సమావేశానికి వస్తున్న ఎంపీపీ జడ్పిటిసి లను అడ్డుకున్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి
భారీ కేడ్లు ఉంచి ఎన్నికలు తలపించేలా పోలీస్ బందోబస్తు
సిఐ చొరవతో సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ
విశాలాంధ్ర నాగులుప్పలపాడు : మండల సర్వసభ్య సమావేశానికి కారులో వస్తున్న ఎంపీపీ జడ్పిటిసి ,ఎంపీటీసీ సభ్యులను స్థానిక ఎస్సై ప్రభాకర్ రెడ్డి భారీకేడ్లు అడ్డుపెట్టి అడ్డుకొని అత్యుత్సాహం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి తో పాటు జడ్పిటిసి యాదల రత్న భారతి, ఎంపీటీసీ సభ్యులు పొద పవన్ , కట్టెడ అంజమ్మ తాటి అనురాధ, లు ఎంపీపీ కారులో మండల పరిషత్ కార్యాలయంలోకి ప్రవేశించగా అక్కడే భారీకేడ్లు అడ్డు ఉంచి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో ఉన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ కారును అడ్డగించి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తమను సమావేశానికి వెళ్ళనివ్వకుండా ఆపివేయాలన్నారని హుకుం జారీ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ జడ్పిటిసి లు ఇదేంటని ప్రశ్నించగా తాను చెప్పిందే వినాలంటూ ఎస్ఐ వారితో వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ జడ్పీటీసీలమైన తమను మండల పరిషత్ కార్యాలయంలోకి పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా కొద్దిసేపు ఎమ్మెల్యే వద్దన్నాడంటూ మరికొద్ది సేపు ఎంపీడీవో శ్రీనివాసరావు వద్దన్నాడని అంటూ రకరకాల సమాధానాలు చెబుతూ వారి వాహనాన్ని పోలీసులతో కలిసి అడ్డుకొని వారిని కిందికి దింపి అక్కడ నుండి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సుమారు గంటన్నరకు పైగా ఇరువురి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది మహిళా ప్రజా ప్రతినిధులైన తమపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి తమను సమావేశానికి పోనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఎంపీపీ అంజమ్మ ఒంగోలు రూరల్ సీఐ రాంబాబుకు ఫోన్లో ఫిర్యాదు చేశారు హుటాహుటిన అక్కడ చేరుకున్న సిఐ రాంబాబు ఇరువురికి సర్ది చెప్పి ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసి లను సమావేశానికి వెళ్లాల్సిందిగా సూచించి వివాదాన్ని నిలువరించారు. దీంతో ఎస్సై ప్రభాకర్ రెడ్డి తీరుపై ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు జిల్లా ఎస్పీ మాలిక గర్గ్ కు ఫిర్యాదు చేశారు.