Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాంకేతిక విద్యాలయాలలో సీట్లు ఖాళీ!

డా యం. సురేష్‌ బాబు
తాజాగా కాగ్‌ నివేదిక ఆసక్తికర అంశాలు బయట పెట్టింది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నా యని వెల్లడిరచింది. బీటెక్‌తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్‌లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగ్‌ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్‌ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయాయి. 2020-21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కొత్త ఐఐటీలైన భువనేశ్వర్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌, ఇండోర్‌, జోధ్‌పూర్‌, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయాయి. 2021-22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాగే కొనసాగితే పలు అంశాల్లో కోర్సులను ఎత్తేయాలని చెబుతున్నారు. కేంద్ర విద్యాసంస్థలలో సీట్లు మిగిలిపోతుంటే ఇక సాధారణ కళాశాలల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకు భర్తీ కావట్లేదు అంటే ..
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ పూర్తికాగానే విద్యార్థులు మంచి ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఉన్నత విద్య ప్రాధాన్యత తగ్గింది. బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్‌డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగం చేసి సంపాదిస్తే సరిపోతుంది. మళ్లీ పీజీలు అవసరమా అనే భావం ఏర్పడుతోంది. దీంతో ఉన్నత విద్య వైపు విద్యార్థులు కన్నెత్తి చూడట్లేదు. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని కాగ్‌ నివేదకలో వెల్లడిరచింది. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్‌ ఐఐటీల్లో ఒకటైన దిల్లీలో 800 పీహెచ్‌డీ సీట్లు ఉండగా కేవలం 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. అనంతపురంలో వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన ఎంటెక్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులో ఒక్క విద్యార్ధి చేరలేదు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన పడకేసి దశాబ్దం అవుతోంది. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన రీసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష మూడు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు అడ్మిషన్లు సంవత్సరమంతా నిర్వహిస్తున్నారు. చాలా విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. ఉన్న అరకొర అధ్యాపకులు డైరెక్టర్లుగా, ప్రిన్సిపాల్‌, రిజిస్ట్రార్‌, రెక్టార్లు, విసిలుగా చలామణి అవుతున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేసే డాక్టరేట్లను వీరు పట్టించుకోరు. పరిశోధన చేయాలని కుతూహలంగా ఉన్న అధ్యాపకులు ఎక్కువగా దిక్కుమాలిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుండి, ఎక్కడో వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్న అతీగతీ లేని విశ్వవిద్యాలయాలకు డబ్బు సమర్పించుకొని పనికిమాలిన పట్టాలు తెచ్చుకుంటున్నారు. శ్రీ సాయి, సత్య సాయి, టైబ్రేవాలా, జబల్పూరు జంబనియా, జైపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ, సన్‌రైజ్‌, బుందేల్‌ఖండ్‌ గోండ్వానా, సామ్‌ హిగ్గిన్స్‌ బోథమ్‌. సెయింట్‌ పీటర్‌, సీఎంసీ, లింగయ్య, మగధ, మోనాద్‌, జై ప్రకాష్‌ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ గరోల, ఇన్నోవేషన్‌ యూనివర్సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నకిలీ విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 2020లో అడ్మిట్‌ అయిన స్కాలర్‌కి 2022లో పట్టా ఇస్తున్నారు. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా రీసెర్చి గ్రాంట్లు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధునికీకరణ నిధులు, స్టార్ట్‌ అప్‌ గ్రాంట్లు, సీడ్‌ గ్రాంట్లకు సవివరమైన ప్రాజెక్ట్‌ రిపోర్టులు యూజీసీ, ఏఐసిటిఇకి పంపలేదు. పరిశోధనలకు నయాపైసా ఇవ్వడం లేదు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధునికీకరణ నిధులు ఇవ్వకపోయినా, కొత్త అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోయినా రాబోయే రెండు మూడు సంవత్సరాలలో విద్యా సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది.
వ్యాస రచయిత ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img