Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వియత్నాంలో దక్షిణ కొరియా మారణకాండను నిర్ధారించిన కోర్టు!

ఎం. కోటేశ్వరరావు

వియత్నాం మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు త్యాగాలు చేసిన ఒక చిన్న దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. అమెరికా సేనలను ప్రాణాలు దక్కితే చాలు అంటూ పారిపోయేట్లు చేసి ప్రజాశక్తితో ఎంత పెద్ద మిలిటరీనైనా మట్టికరిపించవచ్చు అని నిరూపించిన దేశం వియత్నాం. అలాంటి వీరగడ్డకు చెందిన గుయన్‌ థీ ధాన్‌(62) వేసిన కేసును తొలిసారిగా విచారించిన దక్షిణ కొరియా కోర్టు వియత్నాంలో మారణకాండకు దక్షిణ కొరియా మిలిటరీ కారణమని ఫిబ్రవరి మొదటి వారంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఫ్రెంచి వలసగా ఉన్న వియత్నాంను రెండవ ప్రపంచ యుద్ద్ధంలో జపాన్‌ ఆక్ర మించింది. అది పతనమైన తరువాత తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమణలోకి వెళ్లింది. దాన్ని ఓడిరచిన తరువాత అమెరికా ఉత్తర వియత్నాంలోని సోషలిస్టు సమాజాన్ని, కమ్యూనిస్టులను, దక్షిణ వియత్నాంలోని జాతీయవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు చూసారు. దానికి మద్దతుగా తైవాన్‌లో తిష్టవేసిన చాంగ్‌కై షేక్‌మిలిటరీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, లావోస్‌, కంపూచియా, ఫిలిప్పైన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ వియత్నాం మిలిటరీలు వచ్చాయి. ఉత్తర, దక్షిణ వియత్నాంలలోని కమ్యూనిస్టులకు మద్దతుగా చైనా, సోవియట్‌ యూనియన్‌, ఉత్తర కొరియా, లావోస్‌, కంపూచియాల్లోని కమ్యూనిస్టు గెరిల్లాలు బాసటగా నిలిచారు.
వియత్నాంలో అమెరికా కూటమి జరిపిన మారణ కాండకు గురికాని గ్రామం, పట్టణం లేదంటే అతియోక్తి కాదు. ప్రతి చెట్టూ, పుట్ట, రాయి, రప్ప దేన్ని కదిలించినా దుర్మార్గాలువాటికి ప్రతిగా పోరులో ప్రాణాలర్పించిన వారి కథలు, గాధలు వినిపిస్తాయి. అతివల కన్నీటి ఉదంతాలు కోకొల్లలు. అలాంటి మారణకాండలో ఏడు సంవత్సరాల ప్రాయంలో గాయపడి కోలుకున్న గుయన్‌ థీ ధాన్‌ అనే 62 సంవత్సరాల మహిళ 2020లో వేసిన కేసులో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక కోర్టు తీర్పునిచ్చింది. దక్షిణ కొరియా మిలిటరీ జరిపిన దారుణంలోనే ఆమె గాయపడిరదని చెప్పటమే గాక, కేసులో ప్రభుత్వం చేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చి ఆమెకు మూడు కోట్ల వన్‌లు (24వేల డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీని మీద ప్రభుత్వం అప్పీలు చేస్తుందా ? మరొకటి చేస్తుందా అన్నది వెంటనే వెల్లడి కాలేదు. ఫాంగ్‌ హట్‌ సమీపంలోని ఫాంగ్‌ నీ అనే వియత్నాం గ్రామంలో 1968 ఏప్రిల్‌ 12న దక్షిణ కొరియా మిలిటరీ మూకలు నిరాయుధులైన పౌరులపై అకారణంగా జరిపిన కాల్పుల్లో 70 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. వారిలో గుయన్‌ థీ ధాన్‌ ఒకరు. ఆ ఉదంతంలో అమె తల్లి, సోదరుడితో సహా కుటుంబంలోని ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం గురించి అమెరికా మిలిటరీ రికార్డులలో నమోదుచేశారు. ఒక దక్షిణ కొరియా మిలిటరీ జవాను గెరిల్లాల కాల్పుల్లో గాయపడిన తరువాత ఈ ఉదంతం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే గెరిల్లాలనేమీ చేయలేక సాధారణ పౌరులమీద కక్ష తీర్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత గెరిల్లాల దాడికి భయపడి సైనికులు పారిపోయినట్లు అమెరికా రికార్డుల్లో ఉంది. దాడుల్లో 30 లక్షలమంది అమరికా సైనికులు పాల్గొన్నారు. దక్షిణ వియత్నాంలో కీలుబొమ్మ మిలిటరీకి చెందిన రెండు నుంచి రెండున్నర లక్షల మందితో మొత్తంగా మరణించిన వారు 3,33,620 నుంచి 3,92,364 మంది ఉంటారని లెక్క. కమ్యూనిస్టు వియత్నాం మిలిటరీ, గెరిల్లాలుగానీ పదకొండు లక్షల మంది ప్రాణాలర్పించారు. అమెరికా దాడుల్లో ఇరవైలక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక సియోల్‌ కోర్టు కేసు అంశానికి వస్తే అసలు దాన్ని అనుమతించటమే ఒక అసాధారణ పరిణామం. ఫాంగ్‌ హీ గ్రామంలో జరిగినట్లు చెబుతున్న మారణకాండలో దక్షిణ కొరియా మిలిటరీ పాత్ర గురించి ఆధారాలు లేవని ఒకసారి, వియట్‌ కాంగ్‌లను అణచివేసేందుకు దళాలు ప్రయత్నించినపుడు కొందరు పౌరుల మరణాలు తప్పలేదని మరొకసారి, పౌరుల్లో మిళితమైన వియట్‌కాంగ్‌లు జరిపిన కాల్పుల్లోనే గ్రామస్థులు మరణించి ఉండవచ్చు అని, దక్షిణ కొరియా మిలిటరీ దుస్తులు ధరించి వియట్‌కాంగ్‌లే కాల్పులు జరిపారని ఇలా రకరకాలుగా తప్పించు కొనేందుకు ప్రభుత్వం చూసింది. ఒక వేళ కొరియా సైనికులే కాల్పులు జరిపినా అది గెరిల్లాల నుంచి వచ్చిన ముప్పును తప్పించుకొనేందుకు ఆత్మరక్షణ కోసం జరిపినవి తప్ప మరొకటి కాదని కూడా వాదించింది. ఈ వాదనలన్నింటినీ కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వం చెప్పిన దానికి ఎలాంటి రుజువులు లేకపోగా అలాంటి ప్రతిఘటనను మిలిటరీ ఎదుర్కొనలేదని, జనాన్ని ఒకదగ్గర చేర్చి సమీపం నుంచి కాల్చి చంపినట్లు మాజీ సైనికుడు చెప్పాడు.ఈ కేసులో వియత్నాం గ్రామీణులు, నాటి దాడిలో పాల్గొన్న మాజీ సైనికుడు యు జిన్‌ సియోంగ్‌ కూడా ఆ రోజు ఏం జరిగిందీ, నిరాయుధులైన మహిళలు, పిల్లలమీద ఎలాకాల్పులు జరిపిందీ కోర్టుకు చెప్పాడు. ఆ దారుణం జరిగిన తరువాత అమెరికాసైనికుడు ఒకడుతీసిన ఫొటోలు ఈ కేసులో సాక్ష్యాలుగా పనికి వచ్చాయి. దక్షిణ వియత్నాంలో అమెరికా జరిపిన దాడులకు తోడుగా దక్షిణ కొరియా మూడు లక్షల 20వేల మంది సైనికులను అక్కడకు పంపింది. వారు అమెరికన్లతో కలసి లక్షల మందిని చంపారు. దాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇంతవరకు అంగీకరించలేదు. ఈ దారుణం తరువాత మై లాయి అనేచోట అమెరికా మిలిటరీ పెద్ద సంఖ్యలో హతమార్చింది. విమానాలు, మిలిటరీ శకటాలతో అమెరికా దాడి జరపగా గెరిల్లాలు భౌగోళిక అనుపానులు ఎరిగి ఉన్నందున తప్పించుకొని శత్రువులను దెబ్బతీశారు. వారికి తినేందుకు తిండి కూడా లేని స్థితిలో ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకొంటూ పోరు జరిపారు. అనేక రోజులు పస్తులు కూడా ఉన్నారు. సరైన పడకలు, నిదురలేని రోజులు అనేకం. సొరంగాలు తవ్వి రక్షణ తీసుకోవటమే గాక అమెరికా మిలటరీ మీద దాడి చేసి అడవుల్లో కనిపించకుండా తప్పించుకొన్నారు. ఇదంతా ఒక రోజు, ఒకనెల, ఏడాది కాదు పందొమ్మిది సంవత్సరాల పాటు జరిగిన పోరాటం. మై లాయి మారణ కాండ అమెరికా చరిత్రలో చెరగని మచ్చ. ఇలాంటి అనేక దారుణాలు జరిపిన అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ జరిపిన దారుణాలను ఇప్పటికీ ఆ ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. మై లాయిలో మర తుపాకులతో అమెరికన్లు జనాలను హతమార్చారు. విలియం కాలే అనే లెప్టినెంట్‌ నాలుగు గంటలపాటు ఆ మారణకాండను పర్యవేక్షించాడు. వందలాది మహిళల మీద అత్యాచారాలు జరిపి నరికి చంపటంతో పాటు రెండువందల మంది పిల్లలతో సహా 504మందిని చంపారు. వారందరినీ గోతుల్లో దించి ఎటూ వెళ్లకుండా మరతుపాకులతోకాల్చి చంపారు. ఈ ఉదంతాన్ని తరువాత కాలంలో అమెరికా మిలిటరీలో పాఠంగా చెప్పారంటే దుర్మార్గాలను ఎలా జరపాలో శిక్షణ ఇచ్చారన్నది స్పష్టం. వైమానిక దళ మేజర్‌ లాగాన్‌ సిషన్‌ పాఠాలు చెబుతూ మనం వారిని హీరోలుగా పరిగణించ వచ్చని, మై లాయిలో ఎవరైనా హీరోలుఉంటే వారే అని చెప్పాడంటే ఎంతదుర్మార్గంగా ఉంటారో వేరే చెప్పన వసరం లేదు. ఆ మారణకాండ జరిపినపుడు జనం మీదకు హెలికాప్టర్‌ను తోలిన ముగ్గురు పైలట్లను మూడు దశాబ్దాల తరువాత హీరోలుగా అమెరికా సత్కరించింది. విలియం కాలే మీద తప్పనిసరై విచారణజరిపి శిక్ష వేశారు. తరువాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు, అది కూడా మూడున్నర సంవత్సరాల తరువాత వదలివేశారు. వియత్నాంలో దక్షిణ కొరియా మిలిటరీ దుర్మార్గాన్ని కోర్టు నిర్ధారించిన తరువాత కొరియాను ఆక్రమించినపుడు జపాన్‌ చేసిన దుర్మార్గాలను కూడా విచారించాలని, వాటిని జపాన్‌ అంగీకరించాలని దక్షిణ కొరియన్లు డిమాండ్‌ చేశారు. వియత్నాం మారణకాండతో పాటు అమెరికా జరిపిన మరొక దుర్మార్గం ‘ఏజంట్‌ ఆరెంజ్‌’ పేరుతో రసాయన దాడులకు కూడా పాల్పడటం. దీని వలన భూమి, నీరు కలుషితంకావటంతో ప్రజలు అనేకరుగ్మతలకు గురి కావటం, పంటలకు దెబ్బతగిలింది. అమెరికా జరిపిన ఈ దాడి వలన తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కొన్ని కేసులను దాఖలు చేశారు. దీని బాధితులకు కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇండోచైనా దేశాలు, కొరియన్లకు క్షమాపణ చెప్పటమే కాదు, నష్టపరిహారం చెల్లిస్తాయా?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img