‘హిందూత్వం విశాల భావాల మానవ భాష. ప్రజల ఆధ్యాత్మిక చరిత్ర కాదు. సంపూర్ణ మానవ చరిత్ర.’’ సావర్కర్‌ అతిశయించారు. హిందూత్వం హిందూ విశ్వాసాల, ఉన్నత కుల పెత్తనాల రాజకీయ ఉద్యమం. రాజ్యాధికారం పొందటానికి మార్గాలు చూపిన పిడివాదం.
భారత ప్రధాన న్యాయమూర్తి, మధ్వ బ్రాహ్మణ గజేంద్ర గడ్కర్‌ హిందూ మతం సంకీర్ణమన్న నియోగి బ్రాహ్మణ హిందూత్వ సమర్థకుడు సర్వేపల్లి రాధా కృష్ణన్‌ నివేదికను ఆమోదించారు. హిందూత్వ న్యాయవాది రాం జెఠ్మలానీ హిందూత్వం మతఛాందసవాదంకాదని కోర్టుతీర్పును వక్రీకరించారు. రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు న్యాయవాది ఎ.జి.నూరాని, ‘‘ఈ తీర్పు హిందుత్వానికి అనుకూల అర్థాన్నిచ్చింది. హిందూత్వాన్ని భారతీయీకరించింది. మతం, రాజకీయాలమధ్య అడ్డుగోడను కూల్చేసింది.’’ అన్నారు. సావర్కర్‌ దేశాన్ని హిందూత్వ ప్రాతిపదికన పునర్నిర్మించాలన్న ఆశయంతో అండమాన్‌ జైలు నుండి వచ్చారు. 1921లో ఆయనను మహారాష్ట్రలో రత్నగిరి జైలుకు తరలించారు. అక్కడ హిందూత్వ శీర్షికతో కరపత్రం రాశారు. ఇది హిందూత్వ వాదులకు హిందూదేశ సిద్ధాంతంగా బోధపడిరది. లౌకికవాదులకు మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చేదిగా, ముస్లింలను బలిపశువులను చేసేదిగా అర్థమైంది. సావర్కర్‌కు ముందు వివేకానంద, దయానంద సరస్వతి, తిలక్‌ వంటి వారు హిందూ పునరుద్ధరణ చేపట్టారు. సావర్కర్‌ హిందూ పునరుజ్జీవ నాన్ని రాజకీయ కోణంలో నిర్వచించారు. హిందూత్వం, హిందూ మతం ఒకటి కాదన్నారు. హిందూ వేదకాలంది అన్నారు. ఆనాటి నుండే భారత్‌ హిందూ దేశ మన్నారు. ‘‘ఈ దేశాన్ని పితృభూమిగా, పుణ్యభూమిగా పరిగణించే వారంతా హిందువులే. ఈ ప్రాతిపదికన సిక్కులు, బౌద్ధులు, జైనులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు జాతీయవాదులైనా వారి పుణ్యభూములు అరేబియా, ఇజ్రాయిల్‌లలో ఉన్నాయి. వారు హిందువులు కారు.’’ అని వ్యాఖ్యానించారు.
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందూ ఆధ్యాత్మి కతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచమతాలసభలో హిందూ ఆధ్యాత్మికత, జాతీయ వాదాన్ని తెలిపారు. ఈ తత్వాన్ని గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ముందుకు తీసుకెళ్లారు. నేటి హిందూ జాతీయవాదానికి ప్రేరణనిచ్చారు. సంఫ్‌ు ఆరాధ్యుడు ఉమాకాంత్‌ ఆప్టే, ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు వివేకానంద భగవద్గీత అన్నారు. వివేకానంద మతసామరస్యత, మానవవాదాలు బోధించారు. కులవ్యవస్థను తిర స్కరించారు. ‘‘ముస్లిం సహకారం లేకపోతే మానవజాతికి విలువలేదు. మత గ్రంథాల అవసరంలేని స్థితికి మానవ జాతిని చేర్చాలి. ప్రజలు ఆకలితో మాడు తుంటే మనకు నిద్రెలావస్తుంది? కుల కొట్లాటలతో ప్రయోజనంలేదు. తక్కువ కులస్తులను కించపరచటంతో వారు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు. మాన వ జీవితం గోవు జీవితం కంటే విలువైనది.’’ ఇవీ వివేకానందుని ప్రవచనాలు.
గాంధీ వర్ణాశ్రమ ధర్మాలను నమ్మిన హిందూ భక్తుడు. లౌకికత్వం, ఆధ్యా త్మికతలను అనుసంధానించారు. సామాజిక, రాజకీయ తాత్వికతలో రామరాజ్య భావాలను ప్రచారం చేశారు. ‘‘స్వాతంత్య్రమంటే బ్రిటిష్‌ దిగువ సభ, సోవియట్‌ పాలన, ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజీయిజం కాదు. నైతికాధికారాల ప్రజల సర్వసత్తాక రామరాజ్యం. అట్టడుగు పౌరునికీ న్యాయం అందించగల ప్రజా స్వామ్యం. అన్ని మతాలను గౌరవించగలది.’’ అని గాంధీ వక్కాణించారు. మత నైతికతను రాజకీయాల్లోకి తెచ్చారు. తొలినాళ్ళలో వర్ణవ్యవస్థను, అంటరాని తనాన్ని సమర్థించారు. సావర్కర్‌ లాగా రాజకీయ తీవ్రవాదాన్ని మత మూకలోకి చొప్పించలేదు. భారతీయులంతా హిందువులుగా ఉండాలన్న సావర్కర్‌ సంకు చిత హిందూత్వం, మతాలన్నీ కలిసి బతకాలన్న గాంధీ హిందూ మతానికి వ్యతి రేకం. సావర్కర్‌తో, హిందూత్వంతో సమీప సంబంధం గల హిందూ మతోన్మాది గోడ్సే గాంధీని చంపారు. గాంధీ హిందూ మతాన్ని ప్రేమించినా ఏ మతాన్నీ అగౌరవించలేదు. గాంధీ మతం మానవత్వం, మానవ సేవ, సర్వోదయం.
హిందూత్వ విజృంభణ
నెహ్రూ లౌకిక విధానం ఆచరించారు. 1960లలో కాంగ్రెస్‌ హిందూత్వ రాజీ ధోరణి మొదలైంది. 1964లో విశ్వ హిందు పరిషత్‌ స్థాపించారు. గోవధ నిషేధ ఉద్యమం మొదలెట్టారు. 1967లో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గింది. మిశ్రమ ప్రభు త్వాల్లో జనసంఫ్‌ు అధికారం పంచుకుంది. గోవధ నిషేధ ఉద్యమం సాగిన ఉత్తరప్రదేశ్‌లో గెలిచింది. ఇందిర ఎమర్జెన్సీలో ఆర్‌.ఎస్‌.ఎస్‌., జనసంఫ్‌ుల అంటరానితనంపోయి బలపడ్డాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు బలహీనపడ్డాయి. సంఫీుయులు హిందూకు బదులు భారతీయవాడారు. భారతీయ జనసంఫ్‌ు, భారతీయ జనతాపార్టీ, ప్రజా సంస్థలకూ భారతీయ జోడిరచారు. అయోధ్య మందిర్‌ ఉద్యమం మొదలెట్టారు. ఆడ్వాణీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చి వేతతో హిందూత్వం వేళ్లూనుకుంది. వాజ్‌పేయి పాలనలో చాపకింద నీరులా పారింది. కాంగ్రెస్‌, ఇతర పాలక పక్షాలు హిందూత్వ మెతకధోరణి పాటిం చాయి. 2004 నుండి పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో ఏర్పడ్డ అఘాతంలో, అభివృద్ధి నాయకునిగా డబ్బాకొట్టుకున్నమోదీ దిగబడ్డారు. రెచ్చేగొట్టే అబద్దాల ఉపన్యా సాల, ప్రచారపటాటోపాల, ఉద్వేగమతోన్మాదాలతో కుర్చీలో స్థిరపడ్డారు. బ్రాహ్మణేతర హిందువులూ బ్రాహ్మణత్వాన్ని పూసుకున్నారు. హిందూ జాతీయ వాదం ముస్లిం వ్యతిరేకరూపందాల్చింది. మోదీ-షా-యోగి కాషాయ త్రయంలో హిందూత్వ ఆగడాలు పెరిగాయి. హిందూత్వం విజృంభించింది.
మత పెద్దలు ప్రేక్షకపాత్ర వదలాలి. మతోన్మాదంతో తామూ నష్టపోతామని గుర్తించాలి. హిందూత్వవాదాన్ని ఎదిరించవలసిన ప్రత్యేక బాధ్యత హిందు వులుగా పుట్టిన ప్రగతిశీలురది. విద్యార్థులకు, ప్రజలకు మానవీయ శాస్త్రాలు, సామాజిక, సాంస్కృతిక అంశాలు నేర్పాలి. శాస్త్రీయ దృక్పథం అలవర్చాలి. జీవ పరిణామ క్రమం తెలపాలి.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img