Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతులను సంక్షోభంలోకి నెట్టే బడ్జెట్‌!

మోదీనాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 1-2-23న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్‌ 45,03,097 కోట్లు. అప్పులు 17,86,816 కోట్లు కాగా, ద్రవ్యలోటు 17,86,816 కోట్లు. రెవిన్యూ లోటు 8,69,855 కోట్లు. బడ్జెట్‌ ప్రారంభిస్తూ ‘అమృత కాలంలో’ ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌గా మంత్రి అభివర్ణించారు. కానీ అమృతం అనే పదంకన్నా పేదల, రైతుల జీవితాల్లో కటిక చేదునునింపే కాలమంటే బాగుంటుంది. మనది ఇప్పటికీ వ్యవసాయ దేశం. 68శాతం ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థికవ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయ రంగమే పునాది. అలాంటి రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే మోదీ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా, రైతాంగం అన్నా ఎంత చిన్నచూపో తెలుపుతుంది. 2022-23 ఆర్థిక బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 1,51,521 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక బడ్జెట్‌లో 1,44,214 కోట్లకు తగ్గించారు. రైతాంగానికి ఇచ్చే అనేక సబ్సిడీల్లో కోత విధించారు.
సేద్యం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించాలంటే రసాయనిక ఎరువుల వినియోగం తప్పనిసరి. సేద్యంలో 80శాతం పైగా చిన్న, సన్న కారు రైతులే.. రసాయనిక ఎరువుల వినియోగం వీరికి తలకు మించిన భారంగా మారింది. సస్య విప్లవ కాలంలో రైతాంగం రసాయనిక ఎరువుల వాడకానికి అలవాటు చేయటానికి ప్రపంచబ్యాంకు ఎరువులపై సబ్సిడీలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. ఎరువుల వాడకానికి రైతులు అలవాటు పడిన తర్వాత, సబ్సిడీలు తగ్గించమని ప్రపంచబ్యాంక్‌ భారత పాలకులపై వత్తిడి ప్రారంభించటంతో సబ్సిడీ తగ్గింపులు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఎరువుల ధరల నిర్ణయాన్ని ఫ్యాక్టరీ యజమానులకే అప్పగించటం, పోషకాల ఆధారంగా ఎరువుల సబ్సిడీలు ప్రకటించటం, ఇప్పుడు సబ్సిడీల్లో కోత విధించటం ప్రపంచ బ్యాంకు సూచనల మేర జరుగుతున్నదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలకు 2,25,200 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,75,099.92 కోట్లకు సబ్సిడీ తగ్గించారు.
కోట్ల ఎకరాల్లో సాగయ్యే వ్యవసాయాన్ని సమూలంగా మార్చేందుకు, వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రీయ సాగుకు మళ్లించేందుకు అసలు నిధులేమీ లేని పధకాన్ని కేంద్రం తెస్తున్నది. అదే పీఎం ప్రణామ్‌ పథకం. ఈ పధకానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు ఉండవు. ఎరువులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలో కొంత తగ్గించి ఈ పథకానికి కేటాయిస్తారు. ఫలితంగా ఎరువుల సబ్సిడీలో కోత ప్రారంభమౌతుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అంతకు ముందు విడుదల చేసిన సబ్సిడీలో మిగులు చూపిన రాష్ట్రాలకు పీఎం ప్రణామ్‌ పధకం నిధుల్లో 50శాతం గ్రాంటుగా ఇస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎరువులపై సబ్సిడీనీ తగ్గిస్తూ పీఎం ప్రణామ్‌ పథకానికి మళ్లిస్తారు. చివరికి పూర్తిగా ఎరువుల సబ్సిడీకి మంగళం పాడతారు. మోదీ ప్రభుత్వం అనుసరించే విధానాల ఫలితంగా తీవ్ర ప్రతికూల పరిణామాలు సంభవిస్తాయి. సేంద్రీయ వ్యవసాయం సాగుపై పూర్తిగా సేద్యాన్ని మళ్లిస్తే దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని, సేంద్రీయ వ్యవసాయంద్వారా ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించలేం, వాటి ధరలు అధికంగా ఉంటాయని అనేకమంది వ్యవసాయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎరువుల సబ్సిడీ లేకపోవటంతో రైతులకు సేద్యం భారమై, వ్యవసాయం నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
పీఎం కిసాన్‌ యోజన పథకానికి 68వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు బడ్జెట్‌ తగ్గించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథóకం ద్వారా సేద్యంకోసం ముందుగానే పెట్టుబడి అందిస్తున్నామని, రైతాంగానికి దీని ద్వారా సేద్యపు ఖర్చు తగ్గుతుందని మోదీ ప్రభుత్వం పెద్దఎత్తున నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంది. అది ఆచరణలో రైతాంగానికి ఎంతవరకు ఉపయోగపడిరదన్నది చర్చనీయాంశమైనా, ఈ పధకాన్ని కూడా మోదీ ప్రభుత్వం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నది. అందుకు బడ్జెట్‌లో తగ్గిన కేటాయింపులే నిదర్శనం. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పధకానికి 68 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 60వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అర్హులైన రైతులందరికీ ఈ పధకంద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, ఇప్పటికే చాలా మంది రైతులను వివిధ వంకలతో పథóకం నుంచి తప్పించింది. పథకానికి నిధులు తగ్గించటం ద్వారా మరి కొంత మంది రైతులను ఇందుకు దూరం చేస్తుంది.
పీఎం ఫసల్‌ బీమా పథకం ద్వారా పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియంలో రైతులు నామమాత్రంగా చెల్లిస్తే చాలని, మిగతా ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరూ ఈ పధకంలో చేరటం ద్వారా పంట నష్ట పరిహారం పొందుతారని చెప్పింది. రైతులకు బీమా పరిహారం చెల్లించటానికి అనేక నిబంధనలతో కంపెనీలు నామమాత్రం పరిహారంతోనూ, అసలు చెల్లింపులే చేయకుండా వ్యవహరిస్తున్నాయి. ఇలా వ్యవహరించే బీమా కంపెనీలపై మోదీ ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోవటంలేదు. ఈ పధకం వలన దేశ, విదేశీ బీమా కంపెనీలు వేల కోట్లు లాభాలు గడిరచాయి. రైతుకు ఇచ్చిన అప్పులకు ఈ పథకం బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చింది. గత ఆర్థికబడ్జెట్‌లో ఈ పథకానికి 15,500 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో 13,625 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగింది. దీన్ని గమనిస్తే తాను చెల్లించే ప్రీమియమ్‌ తగ్గించుకుని రైతులపై భారం మోపనుంది.
ఈ బడ్జెట్‌లో పంటల కొనుగోళ్లకు సంబంధించిన కేటాయింపులు, మార్కెట్‌ యార్డులకు నిధుల కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనే లేదు. న్యాయమైన మద్దతు ధరలను ప్రకటించి వాటికి చట్టబద్దత కల్పించాలని, ప్రభుత్వమే పంటల కొనుగోళ్ల్లు చేయాలనీ, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, రైతాంగ సుదీర్ఘ పోరాటంతో వ్యవసాయచట్టాల రద్దును మోదీ ప్రభుత్వం ప్రకటించి, మద్దతు ధరల చట్టబద్ధత గురించి కమిటీ వేస్తానని చెప్పింది. ఆచరణలో మోదీ ప్రభుత్వం అందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆచరణ ద్వారా మద్దతు ధరల చట్టబద్దతను అంగీకరించనని చెప్పకనే చెప్పింది. తాను చేపట్టిన వ్యవసాయ చట్టాలను ఆచరణలో పెడుతున్నది. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో పంటల కొనుగోళ్లకు, మార్కెట్‌ యార్డులకు నిధుల కేటాయింపులు జరగలేదు. ఫలితంగా పంటల అమ్మకాలకు ప్రైవేట్‌ వ్యాపారులే శరణ్యం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని సంక్షోభమనే ఊబిలో మరింత లోతుకు లాక్కెళ్లుతుంది. రైతాంగాన్ని సేద్యం నుంచి దూరం చేసేందుకు తీవ్రతరం చేస్తుంది. రైతాంగ వ్యతిరేకమైన ఈ బడ్జెట్‌ను యావన్మంది రైతాంగం వ్యతిరేకించాలి.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img