Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

శాంతిని అడ్డుకుంటున్న అమెరికా

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

అమెరికా తన ‘‘పొడుగు చేతుల అధికార పరిధి’’ని ఇతర దేశాలపై అనేక రంగాల్లో విస్తరిస్తోంది. ఇది దాని పోటీ విధానం.తన సామర్థ్యం, ఆర్థిక ఆధిపత్యం, దేశీయ చట్టాలను ఇతర దేశాలపై దుర్వినియోగం చేసి తన ఆక్రమణ విధానాలను అమలుచేస్తోంది. ఆ ప్రయోజనం కోసం, అమెరికా సంక్లిష్ట చట్టాల వ్యవస్థను రూపొందించింది. గరిష్ట పరిమితులను తగ్గిస్తోంది. తన విచక్షణాశక్తిని విపరీతంగా పెంచింది. రష్యా` ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరగకుండా, శాంతి నెలకొనకుండా అమెరికా చర్యలు అడ్డుకుంటున్నాయి.
ట్రంప్‌ 3,900 ఆంక్షలు విధించారు. సగటున రోజుకు 3 ఆంక్షలు. 2021 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 9,400 ఆంక్షలు విధించింది. తన‘‘పొడుగు చేతుల అధికార పరిధి’’అమెరికాతో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. క్యూబా నుండి రష్యా వరకు, ఇరాన్‌ నుండి లిబియా వరకు, తన ఇష్టాన్ని, ప్రమాణాలను ఇతరులపై రుద్దింది. అమెరికా మిత్ర బృందమని భావించే యూరోపియన్‌ యూనియన్‌ కూడా దాని ఎత్తుగడలపై అసంతృప్తిగా ఉంది. అమెరికా‘‘పొడుగు చేతుల అధికార పరిధి’’ విధానాన్ని అరికట్టడానికి పలుమార్లు ప్రయత్నించింది. అనేక ఎత్తుగడలను వేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాలను పరిష్కార ప్రక్రియలుగా ప్రవేశపెట్టింది.
అమెరికా చర్యలు అంతర్జాతీయ పాలనా యంత్రాంగాల పనితీరును కూడా నాశనం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి వెలుపల తన ఏకపక్ష ఆంక్షలను లెక్కలేనన్నిసార్లు విధించింది. దేశాలకు, సంస్థలకు చట్టబద్ధ సదుపాయాల కల్పనలో ఐక్యరాజ్యసమితి పాత్రను బలహీనపరిచింది. దాని సూపర్‌ 301 నిబంధన అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ధారించినప్పటికీ, చైనా, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై దాని 301 నిబంధన కింద విచారణలను కొనసాగిస్తోంది. బహుపాక్షిక వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తోంది. ఆ విధానంతో, వాణిజ్య పోటీదారులను దెబ్బకొట్టడానికి,అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడానికి అమెరికాతన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. జపాన్‌లోని తోషిబా, జర్మనీలోని సీమెన్స్‌, ఫ్రాన్స్‌లోని ఆల్‌స్టోమ్‌లు అమెరికా సముద్ర దొంగల వంటి పనుల వల్ల నష్టపోయాయి. అమెరికా చర్యలు ఇతర దేశాలలో ప్రాథమిక మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తాయి. ఇతర దేశాలపై అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. మానవ విపత్తులకు కారణమయింది. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, సిరియా, యెమెన్‌లపై విధించిన ఆర్థిక ఆంక్షలు కొవిడ్‌-19 విశ్వ మహమ్మారిపై పోరాడే వారి సామర్థ్యాలను బలహీనపరిచాయి. అమెరికా ఆంక్షల కారణంగా ఒక్క ఇరాన్‌లోనే కొవిడ్‌-19 కారణంగా 13,000 మంది మరణించినట్లు అమెరికాలో పనిచేసే బ్రూకింగ్స్‌ ఇన్స్టిట్యూట్‌ అంచనావేసింది.
ఉక్రెయిన్‌ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23.02.2023 న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం, వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన అయినా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించలేదు. న్యాయమైన సమగ్ర శాశ్వత శాంతిని సాధించలేదు. ఈ యుద్ధం400 రోజులకు చేరబోతోంది. గతేడాది ఘటనల ముందు అంతర్జాతీయ సమాజం మరువరాని వాస్తవం ఒకటుంది. ఉత్తర అట్లాంటిక్‌ ట్రీటి ఆర్గనైజేషన్‌ (నాటొ) నిరంతర తూర్పు విస్తరణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే కారణం. ఇది పాశ్చాత్య దేశాలపై రష్యా దృక్పథాన్ని మార్చింది. దూరపు భాగస్వామిగా ఉండవలసిన అమెరికా రష్యాకు వాకిటి వద్ద శత్రువుగా మారింది. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాతి పరిణామాలతో రష్యా ఇంకా బాధపడుతుండగా ప్రచ్ఛన్న యుద్ధ కూటమి తూర్పు వైపు (రష్యా దిశగా) తన శిబిరాలను నెట్టడం రష్యా అభద్రతా భావాన్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ పై రష్యా ‘‘ప్రత్యేక సైనిక చర్య’’ కంటే, తన చర్యలతో రష్యాకు అనూహ్య ముప్పు కలగాలని అమెరికా కోరిక. అందుకే సంఘర్షణ ముగింపు నకు అమెరికా తొందరపడటంలేదు. రష్యాను కిందికి లాగి, యూరప్‌పై తన అధికారాన్ని పునరుద్ఘాటించాలని కోరుకుంటోంది. ఆయుధాల, ఇంధనశక్తి అమ్మకాలతో విపరీతమైన లాభాలు పొందుతోంది.
పశ్చిమ దేశాల చర్యలు రష్యాకు భద్రతా సంక్షోభాన్ని సూచిస్తాయి. నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా అమెరికా చిత్రీకరించిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, రష్యాను నిర్వీర్యం చేయడానికి ఏళ ్లతరబడి చేస్తున్న దాని సుదీర్ఘ ప్రచారానికి పరాకాష్ట. రష్యాపై తన ఏకపక్ష ఆంక్షలలో చేరడానికి నిరాకరించిన దేశాలను విమర్శిస్తోంది. తద్వారా నైతిక ఉన్నత స్థాయికి దావా వేసింది. అమెరికా తమపై మోపడానికి ప్రయత్నిస్తున్న నైతిక భారం వల్ల ఊగిసలాడకుండా ప్రపంచ దేశాలు ఈ విషయంలో తప్పొప్పులను నిష్పక్ష పాతంగా పరిశీలించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఇతర శాశ్వత సభ్యులలో, రష్యాపై ఆంక్షలు విధించడంలో, ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడంలో చైనా మాత్రమే అమెరికాతో చేరలేదు. రష్యాకు దాని ‘‘ప్రత్యేక సైనిక చర్య’’లో చైనా మద్దతు ఇవ్వలేదు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై దానివైఖరి తటస్థం. కాల్పులవిరమణపై మాట్లాడాలని, యుద్ధాన్ని విరమించాలని ఇరుపక్షాలను కోరుతోంది. రష్యాతో చైనా సంబంధాలు ఏ పార్టీ ఆమోదానికి గాని ఉక్రెయిన్‌తో సంబంధాలకు గాని లోబడి లేవు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో చైనా ప్రయోజనాలు లేవు.‘‘సైనిక సమూహాలను బలోపేతం చేయడం లేదా విస్తరించడం ద్వారా ఒక ప్రాంతపు భద్రత సాధ్యం కాదు. ఒక దేశ భద్రతను ఇతరుల ఖర్చుతో కొనసాగించకూడదు.’’ అని 24.02.2023 న చైనా విడుదలచేసిన పరిస్థితి పత్రం తెలిపింది.
ఐక్యరాజ్యసమితి అధికారపూర్వకంగా ఆమోదించని, అంతర్జాతీయ చట్టంలో చట్టబద్ధతలేని ఆంక్షలను అమెరికా రష్యాపై విధించింది. ఉక్రెయిన్‌కు అత్యంత అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది. దాని నాటొ మిత్రదేశాలను అదేవిధంగా చేయమని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాను ఉన్నత నైతిక స్థాయిలో ఉన్నానని చెప్పడం హాస్యాస్పదం, అసంబద్ధం. రష్యాకు వ్యతిరేకంగా పరోక్ష ప్రాతినిధ్య యుద్ధం చేయించడంలో అమెరికా ప్రాథమిక దురాక్రమణదారు. కాల్పులవిరమణ, శాంతిచర్చల కోసం అవసరమైన అనుకూల పరిస్థితులను సృష్టించేందుకు పరోక్ష ప్రాతినిధ్య యుద్ధాలను ఆపడం మొదటి అడుగుకాగలదు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభానికి పరస్పరం మాట్లాడుకోవడం, చర్చలుజరపడం మాత్రమే ఆచరణీయ పరిష్కారం. ఉక్రెయిన్‌ సార్వభౌమ రాజ్యమైనప్పటికీ, అమెరికా కూటమి దానికి నిధులు, మద్దతు ఇస్తోంది. ఉక్రెయిన్‌ ఈ సహాయాల భ్రమలో చిక్కుకుంది. అది రష్యాతో మాట్లాడాలనుకున్నా, అమెరికా దానికి అనుమతించనంత కాలం, ఉక్రెయిన్‌కు వేరే మార్గంలేదు. పోరాడుతూనే ఉంటుంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అమెరికా తన అధికార దుర్వినియోగాన్ని విడిచిపెట్టి ప్రపంచ సమాజంలో చేరాలి.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి,
సెల్‌: 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img