Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వియత్నాం, అఫ్గానిస్థాన్‌లకు పోలిక ఉందా!

ఎం.కోటేశ్వరరావు

తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి అఫ్గానిస్థాన్‌లో గట్టి దెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలి బన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధి కారులు పరోక్షంగా అయినా అంగీకరించక తప్పలేదు. అధ్య క్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్థితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరవాత స్పష్టత వస్తుందా? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.
తాలిబన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడి యాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతన మైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమె రికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా? అంతకు మించి ఏమీలేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో సర్వ నాశనమైన వియత్నాంలోని సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరవాత హోచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచం లోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జీడీపీలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22 శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయ న్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడిరటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియ త్నాంను 1945లో స్వతంత్య్ర దేశంగా ప్రకటించిన కమ్యూనిస్టు నేత హోచిమిన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్ధంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించు కున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్ధంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది. 1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం. ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగిం చాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్ధం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హోచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరవాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారి పోయింది. ఆ ఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు. సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హోచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్ధంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు, నీరు తాగేందుకు పనికి రాకుండా చేశారు. అమెరికా యుద్ధ చరిత్రలో అత్యధి కంగా 58 వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ నుంచి పారి పోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబన్లు వదిలే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్ధంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.
పరాభవం పాలైన అమెరికా తరవాత కాలం ఇతర కమ్యూ నిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్థిక దాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిం చింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్థితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు.
అమెరికా విదేశాంగ, మిలిటరీ విధానాలు ఎంత లోప భూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా అఫ్గాన్‌ ఉదంతం కూడా నిర్థారించింది. మూడు లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు అఫ్గానిస్థాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజా హిదీన్లు, తాలిబన్లకు మద్దతు ఇచ్చింది? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు. 1970 వ దశకంలో అఫ్గా నిస్థాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్ట టంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్గాన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్థిరపడిన తరవాత తమ దేశంపై కూడా దాడి చేయ వచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది. సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరవాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్థితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబన్లు పుట్టుకువచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబన్లకు శిక్షణ ఇవ్వ టమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభు త్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్థాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్గానిస్థాన్‌లోకి పంపింది. అదేవిధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్ర వాదులు తరవాత ఏకు మేకయ్యారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను ప్రతి ఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేప్‌ా వెనుక పంజ్‌షిర్‌ లోయలో ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముఠాలతో రాజీ చేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడిరది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబన్లు, అల్‌ ఖాయిదాను అంత మొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది. అల్‌ ఖాయిదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని ఆనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్థాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహి స్తున్న సాలేప్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి అఫ్గాన్‌ గూఢచార వ్యవస్థ అధిపతిగా ఏర్పాటు చేసింది. తరవాత ఉపా ధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.
వియత్నాం`అఫ్గాన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆ దేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆ పని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి ఎలా బయట పడిరదో, నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాం. అఫ్గానిస్థాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల, తాలిబన్ల ప్రభుత్వాలు గానీ, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలను మెరుగుపరి చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశా బ్దాలలో పరిస్థితి దిగజారింది. అఫ్గానిస్థాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అఫ్గాన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేం దుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిన తరవాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్థిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడిరది అమెరికన్‌ కంపెనీలు, అఫ్గానిస్థాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. అఫ్గాన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ధ పభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొ న్నారు. ఇప్పుడు తాలిబన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు. తాలిబన్లు దేశాన్ని బాగు చేస్తారా? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img