Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వ్యాపారుల లాబీతో మొక్కజొన్న ధర పతనం!

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం తప్ప అన్నాడు శ్రీశ్రీ. ఆయన మాటల్లోనే భారత రైతుల జీవితంలో ఏమున్నది గర్వించ దగ్గది. పంట నష్టాలు, అప్పులు, ఆత్మహత్యలు తప్ప. ఇది దేశ రైతాంగ చిత్రపటం. మొక్కజొన్న ప్రపంచంలోని 165 దేశాల్లో 190 మిలియన్‌ హెక్టార్ల సాగు చేస్తున్నారు. మొక్కజొన్న అనేక దేశాల్లో ప్రధాన ఆహార పంటగా ఉంది. గోదుమ, బియ్యం కన్నా ఎక్కువగా ఆహారానికి ఉపయోగిస్తున్నారు. ఇథనాల్‌ తయారీ, పశుగ్రాసం, మొక్కజొన్న పిండి, కార్న్‌ సిరప్‌్‌ ఉత్పత్తుల్లో మొక్కజొన్నను ఉపయోగిస్తున్నారు. 2021 అంచనా ప్రకారం మొత్తం ప్రపంచ ఉత్పత్తి కోటి 20 లక్షల టన్నులు. 2022-23 వార్షిక సంవత్సరం అంచనా ప్రకారం భారతదేశంలో మొక్కజొన్న ఉత్పత్తి ప్రాధమిక అంచనా 21.95 మిలియన్‌ టన్నులు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఉత్పత్తి పెరిగి కర్నాటకలో తగ్గిన ఉత్పత్తిని భర్తీ చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం అత్యధిక మొక్కజొన్న సాగు బిహాంలో జరుగుతుంది. ఇక్కడ సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. 20శాతం భూమిని మొక్కజొన్న పంటలకు రైతాంగం వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 11శాతం, రాజస్థాన్‌ 10శాతం, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో 8శాతం మొక్కజొన్న పండిస్తున్నారు.
ఇతర పంటల రైతుల మాదిరే మొక్కజొన్న పంట సేద్యపు రైతులు కూడా తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొం టున్నారు. మొక్కజొన్న సాగు మొదలు గాక ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రబీలో వరితో పాటు మినుము, పెసర, మాగాణి సాగుగా ఉంటే, వేరుశనగ, కంది, మొక్కజొన్న మెట్ట భూమిలో సాగు చేసేవారు. రబీ వరి సాగుకి అనేక ప్రాంతాల్లో సాగు నీరు ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరించటం, ఖరీఫ్‌కు ఆగస్టు దాకా గత ప్రభుత్వాలు సాగునీరు విడుదల చేయకపోవటం, అపరాల సాగుకి సమయం లేకపోవటం, మినుము, పెసర పైర్లకు విపరీతంగా తెగుళ్లు వ్యాపించటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటల ఆలోచనచేసి మొక్కజొన్న పంటను ఎంచుకున్నారు. ప్రారంభంలో ఈ పంట గుంటూరు, కృష్ణా జిల్లాలో పరిమితమైంది. ఆ తర్వాత రాష్ట్ర మంతటా విస్తరించింది. ఈ పంటతో పాటు జొన్న పంట కూడా రబీ సేద్యంలోకి వచ్చి మరో ముఖ్య పంటగా నిలిచింది.
ప్రారంభంలో మొక్కజొన్న రైతులకు ఆశాజనకంగా ఉంది. వరి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. కొద్ది సంవత్సరాలు ఇలా కొనసాగిన తర్వాత మొక్కజొన్న రైతాంగానికి సంక్షోభం ప్రారంభమైంది. ప్రకృతి వైపరీత్యాలు మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైనాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో క్వింటాల్‌కు 1310 రూపాయలు. సేద్యపు ఖర్చులు ఎకరాకి 25 వేలు. సగటు దిగుబడి ఎకరాకి 25 క్వింటాళ్లు. చాలా మంది రైతులకు ఈ దిగుబడి కూడా రావటంలేదు. 25 క్వింటాళ్లు వచ్చే రైతుకు కూడా మిగిలేది చాలా తక్కువ. కౌలు రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగి రైతాంగం నష్ట పోయారు. 2020-21లో 1850, 2021-22లో 1870, 2022-23లో1963 రూపాయలు క్వింటాల్‌ మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధరలుగా ప్రకటించింది. పంట ఖర్చులు 35వేలకు పైగా పెరిగాయి. మార్కెట్లో మొక్కజొన్న కొనటానికి వ్యాపారులు ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నామ మాత్రంగానే కొనుగోలు చేసి బాధ్యత తీరినట్లుగా వ్యవహరించాయి. రైతుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. అయినకాడికి అమ్ముకుందామన్నా కొనే నాధుడు కన్పించలేదు. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
2022లో అంతర్జాతీయంగాను, దేశీయంగాను మొక్కజొన్న దిగుబడులు తగ్గటం, ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా ఉండటం వలన వ్యాపారులు క్వింటాల్‌కు 2000 నుంచి 2200 రూపాయల ధర వరకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2023 మార్చివరకు రైతులకు ఆ ధర లభించింది. ఈ సంవత్సరం కొత్తపంట చేతికి రావటం ప్రారంభం కావటం, ఉత్పత్తి గతం కన్నా పెరగటంతో అకస్మాత్తుగా వ్యాపారులు ధరను దారుణంగా తగ్గించారు. 16 వందల నుంచి 1850 రూపాయల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నెలలోపే నాలుగు వందలకుపైగా తగ్గింది. బిహార్‌లోని భాగపూర్‌ జిల్లాలో క్వింటాల్‌కు 1050 రూపాయలుమాత్రమే రైతులకు లభిస్తున్నది. క్వింటా మొక్కజొన్న పండిరచ టానికి 1300 రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
దేశంలో మొక్కజొన్న రైతులు న్యాయమైన ధర కోసం ఆందోళన చేస్తుంటే, మద్దతు ధరకు కొనుగోలుచేసే చర్యలు తీసుకోకుండా 50 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు దిగుమతి సుంకాన్ని 50శాతం నుండి 15శాతం తగ్గించింది. ఫలితంగా మొక్కజొన్న ధర మరింత పతనమై రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దేశంలో తగినంత ఉత్పత్తి జరిగినప్పుడు దిగుమతి సుంకం తగ్గించి మరీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు సేకరణ ప్రారంభంకాలేదు.
2007లో పత్తి ధర క్వింటాల్‌ 6నుండి 7వేలకు పెరిగి రైతాంగానికి మిగులు ఏర్పడిరది. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిలిపి వేయాలని నిర్ణయించింది. ఫలితంగా రెండు రోజుల్లో పత్తి ధర 4వేలకు పడిపోయింది. గత మార్చి దాకా 2200రూపాయల ధర మొక్కజొన్నకు లభించి రైతాంగానికి ఊరటగా ఉన్న సమయంలో ధర తగ్గటమే కాకుండా, దిగుమతి చేసుకోవాలనే నిర్ణయం మూలంగా ధర పతనం ఎక్కడికి చేరుతుందోనని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం. సాంప్రదాయ సరఫరాదారు అర్జెంటీనాలో ఏర్పడిన తీవ్రమైన కరువు మొక్కజొన్న ఉత్పత్తి తగ్గిన ఫలితంగా ఆసియాలోని ఫీడ్‌ మిల్లర్లు భారతదేశం నుండి మొక్కజొన్న కొనుగోలు చేయటానికి ఇద్దరు వ్యాపారులు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్న రైతాంగానికి మంచి ధర వచ్చేలా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అందుకు భిన్నంగా రైతాంగం నష్టపోయే నిర్ణయం తీసుకుంది.
అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు మొక్కజొన్న రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి. అమెరికా అయితే 1930 నుంచి సబ్సిడీ ఇస్తున్నది. 1995 నుండి 2014 వరకు మొక్కజొన్న రైతులకు అమెరికా సంవత్సరానికి 4.7 బిలియన్ల డాలర్లను అందించింది. ఆ తర్వాత వ్యవసాయం, ఆహార కార్యక్రమాలపై సంవత్సరానికి 97.29 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నది. మోదీ ప్రభుత్వం మాత్రం నామ మాత్రంగా ఇస్తున్న సబ్సిడీలను తగ్గిస్తూ వస్తున్నది.
బొల్లిముంత సాంబశివరావు,
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img